కొబ్బరిపాలు + పుల్ల మజ్జిగ…|

పంట పెట్టడం ఒకెత్తయితే… అది ఆరోగ్యంగా ఎదిగేలా చూసుకోవడం ఒకెత్తు. మార్కెట్‌లో నూటారు పేర్లతో గ్రోత్ ప్రమోటర్లను అమ్ముతున్నారు. అయితే, వీటిని కొనకుండా కొద్దిపాటి శ్రమతో ఇంటి వద్దే పెద్ద ఖర్చేమీ లేకుండా తయారుచేసుకోవచ్చు. మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే ఆక్సిన్స్, జిబ్బరిల్లిన్ తదితరాలు ‘నర్రెంగ’ మొక్కలో దండిగా ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం ‘అల్బీజీయా అమరా’. నర్రెంగ ఆకులను ఒక కిలో తీసుకొని, ఐదు లీటర్ల పుల్ల మజ్జిగలో వేసి, వారం రోజుల పాటు పులియబెట్టాలి. ఆ తరువాత వడకట్టి లీటర్ ద్రావణాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నర్రెంగ మొక్కలు దొరకకపోతే మరో మార్గం ఉంది. పచ్చి కొబ్బరిని రుబ్బి, పాలు తీయాలి. ఐదు లీటర్ల కొబ్బరి పాలకు ఐదు లీటర్ల మజ్జిగను చేర్చి… ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పోసుకొని పులియబెట్టుకోవాలి. వారం తరువాత ద్రావకాన్ని వడకట్టుకొని లీటరు ద్రావణాన్ని 20 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ రెండు ద్రావణాలు పంటల ఎదుగుదలకే కాకుండా పూత, పిందె బాగా రావడానికి ఉపయోగపడతాయి.

Read More

వర్షాకాలంలో పశుసంపద సంరక్షణ – శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు

వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతంతో పాటు రోగకారక క్రిములు (బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు) వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల పశువులలో పాల దిగుబడి తగ్గడమే కాకుండా తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో పశుపోషణలో పాటించాల్సిన సమగ్ర శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు

1: షెడ్ల నిర్వహణ, పారిశుధ్యం మరియు గాలి-వెలుతురు (Shed Management & Sanitation)

వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం షెడ్ పరిశుభ్రతపైనే 80% ఆధారపడి ఉంటుంది.

ఏ . షెడ్ పరిశుభ్రత మరియు నీటి నిల్వ నివారణ:

  • నేల పొడిగా ఉంచడం: షెడ్ లోపల నీరు నిలవకుండా చూడాలి. కాంక్రీట్ లేదా మట్టి నేలపై వర్షం నీరు లేదా మూత్రం నిలిస్తే గిట్టల కుళ్లు (Foot rot) మరియు పొదుగు వాపు (Mastitis) వ్యాధులు వస్తాయి.
  • సున్నం మరియు క్రిమిసంహారకాలు: వారానికి కనీసం రెండు సార్లు షెడ్ నేలపై, మూలల్లో పొడి సున్నం (Quick lime) లేదా వరి పొట్టు చల్లాలి. ఇది తేమను పీల్చుకుని క్రిములను చంపుతుంది.
  • మురుగు నీటి కాలువలు: షెడ్ చుట్టూ ఉన్న కాలువలను శుభ్రం చేసి వర్షపు నీరు సులభంగా బయటకు వెళ్లేలా చూసుకోవాలి.
  1. షెడ్ ఎత్తు మరియు గాలి, వెలుతురు:
  • కిటికీలు మరియు పరదాలు: వర్షం చినుకులు లోపలికి పడకుండా గోనె సంచులు లేదా తార్పాలిన్ పరదాలను అమర్చాలి. అయితే, షెడ్ లోపల అమ్మోనియా వాయువు నిలిచిపోకుండా గాలి ఆడటానికి పైన ఖాళీ (Ventilation) ఉంచాలి.
  • ఈగలు, దోమల నివారణ: వర్షాకాలంలో దోమలు, ఈగల తీవ్రత ఎక్కువ. వీటి నివారణకు సాయంత్రం వేళల్లో వేపఆకులు, సాంబ్రాణి పొగ వేయడం లేదా పొగచుట్ట పొడి ద్రావణాన్ని షెడ్ చుట్టూ పిచికారీ చేయడం చేయాలి.

2: మేత మరియు పోషక యాజమాన్యం (Feed & Nutrition Management)
వర్షాకాలంలో లభించే చిగురించిన పచ్చిమేత వల్ల జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఏ . పచ్చిమేత వాడకంలో జాగ్రత్తలు:

  • లేత గడ్డి వల్ల ప్రమాదం: వర్షాలకు కొత్తగా పెరిగిన లేత పచ్చిమేతలో నీటి శాతం ఎక్కువ, పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉంటుంది. దీనిని నేరుగా తినిపిస్తే పశువులకు సార విరేచనాలు (Diarrhea) మరియు కడుపు ఉబ్బరం (Bloat) వస్తాయి.
  • ఎండుగడ్డి కలపడం: పచ్చిమేతతో పాటు తప్పనిసరిగా తగినంత వరిగడ్డి లేదా జొన్న చొప్ప (ఎండుమేత) కలిపి అందించాలి. పచ్చిమేత కోసిన వెంటనే వేయకుండా 2-3 గంటల పాటు నీడలో ఆరబెట్టి వేయాలి.

బి . బూజు పట్టిన మేత నివారణ (Aflatoxin Control):

  • వర్షాకాలంలో గాలిలో తేమ వల్ల నిల్వ ఉంచిన దాణా, శనగ పొట్టు, తవుడు బూజు పట్టే ప్రమాదం ఉంది.
  • బూజు పట్టిన దాణాను పశువులకు మేపకూడదు. దీనివల్ల కాలేయం పాడై ‘ఆఫ్లాటాక్సికోసిస్’ అనే విషప్రభావం ఏర్పడుతుంది. దాణాను నిల్వ చేసే ప్రదేశంలో ప్లాస్టిక్ షీట్ పరిచి దానిపై బస్తాలు ఉంచాలి.

సి . మినరల్ మిశ్రమం మరియు తాగునీరు:

  • ధాతు లవణాల మిశ్రమం (Mineral Mixture): వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ప్రతి పాడి పశువుకు రోజుకు 50-100 గ్రాముల మినరల్ మిశ్రమం దాణాలో కలిపి ఇవ్వాలి.
  • శుభ్రమైన నీరు: వర్షాకాలంలో కలుషిత నీటి వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి. పశువులకు పంపు నీరు లేదా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాపాలి. గుంటల్లో నిలిచిన వర్షపు నీటిని తాపకూడదు.

3: వ్యాధుల వ్యాప్తి, నివారణ మరియు అత్యవసర జాగ్రత్తలు (Disease Control & Health Care)
వర్షాకాలంలో బ్యాక్టీరియల్ మరియు పరాన్నజీవుల (Parasites) ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువ.

ఏ . ముఖ్యమైన వ్యాధులు – ముందస్తు టీకాలు (Vaccinations):

వ్యాధి పేరు
గొంతువాపు (HS)

లక్షణాలు:
గొంతు వాచి శ్వాస తీసుకోవడం కష్టమవడం, తెల్లటి నురుగు రావడం

నివారణ / టీకా:
వర్షాకాలం ముందు లేదా ప్రారంభంలో H.S. టీకా వేయించాలి

వ్యాధి పేరు: జానపద వ్యాధి (BQ)

లక్షణాలు: పిరుదుల కండరాలు వాచి, తాకితే చప్పుడు రావడం, తీవ్ర జ్వరం

నివారణ / టీకా: B.Q. టీకా వేయించాలి

వ్యాధి పేరు: పొదుగు వాపు (Mastitis)

లక్షణాలు: పొదుగు గట్టిపడి పాలు ఎర్రగా/విరిగిపోయి రావడం

నివారణ / టీకా: పాలు పితికిన తర్వాత చనుమొనలను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో ముంచాలి

వ్యాధి పేరు: పరాన్నజీవుల సమస్య

లక్షణాలు: బరువు తగ్గడం, కళ్ల వెంట నీరు, దవడ కింద వాపు

నివారణ / టీకా: నట్టల నివారణ మందు (Deworming) తాపించాలి

బి . గిట్టల సంరక్షణ (Foot Care):
• నేల తేమగా ఉండటం వల్ల గిట్టల మధ్య పుండ్లు పడతాయి (Foot rot).
• పరిష్కారం: వారానికి ఒకసారి పశువుల కాళ్లను 2% రాగి మైలుతుత్తం (Copper Sulphate) ద్రావణంతో కడగాలి.

  1. గొర్రెలు, మేకలు మరియు కోళ్ల ప్రత్యేక జాగ్రత్తలు:
    • గొర్రెలు/మేకలు: వీటిని వర్షంలో తడవనివ్వకూడదు. వర్షాకాలంలో PPR టీకా మరియు ఎంటరోటాక్సిమియా (ET) టీకా తప్పనిసరిగా వేయించాలి.
    • పెరటి కోళ్లు: కోళ్ల షెడ్లలో రంధ్రాలు లేకుండా చూసి, రాణిఖేత్ (RDV) టీకా వేయించాలి. తాగునీటిలో యాంటీబయోటిక్స్ లేదా విటమిన్లు కలిపి ఇవ్వడం శ్రేయస్కరం.

రైతులకు ముఖ్య గమనిక:
వర్షాకాలంలో పశువులలో ఏమాత్రం మేత తినకపోవడం, జ్వరం రావడం లేదా నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలో ఉన్న పశువైద్యుడిని (Veterinary Doctor) సంప్రదించి చికిత్స అందించాలి.

రచయిత: డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం). Ph: 8121451017
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

ఔషధ మొక్క… పపటాకు

పపటాకు 1.8 మీటర్ల ఎత్తు పెరిగే వార్షిక మొక్క. ఇది విపీరతంగా పెరిగి కలుపు మొక్కలా తయారవుతుంది. ఆకులు వ్యతిరేక దిశలో ఏర్పడి 3 నుండి 5 అండాకారంలో వున్న చిన్న ఆకులు కలిగి వుంటాయి. మొక్క సంవత్సరంలో ఏ సమయంలోనైనా పూయవచ్చు. పూలు పొడవాటి కాడల మీద చిన్న గుత్తులుగా ఏర్పడతాయి. కాయలు కొద్దిగా వంకరగా, బిర్రుగా, గరుకుగా, నలుపు కడ్డీలులాగా వుంటాయి. కాయలు నక్షత్రం ఆకారంలో గుండ్రని గరుకైన అంచులు కలిగి సుమారు 1-2 సెం.మీ. వ్యాసంలో వుంటాయి. ఉత్తర భారతదేశంలో లేత ఆకులు, కొమ్మలను చేపల కూరలో చేపలతో కలిపి వండుకు తింటారు.

సాధారణ నామం : బ్లాక్ జాక్ / బెగ్గర్‌టిక్ శాస్త్రీయ నామం : బిడెన్స్ పైలోసా కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • పపటాకు ఫార్ములేషన్ యాంటి డయాబెటిక్ డ్రగ్స్‌తో కలిపి వాడితే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులలో డయాబెటిస్ నియంత్రణలో వుంటుంది.
  • చైనాలో, ఈశాన్య ఉత్తర భారతదేశంలో ప్రజలు ఔషధంగా ఉపయోగిస్తారు. మొత్తం మొక్క లేదా వివిధ భాగాలను వాపు, రోగనిరోధక సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, కీళ్ళ నొప్పులు, అంటువ్యాధులు, క్యాన్సర్లు, గాయాలు వంటి 40 జబ్బులకు పైగా చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • దక్షిణాఫ్రికాలో దీనిని పందులకు మేతగా ఉపయోగిస్తారు.
  • పపటాకు ఎసిటోన్ ద్రావణాన్ని చిక్కుడు గింజల నిల్వదశలో ఆశించే అకాంతో సెలిడెస్ ఒబ్టెక్టస్, జాట్రోటెస్ సబ్‌సాసియేటస్ పురుగుల నివారణలో మొట్టమొదటిసారిగా ఉపయోగించి 100 శాతం నివారణ సాధించారు. పపటాకు ఒక అద్భుతమైన వృక్ష సంబంధ పురుగుమందు. దీనిని అధిక పరిమాణంలో లెగ్యూమ్ జాతి పంటల ధాన్యాన్ని పురుగులాశించకుండా నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు. (రేణుక, ఆమె అనుచరులు, 2014) రసాయన పురుగుమందులకు ఈ కలుపు మొక్క ఒక అద్భుత ప్రత్యామ్నాయం.
  • పపటాకు తాజా ఆకులనుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ బంబార వేరుశనగ నిల్వ సమయంలో ఆశించే పురుగు కాల్లసోబ్రోకస్ మాక్యులేటస్‌ను, శిలీంద్రాలు ఆస్పర్ౙిల్లస్, పెనిసిలియం, ఫ్యుజేరియం, మ్యూకార్‌లను సమర్థవంతంగా నివారించింది. పపటాకు ఎసెన్షియల్ ఆయిల్ పురుగు, శిలీంద్ర నాశక లక్షణాలు ఈ పరిశోధన ద్వారా విశదమయ్యాయి (అగస్టిన్‌గేడౌమ్, అతని అనుచరులు, 2016)
  • పపటాకు తాజా ఆకుల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యాన్ని పురుగులాశించకుండా కాపాడుతుంది (ఆగస్టిన్ గేడౌమ్, అతని అనుచరులు, 2016)
  • పేనుబంక, లద్దె పురుగులు, చెదల నివారణకు మొత్తం మొక్క, దాని గింజలనుపయోగించి ఫార్ములేషన్ తయారు చేసుకోవచ్చు. మొదట ముదిరిన గింజలను నీటిలో 10 ని॥ మరిగించాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం నీటితోపాటు చిన్న సబ్బు ముక్క లేదా కొంచెం సబ్బు పొడి కలపాలి. ఈ ద్రావణాన్ని వడకట్టి నారుమడి, కూరగాయల పం\ల్లో పిచికారి చేయవచ్చు. మొత్తం మొక్కను కూడా బాగా దంచి రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచి, మరునాడు వడపోసి పిచికారి చేసే ముందు చిన్న సబ్బు ముక్క కలిపి పిచికారి చేయవచ్చు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… శీకాయ

శీకాయ దాదాపు 10-12 మీ. ఎత్తు వరకు పెరిగే బలమైన ముళ్ళతో కూడిన బహువార్షిక తీగ. కొమ్మలు గోధుమరంగులో వుండి, తెల్లని మచ్చలతో కూడి ఉంటుంది. పుష్పాలు చిన్నగా, కాయలు చిన్న కాడతో పలుచగా, బల్లపరుపుగా ఉండి 6-15 గింజలు కలిగి ఉంటాయి. దీనిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

సాధారణ నామం : సోప్‌నట్ అకేసియా, శీకాకాయ
శాస్త్రీయ నామం : అకేసియా కాన్సిన్నా కుటుంబం: మైమోసేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • కాయలు, బెరడు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. బెరడులో సపానిన్, కాయలో అకేసిన్ అనే రసాయనాలుంటాయి. బెరడును ఉబ్బసవ్యాధి నివారణకు, సబ్బులు మరియు షాంపూల తయారీలో ఉపయోగిస్తారు. మూత్రాన్ని సులువుగా జారీ చేయుటకు, క్రిమిసంహారిణిగా, రక్తస్రావాన్ని అరికట్టుటకు, కుష్టు, బొల్లి వంటి చర్మవ్యాధుల నివారణలో ఉపయోగపడుతుంది. విరిగిన ఎముకలను అతికించడానికి కట్టే కట్టులో, పొడి చేసిన కాయలను సబ్బులకు బదులుగాను ఉపయోగించవచ్చు.

వ్యవసాయరంగంలో …

  • శీకాయ గింజల మిథనాల్ ద్రావణం మరియు గింజల, ఆకుల ఇథైల్ ఎసిటేట్ ద్రావణాలు హైబ్లేయ ప్యూరియాని అత్యంత సమర్ధవంతంగా నివారించాయి. శీకాయ (అకేసియా కాన్సిన్నా) కాయలు నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులపై వికర్షక చర్యను ప్రదర్శించాయి (ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2000).
  • అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణం రైస్‌వీవిల్, సైటోఫిలసఒరైజె, మరియు రెడ్‌ఫ్లోర్‌బీటిల్, ట్రైబోలియం కాస్టానియంపై యాంటీఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (క్వాద్రి, 1973). అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణాన్ని (2%, 5%) 40 రోజుల వరినారు మొక్కలపై పిచికారి చేస్తే సుడిదోమ, నీల పర్వత లూజెన్స్ గుడ్లు పెట్టడాన్ని తగ్గించింది (రెడ్డి అండ్ అర్స్, 1988)
  • అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణం (50 పిపియం) పొగాకు లద్దెపురుగు, స్పోడోప్టెరా లిటూర లార్వాలను (85.2%) సమర్ధవంతంగా నివారించింది. ఇది సోయాబీన్ పంటనాశించే పొగాకు లద్దె పురుగు పర్యావరణహిత యాజమాన్యానికి సుస్థిర పరిష్కార మివ్వగలదు (పాటిల్ అండ్ చావన్, 2010).
  • శీకాయ చెట్టు బెరడు క్లోరోఫాం ద్రావణం సూడోమోనాస్ ఈరోజినోసా, స్టెఫైలో కోకస్ ఆరియస్‌పై బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది (వర్గీస్ రాజా అండ్ శివరాజ్, 2012) శీకాయ గింజల ద్రావణం రూట్‌నాట్ నెమటోడ్, మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిటపై నెమటిసైడల్ చర్యను ప్రదర్శించింది (ద్విజేంద్ర సింగ్, 2014).
  • శీకాయ (అకేసియా కాన్సిన్నా) కాయ ఇథనాల్ ద్రావణం (సాపోనిన్ కలిగి ఉన్నవి)తో శుద్ధి చేసిన ఫేసియోలస్ అకానిటిఫోలియస్ గింజలపై కొల్లసోబ్రూకస్ కైనెన్సిస్ గుడ్లు పెట్టడాన్ని, గింజల నుండి వెలువడే పెద్ద పురుగులను గణనీయంగా తగ్గించింది. శీకాయకాయల ఇథనాల్ ద్రావణం జీవపురుగు మందు లక్షణాలు కలిగి పల్స్‌బీటిల్‌ని సమర్ధవంతంగా నివారించగలదు (బజాద్ అండ్ పరదేశి, 2016).
  • అకేసియా కాన్సిన్నా గింజల మిథనాల్ మరియు ఇథైల్ అసిటేట్ ద్రావణాలు మరియు ఆకుల ఇథైల్ అసిటేట్ ద్రావణం టేకు ఆకులను తినే పురుగు హైబ్లీయప్యూరియా లార్వాలను అత్యంత సమర్ధవంతంగా 100% నివారించాయి (దీప అండ్ రెమాదేవి, 2011).
  • అకేసియా కాన్సిన్నా గింజల పొడి వరి ధాన్యాన్ని నిల్వ సమయంలో ఆశించే పురుగులను యాంటీఫీడెంట్ చర్య ద్వారా నివారించింది., అకేసియా కాన్సిన్నా క్రూడ్ ద్రావణం చెరకు పంటలో ముఖ్యపురుగైన సెరటోవాక్యునా లానిజెరాని ప్రయోగశాలలో మరియు క్షేత్ర ప్రయోగాలలో అత్యంత సమర్థవంతంగా నివారించింది (పాటిల్ అండ్ చవాన్, 2009).
  • అకేసియా కాన్సిన్నా గింజల మిథనాల్ ద్రావణం యానిమల్ స్కిస్టోమియాసిస్ వాహకం ఫ్రెష్‌వాటర్ నత్త, లిమ్నీయ లూటియోలపై మొల్లస్కిసైడల్ చర్యను ప్రదర్శించింది (సుకుమారన్, అతని అనుచరులు, 2002).
  • అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణం రెండు మచ్చల ఎర్రనల్లి, టెట్రానికస్ యుర్టికె జీవిత చక్రాన్ని పొడిగించి, అధిక మరణశాతాన్ని నమోదు చేసింది (ఎల్‌గెపలి, అతని అనుచరులు, 2016).

Read More

‘జీవామృతం’ తో జవజీవాలు

జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు (ఎకరం పొలానికి)

  • 200 లీటర్ల నీరు (ఎకరానికి సరిపోతుంది)
  • 10 కిలోల పేడ (నాటు ఆవు)
  • 5 నుంచి 10 లీటర్ల నాటు ఆవు మూత్రం
  • 2 కిలోల బెల్లం (నల్లబెల్లం శ్రేష్టమైనది)
  • 2 కిలోల పప్పుధాన్యాల పిండి (ఉదా: ఉలవ, అలసంద, కంది, మినప, పెసర పిండి, ఏదైనా లేక వీటిని కలిపైనా వాడొచ్చు)
  • పొలం గట్టు మట్టి…పిడికెడు

రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు ‘జీవామృతం’ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు చక్రాలు, వాటిలో జీవామృతం ఒకటి. మిగతావి… బీజామృతం, అచ్ఛాదన, నీటి యాజమాన్యం.

జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైనది. మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. పేడ, మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, నీటిని కలిపినప్పుడు పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు రెట్టింపవుతుంది.

జీవామృతం తయారీ విధానం:
ఎండ తగలని చోట పెట్టిన సిమెంటు తొట్టి లేదా ప్లాస్టిక్ పీపాలో 200 లీటర్ల నీటిని నింపాలి. పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి బాగా కలపాలి. గడియారం ముల్లు తిరిగే దిశగా అంటే సవ్యదిశలో కర్రతో కలియతిప్పాలి. గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియ తిప్పుతూ ఉండాలి. అందులోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి సాగు నీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడవచ్చు. పంటలపైన పిచికారీ చేయొచ్చు.

పంటలపై జీవామృతం పిచికారీ ఇలా…
3 నెలల్లో (60Ð90 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):
మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
రెండోసారి: (21 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (21 రోజుల తర్వాత) 200 లీ. నీటికి 20 లీ. జీవామృతంను కలిపి చల్లాలి.
నాలుగోసారి: (గింజ ఏర్పడుతున్న దశలో) 200 లీ. నీటిలో 5 లీ. పుల్లమజ్జిగ కలిపి పిచికారీ చేయాలి (ఈసారి జీవామృతం అక్కర్లేదు).
6 నెలల్లో (150 నుంచి 180 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):
మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి చల్లాలి.
రెండోసారి: (30 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (30 రోజుల తర్వాత) 200 లీటర్ల ‘నీమాస్త్రం’ను చల్లుకోవాలి.
నాలుగోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
ఐదోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి చల్లాలి.
ఆరోసారి: (గింజ ఏర్పడుతున్నప్పుడు) 200 లీ. నీటిలో 6 లీ. పుల్లమజ్జిగ (ఈసారి జీవామృతం అక్కర్లేదు) కలిపి పిచికారీ చేయాలి.
జీవామృతం, పంచగవ్య తదితరాల తయారీలో వాడే ఆవు పేడ ఎంత తాజాదైతే అంత మంచిది. వారం రోజుల వరకు పర్వాలేదు. మూత్రం మాత్రం ఎంత పాతదైతే అంత మేలు జరుగుతుంది.

Read More

సేంద్రియ ఎరువుల వాడకం క్రమంగా పెరుగుతుంది

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయదారులు 11.17 లక్షల టన్నుల సేంద్రియ ఎరువులు కొన్నారని, ఇది గతం కంటే 3.5 రెట్లు ఎక్కువని, దేశంలో రైతులు క్రమంగా సేంద్రియ ఎరువుల దిశగా మళ్లుతున్నారని కేంద్రం సోమవారం వెల్లడించింది. దేశంలో చాలినన్ని ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎరువుల అందుబాటు విషయంలో ఎలాంటి సమస్యలూ లేవని స్పష్టం చేసింది. “2026 ఖరీఫ్‌నకు సంబంధించి ఎరువుల అవసరాన్ని వ్యవసాయ శాఖ తిరిగి అంచనా వేసింది. సీజన్‌లో మొత్తం 383.9 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయశాఖ నిర్ధారించుకుంది. ప్రస్తుతం దేశంలో 197.56 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి” అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణా ఎస్ శర్మ వెల్లడించారు.

Read More

ధాన్యం తడిస్తే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదే బాధ్యత

తెలంగాణాలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు సంబంధించి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, రైస్‌ మిల్లర్లకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ధాన్యం కొనుగోలు, నిర్వహణ, రవాణా, లెక్కల నమోదులో అనుసరించాల్సిన నియమ నిబంధనల్ని స్పష్టం చేస్తూ జిల్లాల వారీగా ఆదేశాలు జారీ అయ్యాయి.
కౌలు రైతులు తాము సాగుచేసిన భూమి వివరాల్ని ముందుగానే వ్యవసాయశాఖ ఓపీఎంఎస్‌ లాగిన్‌లో కౌలు రైతు కింద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
కొనుగోలు కేంద్రాలు ఎత్తయిన ప్రదేశంలో రవాణాకు అనుకూలంగా ఉండాలి. సెంటర్లో ధాన్యం తడిస్తే నిర్వాహకులదే పూర్తి బాధ్యత.
సన్న ధాన్యం నింపే బస్తాలను గుర్తించేందుకు వీలుగా ఎర్రదారంతో, దొడ్డు ధాన్యం బస్తాలను ఆకుపచ్చ దారంతో కుట్టాలి. సన్నధాన్యం బస్తాలపై ‘ఎస్‌’ అనే అక్షరం రాయాలి.
రైతులు మద్దతు ధర పొందాలంటే తేమ 17% మించొద్దు. చెత్త, తాలు 1%, మట్టిపెళ్లలు, రాళ్లు 1%, చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు పట్టిన ధాన్యం 5%, పూర్తిగా తయారుకాని ధాన్యం 3% దాటొద్దు.
ఏ రోజు కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదేరోజు మిల్లుకు పంపించాలి. ధాన్యం రవాణా చేసే ముందే ఓపీఎంఎస్‌ లో వివరాల్ని పీపీసీ సెంటర్‌ నిర్వాహకులు నమోదుచేయాలి.

  • దళారులు ధాన్యంకొంటే కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై చర్యలుంటాయి.
Read More

తెలంగాణ రాష్ట్రంలో పశుసంపద పెంచాలని ప్రభుత్వానికి విజయ డెయిరీ ప్రతిపాదనలు

తెలంగాణలో రాష్ట్రంలో రోజుకు కేవలం 4 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తవుతున్నాయి, 26 లక్షల లీటర్ల పాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఇక్కడ పశుసంపద వృద్ధి చెందకపోవడమే. గేదెలు, ఆవుల సంఖ్య తగ్గడంతో.. పాడి, దాని అనుబంధ ఉత్పత్తులపై ప్రభావం పడింది. పాడి రైతులు పోసే పాలు రోజువారీ 50 వేల లీటర్ల మేరకు తగ్గాయి. సమస్య తీవ్రత, ప్రజావసరాల దృష్ట్యా పాడి రంగాన్ని ఆదుకునేందుకు పాడిపశువుల సంఖ్య పెంపుదల, ఇతర చర్యలు చేపట్టాలని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 2019తో పోలిస్తే తాజాగా జరిగిన పశుగణనలో పాలిచ్చే గేదెలు, ఆవులు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గింది.

పశువుల సంఖ్య తగ్గింది: 2019లో ఆవులు 42,32,383 ఉండగా.. తాజాగా వాటి సంఖ్య 30,69,524 (27.48%)కి తగ్గింది. గేదెల సంఖ్య 42,26,603 నుంచి 3052102 (27.78%) కి తగ్గింది. మేకలు 49,34,673 నుంచి 45,48,999 (7.82%) కి తగ్గాయి.
సూర్యాపేట జిల్లాలో ఆవులు 62.65%, సంగారెడ్డి 50.74%, మెదక్‌ 45.26%, మహబూబాబాద్‌లో 43.64% తగ్గాయి. గేదెలు సంగారెడ్డి జిల్లాలో 46.14%, కామారెడ్డి 45.92%, మెదక్‌ 45,32%, మహబూబాబాద్‌ లో 43.23% తగ్గాయి. మేకలు హైదరాబాద్‌లో 40.87%, రంగారెడ్డి జిల్లాలో 25.83 % క్షీణించాయి.

పాడిపరిశ్రమకు ఆశించిన ప్రోత్సాహం లేకపోవడం వల్ల రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. రాష్ట్రంలోని గ్రామీణ రైతు కుటుంబాల్లో 0.87% మాత్రమే పాడిపశువుల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్నాయని జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. పాడిపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పశువుల పంపిణీ పథకాన్ని చేపట్టి, లబ్దిదారులకు వాటిని పంపిణీ చేయాలని విజయ డెయిరీ ప్రభుత్వాన్ని కోరింది.
Read More