ఉద్యాన ప్రదర్శనలో ‘నార్మ్‌’కు ప్రథమ బహుమతి

దిల్లీలోని ప్రగతిమైదాన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ వ్యవసాయ, ఉద్యాన, ఆర్గానిక్‌ ప్రదర్శనలో జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ(నార్మ్‌) కు ప్రథమ బహుమతి లభించింది. వందకు పైగా సంస్థలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో శిక్షణ, అభ్యాసం, పరిశోధన, సామర్థ్య నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన సంస్థలను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేటు వ్యవహారాల శాఖ సహాయమంత్రి హర్ష్‌ మల్హోత్రా చేతుల మీదుగా సోమవారం నార్మ్‌ విస్తరణ నిర్వహణ విభాగం వెంకటకుమార్‌, ముఖ్యశాస్త్రవేత్త శివకుమార్‌లు ఈ పురస్కారం పొందారు.

Read More

నేడు అగ్రి, హార్టి, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈరోజు నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సన్నాహాలు పూర్తి చేసింది. ఏటా ప్రవేశాల్లో జాప్యం జరిగి తరగతులు ఆలస్యమవుతుండడంతో ఈసారి కౌన్సెలింగ్‌ ప్రక్రియను త్వరగా నిర్వహించాలని వ్యవసాయ యూనివర్సిటీ ప్రతిపాదించగా.. ఉద్యాన, పశువైద్య వర్సిటీలు ఆమోదించాయి. గతంలో నీట్‌ కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత ప్రవేశాలు నిర్వహించేవారు. ఈసారి నీట్‌ కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా నెలరోజుల్లో మొదటి విడత ప్రవేశాలను పూర్తి చేసి తరగతులను ప్రారంభించాలని భావిస్తున్నారు. నోటిఫికేషన్‌ తర్వాత దరఖాస్తుల నమోదుకు మూడు వారాల గడువు ఇచ్చి ఆ తర్వాత కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఈ ఏడాది సూర్యాపేట, నిజామాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో కొత్త వ్యవసాయ కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినా ఇప్పటి వరకు వాటికి సంబంధించిన సన్నాహాలు పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న కళాశాలలకే నోటిఫికేషన్‌ జారీ కానుంది.

Read More

వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెట్టుబడి సాయం 47% నుంచి 194% పెంపు

వరదల వలన పంట నష్టపోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. పెట్టుబడి సాయాన్ని గణనీయంగా పెంచింది. వ్యవసాయ, ఉద్యాన పంటలకు గతంతో పోలిస్తే పెట్టుబడి సాయం భారీగా పెరిగింది.
వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెట్టుబడి సాయం (హెక్టారుకు రూపాయల్లో)
పంట ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ప్రకటించిన పెరుగుదల
ఎస్‌డీఆర్‌ఎ సాయం శాతం
ప్రకారం
వరి, వేరుశనగ, పత్తి, చెరకు 17,000 25,000 47.05
చిరుధాన్యాలు, నువ్వులు, ఆముదం, జూట్‌ 8,500 15,000 76.47
మినుము, పెసర, కంది, సోయా,
పొద్దుతిరుగుడు, పొగాకు 10,000 15,000 50.0
మొక్కజొన్న 12,500 15,000 20.0
అరటి 25,000 35,000 40.0
పసుపు, మిరప, కంద 17,000 35,000 105.88
ఉల్లి, టమాట, బొప్పాయి,
కూరగాయలు, పూలు, నర్సరీలు 17,000 25,000 47.05
జామ, నిమ్మ, మామిడి, కాఫీ, దానిమ్మ,
సపోట, జీడి, డ్రాగన్‌ 22,500 35,000 55.55
కొత్తిమీర 8,500 25,000 194.11
కర్రపెండలం 8,500 10,000 17.65
ఆయిల్‌పామ్‌ 22,500 చెట్టుకు
రూ. 1,500
కొబ్బరి 1,000 1,500 50

Read More

జెర్బెరాల సాగు… రైతుకు మేలు

జెర్బెరా వాణిజ్యపరంగా సాగు చేసే పూల మొక్కలలో ముఖ్యమైనది. ప్రపంచంలోని అన్ని ప్రదేశాలలో ఇది పెరుగుతుంది. ఈ పుష్పాలు అందమైన వివిధ రంగులలో కనిపించటమే కాక వాటి రేకులు అమరికలో ప్రత్యేకతను ప్రదర్శిస్తాయి. పూవులు ఎక్కువ రోజులు తాజాగా ఉండటం కోసం వాటిని కోసిన తరువాత కాడలను నీటిలో ఉంచవలెను. జెర్బెరాను ఆఫ్రికన్‌డైసి లేదా గెర్బెరోడైసి అని పిలుస్తారు. 

చాలా రాష్ట్రాలు హార్టీకల్చర్‌ మిషన్‌ కింద జెర్బెరా పూల సాగును ప్రోత్సహిస్తున్నాయి. రైతులకు డ్రిప్‌, మల్చింగ్‌, హాఫ్‌ హెచ్‌.పి. మోటార్‌ పంపు, షేడ్‌నెట్‌లను ఉచితంగా లేదంటే సబ్సిడి క్రింద అందజేస్తున్నాయి. మార్కెట్‌లో మంచిధర లభిస్తుంది. ఎక్కువ శ్రమ లేకుండా సాగు చేయవచ్చును. 28þ36 మీటర్ల (1000 చ.మీ.) షేడ్‌నెట్‌లో 3700-3800 వరకు జెర్బెరా మొక్కలు అవసరం అవుతాయి. 90 రోజుల తర్వాత జెర్బెరా పుష్పించడం మొదలవుతుంది. ఒక నెలలో 10 సార్లు పువ్వులను కోయవచ్చు. కోసిన ప్రతిసారీ 800-1000 పూలను షేడ్‌నెట్‌ నుండి తీయవచ్చు. ఒక జెర్బెరా పువ్వు ఖరీదు రూ. 5-6/- వరకు ఉంది. ఒక నెలలో 8 వేల నుండి 10 వేల వరకు ఈజీగా వస్తాయి. తద్వారా 40 వేల వరకు ఆదాయం వస్తుంది. అలా ఈ పంటను 5 లేదా 6 సంవత్సరాలపాటు కొనసాగించవచ్చు.

మొక్కల లక్షణాలు: జెర్బెరా మొక్కలు కాండం లేకుండా గుబురుగా పెరిగే బహువార్షికాలు. వీటి పుష్పాలు పసుపు, ఆరెంజ్‌, తెలుపు, గులాబి, ఎరుపు, స్కార్లెట్‌ రంగులలో లభ్యమవుతాయి. పూకాడలు చాలా పొడవుగా ఏవిధమైన ఆకులు లేకుండా ఉంటాయి.

వాతావరణం: జెర్బెరా మొక్కల పెరుగుదలకు ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మరియు గాలిలో తేమ శాతం 60% ఉండవలెను.

నేలలు: ఎర్రటి నేలలు చాలా అనుకూలం. పి.హెచ్‌ 5.5-6.5 మరియు ఇ.సి. 0.50 డి.ఎస్‌.యు/మీ. గా ఉండేటట్లు చూసుకోవాలి. నేలలు వదులుగా గాలి చొరబడేలా ఉంటే వేళ్లు సులభంగా భూమిలోనికి చొరబడి బాగా పెరుగుతాయి. దీనివేళ్ళు 50-70 సెం.మీ. లోతు వరకు వెళ్ళగలవు.

రకాలు: చాలా రంగులతో కూడిన పూలను మనం జెర్బెరాలో చూడవచ్చు. జెఫ్ఫ, సంగ్రియ, రోకుల, ఆఫ్‌రబ్‌, రోమెన, సలీన, టెకొర మరియు స్టార్‌లైట్‌ వంటి మొదలగు రకాలు గ్రీన్‌హౌస్‌లలో పెంచుతారు.

నేల తయారీ: మొక్కలు నాటే ముందు నేలను మీథైల్‌ బ్రోమైడ్‌ లేదా ఫార్మిలిన్‌ను 100 చ.మీ. లకు 7.5-10 లీ. చొప్పున పిచికారి చేసిన తరువాత 2 వారాల పాటు ప్లాస్టిక్‌తో కప్పి ఉంచాలి. తరువాత ఒక చ.మీ.కు. 100 లీ. నీటితో తడిపి రసాయనాల అవశేషాలు లేకుండా చూసుకోవాలి. 2 వారాల తరువాత మొక్కలు నాటుకోవాలి. ఇది పాలీహౌస్‌లో సాధారణంగా చేస్తారు.

బెడ్లు తయారీ: జెర్బెరాలను ఎత్తైన బెడ్‌లపై పెంచుతారు. దీనివల్ల నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది. బెడ్లు 2 అడుగుల (60 సెం.మీ.) వెడల్పుతో 1.5 అడుగుల ’45 సెం.మీ.) ఎత్తుతో తయారు చేసుకోవాలి. బెడ్ల మధ్య దూరం 1.0 అడుగు (30 సెం.మీ.) ఉండాలి.

బెడ్లు వదులుగా ఉండటం కోసం 30 ట్రాక్టర్ల గులక ఇసుక (ఎర్ర మన్ను), 15 ట్రాక్టర్ల సేంద్రియ ఎరువులు ఒక ఎకరంలో వేసుకోవాలి. అనగా 1000 చ.మీ. పాలీహౌస్‌లో 8 ట్రాక్టర్ల గులక ఇసుక (ఎర్రమన్ను), 4 ట్రాక్టర్ల సేంద్రియ ఎరువులు సరిపోతాయి. బెడ్లను ఫ్యూమిగేట్‌ చేసిన తరువాత చ.మీ.కు/కిలో వేపపిండి వేసుకున్నట్లయితే నులిపురుగుల బెడద నుండి తప్పించవచ్చు.

ఎరువులు: బెడ్లు తయారు చేసిన తరువాత 100 చ.మీ.లకు భాస్వరం ఎరులు 2.5 కిలోలు, మెగ్నీషియం సల్ఫేట్‌ 1/2 కిలో, బయోజైమ్‌ గుళికలు 200 గ్రా., హ్యూమిక్‌ ఆసిడ్‌ 200 గ్రా. కలుపుకోవాలి. ఈ ఎరువులను 6 ఇంచుల వరకు భూమిలో కలియబెట్టి నీరు పెట్టాలి. మొక్కలు నాటే ముందు ఈసి మరియు పి.హెచ్‌ గమనించాలి.

నాటేదూరం: మొక్కలను నాటేటప్పుడు ఎల్లప్పుడు మొక్క క్రౌన్‌ భాగం భూమి పైన ఉండేట్లు చూసుకోవాలి. ఒక బెడ్‌లో 2 వరుసల మధ్య 30 సెం.మీ. దూరంలో, మొక్కకు మొక్కకు మధ్య దూరం 30 సెం.మీ. ఉండేటట్లు చూసుకొని నాటుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి భూమిని వదులు చేయటం వల్ల గాలి ప్రసారం జరిగి బాగా పెరుగుతాయి. మొక్కలు నాటిన తరువాత భూమిలో తేమ శాతం 6 వారాలు వరకు 80-90% ఉండేటట్లు చూసుకోవాలి. లేనిచో వాడిపోయే ప్రమాదం ఉంటుంది.

ప్రవర్ధనము: 3 నెలల కంటే ఎక్కువ వయస్సు మరియు 4 లేక 5 ఆకులు ఉన్న టిష్యూకల్చర్‌ మొక్కలను వాడుకోవాలి. 

నీటి యాజమాన్యం: నీటి ఉదజని సూచిక 6.5-7 మరియు ఈ.సి. 0.5-1.0 ఖిఐ/ళీ2 ఉన్న కఠినత్వం 550 పిపియంగా ఉండాలి. మొక్కలు నాటిన వెంటనే 4 వారాల పాటు ఓవర్‌ హెడ్‌ (పైభాగం నుండి) సూక్ష్మ-స్ప్రింకర్లతో నీరు పెట్టాలి. తరువాత బిందుసేద్యం ద్వారా నీరు పెట్టాలి. బిందు సేద్యం ద్వారా ఒక్కొక్క మొక్కకు 500-700 మి.లీ./రోజుకి నీటిని వినియోగించుకుంటాయి. గాలిలో తేమ 90-92% మించరాదు. అంతకంటే ఎక్కువ అయితే పూల అమరిక అధ్వాన్నంగా ఉంటుంది.

అంతరకృషి: మొక్కలు పడిపోకుండా మట్టిని ఎగదోయాలి.

జిస్‌బడ్డింగ్‌ (చిన్న మొగ్గలను తీసివేయడం): మొక్కలను నాటిన 45 రోజుల తర్వాత క్వాలిటి సరిగా లేనటువంటి చిన్న మొదటి థ మొగ్గలను తీసివేయాలి.

పాత ఆకులను తీసివేయడం: రాలి పడిన ఆకులను, ఎండిన కొమ్మలను తీసివేయడం వల్ల రోగాలు రాకుండా నిరోధించవచ్చు.

కోతకోయడం: జెర్బెరా పంట కాలం 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు పూలు పూస్తూ ఉంటాయి. 2-3 వరుసల పుప్పొడి రేణువులు విచ్చుకోగానే పూలను కోయవచ్చు. 14-16 ఆకుల థలో మొక్కలు ఒక చ.మీ.కు 200 పుష్పాల వరకు పొందవచ్చు. పూలను ఉదయం లేదా సాయంత్రం కోయవచ్చు. జెర్బెరా పూల కాడలను వాలుగా కట్‌ చేసి 4 గంటల పాటు చల్లని నీటిలో ఉంచాలి. నీటి ఉష్ణోగ్రత 14-15 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉండి లీటర్‌ నీటికి 7-10 మి.లీ. క్లోరైడ్‌/సిట్రిక్‌ యాసిడ్‌+ఆస్కార్బిక్‌ ఆసిడ్‌ 5 మి.లీ. గాని కలిపి నీటిలో 4 గంటల పాటు ఉంచవచ్చు. బాగా పండిన పువ్వు యొక్క కాడ 45-55 సెం.మీ. పొడవు, 10-12సెం.మీ. వ్యాసం ఉంటే మార్కెట్‌ విలువ బాగా ఉంటుంది. ఒక రోజుకి 700-1000 వరకు పూలను కోయవచ్చు.

సస్యరక్షణ పద్ధతులు:

పునుబంక, తెల్లదోమ, పాము పొడ, ఎర్రనల్లి, థ్రిప్స్‌, ఆకు తినే పురుగులు వంటి చీడపీడలు జెర్బెరా మొక్కలను ఆశిస్తాయి. 

నివారణ: తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి చీడపీడలను నివారించుకోవాలి.

ఇంకా వేరుకుళ్ళు, క్రౌన్‌ రాట్‌, ఫ్యూజేరియం కుళ్ళు వంటి తెగుళ్ళు కనిపిస్తాయి.

నివారణ: తగిన చర్యలు చేపట్టే తెగుళ్ళను నివారించుకోవాలి. 

పూవులు కాల్షియం లోపం వల్ల వంగిపోవడం, కోత ముందు విరిగిపోవడం, లేత పూవులు వాడిపోవడం, ద్విముఖ పుష్పాలు మరియు పూలన్ని ఒకేసారి విచ్చుకోవడం, పొట్టి కాడలు ఉన్న మొక్కలు ఏర్పడటం జరుగుతుంది.      

ఎన్‌. కౌసల్య, పి.హెచ్‌డి. స్కాలర్‌, ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట,

డా. టి. రవికుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జే.సి.డి.ఆర్‌. హార్టీకల్చర్‌ కాలేజ్‌, తాడిపత్రి – 515411, ఫోన్‌: 8919593384

Read More