దేశ ఆహార భద్రతను స్వామినాథన్‌ తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు

మన వ్యవసాయ రంగం పోషకాహార భద్రత, పంటల్లో భిన్నత్వం, వాతావరణాన్ని తట్టు కునే పంటలు, టెక్నాలజీలు ఈ నాలుగు చతుర్విధ లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎం.ఎస్‌. స్వామినాథన్‌ శత జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామినాథన్‌కు నివాళిగా ప్రత్యేక నాణేన్ని, పోస్టల్‌ స్టాంపును విడుదల చేశారు. ‘వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధను, మెషీన్‌ లెర్నింగ్‌ను ఉపయోగించుకుని కరవును, వేడిని, వరదలను తట్టుకునే పంటలను అభివృద్ధి చేయాలి. రియల్‌ టైమ్‌లో నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. దీనిని ప్రతి జిల్లాలో అందుబాటులోకి తేవాలి. తద్వారా పంటల దిగుబడిని, తెగుళ్ల నివారణను, సాగు విధానాలను పర్యవేక్షించాలి. భూములకు సరిపడే పంటలను నిర్ణయించాలి. పంటల మార్పిడిపై పరిశోధనలు జరగాలి. సౌర విద్యుత్తు ఆధారిత మైక్రో ఇరిగేషన్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ రంగానికి దివంగత స్వామినాథన్‌ చేసిన కృషిని ప్రధాని కొనియాడారు. ఆయన మన దేశానికి ఓ రత్నం లాంటి వారని పేర్కొన్నారు. దేశ ఆహార భద్రతను తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ఆలోచనలు నేటి వ్యవసాయ రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తు న్నాయి’ అని పేర్కొన్నారు.

ఎం.ఎస్‌.స్వామినాథన్‌ శత జయంతి అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీతో ఎంఎస్‌ఎస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఛైర్పర్సన్‌ సౌమ్యా స్వామినాథన్‌, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తదితరులు

Read More

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా గుర్రపుడెక్కతో ఎరువు తయారీ

వినూత్న రీతిలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. పంట కాలువల్లో విపరీతంగా పెరిగే ఈ గుర్రపు డెక్కతో సాగునీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఏళ్లుగా అన్నదాతలను పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఇదొకటి. మరోవైపు, గుర్రపుడెక్క తొలగింపునకు ప్రభుత్వం ఏటా భారీగా ఖర్చు చేస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు పశ్చిమగోదావరి కలెక్టర్‌ చదలవాడ నాగరాణి వినూత్నంగా ఆలోచించారు. ‘గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీకి శ్రీకారం చుట్టారు. డీఆర్‌డిఏ పీడీ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో ఆకివీడు మండలం సిద్ధాపురంలోని సంపద తయారీ కేంద్రంలో కుండీల్లో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీని ప్రయోగాత్మంగా చేపట్టారు. ఫలితంగా అన్నదాతల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు.. మహిళల ఉపాధికి అవకాశం ఏర్పడినట్లైంది. గుర్రపు డెక్క ముక్కలు, ఆవుపేడ, మైక్రోబియల్‌ కల్చర్‌తో ఇలా చేశారు. 3-9 అడుగుల కుండీల్లో కింద గడ్డిని పొరగా వేసి, ఆపైన ముక్కలుగా చేసిన గుర్రపుడెక్క, దానిపైన రెండు అంగుళాల మందంలో ఆవుపేడను ఏడు నుంచి ఎనిమిది పొరలుగా వేశారు. 21 రోజుల పాటు అలా వదిలేశారు. అనంతరం మైక్రోబయల్‌ కల్చర్‌ను వాడి త్వరగా కంపోస్టింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేలా చేశారు. ఆ మిశ్రమాన్ని ఏడు వారాల తర్వాత గుళికలుగా తయారుచేశారు. ఎరువు తయారీ ప్రాంతాన్ని క్రిమికీటకాలు ఆకర్షించే ప్రమాదం ఉండడంతో ఇళ్లకు, గోదాములకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.*నాణ్యమైన సేంద్రియ ఎరువు… తక్కువ సమయంలో…* గుర్రపుడెక్క ఎరువు సాధారణ సేంద్రియ ఎరువు కంటే రెండు నుంచి మూడు రెట్లు నాణ్యంగా ఉన్నట్లు ప్రయోగ పరీక్షల్లో తేలింది. ఈ తీగ కుళ్లడానికి తక్కువ సమయం పడుతోంది. పశువుల వ్యర్థాల కన్నా ఇందులో నత్రజని, భాస్వరం, పొటాషియం, సేంద్రియ కర్బనం, కాపర్‌, మాంగనీస్‌, జింక్‌, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ఈ సేంద్రియ ఎరువు 6 నెలలపాటు నిల్వ ఉంటుంది. మిద్దె పంటలు, కొబ్బరి, మామిడి, సపోటా, కూరగాయలు, ఆయిల్‌పామ్‌, పూలమొక్కలు, కూరగాయలు, వరి, ఉద్యాన పంటలన్నింటికీ గుర్రపుడెక్కతో తయారుచేసిన ఎరువును ఉపయోగించుకోవచ్చు.*స్వయం ఉపాధి మార్గం* ఎరువు తయారీని మహిళా సమాఖ్యలకు అప్పగించడంతో ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన సేంద్రియ ఎరువు దొరుకుతోంది. గుర్రపుడెక్కతో తయారుచేసిన సేంద్రియ ఎరువు ధర కిలో రూ.12 నుంచి రూ.15గా, టన్ను రూ.12 వేలుగా నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే 100 యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎరువు తయారు కావడానికి ఒక్కో యూనిట్లో 20 మందికి 50 రోజుల పాటు ఉపాధి లభిస్తుంది. దీనిని రైతులే స్వయంగా తయారు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

Read More

ఏటా మూడు పంటలు పండాలి

వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక, ఎరువుల వినియోగం తగ్గేలా కసరత్తు.
ప్రయోగాత్మకంగా అంతర పంటలు
వ్యవసాయ శాఖపై సమీక్షలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు

ఏటా మూడు పంటలు పండేలా... 365 రోజులూ సాగు భూములు పచ్చగా ఉండేలా రాష్ట్రంలో మూడు పంటల విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వరి రైతులకు ఆదాయం మరింత పెరిగే మార్గాలు అన్వేషించాలన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు. 'వరిలో అంతర పంటలుగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. పొలం మధ్యలో వెడల్పుగా అదనపు గట్లు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలి. అవసరమైతే ఉపాధి హామీ నిధులతో వాటిని ఏర్పాటుచేయాలి. వరి పంట మధ్యలో లేదా, పంట చుట్టూ ఆక్వా, ఉద్యాన సాగు దిశగానూ ప్రయత్నించాలి' అని సూచించారు.

వేసవిలోనూ సాగుకు సన్నద్ధం..
వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలి. అనంతపురం లాంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం నాలుగు నెలలే పంటలు సాగుచేసి మిగిలిన 8 నెలలు భూములను ఖాళీగా వదిలేస్తున్నారు.. దీనివల్ల భూసారం దెబ్బతింటోంది. అందుకే ఆ కాలంలోనూ ఏదో ఒక పంట సాగుచేసే పరిస్థితులు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ‘వచ్చే వేసవిలో జల వనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లో సాగు చేసేలా రైతుల్ని సన్నద్ధం చేయాలి. 19 మండలాలు జలాశయాలపై, 57 మండలాలు చెరువులపై, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నందున వాటిని సద్వినియోగం చేసుకుని దిగుబడులు సాధించాలి’ అని అన్నారు.

ఎరువుల వినియోగం తగ్గాలి..
ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి భూసారం కాపాడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాల సాగు పెరగాలన్నారు. ఈ సీజన్‌లో రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకులు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. వాట్సప్‌ గవర్నెన్స్‌- మన మిత్ర ద్వారా కొత్తగా వ్యవసాయ శాఖలో మూడు సేవలు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. రైతులకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో కూడా వ్యవసాయ విజ్ఞానంపై అవగాహన పెంచాలని చంద్రబాబు సూచించారు.

పంట కాలం ముందుకు జరిపేలా కార్యాచరణ
గత 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌ 14 తుపాన్లను ఎదుర్కొందని, అక్టోబరులో ఐదు, నవంబరులో ఆరు, డిసెంబరులో మూడు తుపాన్లు ప్రభావం చూపాయని వ్యవసాయ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అక్టోబరులో వచ్చే తుపాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయని వివరించారు. విపత్తుల ముప్పు తప్పేలా ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు. తుపాన్ల నుంచి ఖరీఫ్‌ పంటలను రక్షించుకునేలా పంట కాలాన్ని ముందుకు తీసుకొచ్చేలా కార్యాచరణ మొదలు పెట్టినట్లు వివరించారు. గోదావరి, కృష్ణా డెల్టాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశామన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా సాగునీరు విడుదల చేశామని తెలి పారు. జులై మొదటి వారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, పత్తి సాగు చేస్తుండగా.. వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతోందని.. కందులు సాగు పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని వివరించారు. పర్చూరు ఏఎంసీలో హెడ్డీ బర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభించడంతో రైతుల్లో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. హెడ్డీ బర్లీ స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. కోకో, మామిడి కొనుగోళ్ల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

Read More