పంట వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చే ట్రైకోడెర్మా విరిడె ద్రావణం

ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని రైతులే సులభంగా తయారు చేసుకునే పద్ధతిని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిని 100 మి.లీ. సీసాల్లో నింపి వ్యవసాయ కార్యాలయాల ద్వారా రైతులందరికీ రూ. 20 కి. అందించనున్నారు. ఈ ఒక్కసీసా రూ. 40 వేల విలువైన 200కి. ట్రైకోడెర్మా విరిడె పొడితో సమానంగా పనిచేస్తుంది.

తయారీకి కావలసిన పదార్థాలు :

  • 200 లీ. నీరు పట్టే ప్లాస్టిక్ డ్రమ్ లేదా సిమెంటు తొట్టి
  • 200 లీ. నీరు * 2 కి. బెల్లం
  • ట్రైకోడెర్మా విరిడె కల్చర్ (చిక్కని ద్రావణం) – 100 మి.లీ. సీసా

తయారీ పద్ధతి : నీడలో ఉంచిన డ్రమ్ములో 200 లీ. నీరు పోయాలి. 2 కిలోల బెల్లాన్ని పొడి చేసి నీటిలో వేసి కలిసేలా త్రిప్పాలి. సీసాలోని ట్రైకోడెర్మా విరిడె చిక్కని ద్రావణాన్ని బెల్లం కలిపిన నీటిలో పోసి కలియత్రిప్పాలి. డ్రమ్ముపైన మూత ఉంచాలి. ఉదయం, సాయంత్రం కర్రతో ఒక నిమిషం కలియత్రిప్పాలి. దీనిలో ట్రైకోడెర్మా విరిడె శిలీంద్రం విపరీతంగా పెరుగుతుంది. 4, 5 రోజులకు ద్రావణం వాడటానికి సిద్ధమౌతుంది.

ప్రతిసారి కొత్త సీసాలను కొనవలసిన అవసరం లేదు. ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని కలిపాక అందులో నుంచి 2 లీటర్ల ద్రావణాన్ని తీసి ప్రక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ద్రావణం తయారు చేసుకునేటపుడు 2 కిలోల బెల్లంతో పాటు 200 లీటర్ల నీటిలో కలిపితే రెండు రోజుల్లో మళ్ళీ సిద్ధమౌతుంది. బెల్లం రంగులో వుండే నీరు 2 రోజులకు తెల్లగా మారుతుంది. ఈ ద్రావణం రెండేళ్ళు నిల్వ ఉంటుంది. వెంటనే ప్రభావం చూపుతుంది. తయారు చేసుకున్న 5 లీటర్ల ద్రావణాన్ని ఒక క్యాన్‌లో పోసి మూత పెట్టుకోవాలి. 200 లీ. నీటిలో 2 కిలోల బెల్లంతోపాటు ఈ 5 లీటర్ల ద్రావణం కలపాలి. రెండురోజుల్లో మళ్ళీ వాడుకోవచ్చు. 15 రోజులకొకసారి పిచికారి, నెలకోసారి సాగునీరు లేదా డ్రిప్ ద్వారా ఇవ్వాలి.

ప్రయోజనాలు : విత్తనశుద్ధి : విత్తుకునే అరగంట ముందు విత్తనాలను ట్రైకోడెర్మా విరిడె ద్రావణంలో ముంచి తీయాలి. నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

పంట కోత తర్వాత మిగిలే మోళ్ళు, గడ్డి కుళ్ళడానికి : ఈ ద్రావణాన్ని పిచికారి చేస్తే పంట కోత తర్వాత మిగిలే మోళ్ళు, గడ్డి కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారుతుంది.

కంపోస్టు తయారీలో : చెట్ల నీడలో ప్లాస్టిక్ షీట్ పరచి దానిపై పంట వ్యర్థాలను పొరలా వేయాలి. 10 లీ. ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని పిచికారి చేయాలి. ఇలా 4Ð7 పొరల వరకు వేసుకుంటూ ద్రావణాన్ని పిచికారి చేయాలి. ప్రతి 7 రోజులకోసారి కంపోస్టుని తిరగెయ్యాలి. 60 శాతం తేమ ఉండేలా చూడాలి. 40 రోజులకు కంపోస్టు సిద్ధమౌతుంది.

ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని కర్ణాటక, కేరళ రాష్ట్రాల సేంద్రియ రైతులు పంటలు, తోటల్లో వాడుతున్నారు. దీనిని 1:1 నిష్పత్తిలో కలిపి 15 రోజులకోసారి ఎకరా పంటపై పిచికారి చేయాలి. పంటకు నెలకోసారి కాలువల ద్వారా సాగు నీటితో కలిపి పారించాలి లేదా డ్రిప్ / స్ప్రింక్లర్ ద్వారా ఇవ్వవచ్చు. జీవామృతం ఇచ్చిన రోజునే ఈ ద్రావణాన్ని యిచ్చినా ఫర్వాలేదు. కానీ వేర్వేరుగా ఇవ్వాలి. భూమిలో నివసించే శిలీంద్రాల ద్వారా కలిగే మాగుడు తెగులు, వేరుకుళ్లు, ఎండు తెగుళ్లను సమర్దవంతంగా అరికడుతుంది.
Read More

రైతు పొలంలో మైకోరైజా తయారీ

మర్రి చెట్టు క్రింద మట్టిలో సూక్ష్మజీవులతో పాటు మైకొరైజా కూడా ఉంటాయి. ఈ మట్టిని సేకరించాలి. శ్రీశైలం, తిరుపతి, కాళహస్తి, మహానంది వంటి పుణ్యక్షేత్రాలలోని మట్టిని సేకరించాలి. అటవీ క్షేత్రాల్లో పెరిగే గడ్డి మొక్కలను పీకి వేర్లను కత్తిరించి సేకరించాలి. వీటన్నింటిలో మైకోరైజా ఉంటాయి.

మైకోరైజా తయారు చేసుకోవడానికి ముందుగా మీటరు వెడల్పు, 2 అ. లోతు, వీలుని బట్టి పొడవు నిర్ణయించుకున్న గొయ్యి తవ్వాలి. దానిలో ఒక ప్లాస్టిక్ కవర్ పరచి తవ్విన మట్టికి కొంత పశువుల ఎరువు కలిపి నింపుకోవాలి. స్వయంగా మైకోరైజా (వ్యామ్) స్పోర్లు సేకరించడం సాధ్యం కాకపోతే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కిలో ప్యాకెట్లుగా దొరికే వ్యామ్‌ని కల్చర్ (తోడు)గా వాడుకుని మైకోరైజాను తయారు చేసుకోవచ్చు. సేకరించిన మైకోరైజాను సిద్ధం చేసుకున్న గోతిలో మట్టిలో కలుపుకొని అందులో మెంతులు, తృణ ధాన్యాలు, వరి, పెసర, అలసంద, గింజలను చల్లి నీరు పెట్టాలి. గింజలు మొలకెత్తిన వెంటనే వాటి వేర్లకు అతుక్కుని మైకోరైజా వృద్ధి చెందుతుంది. గోతిలో వేసిన మట్టిలో 6వ వంతు మైకోరైజా కల్చర్ ఉండేటట్లు చూడాలి. గింజలను ఒక రోజు నీటిలో నానబెట్టి విత్తుకోవాలి. గింజలను కలగలిపి విత్తి నీరు పెట్టాలి. పెరుగుతున్న మొక్కలలో మూడు నెలల్లో మైకోరైజా వృద్ధి చెందుతుంది. మైకోరైజా వినియోగించుకోవాలనుకున్నపుడు 10 రోజుల ముందు నీరు నిలిపి మొక్కలను కోసి వేసి, మొక్కల వేర్లను పెకిలించి చిన్న ముక్కలుగా కత్తిరించాలి. కత్తిరించిన వేర్లను, మట్టిని పారతో తిరగేసి ప్లాస్టిక్ సంచుల్లో ఎత్తి పెట్టుకోవాలి.

ఏ పంటలకు వాడవచ్చు
సిద్ధం చేసుకున్న మైకోరైజాను అన్ని ఉద్యాన పంటల్లో వాడవచ్చు. కూరగాయల నారుమళ్ళలో కలపవచ్చు. మైకోరైజాకు తోడుగా వర్మికంపోస్టు లేదా బాగా చివికిన పశువుల ఎరువు వాడవచ్చు. మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనం విత్తేటప్పుడు మొదటి పొరగా మట్టి వేసి విత్తనం వేసే ప్రదేశంలో మైకోరైజా పొడిని పోసి, విత్తనం విత్తి, పైభాగంలో మళ్ళీ మట్టి పొరను అమర్చాలి. మొలచిన గింజల్లో అంకురం తొడిగిన వెంటనే మైకోరైజా శిలీంద్రం వేరును అంటిపెట్టుకుని విస్తరించడం మొదలవుతుంది. మొక్కలు నాటాలనుకున్నపుడు వేరుభాగం చుట్టూ మైకోరైజా చల్లి నాటుకుంటే సరిపోతుంది. పాదులలో తొలుత మట్టి నింపి ఒక పార మైకోరైజా మట్టి వేసి పై భాగం మట్టితో నింపాలి. మిరప, ఇతర కూరగాయల మొక్కలు నాటుకునేటప్పుడు వేర్లను తడిపి వాటిని మైకోరైజా పొడిలో అద్ది నాటుకుంటే సరిపోతుంది. మైకోరైజా వాడిన మొక్కలు బలంగా, ఏపుగా పెరగడంతో పాటు బెట్టను తట్టుకుంటాయి.

ట్రైకోడెర్మా, జీవన ఎరువులు కలిపి సత్తువ కల్గించిన పశువుల ఎరువు
ఒక టన్ను బాగా చివికిన పశువుల ఎరువుకు 1కి. ట్రైకోడెర్మా హార్జియానం, 1 కి. అజటోబాక్టర్ లేదా అజోస్పైరిల్లం, 1 కి. ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బాక్టీరియా, 1 కి. సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, 1 కి. పెసీలోమైసిస్ కలిపి, కుప్పపై నీరు చల్లి పాలిథిన్ షీట్ లేదా కొబ్బరి మట్టలతో కప్పి 15-20 రోజులుంచాలి. ఈ సత్తువ కలిగించిన పశువుల ఎరువును భూమిలో వేయడానికి ముందు 10 టన్నుల పశువుల ఎరువుతో కలపాలి.

Read More

మొక్క వేర్ల పెరుగుదలను పెంచే ట్రైకోడెర్మా, సూడోమోనాస్

సహజ జీవ నియంత్రణ కారకాలుగా, జీవ ఎరువులుగా వీటిని ఉపయోగిస్తారు. వీటిని నేల ద్వారా వ్యాపించే శిలీంధ్ర వ్యాధికారకాలను అణచివేయటానికి, వేర్ల పెరుగుదలను మెరుగుపరచటానికి, పంట దిగుబడులను పెంచడానికి, నేలలోని పోషకాలను కరిగించడానికి ఉపయోగిస్తారు.

తయారీకి కావలసిన పదార్థాలు : ట్రైకోడెర్మావిరిడె మదర్ కల్చర్, సూడోమోనాస్ మదర్‌కల్చర్, బెల్లం – 20 గ్రా.; ఈస్టు – 5 గ్రా.; ప్రెజర్‌కుక్కర్ – 10 లేదా 15 లీటర్లది; స్టీలు డబ్బాలు మూతగలవి; స్పిరిట్ లేదా డెటాల్, గ్యాస్ స్టవ్, ప్లాస్టిక్ బాటిల్స్ – 1 లేదా 2 లీటర్లవి.

తయారీ విధానం : ప్రెజర్‌కుక్కర్‌లో శుభ్రపరచిన స్టీలు డబ్బాని పెట్టి డబ్బా చుట్టూ అంగుళం మేర ఖాళీ ఉండునట్లు చూడాలి. ఈ స్టీలు డబ్బాలు 4 లేదా 8 లేదా 12 లీటర్ల పరిమాణంలో ఉండాలి. ఎంపిక చేసుకున్న కుక్కర్ పరిమాణాన్ని బట్టి డబ్బాల ఎంపిక ఉండాలి. ఎంపిక చేసుకున్న స్టీలు డబ్బాలో సూచించిన పరిమాణంలో నీరు, బెల్లం, ఈస్టు తీసుకోవాలి. నాలుగు లీటర్ల నీరు తీసుకున్నట్లయితే 80 గ్రా. బెల్లం, 20 గ్రా. ఈస్టు కలపాలి. డబ్బా మూతని బిగుతుగా బిగించి పెట్టాలి. కుక్కర్‌లో కూడా నీరు పోసి, మూత పెట్టి పైన విజిల్ పెట్టి స్టవ్ మీద వేడి చేయాలి. మొదటి విజిల్ సుమారు గంట తర్వాత వస్తుంది. తొలి విజల్ వచ్చిన మరో 40 నిమిషాలపాటు వేడి చేయాలి. బెల్లం నీరు మరిగి సూక్ష్మజీవుల రహితంగా మారుతుంది. స్టవ్ ఆపివేసి కుక్కర్‌ని దించి గది వాతావరణంలో చల్లబడిన తర్వాత స్టీల్ డబ్బాలోని బెల్లం ద్రావణాన్ని సీసాల్లో మూడవ వంతు వరకు నింపి దూదితో చేసిన ప్లగ్‌లు (బిరడాలు) పెట్టాలి. మార్కర్‌తో సూడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడె వంటి లేబిల్స్‌ని సిద్ధం చేసుకోవాలి. సీసాలకు లేబిల్స్ అతికించిన తర్వాత ఆయా సీసాల్లో ఆయా శిలీంద్రం, బాక్టీరియా మదర్ కల్చర్ని ఒక చెంచా చొప్పున కలిపి బిరడా పెట్టుకోవాలి. ఒక వారం రోజుల వరకు ప్రతి రోజు సీసాలను ఊపుకోవాలి.

వాటి మదర్ కల్చర్లను  వ్యవసాయ పరిశోధనా స్థానాల నుండి పొందవచ్చు. ఒకసారి మదర్ కల్చర్ని సేకరించుకుంటే దాన్ని పునరుత్పత్తి చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకున్న తర్వాత 6 నెలల వరకు ఇవి నిల్వ ఉంటాయి.
Read More

పరిరక్షణ వ్యవసాయం: నేల ఆరోగ్యం, దిగుబడి మరియు వాతావరణ స్థితిస్థాపకతకు ఒక సుస్థిర మార్గం

పెరుగుతున్న జనాభా, నేల క్షీణత, అస్థిర వాతావరణం ఈ మూడు ఒత్తిళ్లు నేటి ప్రపంచ వ్యవసాయాన్ని చుట్టుముట్టాయి. లోతైన నాగలి దుక్కి మీద ఆధారపడిన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు నేల కోతకు, పోషకాల నష్టానికి కారణమవుతున్నాయని దశాబ్దాలుగా గుర్తించబడింది. ఈ నేపథ్యంలో, 1970లలో అమెరికాలో మొదలై బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా వంటి దేశాలకు విస్తరించిన పరిరక్షణ వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. 1970లో కేవలం 10 లక్షల హెక్టార్లలో ఉన్న పరిరక్షణ వ్యవసాయం విస్తీర్ణం, 2019 నాటికి 102 దేశాల్లో సుమారు 20.5 కోట్ల హెక్టార్లకు (ప్రపంచ సాగుభూమిలో దాదాపు 15%) పెరిగింది.

పరిరక్షణ వ్యవసాయం అనేది ఒకే ఒక్క పద్ధతి కాదు ఇది మూడు అంశాల సమీకృత వ్యవస్థ:
(1) కనీస యాంత్రిక నేల కదలిక, (2) పంట అవశేషాలు లేదా కవర్ పంటల ద్వారా నేలపై శాశ్వత సేంద్రియ కవచం, (3) పంట మార్పిడి లేదా అంతర పంటల ద్వారా జీవవైవిధ్యం.

తక్కువ కదలిక నేల కణాల నిర్మాణాన్ని కాపాడితే, ఉపరితల అవశేషాలు వర్షపు దెబ్బ నుండి, తేమ నష్టం నుండి ఆ నిర్మాణాన్ని కాపాడతాయి. పంట మార్పిడి జీవ కార్యకలాపాలను పునరుద్ధరించి, చీడపీడల చక్రాలను విచ్ఛిన్నం చేస్తుంది.

నేల ఆరోగ్యంపై ప్రభావం

పరిరక్షణ వ్యవసాయం వల్ల కలిగే జీవశాస్త్రపరమైన మార్పులు అత్యంత స్థిరంగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ ప్రకారం, అవశేషాల నిలుపుదలతో కూడిన సున్నా-దుక్కి పద్ధతి పై 20 సెం.మీ నేలలో సూక్ష్మజీవుల జీవద్రవ్యరాశిని 37% పెంచుతుంది (శిలీంధ్రాలలో 31%, బ్యాక్టీరియాలో 11% పెరుగుదల). ఇండో-గంగా మైదానాల్లో ఆరేళ్ల అధ్యయనంలో సున్నా-దుక్కి పద్ధతి ఎగువ 15 సెం.మీ నేలలో హెక్టారుకు సుమారు 2 టన్నుల సేంద్రియ కర్బనాన్ని నిల్వ చేసినట్లు తేలింది. అయితే ఈ కర్బన నిల్వ లోతును బట్టి మారుతుంది 60 సెం.మీ లోతు వరకు కొలిచినప్పుడు సాంప్రదాయ, సున్నా-దుక్కి పద్ధతుల మధ్య తేడా గణనీయంగా తగ్గిపోతుందని మరో అధ్యయనం హెచ్చరిస్తోంది. మృత్తిక స్థూల సాంద్రత విషయంలో మాత్రం సాహిత్యంలో నిజమైన భిన్నాభిప్రాయం ఉంది కొన్ని అధ్యయనాలు స్వల్ప పెరుగుదలను, మరికొన్ని తగ్గుదలను నివేదిస్తున్నాయి.

చిత్రం 1: పరిరక్షణ వ్యవసాయపు మూడు మూలస్తంభాలు పరస్పరం బలపరుచుకునే ఒక సమీకృత వ్యవస్థ.

దిగుబడి, ఆర్థిక అంశాలు
మెటా-విశ్లేషణ ప్రకారం, సున్నా-దుక్కి పద్ధతి సగటున 5.1% దిగుబడి తగ్గుదలకు దారితీస్తుంది. కానీ ఇది పంట, వాతావరణం మేరకు చాలా తేడాగా ఉంటుంది నూనెగింజలు, పత్తి, పప్పుధాన్యాలలో తగ్గుదల లేదు; మొక్కజొన్న, వరిలో ఎక్కువ తగ్గుదల (సుమారు 7.5%) కనిపించింది. పొడి వాతావరణాలలో వర్షాధార పంటలకు సున్నా-దుక్కి పద్ధతి సాంప్రదాయ పద్ధతితో సమానంగా లేదా మెరుగ్గా పనిచేస్తుంది. మలావిలో జరిగిన క్షేత్ర అధ్యయనాల్లో పరిరక్షణ వ్యవసాయ ఆధారిత మొక్కజొన్న పంట దిగుబడిని 22 – 31%, రైతు ఆదాయాన్ని 50 – 83% పెంచడంతో పాటు హెక్టారుకు 28–39 పని దినాల శ్రమను తగ్గించాయి. పంట మార్పిడి, సరైన పొషకాల యాజమాన్యం లేకుండా పరిరక్షణ వ్యవసాయం పూర్తి ప్రయోజనాలు అందించదని గమనించాలి.

వాతావరణ స్థితిస్థాపకత, కర్బన నిల్వ
ఉత్తర చైనా మైదానంలో జరిగిన ఎనిమిదేళ్ల వేడెక్కింపు ప్రయోగంలో, పరిరక్షణ వ్యవసాయం పద్ధతిలో నేల చల్లగా, తేమగా ఉండి, శీతాకాల గోధుమ దిగుబడి వేడెక్కింపు వల్ల 9.3% పెరిగింది. ఈ ప్రయోజనం సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత బలపడటం గమనార్హం ఇది స్థిరమైన, కాలానుగుణంగా పెరిగే ప్రయోజనమని సూచిస్తుంది. అదేవిధంగా, నో-టిల్ మరియు తగ్గిన దుక్కి పద్ధతులు నత్రజని ఆక్సైడ్ ఉద్గారాలను సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే సుమారు 11% తగ్గిస్తాయని ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ తెలిపింది, ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

కలుపు యాజమాన్యం, ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికత
నేల కదలిక తగ్గించడం వల్ల దుక్కి ఆధారిత కలుపు నియంత్రణ తొలగిపోతుంది కాబట్టి, విత్తడం, ఎరువులు, కలుపు/చీడ నియంత్రణ వంటి పనులను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడే జిపిఎస్-ఆధారిత యంత్రాలు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్‌లు , జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, వేరియబుల్-రేట్ టెక్నాలజీ వంటి ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయి. అవశేషాల కవచం వల్ల నేలపై కలుపు మొక్కలను గుర్తించడం కష్టతరం కావడంతో, డ్రోన్‌ చిత్రాల ఆధారంగా కృతిమ మేధస్సు (ఏ ఐ/ఎం ఎల్/డి ఎల్) సాయంతో కలుపు మ్యాపింగ్, స్థల-ఆధారిత హెర్బిసైడ్ ప్రయోగం వంటి పద్ధతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే యంత్రాలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం చిన్న, సన్నకారు రైతులకు ఈ సాంకేతికతలను చేరువ చేయడంలో పెద్ద అడ్డంకిగా మిగిలిపోయింది.

చిత్రం 2: ఖచ్చితమైన వ్యవసాయం మరియు కలుపు యాజమాన్యం. డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ మరియు కృతిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి కలుపు మొక్కలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం మరియు లక్షిత ప్రాంతాల్లో మాత్రమే నియంత్రణ చర్యలను చేపట్టే విధానాన్ని ఈ వైజ్ఞానిక చిత్రపటం వివరిస్తుంది. ఇది చిన్న రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి మరియు సాంకేతిక సవాళ్లను కూడా సూచిస్తుంది

సవాళ్లు, స్వీకరణలో అడ్డంకులు
పంట అవశేషాలను పశువుల మేతకు వాడాల్సిన అవసరం, యంత్రాలు-రుణాల లభ్యత, లింగ ఆధారిత అసమానతలు, విస్తరణ సేవల కొరత ఇవన్నీ ముఖ్యంగా చిన్నకారు, వర్షాధార రైతాంగంలో పరిరక్షణ వ్యవసాయం స్వీకరణను నెమ్మదిస్తున్నాయి. అదేవిధంగా, నేల కర్బన కొలత లోతు, నత్రజని ఆక్సైడ్ కొలత విధానాలలో ప్రామాణికత లేకపోవడం వంటి పద్దతిపరమైన అసమానతలు ఈ రంగంలో పరిష్కరించాల్సిన ముఖ్యమైన పరిశోధన అంతరాలుగా మిగిలాయి.

ముగింపు
పరిరక్షణ వ్యవసాయం నేల సూక్ష్మజీవుల ఆరోగ్యం, ఇంధన-శ్రమ ఆదా, నిర్దిష్ట పరిస్థితులలో దిగుబడి స్థిరత్వం వంటి నిజమైన ప్రయోజనాలను అందిస్తుందని ఈ సమీక్ష స్పష్టం చేస్తుంది. అయితే బల్క్ డెన్సిటీ, పరాగసంపర్క కీటకాలపై ప్రభావం వంటి అంశాల్లో సాహిత్యంలో ఇప్పటికీ నిజమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భవిష్యత్తులో పరిరక్షణ వ్యవసాయం ను కేవలం ఒక స్థిర ప్యాకేజీగా కాకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమర్చుకోగల సమీకృత వ్యవస్థగా, ఖచ్చితమైన సాంకేతికతతో మేళవించి అభివృద్ధి చేయడం ద్వారానే స్థిరమైన వ్యవసాయ లక్ష్యాలను చేరుకోవచ్చు.

ఇతర వివరముల కొరకు , ఈమెయిల్ మరియు ఫోన్: jcharleswesley@gmail.com, +91 8331816872, చార్లెస్ వెస్లీ జె., పిహెచ్.డి స్కాలర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. తిరుమలైకుమార్ ఆర్., అసిస్టెంట్ ప్రొఫెసర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. సరవణన్ ఎస్., ప్రొఫెసర్, వి.ఐ.టి, వెల్లూరు.

చార్లెస్ వెస్లీ జె¹, తిరుమలైకుమార్ ఆర్², సరవణన్ ఎస్³*
¹, ²&³ వి ఐ టి స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ అండ్ అడ్వాన్స్‌డ్ లెర్నింగ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రోనమీ, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT), వెల్లూరు, తమిళనాడు, భారతదేశం.

Read More

కుళ్ళిన పండ్లు లేక కూరగాయల మిశ్రమ ద్రావణం

ఈ మిశ్రమం సూక్ష్మక్రిములకు, వానపాములకు ఆహారంగా ఉపయోగపడి మొక్క ఆరోగ్యంగా పెరుగుటకు దోహదపడుతుంది.

మోతాదు : ఎకరానికి 50 లీటర్లు

కావలసిన పదార్థాలు : ఆవుపేడ : 25 కిలోలు; నీరు : 50 లీటర్లు; కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలు : 20 కిలోలు.

తయారు చేయు విధానం: ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో నీరు, ఆవుపేడ కలిపి నాలుగు రోజులు మురగబెట్టాలి. కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలను ఒక డ్రమ్ములో వేసి మూతబెడితే 4 రోజులలో కుళ్ళిపోతాయి. వీటిని అదే రోజున మెత్తగా పిసికి, ఆవుపేడ, నీళ్ళు కలిపిన డ్రమ్ములో వేసి కలియ పెట్టాలి. ఆపైన మూత వదులుగా పెట్టి, మరుసటి రోజున ఈ మిశ్రమాన్ని కర్రతో కలిపి డ్రమ్ముపై మూతపెట్టాలి. 10 రోజులలో మిశ్రమం తయారవుతుంది. 11వ రోజున ఈ మిశ్రమాన్ని వడబోసి, సుమారు 50 లీటర్లు ఒక ఎకరం పొలంలో నీటిద్వారా గాని, లేదా కళ్ళాపిలా గాని నేలపై చల్లాలి.

Read More

నేలసారాన్ని పెంచే అమృత జలం

ఇది నేలసారాన్ని మెరుగుపరచి, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను వృద్ధిచేస్తుంది. మొక్కలు బలంగా, ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. సేంద్రియ మరియు సహజ వ్యవసాయానికి ఇది చాలా అనువైనది.

మోతాదు: ఎకరాకు 200 లీటర్లు సాగు నీరు ద్వారా గానీ, భూమిపైన గాని చల్లాలి.

కావలసిన పదార్థాలు : ఆవుపేడ: 10 కేజీలు; ఆవు నెయ్యి : 250 గ్రాములు; తేనె / నల్లబెల్లం : 500 గ్రాములు.

తయారు చేయు విధానం: ముందుగా ఆవుపేడ మట్టి కుండలో వేసి పావుకిలో ఆవునెయ్యి వేసి సుమారు 2 గంటలు బాగా కలిపి తర్వాత తేనె లేక బెల్లపు నీరు (అరకేజి బెల్లంకు అర లీటరు నీరు) పోసి 2 గంటలు ఆవుపేడను బాగా పిసుకుతూ కలపాలి. తర్వాత నీటిలో కళ్ళాపిలాజేసి 200 లీటర్ల డ్రమ్ములో పోసి డ్రమ్మునిండా నీరు పోస్తూ కలుపుతుండాలి. డ్రమ్ము నింపిన తర్వాత మిశ్రమాన్ని సుమారు 3 లేక 4 గంటలు కర్రతో త్రిప్పి ఆ తర్వాత ఎకరం పొలంలో కళ్ళాపిలా చిమ్మడం గాని లేక పారుతున్న నీటిలో పోస్తూ గాని భూమికివ్వాలి.

Read More

మొక్క పెరుగుదలకు దోహదపడే ‘చేప కునప జలం’

కావలసిన పదార్థాలు:
తాజా చేప ముక్కలు : కిలో
దేశీ ఆవు మూత్రం : 5 లీటర్లు, నల్లబెల్లం – కిలో
దేశీ ఆవు నెయ్యి : 50 గ్రా, తేనె – 50 గ్రా

చేప కునప జలం ఇంచుమించు ‘మీనామృతం’ మాదిరిగానే పంటలపై పనిచేస్తుంది.

తయారుచేసే పద్ధతి: ఒక కిలో తాజా చేపలను ముక్కలుగా కోయాలి. వాటికి ఒక కిలో నల్లబెల్లం పొడిని కలపాలి. 50 గ్రాముల ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె కూడా కలిపి 30 నిమిషాలు ఉంచాలి. తరువాత ఒక మట్టికుండలో గాని, ప్లాస్టిక్ పాత్రలో గాని 5 లీటర్ల ఆవు మూత్రం పోసి అందులో ఈ మిశ్రమాన్ని కలపాలి. పాత్ర మీద మూత ఉంచి శుభ్రమైన గుడ్డతో బిగించి కట్టాలి. రోజుకొకసారి ఈ మిశ్రమాన్ని కలుపుతూ 20 రోజుల పాటు చల్లని గదిలో ఉంచి మురగబెట్టాలి. తయారైన చేప కునప జలాన్ని వడకట్టి వాడుకోవచ్చు. 100 లీటర్ల నీటికి 3 లీటర్ల చొప్పున దీన్ని కలిపి మె°క్కలపై పిచికారీ చేయాలి. ఇది 2 నెలల వరకు నిల్వ ఉంటుంది.

వాడే విధానం : 3 నుండి 5 శాతం ద్రావణాన్ని ఏ పంటపైనయినా ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారి చేయవచ్చు.

ఫలితాలు :

  • భూమికి అద్భుతమైన పోషకాలనందిస్తుంది.
  • మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది.
  • దీనిని సులభంగా తయారు చేయవచ్చు.
  • మొక్కలకు అద్భుతమైన టానిక్‌లా పనిచేస్తుంది.
Read More

చేప అమైనో ఆమ్లాల ద్రావణం / చేప – బెల్లం ద్రావణం

చేప-బెల్లం ద్రావణంలో ఎన్నో రకాల ‘అమినో యాసిడ్’ లు ఉంటాయి. ఇవి పంటల యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి.

కావలసిన పదార్థాలు: చేప వ్యర్థాలు : 1 కిలో (ఎముకలు, మొప్పలు, చర్మం మొ॥); బెల్లం : 1 కిలో

తయారు చేయు పద్ధతి (చోహాన్ క్యూ పద్ధతి):

  • ఒక కిలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించిన చేపల వ్యర్థ పదార్థాలను, ఒక కిలో బెల్లం పొడిని తీసుకొని బాగా కలిపి ఒక కుండలో నిలువ చేయాలి.
  • కుండపై మూతపెట్టి 10-12 రోజుల పాటు ఆ మిశ్రమాన్ని పులియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ కర్రతో బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని 10-12 రోజుల తర్వాత వడపోసి, ఒక లీటరు మిశ్రమానికి 100 లీటర్ల నీటిని కలిపి (1 శాతం) ఒక ఎకరం పొలంలో పంటపై గానీ, పొలంలోని భూమిపైగానీ, కంపోస్టు గుట్టపైగానీ పిచికారీ చేయాలి.
    సూచనః
  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
  • ఈ ద్రావణాన్ని అన్ని పంటలలో, పండ్ల తోటలలో వాడవచ్చు.
  • ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.

రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

నేలను సారవంతం చేసే ‘మత్స్య సంజీవని’

మీనామృతం తయారుచేసి వడపోసేటప్పటికి అందులోని చేప ముక్కలు పూర్తిగా కరగకుండా కొంతమేరకు మిగిలే ఉంటాయి. అటువంటి చేప ముక్కలను పారేయకుండా తిరిగి ఉపయోగించవచ్చు. వీటిలోని ఉపయుక్త సూక్ష్మజీవులు (ఇండిజినెస్ మైక్రో ఆర్గానిజమ్స్ – ఐ.ఎం.ఓ.లు) లేదా మత్స్య సంజీవని నేలను సారవంతం చేస్తుంది. వేరు వ్యవస్థకు రక్షణగా ఉండి వేరుకుళ్లు, ఎండు తెగుళ్లు వంటి వాటి నుంచి వేర్లను కాపాడుతుంది. వేరు వ్యవస్థ ద్వారా సూక్ష్మ, స్థూల పోషకాలను అందిస్తుంది. వ్యాది నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

మత్స్య సంజీవని తయారీకి కావాల్సిన పదార్థాలు
చేప ముక్కలు (మీనామృతం తయారీలో మిగిలిన వాటితో పాటు తాజా చేప ముక్కలను కూడా వాడవచ్చు) – కిలో, నల్లబెల్లం – 500 గ్రాములు, దేశీ ఆవు నెయ్యి / వెన్న – 50 గ్రాములు, తాటికల్లు – 1 లీటరు, తేనె – 50 గ్రాములు, కాచి చల్లార్చిన నీరు – 5 లీటర్లు

మత్స్య సంజీవనిని తయారుచేసే పద్ధతి: ఒక మట్టి పాత్రలో 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి లేదా వెన్న వేసి పొయ్యిమీద పెట్టాలి. అందులో కిలో చేప ముక్కలను, అర కిలో బెల్లం ముక్కలను వేసి బాగా ఉడికించాలి. చేప ముక్కలు ఉడుకుతున్నప్పుడు అడుగంటి మాడిపోకుండా తగినంత తాటికల్లు కలుపుతూ ఉండాలి. మరొక పాత్రలో 5 లీటర్ల మంచినీటిని మరిగించి చల్లారనివ్వాలి. ఒక మట్టికుండను తీసుకొని, అందులో కాచి చల్లార్చిన నీటిని, ఉడకబెట్టి చల్లార్చిన చేపముక్కలను వేయాలి. అందులో ఒక లీటరు తాటికల్లు, 50 గ్రాముల తేనె కూడా పోసి ఒక శుభ్రమైన తడిలేని కర్రతో బాగా కలియబెట్టాలి. కుండపై మూత ఉంచి దళసరి గుడ్డను రెండు పొరలుగా తీసుకొని బిగించి కట్టాలి. ఈ కుండను ఎండ తగలని చల్లని ప్రదేశంలో నేలలో గుంత తీసి పూడ్చి పెట్టాలి. 5Ð7 రోజుల తర్వాత కుండను వెలికి తీయాలి. కుండలో ఉపయుక్త సూక్ష్మజీవులు పూత పూసినట్టుగా, తెట్టులా తేలుతూ సాధారణంగా తెలుపు, ఆకుపచ్చ, నలుపు, ఊదా రంగులు కలగలసి ఉంటాయి.
మత్స్య సంజీవని వాడే పద్ధతి: వంద కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టుకు ఒక లీటరు చొప్పున మత్స్య సంజీవనిని కలిపి మొక్క పాదుల్లో చల్లాలి. వేప పిండి, ఆముదం చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రీయ ఎరువులతో కూడా కలిపి వాడవచ్చు. 120 మైక్రాన్ల మెష్‌తో వడపోసి ఎకరానికి విడతకు 10 లీటర్ల చొప్పున డ్రిప్ ద్వారా అందించవచ్చు. వంద లీటర్ల నీటికి 3 లీటర్ల మత్స్య సంజీవనిని కలిపి మె°క్కలపై పిచికారీ కూడా చేయవచ్చు.

Read More

ఔషధ మొక్క… కలబంద

కలబంద ఒక గుత్తి వలే పత్రాలు వచ్చే బహువార్షిక మొక్క. దాదాపు 60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు జిగటగా ఉన్న గుజ్ౙు కలిగి, అంచులకు ముండ్ల వంటి దంతాలుంటాయి. ఆకులు 50 సెం.మీ. వరకు పెరిగి చాకుల వలె ఉంటాయి. పూవులు నారింజ పసుపు రంగులో ఒక మీటరు పొడవు గల కాడపై గొట్టాల వలే వ్రేలాడబడి ఉంటాయి. ఈ మొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన వనాలలోను, పొలంగట్ల పైన పెంచబడుతుంది. ఇది వేరు పిలకల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : ఇండియన్ అలో / బార్బడోనఅలో / ఘికుమార్/ఘ్రిత్‌కుమారి శాస్త్రీయ నామం: అలో బార్బడెన్స్ / అలో విర కుటుంబం: లిలియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు, ఆకులలో వుండే గుజ్జు, పసుపు రంగు ద్రవం (మూసాంబ్రం) కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
  • వీటిలో ఆంత్రాక్వినోన్లు (అలాయిన్, అలోఎమోడిన్), రెసిన్లు, టానిన్లు, పాలిశాకరైడ్లు, మొదలైన రసాయన పదార్థాలుంటాయి. కలబంద ఆకు చలవ చేస్తుంది. నేత్ర రోగాల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.
  • దీని నుండి తీసిన గుజ్ౙుని మరియు పసుపు రంగు ద్రవాన్ని ఎండబెడితే మూసాంబ్రం అనే పదార్థం తయారవుతుంది. ఇది నొప్పులను, వాపులను, కుష్టువ్యాధి, మూలశంక, మానసిక వ్యాధులు, చర్మవ్యాధులు, కాలేయ వ్యాధులు, ఋతుసంబంధ వ్యాధుల చికిత్సకు, రక్తవిరేచనాలు అరికట్టడానికి ఉపయోగపడుతుంది.
  • తెగిన గాయాలకు, వడదెబ్బకి ప్రాధమిక చికిత్సగా బాగా పనిచేస్తుంది. కలబంద ఆకులలో ఉండే గుజ్ౙు సౌందర్య సాధనాల తయారీలో ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
  • చంటి పిల్లల కడుపులో క్రిముల నివారణకు, విరేచనకారిగా కూడా ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • కలబంద చెదల వికర్షకంగా పని చేస్తుంది. కలబంద నీటి ద్రావణం చెదలను వికర్షిస్తుంది.
  • కలబందలో సహజ అలాయిన్ అనే రసాయనముంది. అందువలన కలబందను ఎటువంటి పురుగులు, తెగుళ్ళు ఆశించవు (పంత్, 2016). దీనిని జీవ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు.
  • కలబంద ద్రావణంలోని అలోయిన్ ఎ (0.02%) మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెపై బలమైన వికర్షక చర్యను ప్రదర్శించింది (మల్లావధాని, అతని అనుచరులు, 2016).
  • కలబంద ఒక శక్తివంతమైన మొక్కల పెరుగుదల కారకం. కలబంద బయట పొరలో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్ మిశ్రమాలు “అలాయిన్స” వుంటాయి. అలాయిన్ వాల్లబీస్, కంగారూలు, ఎలుకలు, పంటలను తినకుండా వికర్షిస్తుంది.
  • కలబంద క్రూడ్ ద్రావణం ఈగల లార్వాలను సమర్ధవంతంగా నివారిస్తుంది (జెసిఖ, 2012)
  • కలబంద ద్రావణం వగరు రుచి కలిగి ఉండటం వలన పురుగులను వికర్షిస్తుంది కాని చంపదు (మెలెస్, అతని అనుచరులు, 2012).
  • కలబంద గుజ్ౙు (జెల్) డ్రెష్లరా హవాయిఎన్సిస్, ఆల్టర్టేరియా ఆల్టర్నేట శిలీంద్రపెరుగుదలను పూర్తిగా అరికడుతుంది (సితార, ఆమె అనుచరులు, 2011).
  • 4 కి. కలబంద { 500 మి.లీ. వేపనూనె { 500 మి.లీ. పొగాకు పొడి కషాయం 20 లీ. నీటికి కలిపి 3 నుండి 4 గంటలు మరగబెట్టాలి. కుండలో నీరు 5 లీ. మిగిలినపుడు చల్లార్చి, వడపోయాలి. ఈ కషాయాన్ని ప్రత్తి, బెండ మొదలగు పంటలపై పిచికారి చేసి పొగాకులద్దె పురుగు, శనగపచ్చ పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ జీవ పురుగు మందుకి “నీకుంచి (వేప{కలబంద{పొగాకు పొడి డికాక్షన్)” అని పేరు పెట్టారు. 100 నుండి 150 మి.లీ. కషాయాన్ని 15 లీ. నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. 10 రోజుల తర్వాత ఇంకొకసారి పిచికారి చేయాలి. (రజనీకాంత్ భాయ్ పటేల్, గుజరాత్ రైతు, 2001).
  • అలో ఫెరాక్స్‌ని పంటల చుట్టూ జీవకంచెగా నాటితే పంటలనాశించే పురుగులను వికర్షిస్తుంది.
  • అలో మార్లోతి ఆకుబూడిద (5%)ని మొక్కజొన్న లేదా అలసంద గింజలపై చల్లి నిల్వ సమయంలో ఆశించే పురుగులను వికర్షింపవచ్చు.
  • 5 కి. కలబందను ముక్కలుగా చేసి 1 కి. పొగాకు పొడి కలిపి 3 లీ. నీటిలో కలిపి మరిగించి చల్లార్చి, వడపోసి 2 లీ. పుల్లటి మజ్ౙిగ కలిపి 100 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇది జీవ పురుగు వికర్షిణిగా పనిచేస్తుంది.

ఐ.పి.యం రెసిపి1 :

  • 4.5 లీ. నీరు, 1 చెంచా వేపనూనె, 12 చెంచాలు 78% పొటాషియం సిలికేట్ ద్రావణం, 15-30 మి.లీ. యూకలిప్టస్/ జింజర్/ లెమన్‌గ్రాస్/ థైమ్/ క్లోవ్/సిన్నమోన్/పెప్పర్‌మింట్, 1/4 కప్పు అలోవిరా రసం
  • వేపనూనె నీటిలో కరగడానికి 12 చెంచాల పొటాషియం సిలికేట్ ద్రావణం కలపాలి. ఈ మిశ్రమాన్ని వారానికొకసారి పిచికారి చేసి పురుగులను నివారించవచ్చు. వారం వారం ఎసెన్షియల్ మార్చి వాడాలి.

ఐ.పి.యం. రెసిపి2 :

  • 4.5లీ. నీటిలో 2 చెంచాల కలబంద గుజ్ౙు కలిపి 24 గంటలుంచాలి. తర్వాత వడపోసి పిచికారి చేయాలి.
  • ఈ రెసిపీలలో నీటికి బదులు ‘బొటానికల్ టీ’ని కూడా ఉపయోగించవచ్చు. ఈ టీని తయారు చేయడానికి లావెండర్, స్పియర్‌మింట్, పెప్పర్‌మింట్, ఒరిగానో, థైమ్, బోరేజ్, కామ్‌ఫ్రీ, యారో తాజా ఆకులను (2 కప్పులు) నూరి లీ. నీటిలో కలిపి 23 రోజులుంచాలి. మధ్యమధ్య ఈ ద్రావణాన్ని కలుపుతుండాలి. తర్వాత వడపోసి పై రెసిపిలను తయారు చేయడానికి నీటికి బదులు దీనిని ఉపయోగించాలి.
  • కలబంద ద్రావణం కోత అనంతరం పండ్లను ఆశించి కుళ్ళజేయు పెనిసిలియం డిజిటేటం, పెనిసిలియం ఎక్స్‌పాన్సమ్, బోట్రైటిస్ సినరియా, ఆల్టర్నేరియా ఆల్టర్నేటపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (బార్కాయ్‌గోలన్, 2001)
  • పురుగులు, తెగుళ్ళ నివారణకు కలబందనుపయోగించి హెర్బల్ టీ తయారు చేసి ఉపయోగించవచ్చు.

తయారీకి కావలసిన పదార్థాలు : 200 లీ. ప్లాస్టిక్ డ్రమ;్ గ్రైండర్ / చాపర్, రోలు, పత్రం; స్ట్రెనర్ / స్క్రీన్ / గుడ్డ; కొయ్యకర్ర; తాజా శుభ్రమైన నీరు;

మొక్కల పదార్థాలు : 10 కి. అల్లం, 5 కి. వెల్లుల్లి, 5 కి. కలబంద, 10 కి. మిర్చి, 30 కి. వేపఆకులు, 30 కి. కోకోఆకులు, 5 కి. డెర్రిస్, 5 కి. మకాబుహే, కీటకనాశన, శిలీంద్రనాశక వికర్షణ లక్షణాలున్న ఇతర మొక్కలు.
పైన పేర్కొన్న ఆకులను విడివిడిగా నూరాలి.

తయారు చేసే విధానం : నూరిన ఆకులను ప్లాస్టిక్ డ్రమ్ములో వేయాలి. డ్రమ్ములో నీరు నింపాలి. డ్రమ్ములోని పదార్థాలన్నింటినీ కర్రతో కలియత్రిప్పాలి.

హెర్బల్‌టీ తయారవడానికి ఒకరోజు నిల్వఉంచాలి. డ్రమ్‌లోని హెర్బల్ టీని వడపోయాలి. హెర్బల్‌టీకి సమానంగా నీరు కలపాలి. స్ప్రేయర్‌లో నింపి పంటపై పిచికారి చేయాలి. మొక్కలపైన పిచికారి చేయాలి. మొక్కల మొదళ్ళలో డ్రెంచింగ్ చేయాలి. అవసరాన్ని బట్టి 3 లేదా 7 రోజుల కొకసారి మొక్కలపై పిచికారి చేయాలి. క్యాబేజిలో డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాని వేపగింజ పప్పు (నీమ్ సీడ్‌కెర్నల్) + కలబంద+జిల్లేడు+క్లీరోడెండ్రాన్ ఆకు ద్రావణం మరియు వేపకాయలు+ ఎర్రమిరప+సీతాఫలం ఆకు ద్రావణం సమర్థవంతంగా నివారించాయి. (చంద్రశేఖరయ్య అండ్ సన్నవీరప్పనవర్, 2013).

ప్రత్తి, చామంతి పంటలలో పురుగుల నివారణకు కానుగ{కలబంద{వేప ద్రావణం పిచికారి చేయాలి. దీని తయారీకి 1కి. కానుగ చెక్కపొడి, 1 కి. వేప చెక్క పొడి, 250 గ్రా. విషముష్టి గింజలను ఒక మస్లిన్ సంచిలో వేసి ఒక రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మర్నాడు ఉదయం సంచిని పిండి రసాన్ని సేకరించాలి. దీనిని అరలీటరు కలబంద ఆకు రసంతో కలపాలి. దీనికి 15 లీ. నీరు కలపాలి. దీనిని మరలా 23 లీ. ఆవుమూత్రంతో కలపాలి. పిచికారి చేసేముందు 1 లీ. మిశ్రమాన్ని 10 లీ. నీటిలో కలపాలి. ఎకరానికి 60-100 లీ. పిచికారి ద్రావణాన్ని ఉపయోగించాలి (శాయికట్‌మన్నా)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More