సాంకేతికతను సాగుకు అనుసంధానించడం ద్వారా రైతుకు మేలు

వ్యవసాయాన్ని లాభదాయకం చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని సాగుకు సాంకేతికతను అనుసంధానించడం ద్వారా రైతుకు మేలు చేయాలని నాబార్డ్ మాజీ చైర్మన్, ఐఐఎఫఎల్ సంస్థ ఫైనాన్స్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు అన్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ) 63వ వ్యవస్థాపక దినోత్సవాలు గుంటూరు సమీపంలోని లాంఫాం ఆడిటోరియంలో శుక్రవారం జరిగాయి. వాతావరణ మార్పు అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆంగ్రూ అభివృద్ధికి రూ.3 లక్షలు విరాళం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రచురించిన ‘మారనున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులకు సుస్థిర వరి వ్యవసాయం’, గుంటూరు జిల్లాలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ప్రచురించిన ‘కంది సాగు సమగ్ర యాజమాన్యం, మినుము పంటకు నేల ద్వారా సంక్రమించే తెగుళ్లు, అపరాల సాగులో సమగ్ర కలుపు యాజమాన్యం’ పుస్తకాలను ఆవిష్కరించారు.

Read More

వ్యవసాయంలో రోబోటెక్ సేవలు

కలెక్టర్ల సదస్సులో వ్యవసాయం చేసే రోబోలు వచ్చేశాయని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ‘ఆ రోబో చూడటానికి ఎద్దు మాదిరే ఉంది. భూములు దున్నేందుకు దాన్ని వినియోగిస్తున్నారు. ఒక చిన్న సూట్‌కేస్ పెట్టి తీసుకెళ్లొచ్చు. పొలం లోకి వెళ్లి, ఆన్ చేసి పనిచేయించి.. మళ్లీ సూట్‌కేసులో పెట్టి తీసుకోచ్చేయొచ్చు. సాంకేతికత ఆ స్థితికి వచ్చేసింది’ అని పేర్కొన్నారు. రోబో పని తీరు వీడియోను తన కార్యాలయంలో చూశానని తెలిపారు. దాన్ని మీకు షేర్ చేశానని.. చూశారా అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ను అడిగారు. సాంకేతికత ఆ స్థాయికి వచ్చేసిందని, ఇక కూలీలు దొరకడం లేదని మీరు అనకూడదని సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. అది ఏఐ జెనరేటెడ్ వీడియోలా ఉందని రాజశేఖర్ అనడంతో.. సీఎం స్పందిస్తూ.. ఏఐ జెనరేటెడ్ అయ్యుండొచ్చేమో చూసుకోండి.. అదే అయితే ఐ డోంట్ మైండ్ అని నవ్వారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రోబోటిక్ సేవలు ప్రవేశిస్తున్నాయని పునరుద్ఘాటించారు.

Read More

మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు

సచివాలయంలో మొక్కజొన్నల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, వారు హమాలీ, రవాణా, గన్నీ బ్యాగులు, గోదాములు వంటి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. ‘ఇప్పటికే రూ.1650 కోట్లతో 1.22 లక్షల మంది రైతుల నుంచి 6.74 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశాం. అకాల వర్షాల దృష్ట్యా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకొని, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. కొనుగోళ్లు, రవాణాను సత్వరమే పూర్తి చేయాలి. రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నోడల్ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. రైతులు గన్నీ బ్యాగులను సొంతంగా తెచ్చుకుంటే దానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది’ అని తుమ్మల సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోళ్ల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, కరీంనగర్-బి. గోపి, మెదక్, ఖమ్మం- రాహుల్రాజ్, మహబూబ్ నగర్, రంగారెడ్డి-యాస్మీన్ బాషా, నల్గొండ, ఆదిలాబాద్ -కె. చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్‌కు కొర్రా లక్ష్మిలను నియమించింది. రవాణా శాఖ తరఫున మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు నోడల్ అధికారి బాధ్యతలు అప్పగించింది.

Read More

నేల ఆరోగ్యంతోనే పౌష్టికాహారం

నేల ఆరోగ్యంగా ఉంటేనే పౌష్టికాహారం అందుతుంది కాబట్టి రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్)ల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో భూసార ఆరోగ్య వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ‘పిల్లి పెసర, జీలుగ లాంటి పచ్చిరొట్ట పైర్ల ద్వారా నేల సారాన్ని పెంచాలి. పంట అవశేషాలు తగల బెట్టకుండా వాటిని ఎరువులుగా ఉపయోగించాలి. నేల ఆరోగ్య పరిరక్షణను ఉద్యమంలా నిర్వహించేందుకు ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నాం. వారు రైతులకు నేల యాజమాన్యంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే నైపుణ్యాలను వృద్ధి చేస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలి” అని మంత్రి సూచించారు. అంతకుముందు మంత్రి ఇక్రిశాట్‌లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) హిమాన్ష్ పాఠక్, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మిన్ బాషా, అగ్రివర్సిటీ వీసీ రాజిరెడ్డి, అగ్రివర్సిటీ పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

Read More

23 వేల రూపాయలకు చేరువలో పామాయిల్ ధర

కరోనా సమయంలో పామాయిల్ గెలలకు గరిష్ఠంగా టన్నుకు రూ.23 వేల పైచిలుకు ధర లభించింది. అప్పటివరకు గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో, ఎన్‌టిఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కనిపించిన సాగు ఊపందుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నర్సరీల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచడమేగాక, మొక్కలు ఉచితంగా అందిస్తుండటంతో ఏటా సాగు పెరుగుతూ వస్తోంది. గతేడాది వరకు ఎన్‌టిఆర్ జిల్లా వ్యాప్తంగా కేవలం 7,500 ఎకరాల్లో సాగవగా, గడిచిన ఒక్క ఏడాదిలోనే 6,150 ఎకరాల్లో విస్తీర్ణం పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. *మళ్లీ దూకుడు:* తొలుత రూ.12 వేలు ఉన్న టన్ను 2022లో గరిష్ఠంగా రూ.23,467 పలికింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు రూ.15 వేల లోపే ఉంది. గతేడాది మళ్లీ రూ.20 వేలు దాటింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 20 వేల దిగువనుండగా, గడిచిన మూడు నెలలుగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణాలో ఇప్పటికే రూ.23 వేలు దాటింది.పెరుగుదల (టన్నుకు రూ.ల్లో)

జనవరిలో : 19,850

ఫిబ్రవరి మొదట్లో : 20,180

ఫిబ్రవరి చివరిలో : 21,546

మార్చిలో : 22,936

Read More

మొక్కజొన్న పంట ఉత్పత్తి మొత్తానికి సాయం అందించాలి

ఆంధ్ర రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస పథకం కింద అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరించడంతోపాటు.. 100% పంట ఉత్పత్తికి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ‘2025-26 రబీలో రాష్ట్రవ్యాప్తంగా 4.83 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. 37.61 లక్షల టన్నుల దిగుబడి లభిస్తుందని అంచనా. అత్యధికంగా నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, విజయనగరం, ఏలూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, ఎన్టీఆర్, కర్నూలు, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగైంది. రబీ పంట జూన్ వరకు చేతికొస్తోంది. అధిక ఉత్పత్తి కారణంగా, మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కు వగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని అంచనా. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్ట పోతారు’ అని లేఖలో చంద్రబాబు వివరించారు. కర్షకుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. మద్దతు ధర, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని 50:50 నిష్పత్తిలో కాకుండా మొత్తం కేంద్రమే భరించాలని, మొత్తం పంట ఉత్పత్తిలో 25% మాత్రమే కాకుండా 100% ఉత్పత్తికి సాయం అందించాలని పేర్కొన్నారు. జూన్ వరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

Read More

తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతః మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో విస్తృత అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని కెఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో నిర్వహించిన వ్యవసాయ ఎగుమతులపై అవగాహన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ మరియు వ్యవసాయ అభివృద్ధి విధానాల ఫలితంగా తెలంగాణ దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా నిలిచిందని చెప్పారు. అదే సమయంలో ఉద్యానవన పంటల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందని, పండ్లు, కూరగాయలు, పసుపు, మిర్చి వంటి పంటలకు దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిఇడిఎ, డిజిఎఫ్‌టి అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఓ) సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.

ఉత్పత్తి పెంపుతోపాటు రైతులకు మెరుగైన ధరలు అందేలా చేయడం, కొత్త మార్కెట్ అవకాశాలు కల్పించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను విస్తరించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను అంతర్ౙాతీయ మార్కెట్లకు తీసుకెళ్లాలంటే కేవలం ఉత్పత్తి పెరగడం మాత్రమే సరిపోదని, గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ మరియు అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు కూడా అత్యంత అవసరమని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతోందని చెప్పారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా బుగ్గపాడు వద్ద మెగా ఫుడ్ పార్క్ ద్వారా ఆధునిక ప్రాసెసింగ్ సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్, లాజిస్టిక్స్ మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవకాశాలు కల్పించిందని వివరించారు. దీని ద్వారా రైతుల పంటలకు మెరుగైన మార్కెట్ లభించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఉద్యానవన పంటల ఎగుమతులకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరైన సరఫరా వ్యవస్థలు, ప్యాక్ హౌసులు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తే రాష్ట్రం అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ముందుకు వెళ్లగలదని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అదే సమయంలో రైతుల ప్రయోజనాలను కాపాడటం కూడా ఎంతో ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ మరియు వంటనూనెలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలపై రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి నిర్ణయాలు దేశీయ రైతులపై ప్రభావం చూపే అవకాశముందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. అలాగే అమెరికా వంటి దేశాలతో వ్యవసాయ వాణిజ్య ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం అవసరమైనదే అయినా, అది దేశీయ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఓ) వ్యవసాయ ఎగుమతులను విస్తరించడంలో కీలక పాత్ర పోషించగలవని మంత్రి చెప్పారు. రైతుల ఉత్పత్తులను సమీకరించడం, నాణ్యతను నిర్ధారించడం మరియు రైతులను నేరుగా ఎగుమతిదారులతో అనుసంధానం చేయడం ద్వారా చిన్న రైతులు కూడా ప్రపంచ మార్కెట్లలో భాగస్వాములు కావచ్చని తెలిపారు. ఓఆంలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఎపిఇడిఎ, డిజిఎఫ్‌టి మరియు ఇతర పరిశ్రమల సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోందని మంత్రి తెలిపారు. రైతులు మరియు పారిశ్రామికవేత్తలలో అవగాహన పెంచేందుకు పలు శిక్షణ కార్యక్రమాలు మరియు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్-2047 వ్యవసాయం మరియు ఉద్యానవన రంగాల దీర్ఘకాలిక అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఇందులో ఉత్పత్తి పెంపుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఎగుమతుల ప్రోత్సాహం మరియు రైతుల ఆదాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే ముందంజలో నిలిచే పూర్తి సామర్థ్యం ఉందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. సరైన విధానాలు, బలమైన మౌలిక సదుపాయాలు మరియు రైతులు-పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో ఈ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలమని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ విస్తరణ మరియు వ్యవసాయ ఎగుమతుల పెంపుకు పూర్తి కట్టుబాటుతో పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు నిర్వహించిన ఈ సెమినార్ వంటి కార్యక్రమాలు రైతులు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు మరియు విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకువస్తాయని మంత్రి తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు మార్కెట్ అవసరాలను అర్థం చేసుకోవడంలో, కొత్త ఎగుమతి అవకాశాలను గుర్తించడంలో మరియు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలకంగా ఉంటాయని చెప్పారు. ఈ సెమినార్‌లో ఎఫఐసిసి ప్రతినిధులతో పాటు ఎపిఇడిఎ, డిజిఎఫ్‌టి మరియు ఎగుమతి రంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More