పురుగులు, తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడే వావిలాకు కషాయం
పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా వావిలాకు కషాయం రైతులకు వివిధ పంటలలో పురుగుల నియంత్రణ కొరకు ఉపయోగపడుతుంది.

వావిలాకులో సహజంగా ఉండే ఎన్నో రకాల ‘ఆల్కలాయిడ’ల వలన ఇది పురుగుల నియంత్రణలో మరియు తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడుతుంది.
వావిలాకు కషాయాన్ని పంటలలో వచ్చే రసం పీల్చే పురుగులపైన, చిన్న దశలలో ఉన్న లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, ఆకులను తినే పురుగులపై వాడవచ్చు.
వావిలాకులో “నిర్ణుడిన” మూల పదార్థంగా ఉండడం వలన ఇది పురుగులను స్పర్శ చర్య ద్వారా మరియు పొగ చర్య ద్వారా నియంత్రించడంలో ఉపయోగ పడుతుంది.
వావిలాకును వైద్యంలో ఉపయోగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే వావిలాకు ఆకులు వ్యవసాయంలో సస్యరక్షణలో కూడా ఉపయోగపడుతున్నవి. ఇది పురుగులకు అభివృద్ధి నిరోధకంగా మరియు క్రిమిసంహారకంగా పనిచేస్తుంది.
కావలసిన పదార్థాలు:
వావిలాకు : 5 కిలోలు
సబ్బు పొడి : 100 గ్రాములు (లేదా)
కుంకుడుకాయలు : 500 గ్రాములు
తయారు చేసే విధానం:
- ఈ ఆకులను 10 లీటర్ల నీటిలో అరగంట నుండి గంట సేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన కషాయం సుమారు 5 లీ. వరకు ఉంటుంది.
- ఒక కర్రతో ఉడుకుతున్న కషాయాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
- కషాయాన్ని బాగా చలార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి.
- కషాయానికి 100 గ్రా. సబ్బుపొడిని లేదా 500 గ్రా. కుంకుడుకాయ రసాన్ని కలపాలి.
- ఈ కషాయానికి 100 లీటర్ల నీటిని చేర్చి ఒక ఎకరాకు సాయంత్రం వేళ పంటపై పిచికారీ చేయాలి.
జాగ్రత్తలు:
- వావిలాకు కషాయం తయారు చేసేటపుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.
- పంట కాలంలో పంట దశను మరియు పురుగు ఉధృతిని బట్టి 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు.
- తయారు చేసిన కషాయాన్ని నిల్వ ఉంచరాదు.
ఉపయోగాలు:
- వావిలాకు కషాయాన్ని అన్ని పంటలలో వచ్చే పురుగుల నియంత్రణలో వాడవచ్చు.
- పంట తొలిదశలో (30 – 45 రోజులు) సుమారు 100 లీ. ద్రావణం ఒక ఎకరాకు సరిపోతుంది. పంట (60 నుండి 90 రోజులు) మధ్య దశలో సుమారు 150 లీ. ద్రావణం మరియు పంట చివరి దశలో (90-120 రోజులు) సుమారు 200 లీ. ద్రావణం ఒక ఎకరాకు అవసరం పడుతుంది.
- వావిలాకు కషాయం వేరుశనగలో వచ్చే తామర పురుగు, మిరపలో వచ్చే ఆకుముడత, కూరగాయ పంటలను ఆశించే రసం పీల్చే పురుగుల నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
- వావిలాకు కషాయం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పంటలపై పిచికారీ చేయాల్సి ఉంటుంది.
- పురుగుల తొలిదశలో వావిలాకు కషాయం బాగా పనిచేస్తుంది.

