ముంచుకొస్తున్న కరువు… పాడి రైతు గుండె చెరువు

ఎల్‌నినో ప్రభావం వలన పశుగ్రాస కొరత నానాటికీ పెరిగిపోతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాడిరంగం కునారిల్లుతోన్న ఈ పరిస్థితికి పాడి పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందకపోవడం వలన చాలామంది పాడికి దూరం అవుతున్నారు. పశువుల దాణా, మేపు ఖర్చులు  పెరగడం, పచ్చిమేత లభ్యత తగ్గడం, గ్రామాల్లో పశువైద్య సేవలు అరకొరగా ఉండటం, పాలకు గిట్టుబాటు ధర రాకపోవడం - ఇలా ఎన్నో కారణాల వలన పాల ఉత్పత్తి తగ్గుతున్న మాట వాస్తవం. గత 7 సం॥ల్లో 35% పాడి పశువులు తగ్గాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణంగా ఉన్నా మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కన్నా తక్కువ ఉండవచ్చు.
3.7.26 ప్రకారం ఖరీఫ్ నాట్లు వరి (-15%), పల్లీ (-18%), సోయా (-65%), పత్తి (-28%) మాత్రమే నమోదయింది. ఈ ఆలస్యం ధాన్యం/నూనెగింజల ఉత్పత్తిపైనే కాక, ఎండుమేత, తవుడు, పత్తి చెక్కల లభ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే, భారత ప్రభుత్వం 262 జిల్లాలను కరువు ప్రభావితంగా గుర్తించింది.
ఎన్‌డిడిబి అంచనా ప్రకారం, ఎండుమేత నిలువలు, అవసరమైనది 431 మిలియన్ మెట్రిక్ టన్నులు అయినా, 620 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు, పచ్చిమేత అవసరం 1140 మి.మె.ట. కాగా, 752 మి.మె.ట. ఉన్నట్లు, దాణా 32% కొరత ఉన్నట్లు గుర్తించింది.
దేశంలోని వాణిజ్యస్థాయి దాణా తయారీ, 14.5 మి.మె.ట. కాగా, ఈ వాతావరణ ప్రతికూలత వలన లభ్యత 5Ð10% తగ్గగలదని అంచనా.
మార్చి 26 నుండి జూన్ 26 వరకు చూస్తే, పచ్చిమేత ధరలు రూ. 3/80 నుండి రూ. 4/04 కి ఎగబాకగా, దాణాధరలు రూ.23.80 కిలో నుండి రూ.25.06 కి చేరింది. దాణా తయారీకి ముఖ్యమైన తవుడు ధరలు ఏకంగా 21% పెరిగాయి.
17 రాష్ట్రాల్లోని 262 కరువు ప్రభావిత జిల్లాల్లో పశు జనాభా ఇలా ఉంది.
పాలు ఇచ్చే పశువులు  31.19 మిలియన్లు
ఎండిపోయిన పశువులు   13.34 మిలియన్లు
దూడలు       37.16 మిలియన్లు
మొత్తం      81.70 మిలియన్లు
దీనికై, ఎండుమేత 1.1 మిలియన్ మె.ట., పచ్చిమేత 1.4 మి.మె.ట, దాణా 0.4 మి.మె.ట. గా ఉంటుంది. ముఖ్యంగా ఈ అవసరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిసా, బిహార్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఉంది.

కార్యాచరణ ప్రణాళికః

  1. కరువును తట్టుకునే పశుగ్రాసాల పెంపకం బాజ్రా, మక్కలు చేపట్టాలి
  2. పశుగ్రాస విత్తనాల లభ్యత ఉండాలి.
  3. బహువార్షిక పశుగ్రాసాల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
  4. మాగుడుగడ్డి వాడకం పెంచాలి.
  5. సహకార డెయిరీల ద్వారా ‘సైలేజ్’ సరఫరా చేయించాలి.
  6. టోటల్ మిక్స్‌డ్ రేషన్ (టిఎంఆర్) వాడకం పెంచాలి.
  7. ఉపయోగంలోకిరాని దాణా తయారీ సామర్థ్యం వినియోగించి, 3.6 లక్షల టన్నుల అదనపు దాణా తయారీ చేపట్టి రాబోవు 3 నెలల్లో కరువు ప్రభావిత ప్రాంతాల పాడిరైతులకు అందుబాటులోకి తేవాలి.
  8. ఎల్‌నినో ప్రభావం పాలఉత్పత్తిపైన కూడా ఉంటుంది. కాబట్టి, చల్లని వాతావరణంలో కృత్రిమ గర్భధారణ చేపట్టడం, శక్తివర్ధక దాణా సరఫరా ప్రోత్సహించాలి.
    ఏది ఏమైనా, పాడిపశువులకు పచ్చిమేత, ఎండుమేత, ఉత్పాదకత పెంపుదల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    అంతేకాక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు మాగుడుగడ్డి తయారీ, టిఎంఆర్ వాడకం బాహుళ్యంలో తెచ్చినపుడే పాలఉత్పత్తి నిలకడగా ఉండగలదు. అంతేకాక, పాలధర పెంపుదల కోసం ప్రభుత్వ ప్రోత్సాహకం, పశుగ్రాస పెంపకం కోసం పశుగ్రాస విత్తనాల సరఫరా, బీమా ప్రయోజనాలు విజయ డెయిరీ అందిస్తోంది. వీటితో పాడిరైతులు సహకార డెయిరీకి రక్షణ కవచంలా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  • మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553
Read More

మొక్క పెరుగుదలకు దోహదపడే ‘చేప కునప జలం’

కావలసిన పదార్థాలు:
తాజా చేప ముక్కలు : కిలో
దేశీ ఆవు మూత్రం : 5 లీటర్లు, నల్లబెల్లం – కిలో
దేశీ ఆవు నెయ్యి : 50 గ్రా, తేనె – 50 గ్రా

చేప కునప జలం ఇంచుమించు ‘మీనామృతం’ మాదిరిగానే పంటలపై పనిచేస్తుంది.

తయారుచేసే పద్ధతి: ఒక కిలో తాజా చేపలను ముక్కలుగా కోయాలి. వాటికి ఒక కిలో నల్లబెల్లం పొడిని కలపాలి. 50 గ్రాముల ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె కూడా కలిపి 30 నిమిషాలు ఉంచాలి. తరువాత ఒక మట్టికుండలో గాని, ప్లాస్టిక్ పాత్రలో గాని 5 లీటర్ల ఆవు మూత్రం పోసి అందులో ఈ మిశ్రమాన్ని కలపాలి. పాత్ర మీద మూత ఉంచి శుభ్రమైన గుడ్డతో బిగించి కట్టాలి. రోజుకొకసారి ఈ మిశ్రమాన్ని కలుపుతూ 20 రోజుల పాటు చల్లని గదిలో ఉంచి మురగబెట్టాలి. తయారైన చేప కునప జలాన్ని వడకట్టి వాడుకోవచ్చు. 100 లీటర్ల నీటికి 3 లీటర్ల చొప్పున దీన్ని కలిపి మె°క్కలపై పిచికారీ చేయాలి. ఇది 2 నెలల వరకు నిల్వ ఉంటుంది.

వాడే విధానం : 3 నుండి 5 శాతం ద్రావణాన్ని ఏ పంటపైనయినా ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారి చేయవచ్చు.

ఫలితాలు :

  • భూమికి అద్భుతమైన పోషకాలనందిస్తుంది.
  • మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది.
  • దీనిని సులభంగా తయారు చేయవచ్చు.
  • మొక్కలకు అద్భుతమైన టానిక్‌లా పనిచేస్తుంది.
Read More

ఔషధ మొక్క… ఏడాకుల పొన్న

ఏడాకుల పొన్న 4-10 మీ. ఎత్తు వరకు పెరిగే వృక్షం. ప్రతి కణుపు నుండి 4-7 ఆకులు వస్తాయి. ఆకులు దాదాపు 9-12 x 2.5-3 సెం.మీ. పరిమాణంతో కోలగా ఉన్న దీర్ఘచతురస్రాకారంలో గాని, బళ్ళెం ఆకారంలో గాని ఉంటాయి. ఈనెలు దగ్గర దగ్గరగా ఉంటాయి. ఆకుల అడుగు భాగం పాలిపోయి ఉంటుంది. పూలు తెల్లగా ఉండి కొమ్మల చివర్లలో వస్తాయి. గింజలు ఒంటరిగా లేదా జతగా ఉంటాయి.

సాధారణ నామం : డెవిల్స్‌ట్రీ, సప్తపర్ణి శాస్త్రీయ నామం : ఆల్‌స్టోనియా స్కాలారిస్ / ఆల్‌స్టోనియా బూనీ కుటుంబం: అపోసైనేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • పండ్లు మరియు చెట్టు బెరడుకు ఔషధగుణాలున్నాయి.
  • దీనిలో ఎఖిటమైన్, వినోటర్పిన్, గ్లూకోసైడ్, డిటేమిన్, ఎఖిటోనైన్, ఎఖిటైన్ అనే రసాయనాలు ఉంటాయి.
  • బాగా పండిన పండ్లు సిఫిలిస్, మూర్ఛ, పిచ్చి మొదలగు వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి.
  • బెరడు కషాయం జ్వరం, శ్వాసకోశవ్యాధులు, కుష్టు మరియు పుండ్లను నివారిస్తుంది.

వ్యవసాయరంగంలో

  • ఆల్‌స్టోనియా బూనీ ఆకు మరియు కొమ్మ ద్రావణం గులాబి రంగు కాండం తొలుచు పురుగు, సెసేమియా కలామిస్టిస్ పెరుగుదల నిరోధకంగా పనిచేస్తాయి.
  • ఏడాకుల పొన్న పెట్ ఈథర్ ద్రావణం షిగెల్లా బాయ్‌డీ, విబ్రియో పారాహెమోలైటికస్‌పై కొద్దిపాటి నిరోధక చర్యను ప్రదర్శించింది. కార్బన్ టెట్రాక్లోరైడ్ ద్రావణం విబ్రియో మిమికస్, విబ్రియో పారాహెమోలైటికస్‌లపై బలమైన నిరోధక చర్యను ప్రదర్శించింది. క్లోరోఫాం ద్రావణాలు విబ్రియో పారాహెమోలైటికస్ పెరుగుదలను బలంగా అరికట్టింది. ఎస్కెరిచియా కోలిపై కూడా నిరోధక చర్యను ప్రదర్శించాయి (బెల్లా, అతని అనుచరులు, 2017).
  • ఈ చెట్లు కాండం బెరడు ద్రావణం నత్త, లిమ్నేయియా అక్యూమినేటపై బలమైన మొల్లస్కసైడల్ చర్యను ప్రదర్శించింది (సింగ్ అండ్ సింగ్, 2003).
  • ఈ మొక్క ద్రావణం దోమల లార్వాలపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది. (జిజి, అతని అనుచరులు, 2012).
  • ఏడాకుల పొన్న కాండం బెరడు పెట్రోలియం ద్రావణం లిమ్నేయీ అక్యూమినేట, ఇండోప్లానోర్బిస్ ఎక్ౙస్టస్ అను నత్తలపై అధిక విషప్రభావం చూపింది (చౌహాన్ అండ్ సింగ్, 2014).
  • ఏడాకుల పొన్న మిథనాల్, నీటి ద్రావణాలలో ఉన్న అత్యధిక ఫైటోకెమికల్ సముదాయాలు అత్యుత్తమ యాంటీబాక్టీరియల్ చర్యలను ప్రదర్శించాయి (షకీల్, అతని అనుచరులు, 2014).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆకుకూరల సాగు

భారతీయ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ, మన రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు తీస్తున్నారు.

మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలను నిత్యం 125 గ్రాముల చొప్పున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కాగా, మార్కెట్లో వీటికి ఉన్న నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేపడితే ఆకుకూరల ద్వారా రైతులకు గరిష్ట లాభాలు లభిస్తాయి.”

ఆకుకూరలు తక్కువ కాలంలో (20-30 రోజులు) మరియు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర వంటివి నేరుగా విత్తనాలు చల్లి అన్ని కాలాల్లోనూ (వారానికి/పదిహేను రోజులకు ఒకసారి విత్తనాలు వేసుకోవడం ద్వారా) విజయవంతంగా సాగు చేయవచ్చు.

గోంగూర సాగు:
ఆకుకూరలన్నింటి కంటే గోంగూర రుచి ఎక్కువ. నీరు నిల్వ ఉండని తేలికపాటి గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు గోంగూర సాగుకు చాలా అనుకూలం. ఇది ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఏఎన్‌జిఆర్ఏయూ1 ఇది ఎర్ర గోంగూర రకం. విత్తనాలు నాటిన 30 నుండి 35 రోజులకే పంట కోతకు వస్తుంది. నీటి వసతి కలిగిన భూముల్లో ఒక ఎకరానికి దాదాపు 4 – 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు.

పాలకూర:
పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. ఇందులో అధికంగా విటమిన్ ‘ఎ’, ‘సి’, కాల్షియం మరియు ఇనుము వున్నవి. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో మంచి లాభాలను అందించే ఆకుకూర. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కాని ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనం అవసరం. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆల్‌గ్రీన్ రకం ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.

తోటకూర: తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. అర్క వర్ణ, కో-1, కో-2, కో-3, కో-4, అర్కా సుగుణ వంటి రకాలు ఎంపిక చేయవచ్చు. ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 4 నుండి 5 టన్నులు వస్తుంది.

బచ్చలికూర :
బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలి కూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ‘ఎ’, ‘సి’ లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కాని అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎకరాకు 5 – 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. . దిగుబడి 4 నుండి 6 టన్నులు వస్తుంది.

చుక్క కూర:
చుక్కకూరలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థాలు (ఫైబర్), తిన్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణమవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు 20 నుండి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

కొత్తిమీర:
కొత్తిమీర ఆకులతో పాటు విత్తనాల (ధనియాలు) ఉత్పత్తి కొరకు సాగయ్యే కొత్తిమీర, వంటల్లో సువాసనను, రుచిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. పోషక విలువల పరంగా చూస్తే.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సుగంధ తైలాలు, పీచు పదార్థాలు మరియు విటమిన్-కె, ఎ, సి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విశేష గుణాలు ఉండటం వల్ల, దీనిని జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఔషధంగానే కాకుండా వివిధ ఆయుర్వేద చికిత్సల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, వర్షాధార పంటగా పండించేటప్పుడు మాత్రం మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న బంక నేలలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరం. సురుచి, సుగుణ, సాధన, సింధు ముఖ్యమైన రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.

పుదీన:
పుదీనాను అటు ఆకుకూరగాను, ఇటు సుగంధ తైలం ఉత్పత్తి కొరకు విరివిగా సాగు చేస్తారు. మనదేశంలో జపనీస్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది. దీని నుండి తీసే తైలాన్ని సుగంధ పాన్‌మసాలాల తయారీలోనే కాకుండా.. దగ్గు, జలుబు, నొప్పుల నివారణ ఔషధాలలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు. ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. జపాన్ పుదీన, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎకరానికి 12-16 టన్నులు దిగుబడి వస్తుంది.

మెంతి కూర:
దీనిని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్య పంటల్లో ఇదోకటి. ఈ పంట సాగుకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత తేమ అనుకూలం. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర లేతపాటి నేలల్లో సాగుకు అనుకూలం. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1 రకం అనువైనది. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకొకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. ఎకరానికి 4-5 టన్నులు దిగుబడి వస్తుంది.

బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU). Ph: 8374275258

Read More

ఎల్ నినో పరిస్థితుల్లో రైతు ఆదాయ స్థిరత్వానికి వ్యూహాలు: అనుకూల పంటల ఎంపిక మరియు వ్యవసాయ రికార్డుల నిర్వహణ

భారతదేశ జనాభాలో సుమారు 68.84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, మొత్తం శ్రామిక శక్తిలో 54.6 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో కూడా సుమారు 61.12 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, దాదాపు 55 శాతం మంది వ్యవసాయ రంగంతో అనుసంధానమై ఉన్నారు. వ్యవసాయ గణాంకాల ప్రకారం భారతదేశంలో 86 శాతం కంటే ఎక్కువ వ్యవసాయ కమతాలు చిన్న మరియు సన్నకారు వర్గాలకు చెందుతాయి.

తెలంగాణ వ్యవసాయం నీటిపారుదల మరియు వర్షాధార వ్యవసాయ వ్యవస్థల సమ్మేళనంగా ఉండి, వర్షపాతం వ్యవసాయాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇటీవలి సంవత్సరాల్లో సాగునీటి వసతులు పెరిగినప్పటికీ, వాతావరణ మార్పులు రైతుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీసుకునే ప్రతి పంట నిర్ణయం కుటుంబ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వర్షపాతం అస్థిరంగా ఉండే సంవత్సరాలలో పంటల ఎంపిక మరింత కీలకంగా మారుతుంది. ఎల్నినో (Elnino) వంటి వాతావరణ పరిస్థితులు వర్షపాతాన్ని ప్రభావితం చేసి వ్యవసాయ ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో సాధారణంగా రుతుపవనాల బలహీనత, సగటు కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. 2025-26 సంవత్సరానికి కూడా వాతావరణ పరిస్థితులపై ఎల్నినో ప్రభావం కొనసాగే అవకాశాలపై వివిధ వాతావరణ సంస్థలు సూచనలు చేస్తున్నాయి.

తెలంగాణలోని ప్రధాన పంటలు మరియు వాటిపై ఎల్ నినో ప్రభావం
వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2025 వానాకాలంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో వరి పంట 50.57 శాతం వాటాతో ప్రథమ స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో పత్తి 34.52 శాతం విస్తీర్ణాన్ని ఆక్రమించింది. ఈ గణాంకాలు రాష్ట్ర వానాకాల పంటల సరళిలో వరి మరియు పత్తి పంటల ప్రాబల్యాన్ని సూచిస్తున్నాయి. అయితే ఎల్నినో వంటి వాతావరణ అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు కేవలం సంప్రదాయ పద్ధతిలో వరి సాగుపైనే ఆధారపడకుండా, నీటి లభ్యత తక్కువగా అవసరం ఉన్న కందులు, పెసర వంటి పప్పుధాన్యాలు లేదా స్థానిక పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం.

డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన గణాంకాల ప్రకారం, ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో (2014-15 మరియు 2015-16) తెలంగాణలో ప్రధాన పంటల నికర ఆదాయంలో గణనీయమైన మార్పులు నమోదయ్యాయి.

2015-16 తీవ్రమైన ఎల్ నినోలో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. వరి (-14007.72), మొక్కజొన్న – 11373.53), పత్తి (-10908.38), కందులు (-9818.09), పెసర (-5207.97) పంటలన్నింటిలోనూ నికర ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. ఇది తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో పంటలు ఎంతగా దెబ్బతింటాయో సూచిస్తుంది. అదే విధంగా తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు వర్షాభావాన్ని తట్టుకొని రైతులకు నష్టాలను తగ్గించే అవకాశాన్ని కల్పించాయి. దీనినిబట్టి ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో అన్ని పంటలు ఒకే విధంగా ప్రభావితమవలేదని గమనించవచ్చు. కొన్ని సంవత్సరాలలో వరి అత్యధిక నష్టాలను చవిచూడగా, కొన్ని ప్రత్యామ్నాయ పంటలు లాభాలను మరియు తక్కువ నష్టాలను నమోదు చేశాయి.

అదేవిధంగా పంటల ఎంపికలో కూడా ఒకే సూత్రం అందరికీ వర్తించదు. రైతు నేల స్వభావం, నీటి వనరులు, గత అనుభవం, మార్కెట్ పరిస్థితులు మరియు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా తీసుకోవడానికి వ్యవసాయ రికార్డులు ఎంతో ఉపయోగపడతాయి. గత సంవత్సరాలలో ఏ పంటకు ఎంత ఖర్చు అయింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత ఆదాయం లభించింది, వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంట మెరుగ్గా నిలిచింది వంటి వివరాలు రికార్డుల ద్వారా స్పష్టంగా తెలుస్తాయి.

దీనికోసం రైతు పొలంలో జరిగే వివిధ కార్యకలాపాలకు వేర్వేరు రికార్డులు అవసరం. రైతు నిర్వహించుకోదలచిన ముఖ్యమైన రికార్డు రకాలు ఇవి:

  1. వ్యవసాయ దినచర్య రికార్డు
  2. పంటల వారీ ఖర్చు-ఆదాయ రికార్డు
  3. ఎరువుల వినియోగ రికార్డు
  4. పురుగుమందుల వినియోగ రికార్డు
  5. కార్మికుల వినియోగ రికార్డు
  6. యంత్రాల వినియోగ రికార్డు
  7. నీటి వినియోగ రికార్డు
  8. దిగుబడి రికార్డు
  9. పశుసంవర్ధక రికార్డు
  10. నిల్వ మరియు విక్రయాల రికార్డు

ప్రస్తుతం తెలంగాణలోని అభ్యుదయ రైతులు కొంతమంది ప్రధానంగా కాగితపు రికార్డుల ద్వారానే వ్యవసాయ సమాచారాన్ని నమోదు చేసి భద్రపరుస్తున్నారు. అయితే, కాలానుగుణంగా అందుబాటులోకి వచ్చిన వివిధ ఆధునిక పద్ధతులను కూడా వినియోగించి వ్యవసాయ రికార్డులను మరింత సమర్థవంతంగా భద్రపరచుకోవచ్చు. వీటిలో సంప్రదాయ కాగితపు పద్ధతులతో పాటు డిజిటల్ రికార్డు పద్ధతులు, స్మార్ట్ఫోన్ ఆధారిత పద్ధతులు మరియు ప్రభుత్వ డిజిటల్ వేదికలు ముఖ్యమైనవి. ఈ పద్ధతుల వివరాలు క్రింది చిత్రంలో చూపించబడ్డాయి.

వివిధ వ్యవసాయ రికార్డుల పద్ధతులు
ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి అవసరం గల అనుకూల పంటలను ఎంపిక చేసి సాగు చేయడం రైతుల ఆదాయ స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వాతావరణ మార్పులు మరియు వర్షాభావ పరిస్థితుల ప్రభావాలను తగ్గించడంలో ముఖ్యమైన వ్యూహంగా నిలుస్తుంది. అదే సమయంలో, పంటల ఎంపిక, ఖర్చులు, దిగుబడులు, ఆదాయం మరియు వనరుల వినియోగానికి సంబంధించిన వ్యవసాయ రికార్డులను క్రమం తప్పకుండా నమోదు చేసి భద్రపరచడం ద్వారా రైతులు గత అనుభవాలను విశ్లేషించి భవిష్యత్ సాగు నిర్ణయాలను మరింత శాస్త్రీయంగా మరియు సమర్థవంతంగా తీసుకునే అవకాశం కలుగుతుంది. అందువల్ల, అనుకూల పంటల సాగుతో పాటు సమగ్ర వ్యవసాయ రికార్డుల నిర్వహణ కూడా వాతావరణ అనిశ్చితులను ఎదుర్కొంటూ స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యవసాయాభివృద్ధికి కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది.

డా. డి. ఎ. రజిని దేవి, సహాయ ప్రొఫెసర్, వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగం, వ్యవసాయ కళాశాల,రాజేంద్రనగర్
డా. కె. శేఖర్, సహాయ ప్రొఫెసర్, సేద్య విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, ఫోన్: 9032128184

Read More

‘మీనామృతం’తో మునగకు రక్ష!

సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక క్రిమిసంహారకాలకు దీటైన లేదా పోల్చదగిన ప్రత్యామ్నాయాలు లభించకపోవటం ఒక ప్రధాన సమస్య. అయితే, చేప ద్రావణాలతో ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోనూ అద్భుత ఫలితాలు సాధించవచ్చని డా॥ గున్నంరెడ్డి శ్యామసుందర్‌రెడ్డి పరిశోధనలో తేలింది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవరణలో ‘సస్యశ్యామల కృషివనం’ ప్రకృతి సేద్య పరిశోధనా క్షేత్రంలో ఆయన స్థిరపరచిన ‘మీనామృతం’, ‘మత్స్య సంజీవని’ మునగ పంటపై అద్భుతమైన ఫలితాలనిచ్చింది. చేప కషాయం, చేప అమైనో ఆమ్లాలు, చేప కునప జలం వంటివి కూడా వివిధ ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోను, పోషకాలను, వృద్ధి కారకాలను అందించడంలోను, భూసారాన్ని పెంపొందించడంలోను ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నాయి.

మునగ పంటకు ఆకుచుట్టు పురుగు ఒక ప్రధానమైన సమస్య. సేంద్రియ పద్ధతిలో మునగ పండించే రైతులకు, మరీ ముఖ్యంగా ఎగుమతి కోసం మునగ ఆకు పండించే రైతులకు ఈ పురుగు సింహ స్వప్నంగా మారింది. తల్లి పురుగులు (సీతాకోకచిలుకల వంటివి) పెట్టిన గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకులపైన, లేత రెమ్మలపైన ఉన్న పత్రహరితాన్ని గోకి తినటం మొదలుపెడతాయి. లార్వాలు పెరుగుతున్న కొలదీ ఇతర భాగాలకు పాకుతూ ఆకులను, లేత చిగుళ్లను, పూమొగ్గలను తింటూ బతుకుతాయి. లేత పిందెలు, పెరుగుతున్న కాయల మీద ఉన్న పత్రహరితాన్ని కూడా గోకి తింటాయి. లార్వాలు మొక్క పైకి, కిందకీ చురుకుగా కదులుతూ కొత్తగా వస్తున్న చిగుళ్లను ఎప్పటికప్పుడు తినేస్తూ ఉండటం వలన మొక్క మోడులా మారిపోతుంది. లేత మునగ మొక్కలకు ఇది ఆశిస్తే ఆ మొక్కలను పూర్తిగా నాశనం చేస్తుంది. మీనామృతాన్ని ఐదు రోజులకొకసారి మూడుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకు చుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది.

మీనామృతం తయారీకి కావాల్సిన వస్తువులు: తాజా చేప ముక్కలు: 1 కిలో; దేశీ ఆవు మూత్రం : 5 లీటర్లు; నల్ల బెల్లం : 1 కిలో; తాటికల్లు : 1 లీటరు; దేశీ ఆవు నెయ్యి : 50 గ్రాములు; తేనె : 50 గ్రాములు

తయారీ పద్ధతి: మీనామృతం రెండు దశల్లో తయారవుతుంది. ఇందుకు మొత్తం 20 రోజులు పడుతుంది. సిద్ధమైన మీనామృతం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఒక కిలో తాజా చేపలను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. కిలో బెల్లాన్ని పొడి చేయాలి. ఈ రెంటినీ కలిపి అరగంట సేపు ఉంచాలి. చేపను ముక్కలు చేయక ముందే శుభ్రంగా కడగాలి. చేప ముక్కలను కడగకూడదు. చేప తోక, రెక్కలు, మొప్పలు వంటి సులభంగా కుళ్లని భాగాలను తీసివేయాలి. ఒక మట్టికుండలో 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని తీసుకొని చేప ముక్కలు, బెల్లం మిశ్రమాన్ని అందులో వేయాలి. తరువాత కుండపై మూత ఉంచి శుభ్రమైన గుడ్డతో మూతి బిగించి కట్టాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ ఈగలు, ఇతర కీటకాలు లోనికి వెళ్లే అవకాశం ఇవ్వకూడదు. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఒక పరిశుభ్రమైన తడి లేని కర్రతో ద్రావణాన్ని నిమిషం పాటు కలియబెడుతూ ఉండాలి. పది రోజుల తర్వాత ఈ ద్రావణాన్ని పింగాణీ జాడీ లేదా ప్లాస్టిక్ క్యానులోకి వడకట్టుకోవాలి.

అందులో ఒక లీటరు తాటికల్లు, 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె వేసి మూతపెట్టి గుడ్డతో బిగుతుగా కట్టాలి. ఈ మిశ్రమాన్ని మరో పదిరోజుల పాటు ఉంచాలి. ఈసారి కలియబెట్టనవసరం లేదు. పది రోజుల తర్వాత ‘మీనామృతం’ పిచికారీకి సిద్ధమవుతుంది. మీనామృతాన్ని 6 నెలల వరకు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. కొద్ది లీటర్లయితే పింగాణి జాడీలలో నిల్వ ఉంచుకోవచ్చు. చాలా ఎక్కువ లీటర్లయితే ప్లాస్టిక్ క్యానులు లేదా డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకోవచ్చు. గాలి చొరబడని క్యానుల్లో ఉంచినప్పుడు తరచుగా మూతను లేదా బిరడాను తీసి గాలిని బయటకు వదులుతూ ఉండాలి.

‘మీనామృతం’ 3సార్లు పిచికారీ చేయాలి
మునగ చెట్టుపై పురుగును గమనించిన వెంటనే మీనామృతాన్ని పిచికారీ చేయడం ఉత్తమం. వంద లీటర్ల నీటికి 2.5 లీటర్ల నుంచి 5 లీటర్ల చొప్పున మీనామృతాన్ని కలిపి, చెట్టంతా తడిసేలా పిచికారీ చేయాలి. 5 రోజుల వ్యవధితో మరో రెండుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకు చుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది. మరింత మెరుగైన ఫలితాల కోసం మీనామృతంతో పాటు వేపనూనె (1500 పీపీఎం) లీటరు నీటికి 3 మిల్లీ లీటర్లు చొప్పున లేదా 10 శాతం లొట్టపీచు’ (తూటాకు) కషాయం లీటరు నీటికి 50 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయవచ్చు.

‘మీనామృతం’ వల్ల ఇతర ప్రయోజనాలివే…
మీనామృతం స్థూల, సూక్ష్మ ధాతు లోపాలను సమర్థవంతంగా నివారిస్తుంది. పందిరి కూరగాయలు, పచ్చ, దోస, దానిమ్మ వంటి ఉద్యాన పంటల్లో ఆడపూల నిష్పత్తిని గణనీయంగా పెంచుతుంది. మొక్కల్లో రోగనిరోధక శక్తిని వృద్ధిపరచి, ఆకుమచ్చ, కాయకుళ్లు తెగుళ్లను నిరోధిస్తుంది. రసం పీల్చే పురుగులు, లార్వాల తొలి దశలను నాశనం చేస్తుంది. కూరగాయలు, పండ్ల నాణ్యతను, పోషక విలువలను పెంచుతుంది.

Read More

ఆవులు మరియు గేదెల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే మార్గాలు – నూతన సాంకేతికతలు

పాడి పరిశ్రమలో లాభాలు ఆర్జించాలంటే పశువుల పాల దిగుబడి ఎంత ముఖ్యమో, వాటి సంతానోత్పత్తి సామర్థ్యం (Breeding Efficiency) కూడా అంతకంటే ముఖ్యం. “ఏడాదికి ఒక దూడ” (One Calf Per Year) అనే లక్ష్యాన్ని సాధించినప్పుడే పాడి రైతు ఆర్థికంగా స్థిరపడగలడు. అయితే, ప్రస్తుత కాలంలో పోషకాహార లోపం, సకాలంలో ఎదను గుర్తించకపోవడం, మరియు వాతావరణ మార్పుల వల్ల పశువులలో పునరుత్పత్తి సమస్యలు (Reproductive problems) పెరుగుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతికతలను (Latest Technologies) ఉపయోగించడం ఎంతో అవసరం.

సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ప్రాథమికాంశాలు
పశువులలో సంతానోత్పత్తిని పెంచడానికి సాంకేతికతలను వాడే ముందు, కొన్ని ప్రాథమిక యాజమాన్య పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలి.

  1. పౌష్టికాహార యాజమాన్యం (Nutritional Management)
    పశువుల పునరుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి శక్తి, ప్రోటీన్లు మరియు ఖనిజ లవణాలు (Minerals) ఎంతో అవసరం.
    •ఖనిజ లవణాల మిశ్రమం (Mineral Mixture): ఆవులు, గేదెలకు రోజుకు 50-60 గ్రాముల నాణ్యమైన మినరల్ మిశ్రమాన్ని మేతలో కలపాలి. విటమిన్ ఎ, ఇ, మరియు కాపర్, కోబాల్ట్, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ పోషకాలు పశువులు సకాలంలో ఎదకు రావడానికి, గర్భం నిలవడానికి సహాయపడతాయి.
    •గ్రీన్ ఫోడర్ (పచ్చిమేత): పచ్చిమేతలో ఉండే ‘కెరోటిన్’ (Carotene) హార్మోన్ల ఉత్పత్తిని పెంచి, గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  2. ఎదను సకాలంలో గుర్తించడం (Heat Detection)
    ఎదను సరిగ్గా గుర్తించకపోవడం అనేది సంతానోత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా గేదెల్లో మూగ ఎద (Silent Heat) ఎక్కువగా ఉంటుంది. ఇవి రాత్రి వేళల్లో ఎద లక్షణాలను చూపిస్తాయి.
    •సాంప్రదాయ పద్ధతి: రోజుకు కనీసం 3-4 సార్లు (ముఖ్యంగా తెల్లవారుజామున మరియు రాత్రి వేళల్లో) పశువులను నిశితంగా గమనించాలి. యోని నుండి తీగలు వేయడం, తరచుగా అరుస్తూ ఉండటం, ఇతర పశువులపై ఎక్కడం వంటి లక్షణాల ద్వారా ఎదను గుర్తించవచ్చు.

సంతానోత్పత్తిలో విప్లవాత్మక నూతన సాంకేతికతలు (Latest Technologies)
ప్రస్తుతం పశుగ్రాస రంగాన్ని మరియు పశువైద్యాన్ని ఆధునిక సాంకేతికత పూర్తిగా మార్చేస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను ఇచ్చే కొన్ని ముఖ్యమైన టెక్నాలజీలు ఇక్కడ ఉన్నాయి:

  1. ఐఓటి ఆధారిత సెన్సార్లు మరియు స్మార్ట్ కాలర్స్ (IoT Sensors & Smart Collars)
    రైతు ప్రతి నిమిషం పశువును గమనించడం సాధ్యం కాదు. దీనికోసం ఇప్పుడు స్మార్ట్ నెక్ కాలర్స్ (Smart Neck Collars) లేదా కాలి పట్టీలు (Pedometer) అందుబాటులోకి వచ్చాయి.
    •ఈ పరికరాలు పశువుల కదలికలను, శరీర ఉష్ణోగ్రతను మరియు అవి నెమరు వేసే సమయాన్ని నిరంతరం పర్యవేక్షిస్తాయి.
    •పశువు ఎదకు వచ్చినప్పుడు దాని శరీరంలో వచ్చే మార్పులను బట్టి, ఇది రైతు మొబైల్ ఫోన్‌కు “ఎద అలర్ట్” (Heat Alert) మెసేజ్ పంపుతుంది. దీనివల్ల మూగ ఎదను కూడా 100% ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు.
  2. సెక్స్డ్ సార్టెడ్ వీర్యం (Sexed Sorted Semen Technology)
    ఈ సాంకేతికత పాడి పరిశ్రమలో ఒక పెద్ద విప్లవం. సాధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ (AI) చేస్తే పెయ్య దూడ లేదా మగ దూడ పుట్టే అవకాశం 50:50 ఉంటుంది.
    •కానీ ‘సెక్స్డ్ సెమెన్’ సాంకేతికత ద్వారా కేవలం ఆడ దూడలను పుట్టించే X-క్రోమోజోమ్ కలిగిన కణాలను మాత్రమే వేరు చేస్తారు.
    •దీనిని ఉపయోగించడం వల్ల 90% పైగా కేవలం పెయ్య దూడలు (Female Calves) మాత్రమే పుడతాయి. దీనివల్ల మగ దూడల సంఖ్య తగ్గి, పాడి రైతుకు మేలు జరుగుతుంది.
  3. ఐవిఎఫ్ మరియు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (IVF & Embryo Transfer Technology – ETT)
    ఉత్తమ జాతి ఆవు లేదా గేదె నుండి ఎక్కువ దూడలను పెంపొందించడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.
    •ఒక అత్యధిక పాల దిగుబడి ఇచ్చే ఆవు నుండి అండాలను సేకరించి, ప్రయోగశాలలో ఫలదీకరణం (IVF) జరిపి పిండాలను (Embryos) తయారు చేస్తారు.
    •ఈ పిండాలను తక్కువ పాల దిగుబడి ఇచ్చే సాధారణ ఆవుల (Surrogate mothers) గర్భాశయంలో ప్రవేశపెడతారు. దీనివల్ల ఒకే ఉత్తమ జాతి పశువు నుండి ఏడాదికి 10-15 గరిష్ట నాణ్యత గల దూడలను పొందవచ్చు.

4.హార్మోన్ల వినియోగం మరియు ముగింపు, స్థిర సమయ కృత్రిమ గర్భధారణ (Fixed Time AI – FTAI)
చాలా కాలం పాటు ఎదకు రాని పశువుల కోసం హార్మోన్ల చికిత్స (Synchronization Protocols) ఉపయోగపడుతుంది.
•ప్రొజెస్టెరాన్, జిఎన్ఆర్ హెచ్ (GnRH), పిజిఎఫ్2ఆల్ఫా (PGF2α) వంటి హార్మోన్లను నిర్ణీత రోజుల్లో పశువుకు ఇంజెక్ట్ చేయడం ద్వారా, అవి ఒకే సమయంలో ఎదకు వచ్చేలా చేస్తారు.
•దీనివల్ల ఎద లక్షణాలు స్పష్టంగా కనిపించకపోయినా, నిర్ణీత సమయానికి (Fixed Time) కృత్రిమ గర్భధారణ చేసి పశువు గర్భం దాల్చేలా చేయవచ్చు.

  1. గర్భ నిర్ధారణ పరీక్షల్లో ఆధునికత (Early Pregnancy Diagnosis)
    సాధారణంగా పశువు గర్భం దాల్చిందో లేదో తెలియడానికి 3 నెలలు పడుతుంది. కానీ ఇప్పుడు:
    •అల్ట్రాసౌండ్ స్కాన్ (Ultrasonography): కృత్రిమ గర్భధారణ చేసిన 28 నుండి 30 రోజుల్లోనే గర్భాన్ని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు.
    •రక్త/పాల పరీక్షలు (PAG Testing): పశువుల రక్తం లేదా పాలలో ఉండే ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ గ్లైకోప్రోటీన్స్ (PAG) ఆధారంగా 28 రోజుల్లోనే గర్భాన్ని గుర్తించే కిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ పశువు కట్టకపోతే, వెంటనే దానికి మళ్లీ చికిత్స చేసి త్వరగా ఎదకు తీసుకురావచ్చు.

ముగింపు (Conclusion)
ఆవులు మరియు గేదెల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం అనేది కేవలం ఒక పద్ధతిపై ఆధారపడి ఉండదు. సరైన సమతుల్య ఆహారం, మెరుగైన కొట్టాల యాజమాన్యంతో పాటు స్మార్ట్ కాలర్స్, సెక్స్డ్ సెమెన్, ఐవిఎఫ్ వంటి ఆధునిక సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవడం ద్వారా పశువుల పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి, పొదుగు రోగాలు మరియు గర్భకోశ వ్యాధులు తగ్గి, పాడి పరిశ్రమ లాభసాటిగా మారుతుంది.

రచయిత: డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), Ph: 8121451017కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

ఔషధ మొక్క… మచ్చల కలబంద

సాధారణ నామం : స్పాటెడ్అలో శాస్త్రీయ నామం : అలో జెబ్రినా కుటుంబం: ఆస్ఫోడిలేసి

అలో జెబ్రినా చిన్న, దట్టమైన, నీటిని నిల్వ ఉంచుకునే భాగాలున్న ఆకులు కలిగిన మొక్క. ఈ మొక్కలు నీటిని కాండాలు, ఆకులు, వేర్లలో నిల్వ ఉంచుకుని వర్షాభావ పరిస్థితులలో నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. ఆకులు దట్టంగా గుబురుగా ఏర్పడి సాధారణంగా ఆకుపచ్చ రంగులో పెద్ద అండాకారపు తెల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. ఆకుల అంచులు బలమైన గోధుమ రంగు మొనలు గల ముళ్ళు కలిగి ఉంటాయి. ఆకుల చివర్లు ముదురు ఎరుపు నుండి గోధుమ రంగు కలిగి ఉంటాయి. పూలు లేత ఎరుపు రంగులో గొట్టపు ఆకారంలో వుంటాయి.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • బోట్స్వానాలో దీనిని బుట్టల తయారీలో ఉపయోగిస్తారు.
  • అంగోలాలో కునీన్ నది పొడవునా ఉన్న ప్రజలు అలో జెబ్రినా పూలను ఉడికించి కేకులు తయారు చేస్తారు.
  • మహిళలు ప్రసవం తరువాత కాండం, ఆకు మొదళ్ళ పొడిని లోపలికి తీసుకుంటారు. దీని రసాన్ని గాయాలను మాన్పడానికి, చర్మ సమస్యలకు, నులి పురుగుల నివారణకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • ప్రత్తి పంటలో నష్టాలు కలిగించే పేనుబంక, ఎఫిస్ గాసిపిని అలో జెబ్రినా 20% ద్రావణం వికర్షక, కాంటాక్ట్ చర్యలతో సమర్ధవంతంగా అరికట్టింది (రంగరిరాజ్, అతని అనుచరులు, 2016). ఆకు ద్రావణం తయారు చేయడానికి ఆకులను సేకరించి 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఓవెన్‌లో 5 రోజులు ఆరబెట్టాలి. తర్వాత ఆరిన ఆకులను రోటిలో వేసి బండతో దంచాలి. మెత్తగా దంచిన పొడిని 1000 మి.లీ. బీకర్లో వేయాలి. ఈ పొడిని గాలి చొరబడని జార్‌లో నిల్వ చేయాలి. 400 గ్రా. పొడిని 3 లీ. గాజు ఫ్లాస్క్‌లో తీసుకుని 2 లీ. డిస్టిల్డ్ వాటర్ కలపాలి. ఈ ద్రావణాన్ని చేతిలో 1 గంట సేపు కుదుపుతూ, తర్వాత 24 గంటలుంచాలి. 24 గంటల తర్వాత ద్రావణాన్ని గుడ్డతో వడపోసి తర్వాత వాట్‌మన్ నెం. 24 ఫిల్టర్ పేపర్‌తో వడపోయాలి. ఈ ద్రావణాన్ని 2 లీ. కోనికల్ ఫ్లాస్క్‌లో సేకరించాలి. 20% ద్రావణం తయారు చేయడానికి 200 మి.లీ. స్టాకు ద్రావణాన్ని 800 మి.లీ. శుభ్రమైన నీటికి కలపాలి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం

     గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తోంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనాధారంలో పశుపోషణకు ముఖ్యమైన స్థానం ఉంది. వ్యవసాయంతో పాటు పశువులను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో పశుపోషణ సంప్రదాయ పద్ధతులపై ఆధారపడగా, ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ యాప్‌లు, ఆన్‌లైన్ సేవలు వంటి సాంకేతిక సాధనాలు రైతులకు పశువుల సంరక్షణ, ఆరోగ్య నిర్వహణ, మార్కెటింగ్ మరియు ఆర్థిక లావాదేవీలలో సహాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం రైతుల జీవితాలను సులభతరం చేస్తూ, వారి ఆదాయాన్ని పెంచే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది.

పశువులకు డిజిటల్ గుర్తింపు (RFID ట్యాగింగ్):
ప్రతి పశువు చెవికి ప్రత్యేకమైన డిజిటల్ కోడ్ కలిగిన ట్యాగ్‌ను (RFID – Radio Frequency Identification) అమర్చుతున్నారు. దీని ద్వారా పశువు పుట్టిన తేదీ, యజమాని వివరాలు, ఇచ్చిన టీకాలు, మరియు ఆరోగ్య చరిత్రను కేంద్ర ప్రభుత్వ నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (NDLM) డేటాబేస్ లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇది పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి మరియు నకిలీ పశువులను గుర్తించడానికి సహాయపడుతుంది.

పశువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ- డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో పశువుల ఆరోగ్య పర్యవేక్షణ ఒకటి.

  • ప్రస్తుతం పశువులకు స్మార్ట్ కాలర్లు లేదా చెవులకు అమర్చే సెన్సర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పశువుల శరీర ఉష్ణోగ్రత, కదలికలు, ఆహారం తీసుకునే విధానం వంటి విషయాలను నిరంతరం గమనిస్తాయి.
  • పశువులో ఏదైనా అసాధారణ లక్షణం కనిపిస్తే వెంటనే రైతు మొబైల్‌కు సమాచారం చేరుతుంది. దీంతో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చు. ఫలితంగా పశువుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి.
  • మన దేశంలో కొన్ని AI ఆధారిత వ్యవస్థలు మాస్టైటిస్, లంపీ స్కిన్ డిసీజ్ వంటి వ్యాధులను కూడా ముందుగానే గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

పాల ఉత్పత్తి మరియు విక్రయాలలో డిజిటలైజేషన్:
పాల సేకరణ కేంద్రాలలో ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్’ (AMCU) వచ్చాయి. వీటి ద్వారా పాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో నాణ్యత (ఫ్యాట్ శాతం) ఎంత ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ కావడం వల్ల పారదర్శకత పెరుగుతుంది.

  • డిజిటల్ పరికరాలు పశువుల ఉత్పాదకతను కూడా పెంచుతున్నాయి. పశువులు ఎంత మేత తింటున్నాయి, ఎప్పుడు మేత ఇవ్వాలి, సంతానోత్పత్తికి సరైన సమయం ఎప్పుడు అనే విషయాలను ఇవి గుర్తించగలవు. అలాగే పాల ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కూడా విశ్లేషించగలవు.
  • దీంతో ప్రతి పశువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సాధ్యమవుతుంది. ఫలితంగా పాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతోంది.

కృత్రిమ గర్భధారణ (AI) మరియు సంతానోత్పత్తి యాప్‌లు:
పశువుల ఈత సమయం, ఎదకు వచ్చే సమయం కచ్చితంగా తెలిస్తేనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. దీని కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు వచ్చాయి. ఇవి పశువుల ఆరోగ్య చక్రంను పర్యవేక్షించి, రైతులకు సరైన సమయానికి సూచనలు పంపుతాయి.

రైతుల చేతిలో స్మార్ట్‌ఫోన్ శక్తి- నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ రైతులకు ఒక ముఖ్యమైన సాధనంగా మారింది.
మొబైల్ యాప్‌ల ద్వారా రైతులు పశువైద్యుల సలహాలు పొందవచ్చు. టెలీమెడిసిన్ సేవలను ఉపయోగించవచ్చు. వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. వ్యాధులపై హెచ్చరికలు పొందవచ్చు. మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు. అలాగే పశువులు లేదా పాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. టీకాలు వేయాల్సిన తేదీలు, మందులు ఇవ్వాల్సిన సమయాల గురించి కూడా యాప్‌లు గుర్తు చేస్తాయి.

వ్యాధుల నియంత్రణలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర
పశువుల ప్రవర్తనలో ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే డిజిటల్ పరికరాలు వెంటనే హెచ్చరికలు పంపిస్తాయి. దీంతో వ్యాధులు ఎక్కువగా వ్యాపించకముందే అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పశువుల మరణాలు తగ్గడమే కాకుండా రైతులు ఆర్థిక నష్టాల నుంచి కూడా రక్షించబడతారు.

పశువైద్య సేవలు – ఈ-సంజీవని:
దూర ప్రాంతాల్లోని రైతులకు పశువైద్యుల సలహాలు, సూచనలు అందించడానికి టెలి-మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు, స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో కాల్స్ చేసి వ్యాధులను నిర్ధారించి, చికిత్స అందించవచ్చు.

మార్కెట్ అవకాశాల విస్తరణ- డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్రయించే అవకాశం పొందుతున్నారు.
దీంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తులకు సరైన ధర లభిస్తుంది. మార్కెట్ సమాచారం సులభంగా అందుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే డిజిటల్ చెల్లింపుల వల్ల డబ్బు లావాదేవీలు మరింత సురక్షితంగా, వేగంగా జరుగుతున్నాయి.

పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు
డిజిటల్ టెక్నాలజీ వినియోగం వల్ల యాంటీబయాటిక్స్ అవసరానికి మించి వాడాల్సిన అవసరం తగ్గుతుంది. నీరు, మేత వంటి వనరుల వృథా తగ్గుతుంది. పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గుతుంది. దీంతో అందుబాటులో ఉన్న వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు
అయితే ఈ మార్పుల మధ్య కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోవడం. డిజిటల్ పరిజ్ఞానం కొంతమందికి తక్కువగా ఉండటం. ఆధునిక పరికరాల ధరలు ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రైతులందరూ ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగించలేకపోతున్నారు.
అందుకే రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి.

ముగింపు
డిజిటల్ టెక్నాలజీ సంప్రదాయ పశుపోషణ పద్ధతులను తొలగించడం లేదు. వాటిని మరింత మెరుగుపరుస్తోంది. రైతుల అనుభవానికి ఆధునిక సాంకేతికత తోడవడంతో పశుపోషణ మరింత సులభంగా, సమర్థవంతంగా మారుతోంది. ఆరోగ్యకరమైన పశువులు, అధిక ఆదాయం, బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో పశుపోషణలో డిజిటల్ సాధనాలు కూడా భూమి, నీరు, మేతల మాదిరిగానే అవసరమైనవిగా మారనున్నాయి.
ఈ డిజిటల్ విప్లవం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం వల్ల పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయి. యువత కూడా ఈ ఆధునిక పశుపోషణ పట్ల ఆసక్తి చూపుతున్నారు.

డా. బద్దం అఖిల (ఎం.వి.ఎస్‌సి.),
డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. Ph: 9703121088

Read More

ఔషధ మొక్క… కలబంద

కలబంద ఒక గుత్తి వలే పత్రాలు వచ్చే బహువార్షిక మొక్క. దాదాపు 60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు జిగటగా ఉన్న గుజ్ౙు కలిగి, అంచులకు ముండ్ల వంటి దంతాలుంటాయి. ఆకులు 50 సెం.మీ. వరకు పెరిగి చాకుల వలె ఉంటాయి. పూవులు నారింజ పసుపు రంగులో ఒక మీటరు పొడవు గల కాడపై గొట్టాల వలే వ్రేలాడబడి ఉంటాయి. ఈ మొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన వనాలలోను, పొలంగట్ల పైన పెంచబడుతుంది. ఇది వేరు పిలకల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : ఇండియన్ అలో / బార్బడోనఅలో / ఘికుమార్/ఘ్రిత్‌కుమారి శాస్త్రీయ నామం: అలో బార్బడెన్స్ / అలో విర కుటుంబం: లిలియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు, ఆకులలో వుండే గుజ్జు, పసుపు రంగు ద్రవం (మూసాంబ్రం) కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
  • వీటిలో ఆంత్రాక్వినోన్లు (అలాయిన్, అలోఎమోడిన్), రెసిన్లు, టానిన్లు, పాలిశాకరైడ్లు, మొదలైన రసాయన పదార్థాలుంటాయి. కలబంద ఆకు చలవ చేస్తుంది. నేత్ర రోగాల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.
  • దీని నుండి తీసిన గుజ్ౙుని మరియు పసుపు రంగు ద్రవాన్ని ఎండబెడితే మూసాంబ్రం అనే పదార్థం తయారవుతుంది. ఇది నొప్పులను, వాపులను, కుష్టువ్యాధి, మూలశంక, మానసిక వ్యాధులు, చర్మవ్యాధులు, కాలేయ వ్యాధులు, ఋతుసంబంధ వ్యాధుల చికిత్సకు, రక్తవిరేచనాలు అరికట్టడానికి ఉపయోగపడుతుంది.
  • తెగిన గాయాలకు, వడదెబ్బకి ప్రాధమిక చికిత్సగా బాగా పనిచేస్తుంది. కలబంద ఆకులలో ఉండే గుజ్ౙు సౌందర్య సాధనాల తయారీలో ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
  • చంటి పిల్లల కడుపులో క్రిముల నివారణకు, విరేచనకారిగా కూడా ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • కలబంద చెదల వికర్షకంగా పని చేస్తుంది. కలబంద నీటి ద్రావణం చెదలను వికర్షిస్తుంది.
  • కలబందలో సహజ అలాయిన్ అనే రసాయనముంది. అందువలన కలబందను ఎటువంటి పురుగులు, తెగుళ్ళు ఆశించవు (పంత్, 2016). దీనిని జీవ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు.
  • కలబంద ద్రావణంలోని అలోయిన్ ఎ (0.02%) మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెపై బలమైన వికర్షక చర్యను ప్రదర్శించింది (మల్లావధాని, అతని అనుచరులు, 2016).
  • కలబంద ఒక శక్తివంతమైన మొక్కల పెరుగుదల కారకం. కలబంద బయట పొరలో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్ మిశ్రమాలు “అలాయిన్స” వుంటాయి. అలాయిన్ వాల్లబీస్, కంగారూలు, ఎలుకలు, పంటలను తినకుండా వికర్షిస్తుంది.
  • కలబంద క్రూడ్ ద్రావణం ఈగల లార్వాలను సమర్ధవంతంగా నివారిస్తుంది (జెసిఖ, 2012)
  • కలబంద ద్రావణం వగరు రుచి కలిగి ఉండటం వలన పురుగులను వికర్షిస్తుంది కాని చంపదు (మెలెస్, అతని అనుచరులు, 2012).
  • కలబంద గుజ్ౙు (జెల్) డ్రెష్లరా హవాయిఎన్సిస్, ఆల్టర్టేరియా ఆల్టర్నేట శిలీంద్రపెరుగుదలను పూర్తిగా అరికడుతుంది (సితార, ఆమె అనుచరులు, 2011).
  • 4 కి. కలబంద { 500 మి.లీ. వేపనూనె { 500 మి.లీ. పొగాకు పొడి కషాయం 20 లీ. నీటికి కలిపి 3 నుండి 4 గంటలు మరగబెట్టాలి. కుండలో నీరు 5 లీ. మిగిలినపుడు చల్లార్చి, వడపోయాలి. ఈ కషాయాన్ని ప్రత్తి, బెండ మొదలగు పంటలపై పిచికారి చేసి పొగాకులద్దె పురుగు, శనగపచ్చ పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ జీవ పురుగు మందుకి “నీకుంచి (వేప{కలబంద{పొగాకు పొడి డికాక్షన్)” అని పేరు పెట్టారు. 100 నుండి 150 మి.లీ. కషాయాన్ని 15 లీ. నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. 10 రోజుల తర్వాత ఇంకొకసారి పిచికారి చేయాలి. (రజనీకాంత్ భాయ్ పటేల్, గుజరాత్ రైతు, 2001).
  • అలో ఫెరాక్స్‌ని పంటల చుట్టూ జీవకంచెగా నాటితే పంటలనాశించే పురుగులను వికర్షిస్తుంది.
  • అలో మార్లోతి ఆకుబూడిద (5%)ని మొక్కజొన్న లేదా అలసంద గింజలపై చల్లి నిల్వ సమయంలో ఆశించే పురుగులను వికర్షింపవచ్చు.
  • 5 కి. కలబందను ముక్కలుగా చేసి 1 కి. పొగాకు పొడి కలిపి 3 లీ. నీటిలో కలిపి మరిగించి చల్లార్చి, వడపోసి 2 లీ. పుల్లటి మజ్ౙిగ కలిపి 100 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇది జీవ పురుగు వికర్షిణిగా పనిచేస్తుంది.

ఐ.పి.యం రెసిపి1 :

  • 4.5 లీ. నీరు, 1 చెంచా వేపనూనె, 12 చెంచాలు 78% పొటాషియం సిలికేట్ ద్రావణం, 15-30 మి.లీ. యూకలిప్టస్/ జింజర్/ లెమన్‌గ్రాస్/ థైమ్/ క్లోవ్/సిన్నమోన్/పెప్పర్‌మింట్, 1/4 కప్పు అలోవిరా రసం
  • వేపనూనె నీటిలో కరగడానికి 12 చెంచాల పొటాషియం సిలికేట్ ద్రావణం కలపాలి. ఈ మిశ్రమాన్ని వారానికొకసారి పిచికారి చేసి పురుగులను నివారించవచ్చు. వారం వారం ఎసెన్షియల్ మార్చి వాడాలి.

ఐ.పి.యం. రెసిపి2 :

  • 4.5లీ. నీటిలో 2 చెంచాల కలబంద గుజ్ౙు కలిపి 24 గంటలుంచాలి. తర్వాత వడపోసి పిచికారి చేయాలి.
  • ఈ రెసిపీలలో నీటికి బదులు ‘బొటానికల్ టీ’ని కూడా ఉపయోగించవచ్చు. ఈ టీని తయారు చేయడానికి లావెండర్, స్పియర్‌మింట్, పెప్పర్‌మింట్, ఒరిగానో, థైమ్, బోరేజ్, కామ్‌ఫ్రీ, యారో తాజా ఆకులను (2 కప్పులు) నూరి లీ. నీటిలో కలిపి 23 రోజులుంచాలి. మధ్యమధ్య ఈ ద్రావణాన్ని కలుపుతుండాలి. తర్వాత వడపోసి పై రెసిపిలను తయారు చేయడానికి నీటికి బదులు దీనిని ఉపయోగించాలి.
  • కలబంద ద్రావణం కోత అనంతరం పండ్లను ఆశించి కుళ్ళజేయు పెనిసిలియం డిజిటేటం, పెనిసిలియం ఎక్స్‌పాన్సమ్, బోట్రైటిస్ సినరియా, ఆల్టర్నేరియా ఆల్టర్నేటపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (బార్కాయ్‌గోలన్, 2001)
  • పురుగులు, తెగుళ్ళ నివారణకు కలబందనుపయోగించి హెర్బల్ టీ తయారు చేసి ఉపయోగించవచ్చు.

తయారీకి కావలసిన పదార్థాలు : 200 లీ. ప్లాస్టిక్ డ్రమ;్ గ్రైండర్ / చాపర్, రోలు, పత్రం; స్ట్రెనర్ / స్క్రీన్ / గుడ్డ; కొయ్యకర్ర; తాజా శుభ్రమైన నీరు;

మొక్కల పదార్థాలు : 10 కి. అల్లం, 5 కి. వెల్లుల్లి, 5 కి. కలబంద, 10 కి. మిర్చి, 30 కి. వేపఆకులు, 30 కి. కోకోఆకులు, 5 కి. డెర్రిస్, 5 కి. మకాబుహే, కీటకనాశన, శిలీంద్రనాశక వికర్షణ లక్షణాలున్న ఇతర మొక్కలు.
పైన పేర్కొన్న ఆకులను విడివిడిగా నూరాలి.

తయారు చేసే విధానం : నూరిన ఆకులను ప్లాస్టిక్ డ్రమ్ములో వేయాలి. డ్రమ్ములో నీరు నింపాలి. డ్రమ్ములోని పదార్థాలన్నింటినీ కర్రతో కలియత్రిప్పాలి.

హెర్బల్‌టీ తయారవడానికి ఒకరోజు నిల్వఉంచాలి. డ్రమ్‌లోని హెర్బల్ టీని వడపోయాలి. హెర్బల్‌టీకి సమానంగా నీరు కలపాలి. స్ప్రేయర్‌లో నింపి పంటపై పిచికారి చేయాలి. మొక్కలపైన పిచికారి చేయాలి. మొక్కల మొదళ్ళలో డ్రెంచింగ్ చేయాలి. అవసరాన్ని బట్టి 3 లేదా 7 రోజుల కొకసారి మొక్కలపై పిచికారి చేయాలి. క్యాబేజిలో డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాని వేపగింజ పప్పు (నీమ్ సీడ్‌కెర్నల్) + కలబంద+జిల్లేడు+క్లీరోడెండ్రాన్ ఆకు ద్రావణం మరియు వేపకాయలు+ ఎర్రమిరప+సీతాఫలం ఆకు ద్రావణం సమర్థవంతంగా నివారించాయి. (చంద్రశేఖరయ్య అండ్ సన్నవీరప్పనవర్, 2013).

ప్రత్తి, చామంతి పంటలలో పురుగుల నివారణకు కానుగ{కలబంద{వేప ద్రావణం పిచికారి చేయాలి. దీని తయారీకి 1కి. కానుగ చెక్కపొడి, 1 కి. వేప చెక్క పొడి, 250 గ్రా. విషముష్టి గింజలను ఒక మస్లిన్ సంచిలో వేసి ఒక రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మర్నాడు ఉదయం సంచిని పిండి రసాన్ని సేకరించాలి. దీనిని అరలీటరు కలబంద ఆకు రసంతో కలపాలి. దీనికి 15 లీ. నీరు కలపాలి. దీనిని మరలా 23 లీ. ఆవుమూత్రంతో కలపాలి. పిచికారి చేసేముందు 1 లీ. మిశ్రమాన్ని 10 లీ. నీటిలో కలపాలి. ఎకరానికి 60-100 లీ. పిచికారి ద్రావణాన్ని ఉపయోగించాలి (శాయికట్‌మన్నా)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More