వండని వంట… కరివేపాకు పచ్చడి

వేపకుండా, ఉడికించకుండా, నూనె కూడా వాడకుండా, కరివేపాకుతో రుచికరంగా పచ్చడి తయారు చేసుకోవచ్చు.

గుప్పెడు లేత కరివేపాకును తీసుకోవాలి. అందులో తగినంత చింతపండు, మనం తినగలిగేంతగా ఎండుమిర్చి, పసుపు, సరిపడ ఉప్పు చేర్చుకుని, అన్నిటినీ కలిపి రోట్లో నూరాలి. మిక్సీలోను చేయొచ్చు. కరివేపాకు పచ్చడి రెడీ!

తాజా కరివేపాకు పచ్చడిని వేడి వేడి అన్నంలో కలిపి తింటే చాలా బాగుంటుంది. అలా తినలేని వారు కొద్దిగా గానుగ నూనెను చేతి మీద వేసుకుని అన్నంలో కలిపి తినవచ్చు. లేదా నెయ్యి కలిపి కూడా తినవచ్చు.
రెండు రోజులు తిన్నాక పచ్చడిని మిగిలితే, కరివేపాకు పచ్చడికి సరిపడ అన్నం కలిపి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలతో అతి తక్కువ నూనెలో తిరగమోత వేస్తే, ‘కరివేపాకు రైస’ తయారు అవుతుంది. కరివేపాకు సువాసనతో, పచ్చడి బాగుంటుంది.

పులుపు కావాలనుకుంటే, కాస్త నిమ్మరసం కలుపుకోవచ్చు.
ఈ కరివేపాకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఒకటి, రెండు రోజుల్లో వాడుకోవాలి.
ఏ పచ్చడి అయినా అప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవడం ఆరోగ్యదాయకం!
ఇదే విధంగా కొత్తిమీరతోను పచ్చడి చేసుకోవచ్చు.

  • రచన : ఇందిర జమ్మలమడక

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… మామిడల్లం పచ్చడి

ప్రకృతి మానవాళికి ప్రసాదించిన ఒక మంచి ఆహారం ‘మామిడి అల్లం’ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇది అల్లం జాతికి చెందిన దుంప. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చూడ్డానికి అల్లం దుంపలా వున్నా, గిచ్చి చూస్తే పచ్చి లేత మామిడికాయ వాసనతో చిన్న పాటి వగరుతో వుంటుంది.

మామిడి అల్లాన్ని ఉపయోగించి ‘వండనివంట’గా రోజువారీగా ఉపయోగపడే రోటి పచ్చడి చేసుకోవచ్చు.
కొన్ని రోజులు నిల్వ వుండే ఆవకాయ పచ్చడి లాగా కూడా చేసుకోవచ్చు.

మామిడల్లంతో రోటి పచ్చడి తయారీ…
మామిడల్లాన్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. దీనికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి చేర్చి చింత పండు లేదా నిమ్మ రసం కలిపి కచ్చాపచ్చాగా నూరుకుని, అన్నంలోకి లేదా రోటీలోకి తింటే చాలా బావుంటుంది.. (అవసరం అనుకున్న వారు ఎండుమిర్చితో తాలింపు పెట్టుకుంటే మరింత రుచి.. )
ఈ పచ్చడి ఏరోజుకారోజు చేసుకోవడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ వుండదు.

రెండవ పద్దతి ‘మామిడి అల్లం – ఆవకాయ’
మామిడల్లాన్ని కడిగి తేమ లేకుండా ఆరబెట్టాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
కోసుకున్న ముక్కలకు కొద్దిగ ఆవపిండి, కొద్దిగ కారం, సరిపడ ఉప్పు కలిపి, నువ్వుల నూనె కూడా సరిపడా కలిపి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా కలపాలి. తరువాత నిమ్మ రసం కలిపి వూరనివ్వాలి. ఇది అచ్చు చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిలా వుంటుంది. కొన్ని రోజులు ఫ్రిజ్ సహాయం లేకుండా నిల్వ వుంటుంది. ఫ్రిజ్‌లో దాస్తే మరింత తాజాగా వుంటుంది. అభిరుచినిబట్టి తాలింపు అదనం. గింజలు తీసిన పచ్చిమిర్చి ముక్కలు, కారెట్ ముక్కలు, మామిడి పొడి కూడా కలిపి మిక్సెడ్ పచ్చడి చేయవచ్చు.

  • రచన : సుబ్బారెడ్డి మేడపాటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఉల్లి – నిమ్మ పచ్చడి

రెండు ఉల్లిగడ్డలు, రెండు నిమ్మకాయలు, ఉప్పు, కారం, పసుపు ఉంటే చాలు. అయిదే నిమిషాల్లో తయారు చేసుకోగలిగే చతుర్రుచుల (పులుపు, కారం, ఉప్పు, ఉల్లిఘాటు) పచ్చడి రెడీ!

ఉల్లిగడ్డలను సన్నగా తరిగి గిన్నెలో పెట్టుకోవాలి. వీటిలో నిమ్మ రసం పిండుకోవాలి. కొద్దిగ పసుపు కలిపి అన్ని ముక్కలకు పట్టేలా స్పూన్‌తో కలపాలి. ఎవరి రుచిని బట్టి వారికి కావలసినంత కారం, ఉప్పు అదే గిన్నెలో వేసి, స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. ‘ముంతకిందిపప్పు’ అని, జాతరలలో కలుపుతారు కద, అలా బాగా కలుపుకోవాలి.

వేడి వేడి అన్నంలో, ఈ ‘ఉల్లి – నిమ్మ’ పచ్చడి వడ్డించుకుని తింటే, వండిన వంటలన్నీ బలాదూర్!

ఉల్లిపాయలలో పీచు, నిమ్మరసంలో ‘సి’ విటమిన్ పసుపులో ఆరోగ్యం అన్ని కలగలిపిన సహజ పచ్చడిది.

వేడి చెయ్యనక్కర లేదు, వేపడం కూడా అవసరం లేదు, వండవలసిన అవసరం అసలే లేదు. నిముషాల వ్యవధిలో తయారు చేసుకోవచ్చు.

వంటలు చేసుకునే స్టూడెంట్స్, సింగిల్‌గా ఉంటున్న ఉద్యోగులు, సమయం తక్కువ ఉన్నవారు, నేచురల్ పద్ధతిలో ఇలా ట్రై చెయ్యడం బెటర్. పోషకాలు, ఫ్లేవర్లు మాత్రమే కాకుండా, చాలా ముఖ్యమైన జీవశక్తి పూరితమైన పచ్చడి ఉల్లి – నిమ్మ పచ్చడి

  • రచన : కావూరి మారుతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

ముల్లంగి పెరుగు పచ్చడి

పెరుగు పచ్చడి పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే కానీ, అందులో కూడా మళ్ళీ పోపు పెడతారు. పోపు వల్ల నూనె కాలుతుంది. కాలిన నూనె, క్యాన్సర్ కారకం. పెరుగు పచ్చడిలో ఉప్పు నూనె అవసరం లేదు.
లీటరు పెరుగును గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలి.

రెండు ముల్లంగి దుంపలను మట్టి లేకుండా నీటితో శుభ్రంగా కడగాలి. ముల్లంగి దుంపలను శుభ్రంగా కడిగి ‘కోరు’ మీద సన్నగా తరుగాలి. ఆ తరిగిన కోరును పెరుగు గిన్నెలో వేసి బాగా కలపాలి.ఉంటే ఒక టొమాటో పండును చిన్నచిన్న ముక్కలు చేసి కలుపుకోవాలి. కాస్తా పసుపు వెయ్యాలి.కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలు చేసి వెయ్యాలి. తగినన్ని పచ్చడి మిరపకాయలను చిన్న చిన్న ముక్కలు చేసి పచ్చడిలో వెయ్యాలి. ఉల్లిగడ్డ తరుగు కూడా వెయ్యాలి. లేత కరివేపాకును ముక్కలు చేసి కలపాలి. ముల్లంగి దుంపల్లో సోడియం ఎక్కువ ఉంటుంది కనుక చప్పగా కాకుండా ఉప్పగానే ఉంటుంది.

అయినా ఉప్పు లేకుండా తినలేని వారు, స్వల్పంగా రాక్ సాల్ట్ తగినంత వేసుకోవాలి. చిటికెడు మిరియాల పొడి, ఇంగువ పొడిని కూడా కలుపుకోవచ్చు. మరింత రుచికరంగా ఉంటుంది.

నిజానికి పెరుగు పచ్చడిలో ఉప్పు అవసరం లేదు.పెరుగులో కూడా సోడియం ఎక్కువ ఉంటుంది. ఉప్పు లేకుండా కూడా రుచికరంగా ఉంటుంది.

ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకుని, వేడి వేడి అన్నంలో కలుపుకుని తినవచ్చు. ఎక్కువ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టకపోవడం మంచిది. పెరుగు పచ్చడి ఉంటే, మరో కూర అవసరం లేదు.

  • స్నేహా తిలక్
Read More

వండని వంట… వెజ్ మిక్స్

  1. పండిన టొమాటోలు రెండు, మూడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సన్నగా తరిగి, కొంచెం కొత్తిమీర తరుగుతో సహా అన్నీ ఒక గిన్నెలో వేసుకుని, ఉప్పు వేసి చేత్తో గట్టిగా పిసుకుతున్నట్లు కలిపితే, అన్నీ చక్కగా కలిసిపోతాయి… వేడి వేడి అన్నంలో అయితే భలే ఉంటుంది!
  2. పైన చెప్పిన అన్నీ పెరుగులో కలిపి కూడా తినవచ్చు. రైతాలా ఉంటుంది.
  3. కూర దోసకాయ ముక్కలు సన్నగా తరిగి, పైన చెప్పిన పదార్థాలు అన్నీ కలిపినా, అది కూడా ఒక కూర లాగానే ఉంటుంది.
  4. పైన చెప్పిన అన్ని పదార్థాలు మరియు కీర దోస ముక్కలు కలిపినా, అది కూడా కూర లాగా తినవచ్చు.
  5. ఎండుమిరప కాయలు, ఉప్పు ..చింత పండు గుజ్జులో కలిపి తింటే బావుంటుంది. మనకు అనుకూలంగా ఉల్లిగడ్డ తరిగి వేసుకోవచ్చు. కొంచెం నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ కలుపుకోవచ్చు. లేక పోయినా చాలా బావుంటుంది.
  6. పచ్చి మిరప కాయలు, ఉప్పు, కొంచెం చింత పండు మంచిగా నూరుకుని, కూర దోసకాయలు ముక్కలుగా తరిగి దానిలో వేసి కచ్చా పచ్చాగా దంచి, ఒక పచ్చడి లాగ తినొచ్చు.
  7. మనం పచ్చిగా తినగలిగే అన్ని కూరగాయ ముక్కలు (క్యారెట్, దోసకాయ, టొమాటో, ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తి మీర) అన్ని ఉప్పుతో కలిపి చేత్తో గట్టిగా కలిపి పెరుగుతో అయినా, లేకుండా అయినా తినొచ్చు.
    పల్లీల పొడి, పచ్చి కొబ్బరి తురుము ఆప్షనల్.
    ఇవన్నీ… సైడ్ డిష్ లాగ తినొచ్చు….లేదా ఎమర్జెన్సీ కూరలుగా కూడా పనికొస్తాయి.
  • ప్రశాంతి

Read More

‘పచ్చి టొమాటో’ నిల్వ పచ్చడి తయారీ…

ఓ అరకిలో సేంద్రీయ టొమాటో పండ్లను – కాస్తా దోర పండ్లు అయితే మంచిది – తీసుకుని, శుభ్రమైన గుడ్డతో తుడిచి, చిన్న ముక్కలుగా కోసి, తగినంత ఉప్పు కారం పసుపు వేసి కలుపుకోవాలి.

తగినన్ని ఆవాలు, జీలకర్ర రోట్లో వేసి మెత్తగా నూరి, టొమాటో ముక్కలకు కలపాలి. తగినన్ని వెల్లుల్లి పాయలు కూడా కచ్చా పచ్చాగా దంచి టొమాటో ముక్కల్లో కలపాలి.

ఉప్పు కారం తగినంత ఉన్నదీ లేనిదీ చూసుకుని, అవసరాన్ని బట్టి చేర్చుకోవాలి. అందుకని ముందుగానే టొమాటో ముక్కల మోతాదును బట్టి, కొంత తక్కువ ఉప్పూ, కారం, కలుపుకోవాలి.

ఈ ఉప్పు కూడా రాక్ సాల్ట్ అయితే ఉత్తమం. అలాగే కారం కూడా సేంద్రీయ వ్యవసాయ మిరపకాయల కారం అయితే బాగుంటుంది.

టొమాటో ముక్కల్లో అన్నిటినీ కలిపి, స్టెయిన్ లెస్ స్టీల్ గిన్నెలో కానీ, పింగాణీ గిన్నెలో కానీ వేసుకోవాలి. రోజుకు రెండు సార్లు నెమ్మదిగా గరిటెతో కలుపుకోవాలి. తరువాత తగిన సీసాలో పెట్టుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
పోపు పెట్టుకోవడం అవసరం లేదు.

ఇంకా అదనంగా ఏమైనా పదార్థాలను చేర్చాలని అనుకునే వారు చేర్చుకోవచ్చు. అల్లం ఇంగువ వగైరా.
వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకుని తినవచ్చు. అవసరం అనుకున్న వారు కాస్తా నెయ్యి లేదా గానుగ నూనె వేసి కలుపుకుని కూడా తినవచ్చు. ఆవ ఘాటుతో రుచి బాగుంటుంది.

నూనె వాడకం తగ్గించాలి.

నిల్వ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కనుక, నీడపట్టు పనులు చేసేవారు తక్కువ తినడం ఉత్తమం.
బయటి వాతావరణంలో ఉన్నా పచ్చడి బాగానే ఉంటుంది. కాకపోతే పచ్చడి పైన కాస్తా గానుగ సేంద్రీయ నువ్వుల నూనె పొయ్యడం బెటర్.

పండు దోస పండ్లతో కూడా ఇలాగే నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు. . కాకపోతే పులుపు కోసం నిమ్మరసం లేదా మామిడి వరుగు పొడి వాడవచ్చు.

  • తుమ్మేటి రఘోత్తమ రెడ్డి
Read More

వండని వంట… తీపి రాగి పిండి

పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు, పచ్చళ్ళు… ఆహారంగా తయారు చేసుకోవడం వండని వంటలు. వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని ‘అమృతాహారం’ తినడం మంచిది. రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తి పూరితమైన ‘వండని వంట’ తీపి రాగిపిండి తయారీ ఇలా….

అరకిలో రాగులు, అరకిలో పెసలు లేదా మినుముల పిండి ప్రధానంగా అవసరం ఉంటుంది. రాగులను పెసలను పచ్చి వాటినే పిండి పట్టించాలి. వేపకూడదు (మర పట్టించడం కంటే, విసుర్రాయితో విసురుకోవడం మంచిది.పిండిని మర పట్టిస్తే, అధిక ఉష్ణోగ్రతకు గురౌతుంది)

పచ్చి వాసనే, జీవశక్తికి నిదర్శనం!

మొత్తం కిలో రాగులు, పెసలు (మినుములు) పొడిలో, సుమారు వంద గ్రాముల నెయ్యిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి.

ఆ పిండి మిశ్రమంలో ఎండుకొబ్బరి పొడి, వేరుశనగ పొడి, నువ్వుల పొడి (ఒక్కొక్కటి వంద గ్రాములు-పచ్చిపొడులు)

జీడిపప్పు, బాదాంపప్పు కూడా కాస్తా చేర్చుకోవచ్చు. వాటిని కూడా పొడి చేసుకుని కలపాలి. చివరికి ఎండుద్రాక్ష పండ్లను కూడా తగినన్ని కలుపుకోవాలి.

ఈ మొత్తం పొడుల మిశ్రమానికి సమానంగా, ముడిచక్కెర పొడిని లేదా ముడిబెల్లపు తురుమును కలిపి, యాలకుల పొడిని కూడా కలపాలి. ఖర్ౙూర పండ్లను చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుకోవచ్చు. అన్ని రకాల ఎండుపండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

అంతే! రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తిపూరితమైన ‘వండని వంట’ సిద్దం అవుతుంది.
నెయ్యి కలుపుతాం కనుక, బయట కూడా నిల్వ ఉంటుంది.

ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి తగినంత తయారు చేసుకోవచ్చు. ప్రయాణాలు చేసే సమయంలో ప్రధాన ఆహారంగా కూడా తినవచ్చు.

  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Read More

వండని వంట… పండు మిర్చి పచ్చడి

వండని వంటలు అంటే, పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు పచ్చళ్ళు ఆహారంగా తయారు చేసుకోవడం.

ధాన్యం, పప్పులు, నూనె గింజలు, కూరగాయలు మొదలగునవి ఉడికించినా, వేపినా, ఫ్రై చేసినా, వాటిలో ఉన్న జీవశక్తి నాశనం అవుతుంది, మృతాహారాన్ని తినవలసి వస్తుంది. మృత ఆహారం అంటే చనిపోయిన ఆహారం అని అర్థం.

మృతాహారం తింటే, మన శరీరానికి జీవశక్తి లభించదు. మనలో జీవశక్తి లోపిస్తే, వ్యాధి కారక శక్తులు ప్రవేశిస్తాయి. కోవిడ్ వైరస్ చెప్పిన పాఠాల్లో, అది ముఖ్యమైన పాఠం కద!

అమృతాహారాన్ని తినవలసిన మనుషులు, మృతాహారం తినడం వైపు పయనించారు! మృతాహారం, వ్యాధి కారకం!

వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని తినడం మంచిది.
అమృతాహారాన్ని తయారు చేసుకుని భుజిస్తే, మన ఆయురారోగ్యాలు పదిలంగా ఉంటాయి!

అమృతాహారం అంటే, చనిపోని ఆహారం అని అర్థం!

మిద్దెతోట, పెరటితోటల్లో మిర్చి ఉత్పత్తి ఎక్కువ వస్తున్నప్పుడు, మధ్య మధ్య పండు మిరపకాయలతో రోటి పచ్చడి తయారు చేసుకోవాలి. అది బయటి ఉష్ణోగ్రతల వద్ద కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ అవసరం లేదు.
పెరటితోట మిద్దెతోట అంటే, పురుగుమందుల వాడకం లేని, సహజ ఉత్పత్తి అని కద! అప్పుడే అది అమృతాహారం అవుతుంది.

కాసిన్ని పండు మిరపకాయలను తెంపుకుని, క్లాత్‌తో శుభ్రంగా తుడిచి, తొడిమలు తీసేసి ముక్కలు ముక్కలుగా కోసి, ఆ పండుమిరపకాయలకు తగినంత కొత్త చింతపండు, తగినంత ఉప్పు (రాక్ సాల్ట్ అయితే బెటర్), వెల్లుల్లి పాయలను, కొద్దిగా పసుపు, జీలకర్రను వేసుకొని, రోటిలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ పచ్చడి బయట వాతావరణంలో కూడా, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాకపోతే ఉప్పు తగినంత కలుపుకోవాలి. ఈ పచ్చడి తయారీలో నీటి తేమ తగలకుండా తయారు చేసుకోవాలి.

పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు. పోపు పెట్టడం అంటే, కాలిన నూనెను తినడం అవుతుంది. కాకపోతే అన్నం తినేటప్పుడు పచ్చి నూనెను – అదీ చెక్క గానుగ నూనెను కొద్దిగా వేసుకొని తినవచ్చు.
పాతకాలపు పండుమిరపకాయల పచ్చడినే, నూనె తాలింపు పెట్టకుండా వాడుకోవచ్చును!
నిల్వ పచ్చడి అంటేనే, ఉప్పు ఎక్కువగా ఉంటుంది.

శారీరక శ్రమ చేసేవారు కాస్తా ఎక్కువ సార్లు తిన్నా పరవాలేదు కానీ, నీడపట్టున పనులు చేసేవారు రుచి కోసం అప్పుడప్పుడు తినడం మంచిది.

పండుమిరపకాయల్లో చింతపండుకు బదులుగా టొమాటో పండ్లను కూడా వేసుకొని పచ్చడి తయారు చేసుకోవచ్చు కానీ, ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవచ్చు. బయట నిల్వ ఉండదు. ఫ్రిజ్‌లో పెట్టుకుని రెండు మూడు రోజుల పాటు వాడుకోవచ్చు.

మొదటిసారిగా చేసుకునేవారు, కొద్ది మొత్తంలో చేసుకుని, ఉప్పు, కారం, పులుపు సరిగా ఉన్నాయో లేదో చూసుకుని, తరువాత మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది. రోలు రోకలి లేనివారు మిక్సీలో వేసి తిప్పుకోవాలి.

మిక్సీలో వేసి తిప్పితే, పదార్ధం ఉష్ణోగ్రతకు గురౌతుంది, ఆ కారణంగా పదార్ధంలో ఎంతో కొంత జీవశక్తి లాస్ అవుతుంది. కనుక రోలు రోకలి వాడటం బెటర్. రోళ్ళు, రోకళ్ళు పట్టణాలలో అక్కడక్కడ రోడ్ల పక్కన పెట్టి అమ్ముతున్నారు. కొనుక్కుని తెచ్చి పెట్టుకోవాలి. ఎప్పటికీ ఉపయోగపడుతుంది.

  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Read More

అధిక పోషక విలువలు గల తృణధాన్యాలు

ఆహారంలో మరింత ఎక్కువగా కొర్రలు, రాగులు, సజ్జలు, అరికెలు వంటి తృణధాన్యాలను వినియోగించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని మిల్లెట్ రీసెర్చ్ ల్యాబ్ విస్తృతంగా పరిశోధనలను చేస్తోంది. వాతావరణ మార్పులకు తట్టుకునే, అధిక పోషక విలువలు కలిగిన, రైతులకు గిట్టుబాటు కలిగించే కొత్త వంగడాలను ఇక్కడి శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు సృష్టిస్తున్నారు. ఆచార్యులు డా. ముతమిళవరసన్ నేతృత్వంలోని విద్యార్థులు కొర్రల్లో పోషక పదార్థాల శోషణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు జన్యు ఆధారిత అధ్యయనాలు సత్ఫలితాలిస్తున్నాయి. దేశవిదేశాలలో సేకరించిన 156 కొర్ర రకాలపై విశ్లేషణలు చేసి తక్కువ ఫైటిక్ యాసిడ్ కలిగిన వాటిని అభివృద్ధి చేశారు. ల్యాబ్‌కు సమీపంలోని ఎకరం భూమిలో కొత్తగా సృష్టించిన కొర్ర వంగ డాలను పండించి ఫలితాలను సాధించారు. వీరి పరిశోధనలకు కేంద్ర సంస్థలు రూ. 5 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాయి.

జావ.. దోసెలు.. ఉప్మా.. బియ్యం.. మినపగుళ్లతోనే కాదు. కొర్రలతోనూ దోసెలు చేసుకుని తినొచ్చంటూ తృణధాన్యాల పరిశోధన ప్రయోగశాల ప్రతినిధులు చెబుతున్నారు. దోసెలతోపాటు ఉప్మా, జావ కూడా తయారు చేస్తున్నారు. ప్రత్యేకమైన రుచిని పరిచయం చేసేందుకు కొన్ని రెస్టారెంట్లలో సొంతంగా తయారు చేసి ఇస్తున్నారు. మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తృణధాన్యాల్లో అధిక ఫైబర్, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు ఉండడంతో సమతుల్య ఆహారంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు. జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొర్రలు, రాగులు, సజ్ౙలు, అరికెల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

రైతులకు ఉచితంగా వంగడాలు
కొర్రలు ఎక్కువగా తింటే జీర్ణం కాదని అపోహలున్నాయి. జన్యుపరమైన అంశాలను పరిశీలిస్తే కొర్రల్లో ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ యాసిడ్ జీర్ణక్రియను స్వల్పంగా మందగిస్తుంది. అందుకే చాలామంది ఆహారంగా తినేందుకు ఇష్టపడటం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్త రకం కొర్రల వంగడాలను రైతులతో సాగు చేయించాలని పరిశోధకులు నిర్ణయించారు. రెండు, మూడు సీజన్ల వరకూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా కొత్త వంగడాలను పంపిణీ చేయించనున్నారు.

బియ్యంలో అధికంగా కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. సులభంగా ఎవరైనా తింటారు. పైగా తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాల్లో పేదలకు ఉచితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు అందిస్తున్నాయి. వారు కొర్రలు కొని వండుకుని ఆహారంగా తినేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఆయా రాష్ట్రాల్లో అల్పాహారంగా తృణధాన్యాలను ఎంపిక చేసుకోవాలని అభ్యర్థించనున్నారు.
Read More
  • 1
  • 2