ఎల్ నినో పరిస్థితులలో పంటల సాగుకు సూచనలు

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడం వల్ల ప్రపంచ స్థాయిలో వచ్చే ఒక సహజ వాతావరణ మార్పు. ఇది ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చి, 9 నుండి 12 నెలల పాటు ఉంటుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వర్షాలు తగ్గి, ఎండలు మరియు కరువు పరిస్థితులు ఏర్పడతాయి. 2026 ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావం ఆగస్టు వరకే ఉంటుందని భావించినప్పటికీ, ప్రస్తుత అంచనాల ప్రకారం ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం వుంది. ప్రస్తుత 2026–27 కాలంలో ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావం 2027 ఖరీఫ్ సీజన్ వరకు కొనసాగి వ్యవసాయం, తాగునీరు మరియు గ్రామీణ జీవనోపాధిని దెబ్బతీయవచ్చని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నట్లు తెలియజేశారు.

ఆంధ్ర ప్రదేశ్ లో 16 జూలై 26 నాటికీ సాధారణ వర్షపాతము 170 మి.మి.గాను 86 మి.మి నమోదు అయింది. అంటే దాదాపు 50 శాతము లోటు వర్షపాతము నమోదు అయింది. ముక్యముగా కోనసీమ, తూర్పు, పచ్చిమ గోదావరి మరియు అన్నమయ్య జిల్లాలలో దాదాపుగా 65 శాతము భారి లోటు వర్షపాతము నమోదు అయింది. అన్ని ప్రధాన జలాశయాలలో కలిపి 290.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది, గత ఏడాది ఇదే సమయానికి (8-7-26) ఈ నిల్వ 524.56 టీఎంసీలుగా ఉండేది.అంటే 55 శాతము తక్కువగా ఉన్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండటం వల్ల సాగునీటి ఇబ్బందులు రావచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఖరిఫ్ లో సాధారణ సాగు ౩౦.84 లక్షల హెక్టార్లుకు గాను 6.7 లక్షల హెక్టార్లు అంటే 22 శాతం మాత్రమే సాగు అయింది. ప్రస్తుతానికి వరి 2.2 లక్షల హెక్టార్లు, ప్రత్తి 1.63 లక్షల హెక్టార్లు, కంది 70400 హెక్టార్లు, వేరుసెనగ 43000 హెక్టార్లు, మొక్కజొన్న 40700 హెక్టార్లు సాగు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లాలకుగాను, కర్నూల్, శ్రీకాకుళం, తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలు తప్ప మిగిలిన 25 జిల్లాలలో 25 శాతము కన్నా తక్కువ విస్తీర్ణంలో సాగు అయింది.

పంటలపై ప్రభావం (దిగుబడి నష్టాలు):
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తి దాదాపు 11% తగ్గే అవకాశం ఉందని, ముఖ్యంగా వర్షాధార పంటలకు 15- 20% నష్టం వాటిల్లవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య వ్యవసాయోత్పత్తి తగ్గుదల క్రింది విధంగా పంటల వారీగా అంచనా వేసినట్లు తెలియజేశారు.

పంట ప్రభావ అంచనా / దిగుబడి తగ్గుదల
మొక్కజొన్న 30% నుండి 35% వరకు తగ్గుదల
సజ్జ 25% నుండి 30% తగ్గుదల
వరి 10% నుండి 20% తగ్గుదల
పప్పుధాన్యాలు 15% నుండి 18% తగ్గుదల
వేరుశెనగ / పత్తి / చెరకు తీవ్రమైన నీటి కొరత వల్ల నాణ్యత, దిగుబడి దెబ్బతింటుంది (వేరుశెనగ పూర్తిగా నష్టపోవచ్చు)
జొన్న, రాగి కరువును తట్టుకోగలవు కాబట్టి వీటికి ప్రమాదం తక్కువ

ప్రస్తుతము సాగు చేసిన పంటల్లో సూచనలు

  • బోరు బావుల క్రింద సాగు చేస్తున్న మొక్కజొన్న, పత్తి పంటలకు నీటి వినియోగాన్ని ఆదా చేసేందుకు వరుస విడిచి వరుసకు నీటిపారుదల అందించాలి.
  • కంది మరియు ఆముదంలో మొక్కల సాంద్రత తక్కువ చేయించడం వలన ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఆముదం మరియు కంది పంటలలో ఎక్కువ వత్తుగా ఉన్న మొక్కలను తొలగించి వరుసలో మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తిన 30 మరియు 60 రోజులకు గుంటకతో గాని, గొర్రుతో గాని అంతర కృషి చేయడం ద్వారా కలుపు నివారణతో పాటుగా నేలలో తేమను రక్షించుకోవచ్చు.
  • లోతు తక్కువ గల ఎర్ర గరప నేలల్లో పంట మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత ప్రతి రెండు సాళ్ళ మధ్య కట్టె నాగలి గానీ లేదా బోదె నాగలి గానీ నడిపినట్లు అయితే పొలమంతా బోదెలు-కాలువలు లాగా తయారు అవుతాయి. బోదెలు చేయడం వలన మొక్కల మొదళ్లకు తగినంత మట్టి సమకూరుతుంది. ఇలా బోదెలు -కాలువలు చేయడం వలన వర్షపు నీరు సాళ్లలో నిలబడి భూమిలోనికి ఇంకి పోతుంది, తద్వారా ఎక్కువ నీరు భూమి లోనికి ఇంకడం వలన భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి పంట మొక్కలకు అందించడం వలన దిగుబడి పెరుగుతుంది.
  • పంట వేసిన తరువాత వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టు లేదా పంట అవశేషాలతో మల్చింగ్ (ఆచ్చాదన) చేయడం వలన భూమిలో తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉండటం ద్వారా పంట బెట్టకు గురి కాకుండా ఉంటుంది. అలాగే కలుపు సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి కనుక నేలలో తేమ శాతాన్ని రక్షించుకోవచ్చు.
  • మెట్ట ప్రాంతాల్లో పంటకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు నీటి కుంటలలో నిలువ చేసిన నీటిని, పంట కాలంలో ఎర్ర నేలల్లో పదిరోజులకు, నల్లరేగడి నేలల్లో 15 రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, స్ప్రింకర్ల ద్వారా 20 మి.మీ.ఎర్ర నేలల్లో, 40 మి.మీ.నల్లరేగడి నేలల్లో అందించగలిగితే 20-30% దిగుబడి పెరుగుతుంది. చివరి దశలో బెట్ట వస్తే (కంది, ఆముదం వంటి దూర వరస పంటలకు) నీటి ట్యాంకర్ల ద్వారా రక్షక తడులు (Protective Irrigation) ఇవ్వాలి.

వరి సాగు లో వర్షాభావ పరిస్థితులు లేదా సాగునీటి కొరత ఉంటే సూచనలు

  • పొలంలో నిరంతరం నీరు నిల్వ ఉంచకుండా ప్రత్యామ్నాయ తడి-పొడి (AWD) పద్ధతి పిలక దశలో, పై పాటుగా ఎరువులు వేసినప్పుడు అనుసరించాలి. కాలువల ద్వారా అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించాలి. పొలాల గట్లను బలపరచి నీటి నష్టాన్ని తగ్గించాలి. పొలంలో పగుళ్లు రాకుండా తగిన తేమను నిలుపుకోవాలి.
  • నీటి లబ్యత తక్కువగా ఉన్న యెడల, మురుగు నీటి నాణ్యతను పరీక్షించుకొని లవణ సాంద్రత 2 దేసిమేన్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సాగునీరుగా ఉపయోగించాలి.
  • వరి దిగుబడి తగ్గే అవకాశం ఉన్న జిల్లాల్లో, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు లో దమ్ము చేసి చదును, చేసిన పొలంలో మండె కట్టిన విత్తనాన్ని వెదజల్లే పద్ధతి లేదా డ్రమ్ సీడర్ పద్దతి లేదా SRI సాగు పాటించాలి.
  • తక్కువ కాలం మరియు బెట్టను తట్టుకునే వరి రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి.
  • ఆలస్యంగా వర్షాలు వచ్చినప్పుడు మెట్ట ప్రాంతాలు మరియు బోరు బావుల క్రింద స్వల్ప వ్యవధి రకాలైన MTU1121, MTU1293, MTU1290 మరియు MTU1426 సాగు చేయాలి. తక్కువ వయస్సు (20–25 రోజుల) నారును ఉపయోగించాలి.
  • చాడు నేలలకు: ఇంద్ర,, MCM 103, MCM 125, MTU 1290, MTU 1293
  • నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్ లో చ॥మీ॥ కు 33 కుదుళ్ళు ఉండేలా చూడాలి. భూసారం ఎక్కువ ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్ళు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేట్లు నాటాలి. వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ళ సంఖ్యను నిర్ధారించాలి. దీర్గకాలిక, మద్యకాలిక మరియు స్వల్ప కాలిక రకాలు నాటినపుడు ఒక చధరపు మీటరుకు 33 కుదుళ్లు ఉండాలి.
  • నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. బాటలు తీయటం వలన పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు.
  • ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులలో, ఉన్న నీటిని జీవ తడులకు వాడుకోవాలి.
  • నీరు తక్కువగా ఉన్నపుడు వరి పైరు మూన తిరిగిన దశ నుండి పిలకల దశ వరకు ఆరుతడిలాగా నీటి తడులు పెడుతూ మరియు నీరు బయటకు పోకుండా పొలం గట్టును దృడంగా చేసుకోవాలి.
  • అధిక ఉషోగ్రతలకు చౌడు భూముల్లో సాగు చేసే వరి పంటకు తరచు మంచి నీరు మార్చుకోవటం వలన చౌడు తీవ్రతను తగించుకోవచ్చు .
  • పంటలో గనుక జింక్ లోపం వచ్చినటైతే ఒక లీటరు నీటికి 2 గ్రా. జింక్ సల్ఫేట్ (0.2%) కలపి పిచికారి చేసి నివారించుకోవాలి. జింక్ లోపం తీవ్రతను బట్టి 5 రోజుల కాలంలో రెండవ పిచికారి చేయాలి.
  • ఇనుము ధాతు లోపము నివారణకు లీటరు నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మఉప్పు కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ద్రావణాన్ని (10 గ్రాముల అన్నభేది) వాడాలి.

ఎల్‌నినో / బెట్ట పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు:
వర్షాలు సకాలములో లేని యెడల ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.

  • ఆగష్టు మాసములో : తేలికపాటి నేలలు : జొన్న, కొర్ర , సజ్జ , పెసర , అలసంద మేత జొన్న, ఉలవలు
  • భరువైన నేలలు: ఆముదము, జొన్న, కొర్ర , సజ్జ , పెసర , అలసంద, కంది ఉలవలు
  • ప్రస్తుత పరిస్థితుల్లో వరి, మొక్కజొన్న పంటల సాగును సాధ్యమైనంత వరకు తగ్గించడం మంచిది.
  • ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ పంట కాలం గల మినుములు, కొర్రలు, సజ్జలు వంటి పంటలను సాగు చేయాలని సూచించారు.

పండ్ల తోటలను (చీని, మామిడి లో) తీవ్ర కరువు సమయంలో చెట్లను కాపాడుకునే అత్యవసర పద్ధతులు:

  • పాదులలో అచ్ఛాధన (మల్చింగ్) చేసుకొని నీటి ఆవిరిని అరికట్టాలి. నేల ఆరోగ్యాన్ని పెంపొందించాలి.
  • ఎండ తీవ్రతలేని సాయంత్రం సమయంలోనే పండ్ల తోటలకు సాధారణ తడిగానీ, లేదా ట్యాంకర్ల ద్వారా రక్షకతడిగానీ ఇవ్వాలి.
  • చెట్టు పాదులో ఒక వారం ఒక సగభాగం, మరుసటి వారం ఇంకో సగభాగంలో నీరు పెట్టడం ద్వారా నీటిని ఆదాచేయవచ్చును. ఇది పార్షియల్ డ్రై రూట్ జోన్ తడి పద్ధతి అంటారు.
    • 1:1 నిష్పత్తిలో బంకమట్టి + సున్నం కలిపి కాండానికి పూస్తే చెట్లు ఎండకు ఎండిపోవడాన్ని తగ్గించవచ్చు.
    • పచ్చిరొట్ట పంటలు వేసుకొని, నేలలో సేంద్రీయ పదార్థాన్ని పెంచవచ్చు.
    • చెరువు మట్టిని వేసి నేలలో తేమను నిలిపే గుణాన్ని పెంచవచ్చు.
    • చెట్టు ఎండిపోతున్నప్పుడు బాగా ఎండిపోతున్న చెట్ల కొమ్మలన్నీ నరికి, ఒక్క ప్రధాన కొమ్మనే ఉంచాలి. ఈ పద్ధతి చెట్టు నీటి అవసరాన్ని తగ్గించి బ్రతికిస్తుంది. దీనిని డీ-హార్నింగ్ (De-horning) అంటారు.
    • పంట కోత అనంతరము కొమ్మలు కత్తిరించి, ఆ వ్యర్థాలను ముక్కలు చేసి, పాదుల్లోనే మల్చింగ్ గా వేయాలి. దీనివల్ల నేల తేమ ఆవిరి బాగా తగ్గుతుంది. ముఖ్యంగా చీడపీడలకు గురైన కొమ్మలను పూర్తిగా కత్తిరించాలి.
    • చెట్టుకు 40-50 కేజీల సేంద్రియ ఎరువు (పశువుల/గొర్రెల/కోళ్ల వ్యర్థాలు) వేయాలి. పండ్ల చెట్ల మధ్య వరుసల పచ్చిరొట్ట పంటలు వేసి 50% పూత దశలో భూమిలో దున్నాలి.
    • మొక్కల వేగవంతమైన పెరుగుదలకు మరియు పోషకాల లభ్యతకు తోడ్పడే పి.ఎస్.బి (PSB – ఫాస్ఫో బ్యాక్టీరియా) వంటి జీవన ఎరువులను వినియోగించాలి.
    • ఉద్యాన పంటలకు అత్యంత కీలకమైన పూత మరియు పిందె దశల్లో నీటి కొరత రాకుండా తగినంత నీరు కచ్చితంగా అందించాలి.

ఆకుకూరలు, కూరగాయలు:
• పొలంలో వర్షపు నీరు పొర్లిపోకుండా, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా బోర్‌వెల్ రీఛార్జ్ పిట్ (ఇంకుడు గుంత) ఏర్పాటు ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంచవచ్చు.
• తక్కువ నీరు & స్వల్ప కాలపరిమితి గల కూరగాయ పంటలను వేసుకోవాలి. ఎక్కువ నీరు అవసరమయ్యే టొమాటో, మిర్చిలకు బదులు గోరుచిక్కుడు, చిక్కుడు, అలసంద. చిలగడదుంప, చామదుంప, కంద, ముల్లంగి, బీట్‌రూట్ , క్యారెట్ (కరుడ రకాలు: 80-90 రోజులు) వేసుకోవలెను.
• వివిధ రకాల ఆకుకూరలు తక్కువ కాలంలో పండుతాయి. కొత్తిమీర, గోంగూరలు డ్రిప్ + మైక్రో జెట్స్ ద్వారా తక్కువ నీటితో సాగు చేయవచ్చును.

ఆయిల్ పామ్ పంటల్లో:

  • రక్షక నీటి పారుదల మరియు తేమ సంరక్షణ చర్యలను చేపట్టండి. నేలలో తేమను కాపాడటానికి మరియు నేల ఉష్ణోగ్రతను తగ్గించడానికి, ఎండిన ఆకులు, ఖాళీ పండ్ల గుత్తులు లేదా సేంద్రియ వ్యర్థాలను ఉపయోగించి నేరుగా నేలలోనే మల్చింగ్ చేయండి.
  • అధిక ఉష్ణోగ్రతల సమయంలో తగినంత నీటిపారుదల లేకుండా అధికంగా ఎరువులు వేయడం మానుకోండి.
  • వేసవిలో ఆకులను ఎక్కువగా కత్తిరించడాన్ని నివారించండి, ఎందుకంటే చెట్టు పైభాగం (canopy) తగ్గడం వల్ల వేడి ఒత్తిడి పెరగవచ్చు. ప్రతి చెట్టుకు కనీసం 35–40 పని చేసే ఆకులు ఉండేలా చూసుకోండి. పశు సంరక్షణకు సూచనలు
  • సన్నకారు రైతులు ఉలవలు వేసుకుని 10 నుంచి 15 పొట్టేలు పిల్లలు మేపుకుంటే ఒక్కొక్క పొట్టేలుపై పది నుంచి పదిహేను వేల రూపాయల ఆదాయం వస్తుంది.
  • దాణా తక్కువ ధరలో దొరుకుతుందని ఎక్కువగా పశువులకు ఇవ్వడం జరుగుతుంది. దీని వలన పాల దిగుబడి బాగా వచ్చినా పశువుల జీర్ణ వ్యవస్థ పనితీరు తగ్గి చనిపోతాయి. కావున ఈ పద్దతిని ఆచరించకుండా చూడాలి.
  • Co F31, Australian Red Napier వంటి గడ్డి రకాలు తక్కువ నీటితో పండించవచ్చును. తద్వారా పచ్చి మేత కొరత తగ్గించవచ్చును.
  • పాడి పశువుల ఆరోగ్యం, పాల ఉత్పాదకత పెరగడానికి వాటి ఆహారంలో క్రమం తప్పకుండా మినరల్ మిక్స్ (ఖనిజ లవణాల మిశ్రమం) అందించాలి అని తెలపడము అయినది.
  • అవసరమైన టీకాలను, సరైన సమయంలో ఇవ్వాలి.

రైతులందరూ వాతావరణ భీమా WBCIS (Weather Based Crop Insurance Scheme) మరియు ప్రధానమంత్రి పంటల భీమా PMFBY (Pradhan Mantri Fasal Bima Yojana) పథకాలలో తప్పనిసరిగా నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించి, నీటి పొదుపు: నీటి వినియోగంలో జాగ్రత్త వహించాలి. భూమిలో తేమ ఆరిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

డా . బి. సహదేవ రెడ్డి, డా. పి.వి. రమేష్ బాబు, డా . య౦ .గిరిజా రాణి మరియు
డా . సి.హెచ్. శ్రీనివాస్, సహ పరిశోధన సంచాలకులు
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము, మారుటేరు. Ph: 9866787072

Read More

సేంద్రియ ఎరువుల వాడకం క్రమంగా పెరుగుతుంది

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయదారులు 11.17 లక్షల టన్నుల సేంద్రియ ఎరువులు కొన్నారని, ఇది గతం కంటే 3.5 రెట్లు ఎక్కువని, దేశంలో రైతులు క్రమంగా సేంద్రియ ఎరువుల దిశగా మళ్లుతున్నారని కేంద్రం సోమవారం వెల్లడించింది. దేశంలో చాలినన్ని ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎరువుల అందుబాటు విషయంలో ఎలాంటి సమస్యలూ లేవని స్పష్టం చేసింది. “2026 ఖరీఫ్‌నకు సంబంధించి ఎరువుల అవసరాన్ని వ్యవసాయ శాఖ తిరిగి అంచనా వేసింది. సీజన్‌లో మొత్తం 383.9 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయశాఖ నిర్ధారించుకుంది. ప్రస్తుతం దేశంలో 197.56 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి” అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణా ఎస్ శర్మ వెల్లడించారు.

Read More

స్వల్ప-మధ్యకాలిక పంటలకు ప్రాధాన్యం

ఈ ఏడాది ఎల్ నినో కారణంగా వర్షాలు తక్కువగా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఖరీఫ్ పంట నష్టాలను తగ్గించేందుకు కేంద్రం నడుం బిగించి వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పంటలు వాతావరణ పరిశీలన సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసింది. రాబోవు అనావృష్టి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న దానికి సంబంధించిన ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసింది. పశ్చిమాసియాలో తాజా పరిణామాలు, ఆహార భద్రత, ఎరువుల లభ్యత వంటి అంశాలపై అంతర్ మంత్రిత్వశాఖల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వల్ప, మధ్యకాలిక పంటలకు ప్రాధాన్యం ఇస్తూ విత్తన నిల్వలను నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

Read More

రెండు మూడు నెలలు ముందుకు ఖరీఫ్ సాగు

అన్ని రిజర్వాయర్లలో నీరు అందుబాటులో ఉందని, ముందస్తు సాగు చేస్తే తుపాన్ల నుంచి తప్పించుకోవచ్చని, ఖరీఫ్ సీజన్‌ను రెండు, మూడు నెలలు ముందుకు తెస్తున్నామని, దీనిపై రైతులకు శాసనసభ్యులు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలివీ.. “క్లస్టర్ బేస్డ్ విధానంలో ఉద్యానపంటల సాగుకు ముందుకెళ్తున్నాం. వివిధ పంటల సాగుకు అనుగుణంగా జిల్లాలను క్లస్టర్లుగా విభజించి, కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. వ్యవసాయం నుంచి ఉద్యానసాగు వైపు రైతులు మళ్లితే లాభాలొస్తాయి. ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు గతంలో ఇచ్చినట్లే డ్రిప్‌లు, స్ప్రింక్లర్లను రాయితీపై అందిస్తాం. గతేడాది వ్యవసాయ యాంత్రీకరణకు రూ.61 కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది రూ.137 కోట్లు కేటాయించాం అని అన్నారు.

Read More

వచ్చే ఖరీఫ్ లో ఎల్ నినో ప్రభావం

సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఎల్నినో కారణంగా వచ్చే ఖరీఫ్ లో నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఆదేశించింది. ఎల్నినో పరిస్థితుల్ని అంచనా వేసి, అందుకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే దీనిపై అధికారులతో చర్చించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు సన్నద్ధంగా ఉండాలని, రైతులకు అవగాహన కల్పించడంతో పాటు సాగుపై సూచనలు చేయాలని ఆదేశించారు. అయితే దీనిపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఏప్రిల్లో రుతుపవనాలపై ఐఎండీ నివేదిక విడుదల చేయనుంది.
మే నుంచి జులై మధ్య లేదా ఆగస్టులో ఎల్నినో వచ్చే అవకాశం 50% నుంచి 61% పైనే ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అక్టోబరు వరకూ ఇది కొనసాగొచ్చని చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరంగా సున్నిత రాష్ట్రం. వర్షాలపై ఆధారపడి అధిక శాతం పంటలు సాగవుతాయి. ఎలి నినో ఏర్పడితే రుతుపవనాలు బలహీనపడతాయి. ఫలితంగా వర్షపాతం తగ్గుతుంది. పొడికాలాలు పెరుగుతాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వర్షాధార పంటల ఉత్పత్తి తగ్గుతుంది. సూక్ష్మసేద్యం ద్వారా ఉద్యాన రైతులు కొంతమేర బయటపడొచ్చు.

Read More