మొక్కజొన్న పంట ఉత్పత్తి మొత్తానికి సాయం అందించాలి

ఆంధ్ర రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస పథకం కింద అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరించడంతోపాటు.. 100% పంట ఉత్పత్తికి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ‘2025-26 రబీలో రాష్ట్రవ్యాప్తంగా 4.83 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. 37.61 లక్షల టన్నుల దిగుబడి లభిస్తుందని అంచనా. అత్యధికంగా నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, విజయనగరం, ఏలూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, ఎన్టీఆర్, కర్నూలు, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగైంది. రబీ పంట జూన్ వరకు చేతికొస్తోంది. అధిక ఉత్పత్తి కారణంగా, మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కు వగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని అంచనా. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్ట పోతారు’ అని లేఖలో చంద్రబాబు వివరించారు. కర్షకుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. మద్దతు ధర, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని 50:50 నిష్పత్తిలో కాకుండా మొత్తం కేంద్రమే భరించాలని, మొత్తం పంట ఉత్పత్తిలో 25% మాత్రమే కాకుండా 100% ఉత్పత్తికి సాయం అందించాలని పేర్కొన్నారు. జూన్ వరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

Read More

పశువుల ఆరోగ్యంకు రూ.1.70 కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశు సంపద ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద రూ.1.70 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపి, వేరే పథకాలకు ఈ నిధులను మళ్లించరాదని పశు సంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

ఎకరా వరకూ.. రైతు భరోసా నిధులు విడుదల

యాసంగి సీజన్‌కు పంటల పెట్టుబడి కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో 68,89,955 మంది రైతులకు రూ.3,446.94 కోట్లను రైతు భరోసా కింద ఆదివారం నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న వారిని పరిగణనలోకి తీసుకొని 57,44,907.19 ఎకరాలకు ఈ సాయం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎకరాకు రూ. 6 వేల చొప్పున విడుదల చేశారు. నిధుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లు విడుదలయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 24,935 మంది రైతులకు రూ.10.43 కోట్లు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని… ఆమేరకు బ్యాంకుల నుంచి సందేశాలు వస్తాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎకరం వరకు భూమి ఉండి, నిధులు జమ కాని వారు సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు.

Read More

రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ఆమోదించండి

ఆంధ్ర వర్షాభావ ప్రాంతాలైన రాయలసీమలోని 8 జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకానికి త్వరగా అనుమతులివ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకుర్‌కు విజ్ఞప్తిచేశారు. ‘కరవు ప్రభావిత పది జిల్లాలను ఉద్యాన పంటల కేంద్రంగా మార్చడానికి రాష్ట్రం రూ.41,352 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే డీపీఆర్ సమర్పించింది. రాష్ట్రం సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపండి’ అని ఆయన కేంద్ర అధికారులకు విజ్ఞప్తిచేశారు.

Read More

ప్రకృతి వ్యవసాయ రైతులకు గుర్తింపు కార్డులు

జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు గుర్తింపు కార్డులు, ఇతర వస్తువులతో ఉన్న కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489 ప్రకృతి వ్యవసాయ సమూహాల్లో ప్రతి క్లస్టర్‌కు 125 మంది చొప్పున, మొత్తం 61,125 మంది రైతులకు ఈ కిట్లను అందజేస్తారు. ఇందులో గుర్తింపు కార్డు, క్లాత్ బ్యాగ్, క్షేత్రదర్శిని డైరీ, చిన్న ప్యాకెట్ డైరీ, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్ను ఉంటాయి. జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు కిట్లను పంపిణీ చేస్తారు. తర్వాత జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రతీ క్టసర్‌కు ఇద్దరు చొప్పున కృషి సఖిలను ఇందుకోసం ఎంపిక చేశారు. వీరి ద్వారా సేంద్రియ సాగు పద్ధతుల పై అవగాహన కల్పిస్తారు.

Read More

క్వింటాకు 42 వేల రూపాయలు పలికిన ‘సింగిల్ పట్టి’ మిర్చి

తెలంగాణాలోని ములుగు జిల్లా పొట్లాపూర్ గ్రామానికి చెందిన కె. లింగమూర్తి అనే రైతు 7 బస్తాల సింగిల్ పట్టి మిర్చి ఎనుమాముల మార్కెట్‌కు తీసుకురాగా.. క్వింటాకు రూ.42 వేల ధర వచ్చింది. ఈ సీజన్‌లో ఈ స్థాయిలో ధర రావడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ రకం మిర్చి తక్కువ కారం ఉండి.. మంచి రంగు ఉంటుందని మార్కెట్ అధికారులు తెలిపారు.

Read More

టమాటా ధర లేక ఉచిత పంపిణీ

టమాటాను అమ్ముకోలేక రైతులు ఉచితంగా పంపిణీ చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తెలంగాణా రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో గూడూరు మండలం భూపతి పేటకు చెందిన పోగుల కొండ సారయ్య, మోహన్, సురేందర్ శుక్రవారం కొత్తగూడ సంతలో టమాటాని విక్రయానికి తీసుకొచ్ౘ్ారు. చిరువ్యాపారులకు ఇరవై కిలోల పెట్టెను రూ.100కు విక్రయించేందుకు ప్రయత్నించగా ఎవరూ కొనుగోలు చేయలేదు. కనీసం రూ.50కి కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో మహిళలందరికీ ఉచితంగా పంపిణీ చేశారు.

Read More

పెరుగుతున్న మిరప ధరలు

ప్రస్తుతం మిర్చికి డిమాండ్ ఏర్పడింది. వరంగల్ ప్రాంతంలో సాగయ్యే ఎల్లో మిర్చి (స్నాక్స్ తయారీలో వినియోగించే కారం) రకానికి రికార్డు స్థాయిలో క్వింటాకు రూ. 44 వేలు ధర పలుకుతోంది. వండర్ హాట్ రకానికి గత వారంతో పోలిస్తే ఇప్పటికి రూ.5 వేలు పెరిగి బుధవారం క్వింటా రూ.30 వేలు పలికింది. అత్యధికంగా సాగయ్యే తేజ రకం రెండు వారాల క్రితం రూ.15 వేలు పలకగా, ఇప్పుడు రూ.20,200 పలుకుతోంది. 341 రకానికి రూ. 25,600, దీపిక రకానికి రూ.26,200 ధర నడుస్తోంది.

Read More

కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 9600/- సబ్సిడీ

తెలంగాణా రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో ఎకరంలో ఆరుటన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును అంచనా వేసి అందులో 40 శాతం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యానశాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో ఏటా 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు అవసరం. ఇందుకు అదనంగా 1.33 లక్షల ఎకరాల్లో 12.68 లక్షల టన్నులు ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఈఏడాది 10 వేల ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగు చేపట్టాలన్నది లక్ష్యం. దీని కోసం సమీకృత ఉద్యాన మిషన్‌ పథకం కింద సాయం అందించేందుకు మంత్రి ఆదేశించారు. ఎకరంలో కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, సస్యరక్షణ, పోషక యాజమాన్యం కోసం రూ.24 వేలు ఖర్చవుతుందని ఉద్యానశాఖ గుర్తించింది. ఇందులో 40 శాతం.. అంటే రూ. 9600 సాయం అందించేందుకు సిఫార్సు చేయగా.. మంత్రి ఆమోదం తెలిపారు. టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, మిర్చి, బీర, క్యాప్సికం, చిక్కుడు, కాకర, దొండ, సొరకాయ తదితర తోటల సాగుకు ముందుకొచ్చే రైతులు స్థానిక ఉద్యాన అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తారు. సాగు ప్రారంభించిన వెంటనే నారు, విత్తనాలను ఉద్యానశాఖకు చెందిన లేదా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేస్తే వారికి 40 శాతం సబ్సిడీ సాయం రూ.9600 రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కో రైతుకు 2.50 ఎకరాల చొప్పున సబ్సిడీ సాయం అందిస్తారు. సాగుకు అవసరమైన నారును సిద్దిపేట జిల్లా ములుగు, హైదరాబాద్‌ సమీపంలోని జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లలో ఉద్యానశాఖ సాగు చేస్తోంది. ఎంపికైన రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందజేస్తుంది.

Read More

కంద.. చేమ.. క్యారెట్‌..!

దుంపల సాగు విస్తీర్ణం పెంపుపై తెలంగాణా ప్రభుత్వం దృష్టి
నష్టాల నుంచి రైతులను గట్టెక్కించాలని నిర్ణయం

అకాల వర్షాలు, వరదలతో పంటలను కోల్పోతున్న రైతులను నష్టాల నుంచి గట్టెక్కిస్తూ ప్రజలకు పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దుంపల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించింది. రైతులను కంద, చేమ, బంగాళాదుంప, క్యారెట్‌, ముల్లంగి, బీట్‌రూట్‌, కర్రపెండలం వంటి పంటల సాగువైపు మళ్లించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన, కురుస్తున్న అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు, మామిడి, నిమ్మ తదితర పంటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో నష్టాల నివారణకు ప్రత్యామ్నాయాలను సూచించాలని ఉద్యాన విశ్వవిద్యాలయ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వారి సూచనలతో ఎక్కువగా దుంప పంటలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో పోషక విలువలు ఉన్న దుంప పంటలు 3,700 ఎకరాల మేరకే సాగవుతున్నాయి. అత్యధికంగా 2,200 ఎకరాల్లో కందగడ్డ (మొరంగడ్డ/ చిలగడదుంప) సాగవుతోంది. బంగాళాదుంప వినియోగం ఎక్కువగానే ఉన్నా.. రాష్ట్రంలో ఆ పంట కేవలం 452 ఎకరాల్లోనే సాగు అవుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ఏటా 6 లక్షల టన్నుల మేరకు దుంపల వినియోగం ఉంటుండగా.. ఇక్కడ తక్కువగా సాగు అవుతుండటంతో వాటిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న ఖరీఫ్‌లో రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల మేరకు దుంప పంటలను సాగుచేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

తక్కువ నీరు.. ఎక్కువ నిల్వ: అకాల వర్షాలు, వరదలతో ఇతర పంటలు దెబ్బతింటున్నా.. దుంపలకు ఎలాంటి నష్టం కలగదని అధ్యయనాల్లో తేలింది. కోతకు వచ్చిన తర్వాత ఇతర పంటలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. దుంప పంటలను మాత్రం ఎక్కువ కాలం పాటు నిల్వ చేసే అవకాశముంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దుంపల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని, అధిక దిగుబడినిచ్చే రకాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

Read More
  • 1
  • 2