‘వండని వంటలు’ ఓ అద్భుతం‘వంద వండని వంటలు’ పుస్తకావిష్కరణలో పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

ఈరోజు హైదరాబాద్‌లోని వారి నివాసంలో ‘రైతునేస్తం పబ్లికేషన్స’ ప్రచురించిన ‘వంద వండని వంటలు’ పుస్తకాన్ని పూర్వ ఉప రాష్ట్రపతి ఆవిష్కరించి… రచయిత, సంకలన కర్త తుమ్మేటి రఘోత్తమ రెడ్డిని అభినందించారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో బయటి ఆహారం మీద ఆధారపడకుండా, అప్పటికప్పుడు చేసుకుని తినేవిధంగా పలువురు అందించిన ఈ వండని వంటలు ఈతరానికి ఓ ఆరోగ్య దిక్సూచి. ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగించడమే గాక, సమయాన్ని ఆదాచేసే ఈ పుస్తకం ప్రత్యేకించి బ్రహ్మచారులకు, ఉద్యోగాలు చేసుకునే జంటలకు మరింత ప్రయోజనకారి కాగలదన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహారం నేపథ్యంలో పలు పుస్తకాలను అందిస్తున్న ‘రైతునేస్తం’ వ్యవస్థాపకులు శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి చొరవ ఇదే విధంగా కొనసాగాలని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాలను వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పద్మశ్రీ డా॥ యడ్లపల్లి వేంకటేశ్వర రావు, రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, ‘మిసిమి’ పత్రిక సంపాదకులు అశ్వినీ కుమార్, వలేటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

‘రైతునేస్తం పబ్లికేషన్స’ ప్రచురించిన ‘వంద వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777 కు సంప్రదించండి.

Read More

వండని వంట… కొబ్బరి అటుకుల లడ్డు

ఉడికించని, వేపని, వేడిచెయ్యని, సహజంగా చేసుకునే ఒక స్వీట్ కొబ్బరి అటుకుల లడ్డు. ఇది చేసుకోవడం చాలా సింపుల్. చాలా రుచికరమైన స్వీట్.

కావాల్సిన పదార్ధాలు: అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, ఎలాచి పొడి, బెల్లం తురుము.

తయారీ విధానం: అటుకులను కచ్చాపచ్చాగా దంచుకుని, అందులో ఎలాచి పొడి, కొబ్బరి తురుము వేసుకుని, తీపి రుచి చూసుకుంటూ బెల్లం వేసుకోవాలి.

పచ్చి కొబ్బరి వల్ల, లడ్డు కట్టడానికి వస్తుంది… ఎక్కువ తీపి పట్టదు, కానీ రుచిగా ఉంటుంది.

పచ్చి కొబ్బరి కనుక, అప్పటికప్పుడు చేసుకుని తినవచ్చు. లేదా ఫ్రిజ్‌లో పెట్టుకుని వారం పది రోజుల పాటు వాడుకోవచ్చు.

రచన: సంధ్యా శశికాంత్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఫ్రూట్ సలాడ్

మామూలుగా బయట దొరికే ఫ్రూట్ సలాడ్‌లో కస్టర్డ్ పౌడర్, చక్కెర, పాలలో వేసి మరిగించి చల్లారాక ఫ్రూట్స్ వేసి కలుపుతారు.

చక్కెర, కస్టర్డ్ పౌడర్ లేకుండా, పాలను మరిగించకుండా ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.ఉడికించని ఆహారం కనుక, జీవశక్తిపూరితంగా ఉంటుంది.

తయారీ విధానం: రెండు అరటిపళ్ళు, నాలుగు సపోటాలు బాగా మాగినవి, కొన్ని అంగూర (ద్రాక్ష) పండ్లు, రెండు దోర జామపండ్లు, అన్నిటినీ సన్న ముక్కలుగా తరిగి గిన్నెలో వేసుకొని, పచ్చి పాలు పోసి కలుపుకొని, కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి.

కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు.

జీడీపప్పు, బాదం పప్పు ఉంటే వేసుకోవచ్చు.

మాములుగా తినొచ్చు, లేదా ఎండలు బాగా వున్నాయి కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే, కడుపుకు చల్లగా హాయ్‌గా ఉంటుంది.

చక్కెర అవసరం లేదు. పళ్ళలో వుండే తీపి సరిపోతుంది. ఇంకా తీపి కావాలనిపిస్తే, తేనే కలుపుకోవచ్చు !

రచన: శివారెడ్డి కర్నాటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… కడుపులో చల్లటి భోజనం

మామూలుగా ఎండాకాలంలో ఏమి తినాలనిపియదు. నీళ్లు బాగా తాగిన తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది, కాసేపటికి నీరసం వస్తుంది, అటువంటి పరిస్థితుల్లో దీన్ని బాగా తినొచ్చు.

కావాల్సిన వస్తువులు: ఒక సగం కీర, చిన్న దోసకాయ ముక్క, మూడు నాలుగు క్యారెట్ ముక్కలు అంటే చిన్న క్యారెట్ ఒకటి, చిన్న బీట్రూట్ ముక్క రెడ్ కలర్ ఉండొద్దు అనుకుంటే బీట్రూట్ వేయకుండా ఉండొచ్చు. ఒక టమాటా, ఒక చిన్న కప్పు పెరుగు, కొంచెం సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు కొన్ని….

చేసుకునే విధానం: అన్ని ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు తక్కువ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది గట్టిగా లేకుండా కొంచెం లూస్‌గా ఉంటేనే బాగుంటుంది. ఉదయము, మధ్యాహ్నము ఎప్పుడైనా మనం దీన్ని తినొచ్చు. అమృత ఆహారం అనలేము, ఎందుకంటే సాల్ట్ కలుస్తుంది కాబట్టి. ఉప్పు లేకుండా కూడా బాగానే ఉంటుంది.
అన్నం తింటేనే కడుపు నిండుతుంది అనుకునేవాళ్ళు కరెక్ట్‌గా ఒక ముద్ద అన్నాన్ని పిసికి, దీంట్లో కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది

కీర లేకున్నా టమాటా, ఉల్లిగడ్డ, పెరుగు…. వీటితో కూడా ట్రై చేసుకోవచ్చు.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… అమృత ఆహారము

ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఆహారము ‘అమృత ఆహారము’.

ఈ అమృతాహారం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయి. దీని తయారీ విధానము మొదట్లో ఇది కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ, ఒకసారి చేసుకుంటే చాలా సులువు. దీనికి సంబంధించి మూడు భాగాలుగా ఈ ఆహారాన్ని తయారు చేసుకునే విధానాన్ని మనము డివైడ్ చేసుకుందాం. దానివల్ల మీకు కొంచెం సులువు అవుతుంది.

మొదటి భాగం: కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవి అవసరము. మనకు అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఎక్కువ ధర పెట్టాలని ఏం లేదు, మనకు అందుబాటు ధరలలో ఏవైతే దొరుకుతాయో, అవి ఎన్ని ఎక్కువ రకాలు దొరుకుతాయో అన్ని.

ఒకవేళ రెండు మూడు రకాలు దొరికినాయి అనుకోండి, అంటే రెండు కూరగాయలు – ఒక ఆకుకూర – రెండు రకాల పండ్లు, అట్లా అయినా పర్వాలేదు. వాటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

రెండవ భాగం: మొలకలు అంటే, పప్పు ధాన్యాలకు సంబంధించి పెసలు, ఉలువలు, శనగలు, పల్లీలు, బొబ్బర్లు,
రాజ్మా, కాబూలీచెన ఇట్లాంటివి. అంటే రెండు పలకల నుండి మొలకలు వచ్చేవి ఏవైనా గాని, అవి కూడా అందుబాటులో ఉన్నవి ముందే తయారు చేసుకొని మొలకగట్టి రెడీగా ఉంచుకోవాలి.

మూడవ భాగం: ధాన్యము, చిరుధాన్యాలకు సంబంధించి అంటే బియ్యము దంపుడు బియ్యం అయితే మంచిది, ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు, జొన్నలు, గోధుమలు, ఇందులో ఏవి అందుబాటులో ఉంటే అవి. ఉదయం నానబెట్టి రాత్రికి ఇడ్లీ పిండి రుబ్బినట్టు రుబ్బి పక్కన పెట్టుకుంటే, పొద్దునకి పులుస్తది. ఈ పులిసిన పేస్ట్ లోంచి ఒక మనిషికి రెండు స్పూన్ల చొప్పున అవసరం అయితది.

ఇప్పుడు ఈ మూడు భాగాలను ఒక భాగంగా తయారు చేసి, మనం ఎట్లా ఆహారంగా తీసుకోవాలో చూద్దాం.
మనము తినగలిగినన్ని కూరగాయ ముక్కలు ఒక గిన్నెలోకి తీసుకొని, దాంట్లోకి రెండు చెంచాల పేస్టు, ఒక చెంచా మొలకలు కలుపుకొని తినొచ్చు.

ఉదయము ఈ ఆహారాన్ని తీసుకుంటే ఆకలి కూడా ఎక్కువగా వేయదు. మనము తినగలిగినంత అమృతారాన్ని తినొచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. మధ్యాహ్నముా, రాత్రికి కూడా ఇదే ఆహారాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ అట్లా తీసుకోలేకపోతే, మనం భోజనం చేసేముందు కొంత, అంటే ఒక రెండు మూడు చెంచాలు ఈ అమృత ఆహారాన్ని తీసుకొని, తర్వాత భోజనాన్ని కంటిన్యూ చేయొచ్చు.

ఇది అనేక ఆరోగ్య సమస్యలను నిర్మూలిస్తుంది, రాకుండా చేస్తుంది. కాబట్టి మిత్రులు దీన్ని ప్రయత్నం చేయొచ్చు.

మేము ఒక నెల నుంచి తింటున్నాము.

ప్రాణం తేలిగ్గా ఉంటుంది. ఒకవేళ కొత్తలో ఎవరికైనా తినడం కష్టం అనిపిస్తే, కొంచెం బెల్లం ముక్క లేదంటే ఒక రెండు చెంచాల పెరుగు, కొన్ని ఎక్కువ పండ్ల ముక్కలు మనకు ఇష్టమైనవి వేసుకొని తినొచ్చు. తినే ముందు కొన్ని నువ్వులు కొన్ని అవిసెలు దీంట్లో కలుపుకొని తింటే, అప్పుడు పంటికి పచ్చివి చాలా టేస్ట్ అనిపిస్తాయి.
మేము ఇద్దరమే తింటాం కాబట్టి మాకు వారానికి అవసరమైనటువంటి పండ్ల ముక్కల్ని కూరగాయ ముక్కలు ఒకసారి కట్ చేసి పెట్టుకుంటున్నాము. దాన్యాలకి సంబంధించినటువంటి పేస్టును కూడా ఒకేసారి రుబ్బి ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకుంటున్నాము. తినడానికి రెండు మూడు గంటల ముందు ఫ్రిజ్ లోంచి మన అవసరం నిమిత్తం ఎంతయితే తినాలో అంత క్వాంటిటీని వేరే గిన్నెలోకి తీసుకొని బయటపెట్టి దాన్ని బ్రేక్ ఫాస్ట్‌కి తీసుకుంటున్నాం.

ఒకవేళ మీకు ఏమైనా సందేహం ఉంటే Ameya Krishi Vikasa Kendram YouTube Channel / అమేయ కృషి వికాస కేంద్రం యూట్యూబ్ ఛానల్‌లో దీనికి సంబంధించిన వీడియో ఉన్నది మిత్రులు గమనించగలరు.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… సత్తుపిండి

సత్తుపిండిని కేవలం రెండే రెండు పదార్థాలతో తయారు చేస్తారు. తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగకు కట్టుకుపోయే ‘సద్ది’లో, ఈ సత్తుపిండి ఒకటి.

సత్తుపిండిని, మొక్కజొన్నలను ‘వేపి’ తయారు చేస్తారు.
మన వండని వంటలు కాన్సెప్ట్ ప్రకారం, మొక్కజొన్నలను వేపకుండానే తయారు చేసాను.

కిలో మొక్కజొన్నలను బాగా ఎండబెట్టి, శుభ్రం చ్రేసి, మెత్తగా మర పట్టించాలి.

విసుర్రాయితో విసురుకుంటే, ‘కోల్డ్ విసుర్డ్ పిండి’ వస్తుంది, అది మరీ శ్రేష్టమైన పిండి.

మర(గిర్ని) పట్టిస్తే పిండి ఎక్కువ వేడెక్కుతుంది. ఆ మేరకు జీవశక్తి నష్టపోతుంది. కనుక విసుర్రాయి (తిరుగలి) ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండాలి.

సత్తుపిండి తయారీ విధానం: రెండు కప్పుల మొక్కజొన్న పిండికి, తగినంత ముడిబెల్లాన్ని తీసుకోవాలి. కాస్తా వెడల్పు గిన్నెలో అరకప్పు మంచినీరు తీసుకుని, ఆ నీటిలో బెల్లాన్ని కరిగించాలి. కరిగిన బెల్లపు నీటిలో, మొక్కజొన్న పిండిని బాగా కలిపి, ముద్దలు చేసుకోవాలి. అంతే! వెరీ సింపుల్!

మొక్కజొన్న పిండి సహజ సువాసనతో తియ్యగా ఉంటుంది.

పెద్దలు, పిల్లలు సత్తుపిండిని ఉపాహారంగా తినవచ్చు.

బెల్లం మోతాదు ఎవరి అబిరుచిని బట్టి వారు, కాస్తా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.

పిండి తయారుగా ఉంటే, సత్తుపిండి తయారీ నిముషాలలో అవుతుంది. సత్తుపిండిలో ఎండుద్రాక్ష లేదా ఖర్జూర పండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

పూర్వం ప్రయాణాల్లో సత్తుపిండిని, బెల్లాన్ని వెంట తీసుకుని పొయ్యేవారు. వంటకు వీలుకాని పూట, సత్తుపిండిని తినేవారు.

  • రచన: తుమ్మేటి రఘోత్తమరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… పచ్చిమిర్చి పచ్చడి

పచ్చిమిర్చిని కూరల్లో కారం కోసం వాడతాం కదా. కానీ, ఒక కూరగాయగా కూడా వాడుకోవచ్చు.

పచ్చిమిర్చిని తింటే, కడుపులో మంట వస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ ప్రకృతి ఆహారంలో, ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చిమంచిదని చెప్తారు. ఎందుకంటే పచ్చిమిర్చి ఎండిన తర్వాత, దానికి కారం ఎక్కువగా ఉంటుంది. అందుకని పచ్చిమిర్చి మంచిదని చెప్తారు.

సరే ఆ సంగతి వదిలేసి, పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా సులభంగా తయారు చేయవచ్చు.

కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, వాటికి సరిపడా చింతపండు, ఉప్పు, ఇంగువ.
నీటిలో కడిగి శుభ్రం చేసి, తేమ లేకుండా తుడిచిన పచ్చిమిర్చిని, ఉప్పును రోట్లో కానీ, మిక్సీలో కానీ వేసి దంచి, కొంచెం దంచిన తర్వాత, దానికి చింతపండు కలిపి దంచుకోవాలి. కావలసిన వారు జీలకర్ర వేసుకోవచ్చు.

ఆఖరున ఇంగువ కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

ఇది అన్నం లోకి, రొట్టెలు, టిఫిన్స్ అన్నింటిలోకీ బాగుంటుంది.

ఆ పచ్చడికి కొత్తిమీర కలిపి చేస్తే , ‘పచ్చిమిర్చి కొత్తిమీర’ పచ్చడి అవుతుంది.

పచ్చిమిర్చి, ఉప్పు, ఇంగువ మాత్రమే కలిపి చేస్తే, అది ‘పచ్చిమిర్చి కారం’ అవుతుంది.

ఈ పచ్చడికి ఉల్లిపాయ కలిపి చేస్తే, ఉల్లిపాయ పచ్చడి అవుతుంది. ఎల్లిపాయ అయినా వేసుకోవచ్చు.
ఒకే విధానంతో రకరకాల పచ్ౘ్ళ్లు చేసుకోవచ్చు.

రచన: శ్రీమతి లతా కృష్ణమూర్తి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… కొత్తిమీర పచ్చడి

కొత్తిమీరని మనం వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటాం. కూరల్లో, పచ్చళ్ళలో, పప్పులో, సాంబారులో చివరగా ఇంత కొత్తిమీర వేస్తే చాలు… ఆ ఘుమఘుమలు మనకు ఆ పదార్థం నచ్ౘ్కపోయినా రుచి చూసేట్టు చేస్తుంది. ఆనక తినేట్లుగా కూడా చేస్తుంది.

పచ్చి కొత్తిమీరలో విటమిన్ ఎ, బి, సి, కె, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఐరన్ కూడా ఉంటుంది.

కొత్తిమీర గుండెకు చాలా మంచిది. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. అల్సర్‌ని తగ్గిస్తుంది. కిడ్నీలను శుభ్రం చేస్తుంది. ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

కొత్తిమీర రోటి పచ్చడి కావల్సిన దినుసులు :
పది పన్నెండు ఎండుమిర్చి, పదిదాకా పచ్చిమిరప కాయలు.
జీలకర్ర›, గోలీకాయంత చింతపండు
చిన్న ముక్క బెల్లం, సరిపడా రాళ్ళ ఉప్పు, ఒక పెద్ద కట్ట కొత్తిమీర
నాలుగు వెల్లుల్లి రెబ్బలు (ఇష్టం ఉంటే వేసుకోండి)

పైన చెప్పిన వాటిలో పచ్చిమిర్చి, ‘కొత్తిమీర సేంద్రియం కాకపోతే, కొంచెం ఉప్పు, పసుపు నీళ్ళలో వేసి పచ్చిమిర్చి తొడిమ తీసి వేసి పదినిమిషాలు ఉంచి, బాగా కడగండి. ఆ నీళ్ళు పారపోసి మళ్ళీ ఇంకో రెండుసార్లు కడగండి, ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే కొంతన్నా పోతాయి. కొత్తిమీర కూడా ఇదే ప్రాసెస్‌లో కడిగి, రెండూ తడి లేకుండా ఆరపెట్టుకోండి. తరువాత జీలకర్ర, పచ్చి, ఎండుమిర్చిని కలిపి మెత్తగా నూరి, అందులో ఉప్పు, వెల్లుల్లి వేసి మరింత నూరి, చివరికి కొత్తిమీర, బెల్లం వేసి మెత్తగా నూరి, గిన్నెలోకి తీసుకోవాలి.
పోపు అవసరం లేదు. వేడి అన్నంలో కలిపి, అవసరం అనుకున్న వారు నెయ్యి, లేదా కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ ఆయిల్ వేసుకుని తినవచ్చు. అవి లేకున్నా రుచిగానే ఉంటుంది. తడి లేకపోతే, మీరు చేసిన పచ్చడి వారమైనా పాడవదు.

రచన : కొలను పద్మావతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

దోసకాయ-మామిడికాయ పచ్చడి

వేపకుండా, ఉడికించకుండా తయారుచేసే సహజాహార వంటకం ఈ ‘దోసకాయ-మామిడికాయ’ పచ్చడి
దోసకాయను-మామిడికాయను బాగా కడిగి, చెక్కు తీసి కానీ, తీయకుండా కానీ, చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పచ్చిమిర్చి కానీ, పండుమిర్చి కానీ, బాగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. (కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు).

సముద్రపు రాళ్ళ ఉప్పు కానీ, రాక్ సాల్ట్ కానీ తగినంత తీసుకోవాలి. మిక్సీలో కానీ రోట్లో కానీ పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి నూరుకోవాలి. తరువాత మామిడికాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నూరుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నూరు కున్న పచ్చడిని, మామిడికాయ పచ్చడిగా కూడా తినవచ్చు. లేదంటే దోసకాయ ముక్కలు దానిలో కలిపి దోసకాయ ష మామిడికాయ పచ్చడిగా కూడా తినవచ్చు.

రెండు రకాలుగా చేసుకోవచ్చు.

అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. రోటీ, పుల్కా, చపాతీలలో కూడా బాగుంటుంది.

ఎండుమిర్చికంటే పచ్చిమిర్చి కానీ పండుమిర్చి కానీ వాడుకుంటే రుచి ఎక్కువ ఉంటుంది.
పండుమిర్చిఎండిన తర్వాత కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎండుమిర్చి తక్కువ వాడుకుంటే మంచిది.

మామిడికాయ బదులుగా చింతపండు కూడా వాడుకోవచ్చు. కానీ చింతపండు ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. అందుకని మామిడికాయ వాడుకుంటే రుచిగా ఉంటుంది.

ఈ పచ్చడిని ఏ రోజుకు ఆరోజు తయారు చేసుకుని వాడుకోవడం మంచిది.

రచన : లతా కృష్ణమూర్తి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఉల్లిపాయ పచ్చి పులుసు

తక్కువ దినుసులతో అతి తక్కువ వ్యవధిలో చేసుకోదగిన వండని వంట ఈ పచ్చి పులుసు.

ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గుప్పెడంత తాజా కొత్తిమీరను శుభ్రం చేసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి.

నిమ్మకాయంత చింతపండు ఈనెలు గింజలు లేకుండా చూసి, ఒకసారి కడిగి అరకప్పు నీళ్లలో నానబెట్టాలి.

రెండు లేదా మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. నిమ్మకాయంత బెల్లం పొడిగా అంటే నలగగొట్టి పెట్టుకోవాలి. తగినంత రాళ్ళ ఉప్పు దగ్గర పెట్టుకోండి.

ఇపుడు నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి, దానిలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తమీర, బెల్లం, పపచ్చిమిర్చి, ఉప్పు వేసి గరిటెతో బాగా కలపాలి. అంతే ఉల్లిపాయ పచ్చి పులుసు తయారైపోయింది.

దీనికి కంది పచ్చడి మంచి జోడీ. పుల్ల పుల్లగా కొంచెం తీయగా, తక్కువ కారంగా, వేడి వేడి అన్నంతో తింటుంటే ఉల్లిపాయ ముక్కలు కొత్తమీర పంటికి తగులుతూ ఉంటే…. రుచి మీరే చెప్పాలి.

రచన : మంచికంటి సుబ్బల

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More
  • 1
  • 2