వండని వంట… అమృత ఆహారము

ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఆహారము ‘అమృత ఆహారము’.

ఈ అమృతాహారం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయి. దీని తయారీ విధానము మొదట్లో ఇది కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ, ఒకసారి చేసుకుంటే చాలా సులువు. దీనికి సంబంధించి మూడు భాగాలుగా ఈ ఆహారాన్ని తయారు చేసుకునే విధానాన్ని మనము డివైడ్ చేసుకుందాం. దానివల్ల మీకు కొంచెం సులువు అవుతుంది.

మొదటి భాగం: కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవి అవసరము. మనకు అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఎక్కువ ధర పెట్టాలని ఏం లేదు, మనకు అందుబాటు ధరలలో ఏవైతే దొరుకుతాయో, అవి ఎన్ని ఎక్కువ రకాలు దొరుకుతాయో అన్ని.

ఒకవేళ రెండు మూడు రకాలు దొరికినాయి అనుకోండి, అంటే రెండు కూరగాయలు – ఒక ఆకుకూర – రెండు రకాల పండ్లు, అట్లా అయినా పర్వాలేదు. వాటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

రెండవ భాగం: మొలకలు అంటే, పప్పు ధాన్యాలకు సంబంధించి పెసలు, ఉలువలు, శనగలు, పల్లీలు, బొబ్బర్లు,
రాజ్మా, కాబూలీచెన ఇట్లాంటివి. అంటే రెండు పలకల నుండి మొలకలు వచ్చేవి ఏవైనా గాని, అవి కూడా అందుబాటులో ఉన్నవి ముందే తయారు చేసుకొని మొలకగట్టి రెడీగా ఉంచుకోవాలి.

మూడవ భాగం: ధాన్యము, చిరుధాన్యాలకు సంబంధించి అంటే బియ్యము దంపుడు బియ్యం అయితే మంచిది, ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు, జొన్నలు, గోధుమలు, ఇందులో ఏవి అందుబాటులో ఉంటే అవి. ఉదయం నానబెట్టి రాత్రికి ఇడ్లీ పిండి రుబ్బినట్టు రుబ్బి పక్కన పెట్టుకుంటే, పొద్దునకి పులుస్తది. ఈ పులిసిన పేస్ట్ లోంచి ఒక మనిషికి రెండు స్పూన్ల చొప్పున అవసరం అయితది.

ఇప్పుడు ఈ మూడు భాగాలను ఒక భాగంగా తయారు చేసి, మనం ఎట్లా ఆహారంగా తీసుకోవాలో చూద్దాం.
మనము తినగలిగినన్ని కూరగాయ ముక్కలు ఒక గిన్నెలోకి తీసుకొని, దాంట్లోకి రెండు చెంచాల పేస్టు, ఒక చెంచా మొలకలు కలుపుకొని తినొచ్చు.

ఉదయము ఈ ఆహారాన్ని తీసుకుంటే ఆకలి కూడా ఎక్కువగా వేయదు. మనము తినగలిగినంత అమృతారాన్ని తినొచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. మధ్యాహ్నముా, రాత్రికి కూడా ఇదే ఆహారాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ అట్లా తీసుకోలేకపోతే, మనం భోజనం చేసేముందు కొంత, అంటే ఒక రెండు మూడు చెంచాలు ఈ అమృత ఆహారాన్ని తీసుకొని, తర్వాత భోజనాన్ని కంటిన్యూ చేయొచ్చు.

ఇది అనేక ఆరోగ్య సమస్యలను నిర్మూలిస్తుంది, రాకుండా చేస్తుంది. కాబట్టి మిత్రులు దీన్ని ప్రయత్నం చేయొచ్చు.

మేము ఒక నెల నుంచి తింటున్నాము.

ప్రాణం తేలిగ్గా ఉంటుంది. ఒకవేళ కొత్తలో ఎవరికైనా తినడం కష్టం అనిపిస్తే, కొంచెం బెల్లం ముక్క లేదంటే ఒక రెండు చెంచాల పెరుగు, కొన్ని ఎక్కువ పండ్ల ముక్కలు మనకు ఇష్టమైనవి వేసుకొని తినొచ్చు. తినే ముందు కొన్ని నువ్వులు కొన్ని అవిసెలు దీంట్లో కలుపుకొని తింటే, అప్పుడు పంటికి పచ్చివి చాలా టేస్ట్ అనిపిస్తాయి.
మేము ఇద్దరమే తింటాం కాబట్టి మాకు వారానికి అవసరమైనటువంటి పండ్ల ముక్కల్ని కూరగాయ ముక్కలు ఒకసారి కట్ చేసి పెట్టుకుంటున్నాము. దాన్యాలకి సంబంధించినటువంటి పేస్టును కూడా ఒకేసారి రుబ్బి ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకుంటున్నాము. తినడానికి రెండు మూడు గంటల ముందు ఫ్రిజ్ లోంచి మన అవసరం నిమిత్తం ఎంతయితే తినాలో అంత క్వాంటిటీని వేరే గిన్నెలోకి తీసుకొని బయటపెట్టి దాన్ని బ్రేక్ ఫాస్ట్‌కి తీసుకుంటున్నాం.

ఒకవేళ మీకు ఏమైనా సందేహం ఉంటే Ameya Krishi Vikasa Kendram YouTube Channel / అమేయ కృషి వికాస కేంద్రం యూట్యూబ్ ఛానల్‌లో దీనికి సంబంధించిన వీడియో ఉన్నది మిత్రులు గమనించగలరు.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

పచ్చని డాబా… ఆరోగ్యానికి బాట

పట్టణ ప్రాంతాలలో, జనాభా పెరుగుదలతో ఎక్కువ భూమి ఇంటి నిర్మాణానికి వినియోగించబడుతుంది. అందువలన కూరగాయలను పండించడానికి భూమి దొరకడం కష్టంగా మారింది. ప్రత్యేకంగా కుండీలను, కంటైనర్లను ఉపయోగించి పండ్ల మొక్కలను, కూరగాయలను ఇంటి ఖాళీస్థలంలో లేదా డాబాపై పెంచుకోవడం ఒక్కటే మార్గం. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడే కూరగాయలను పండించడానికి 40-50చ.మీ. స్థలం సరిపోతుంది. కంటైనర్లలో మట్టిని సంవత్సరానికొకసారి మార్చాలి. పాటింగ్ మిశ్రమంలో మట్టి, ఇసుక, వేపపిండి, జీవన ఎరువులు సరైన పాళ్ళలో ఉండాలి. పెరటిలోను, ఇంటి పైకప్పుపైనా మొక్కలు సాగు చేసుకోవచ్చు. సేంద్రీయ ఎరువులతో కూరగాయలు, పండ్లు పండించి ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందంపొందవచ్చు.

ఇంటి మిద్దెపై ఒక సెంటు స్థలం ఉన్నప్పటికీ ఇంటికి సరిపడా కూరగాయలు చాలా సులువుగా సాగు చేసుకోవచ్చు. పురుగు మందుల అవశేషాలు లేని చక్కని రుచికరమైన కూరగాయలన్నింటినీ స్వయంగా పండించవచ్చు.

మిద్దె తోటలో మొక్కల పెంపకము వల్ల లాభాలు: మిద్దె తోటలో మొక్కల పెంపకం ద్వారా ఏడాది పొడవునా పురుగు మందుల అవశేషాలు లేని తాజా ఉత్పత్తులు లభిస్తాయి. ఆహార, ఆరోగ్య భద్రత పొందవచ్చు. పచ్చదనాన్ని పెంపొందించడంతో ప్రాణవాయువు పెరిగి, గాలిలో హానికర బొగ్గుపులుసు వాయువు తగ్గుతుంది. ఉత్పత్తులు నాణ్యంగా పోషకాలతో నిండి ఉంటాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఇంటి పై మిద్దె తోటలో మొక్కల పెంపకం వలన మంచి వ్యాయామం లభిస్తుంది. పండ్ల, కూరగాయల ఖర్చు తగ్గుతుంది. స్థలం, అపార్టుమెంట్ల విలువ పెరుగుతుంది. పైగా ఈ మిద్దె తోటల పెంపకం వలన వేసవిలో ఉష్ణోగ్రతలను కొంతవరకు తగ్గించుకోవచ్చు.

మిద్దె తోటను ఏర్పాటు చేసుకునే విధానం : పీవీసీ పైపులతో స్టాండ్లు ఏర్పాటు చేసుకొని, వాటిపై ఖాళీ ప్లాస్టిక్‌ డబ్బాలు పెట్టాలి. ఆ ఖాళీ డబ్బాల్లో ఎర్రమట్టి, వర్మీ కంపోస్టు, పశువుల పేడ నింపాలి.

మిద్దెపై వార్షిక కూరగాయల మరియు పండ్ల మొక్కల పెంపకం యొక్క ప్రణాళిక: మొక్కల పెంపకం చేపట్టే ముందు ప్రణాళిక తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ డాబాపై పెంచుతున్నదైతే ముందుగా ఇంజనీరు చేత డాబా పైకప్పు గట్టిదనాన్ని పరీక్షింపజేయాలి. అంటే మన ప్రణాళిక ప్రకారం కూరగాయలు, పండ్లు మొదలైనవి పెంచడానికి తట్టుకోగలదో లేదో పరీక్షించాలి. పైకప్పు కారకుండా ఉండాలి. మురుగు నీటి పారుదల సౌకర్యం తప్పని సరిగా ఉండాలి. ప్రణాళికబద్ధంగా మొక్కలను నాటాలి. కుండీల్లో నింపే మిశ్రమం తేలికపాటి బరువు కలిగి ఉండాలి. మొక్కలను పెంచడానికి ఎత్తైన మడులను ఏర్పాటు చేయాలి. ట్రెల్లీస్ ఏర్పాటుచేసి తీగలు పారించాలి. డాబాలపైన, బాల్కనీలలోనూ పెరిగే మొక్కలు ఎక్కువ గాలికి, ఎక్కువ వేడికి గురవుతాయి. ఎత్తులో అమర్చిన కుండీలు ఒకే వరుసలో ఉండాలి. వీటిని తేలికపాటి మట్టి మిశ్రమంతో నింపాలి. మట్టి మిశ్రమంతో నింపక ముందు సరైన మురుగునీటి పారుదల సౌకర్యం ఏర్పాటుచేయాలి. షేడ్ నెట్ కాని, పందిరికాని ఏర్పాటుచేసుకొని ఏడాది పొడవునా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పూలను కూడా పెంచుకోవచ్చు.

కుండీల ఎంపిక: కుండీలను ఎంచుకునేటప్పుడు మురుగునీరు పోవడానికి రంధ్రాలున్న వాటినే ఎంచుకోవాలి. కుండీలలోపల వైపు మెరుపులేని కుండీలు ఎంచుకోవాలి. మెరుపు ఉంటే సీసం, మట్టి మిశ్రమంలో కలుస్తుంది. కుండీలను బంకమట్టితో, ప్లాస్టిక్, చెక్క లేదా లోహంతో తయారుచేస్తారు. కుండీల ఎంపికలో మొక్కలు పెరిగే ఎత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

తొట్టి/ప్లాస్టిక్ సంచులు: మనకున్న ఖాళీ స్థలాన్ని బట్టి కావలసినంత పొడవు 9-20″ లోతు సిమెంట్ తొట్లు నిర్మించుకొని /ప్లాస్టిక్ సంచులు ఉపయోగించుకొని మట్టి మిశ్రమాన్ని (2 భాగాలు ఎర్రమట్టి + 1 భాగం ఇసుక + 1 భాగం కంపోస్టు) నింపుకొని పండ్లు, కూరగాయల పంటలను పెంచుకోవచ్చు. పై అంచునుండి అంగుళం ఖాళీని నీరు పెట్టడానికి వీలుగా వదలాలి.

మట్టి కుండీలు: కుండీల ప్రక్క నిలువుగాను, పైభాగం వెడల్పుగాను ఉంటుంది. ఇటువంటి కుండీలలో ఎక్కువ మట్టి, ఎరువుల మిశ్రమాన్ని నింపవచ్చు.

ప్లాస్టిక్ కుండీలు: గుండ్రంగా, చదరంగా ఉన్న ప్లాస్టిక్ కుండీలను ఇంటిలో పెరిగే మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తారు. ఇవి తేలికగా మరియు రంధ్రాలు కలిగి తిరిగి వాడుకోవడానికి అనువుగా ఉండి తక్కువ స్థలంలో నిల్వచేసుకోవడానికి వీలుగా ఉంటాయి.

కుండీలు నింపే పద్ధతి: మిద్దె తోటల పెంపకంలో మట్టి అతి ముఖ్యమైనది. మంచి మట్టి వాడితే మొక్కలు బాగా పెరుగుతాయి. మార్కెట్లో అనేక పాటింగ్ మిశ్రమాలు లభిస్తాయి. 3 భాగాల కంపోస్ట్ లేదా కంపోస్టు ఎరువును ఒక భాగం తేలిక బరువున్న పీట్ తో కలిపి పాటింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. నాటే కూరగాయలకు నారు మొక్కల పెంపకానికి లోతు తక్కువ పళ్ళాలను /తొట్లను మట్టి, ఇసుక, కంపోస్ట్ (1:1:1) మిశ్రమంతో కలిపి విత్తనాలను చల్లాలి. మట్టి మిశ్రమాన్ని తొట్లు/బారిల్స్/బకెట్లు/ప్లాస్టిక్ సంచుల్లో నింపే ముందు వాటి అడుగున నీరుపోయే రంధ్రాన్ని ఏర్పర్చాలి. తొలుత నీరుపోయే రంధ్రాన్ని చిన్న చిన్న పెంకులతో కప్పాలి. దీని వలన నీరుపోయే రంధ్రం గుండా మట్టి మిశ్రమం జారిపోకుండా అదనపు నీరు మాత్రమే బయటకు పోతుంది. ఆ తర్వాత గరుకు ఇసుక పోసి సమం చేయాలి. దానిపై ఒక అంగుళం మందంతో ఎండుటాకులు లేదా కొబ్బరి పొట్టు పరిచి దానిపై మట్టి మిశ్రమాన్ని అంచువరకు నింపాలి. ఇంటి మేడపైన మొక్కలు పెంచే కంటైనర్లను ఒక పద్ధతిలో ఉంచాలి. నీరు పోయడం, కలుపు తీత అంతరకృషి కాయ/ఆకు కోతకు అనువుగా మనిషి నడిచేందుకు వీలుగా దారి వదలాలి. మిద్దెపై చుట్టూ ఉండే పెరాపెట్ గోడపై 6 అడుగుల దూరంలో ఇనుప చువ్వలు నాటి వాటికి ట్రెల్లీస్ లా బైండింగ్ వైర్ అల్లించాలి. వాటిపైకి తీగజాతి కూరగాయల్ని పాకించి, నిలువు స్థలంలోను ఫలసాయం పొందవచ్చు.

ఎరువుగా ఇంటి వ్యర్థాలు: మొక్కల ఎండిన ఆకులను తొలగించి ఓ బకెట్‌లో నిల్వ ఉంచాలి. కూరగాయల వ్యర్థాలను సైతం అందులో వేయాలి. వాటిపై కొద్దిగా మట్టి వేసి ఆవు మూత్రం చల్లితే కంపోస్టు ఎరువు వాటంతట అదే తయారవుతుంది. రోజూ కొంత సమయం కేటాయించగలిగితే కుటుంబానికి అవసరమైన కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు డాబా పైనే పండించుకోవచ్చు.

డా. పోతురాజు ప్రదీప్ కుమార్, డా. మీగడ లక్ష్మి కమల, డా. యల్లపు రామ్ మోహన్
డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం. Ph: 9160477365

Read More

వండని వంట… వెజ్ మిక్స్

  1. పండిన టొమాటోలు రెండు, మూడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సన్నగా తరిగి, కొంచెం కొత్తిమీర తరుగుతో సహా అన్నీ ఒక గిన్నెలో వేసుకుని, ఉప్పు వేసి చేత్తో గట్టిగా పిసుకుతున్నట్లు కలిపితే, అన్నీ చక్కగా కలిసిపోతాయి… వేడి వేడి అన్నంలో అయితే భలే ఉంటుంది!
  2. పైన చెప్పిన అన్నీ పెరుగులో కలిపి కూడా తినవచ్చు. రైతాలా ఉంటుంది.
  3. కూర దోసకాయ ముక్కలు సన్నగా తరిగి, పైన చెప్పిన పదార్థాలు అన్నీ కలిపినా, అది కూడా ఒక కూర లాగానే ఉంటుంది.
  4. పైన చెప్పిన అన్ని పదార్థాలు మరియు కీర దోస ముక్కలు కలిపినా, అది కూడా కూర లాగా తినవచ్చు.
  5. ఎండుమిరప కాయలు, ఉప్పు ..చింత పండు గుజ్జులో కలిపి తింటే బావుంటుంది. మనకు అనుకూలంగా ఉల్లిగడ్డ తరిగి వేసుకోవచ్చు. కొంచెం నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ కలుపుకోవచ్చు. లేక పోయినా చాలా బావుంటుంది.
  6. పచ్చి మిరప కాయలు, ఉప్పు, కొంచెం చింత పండు మంచిగా నూరుకుని, కూర దోసకాయలు ముక్కలుగా తరిగి దానిలో వేసి కచ్చా పచ్చాగా దంచి, ఒక పచ్చడి లాగ తినొచ్చు.
  7. మనం పచ్చిగా తినగలిగే అన్ని కూరగాయ ముక్కలు (క్యారెట్, దోసకాయ, టొమాటో, ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తి మీర) అన్ని ఉప్పుతో కలిపి చేత్తో గట్టిగా కలిపి పెరుగుతో అయినా, లేకుండా అయినా తినొచ్చు.
    పల్లీల పొడి, పచ్చి కొబ్బరి తురుము ఆప్షనల్.
    ఇవన్నీ… సైడ్ డిష్ లాగ తినొచ్చు….లేదా ఎమర్జెన్సీ కూరలుగా కూడా పనికొస్తాయి.
  • ప్రశాంతి

Read More