సీటొస్తే… కొలువు గ్యారంటీ!
15 ఏళ్లుగా వంద శాతం ప్రాంగణ నియామకాలు
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సేవలకూ అవకాశం
‘నార్మ్’లో పీజీడిప్లొమా కోర్సు
ఇక్కడ సీటొస్తే చాలు.. మంచి వేతనాలతో ఉద్యోగం లభిస్తోంది. కోర్సులో చేరిన విద్యార్థులు కూడా శతశాతం ఉత్తీర్ణత సాధిస్తుంటారు. ఇదీ హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్) ఘనత. ఇక్కడ పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ - అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ (పీజీడీఎం-ఏబీఎం) కోర్సును పూర్తిచేసినవారు 100% ఉద్యోగాలు పొందుతున్నారు. రెండేళ్ల కోర్సులో మొదటి సంవత్సరం పూర్తవగానే విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు ప్రారంభమవుతున్నాయి. ఏఐసీటీఈతో పాటు 'న్యాక్' గుర్తింపుపొందిన ఈ వ్యవసాయ అనుబంధ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది.
వ్యవసాయ పరిశోధనలో మేటిగా…
భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్)కి అనుబంధంగా వ్యవసాయ పరిశోధన విద్యా నిర్వహణకు సంబంధించి 1976లో నార్మ్ ఏర్పాటయింది. వ్యవసాయ పరిశోధనలో జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడం.. మెరుగైన సలహాలను అందించడంతో పాటు రైతులు, శాస్త్రవేత్తలతో సహా వివిధ వాటాదారులకు పేటెంట్లు వంటివి లభించేందుకు నార్మ్ కృషి చేస్తోంది. వ్యవసాయ, అనుబంధ రంగాలతో పారిశ్రామిక, వ్యాపార రంగాల అధ్యయనాలను సమ్మిళితం చేసి సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడేలా 2009లో పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును ప్రారంభించింది. 2019 వరకు ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లామా ఇన్ మేనేజ్మెంట్ అగ్రికల్చర్ (పీజీడీఎంఏ) పేరిట ఉండేది. 2020 నుంచి దాన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ – అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ (పీజీడీఎం-ఏబీఎం)గా నిర్వహిస్తున్నారు.
ప్రతిభావంతులకు పట్టం…
బీఎస్సీ వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య, మత్స్య నాలుగేళ్ళ కోర్సులు ఉత్తీర్ణులైన వారు క్యాట్, సీమాట్ పరీక్షలు రాయాలి. అర్హత సాధించినవారు నార్మ్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటారు. పీజీడీఎం-ఎంబీఎంలో 60 సీట్లు ఉండగా… ఏటా వెయ్యిమందికి పైగా దరఖాస్తు చేస్తున్నారు. ఆయా అభ్యర్థులకు ఎనలిటికల్ రైటింగ్స్కిల్స్ టెస్ట్, బృందచర్చలు, మౌఖిక పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికే ప్రవేశాలు కల్పిస్తారు. కేంద్రీయ విద్యాసంస్థల మాదిరే రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ప్రవేశాలు పొందినవారికి ఒక్కో విద్యార్థికి ఒక్కో గది చొప్పున హాస్టల్ వసతి ఉంటుంది. విశాలమైన తరగతి గదులుంటాయి. జాతీయ అంతర్జాతీయ వ్యవసాయ, వాణిజ్య ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులం ఉంటుంది. బోధకుల్లో 70% మంది శాస్త్రవేత్తలు, నిపుణులు ఉండగా.. 30% మంది పారిశ్రామికరంగం నుంచి వచ్చి బోధన చేస్తారు. విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠాలతో పాటు అసైన్మెంట్లు, కేస్ స్టడీస్, ముఖాముఖి చర్చలు, పారిశ్రామిక ప్రముఖులతో భేటీలు, క్షేత్రస్థాయి పరిశీలనలు వంటివి ఉంటాయి. సెమినార్లు, వర్క్షాపులు, సింపోజియాలలోనూ పాల్గొంటారు. వారికి కార్పొరేట్ కంపెనీల కోసం కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు అవకాశం కల్పిస్తారు. రెండేళ్ళ కోర్సులో ఆరు ట్రిమిస్టర్లు ఉంటాయి. ఫైనాన్స్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్, ఇంటర్న్షిప్, ప్రజెంటేషన్ స్కిల్స్, సప్లైచెయిన్, రాజకీయ, ఆర్థిక తరగతులు వంటివి ఇందులో భాగంగా ఉంటాయి.
- మూడో ట్రిమిస్టర్ నుంచే కంపెనీలు నార్మ్కు వచ్చి విద్యార్థులను ఇంటర్న్షిప్కి ఎంపిక చేసుకుంటున్నాయి. ఐదో ట్రిమిస్టర్ లోనూ మళ్లీ కంపెనీలు వచ్చి ఇంటర్న్షిప్ ఇస్తున్నాయి. అది పూర్తయిన వెంటనే ప్రాంగణ నియామకాలు మొదలవుతున్నాయి. విద్యార్థలకు శిక్షణ ఇచ్చిన కంపెనీలే సగానికి పైగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తుండగా.. మిగిలినవారిని ఇతర కంపెనీలు ఎంపిక చేస్తున్నాయి.
- వ్యవసాయ, విత్తన, ఎరువులు, పురుగు మందులు, పశువైద్య, మత్స్య, జీవశాస్త్ర, బ్యాంకింగ్ ఆర్థిక, బీమా, వాణిజ్య సంస్థలు, గృహోపకరణాలు, అగ్రిటెక్ తదితర రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇంతవరకు నియమితులైనవారికి సగటున రూ. 10.7 లక్షల ప్యాకేజీ ఉంది. గత ఏడాది అత్యధికంగా రూ. 15 లక్షల ప్యాకేజీ వచ్చింది. నార్మ్లో ప్రవేశాలు పొందుతున్న విద్యార్థులో 50% మేరకు అమ్మాయిలు ఉంటున్నారు.
సీట్ల సంఖ్య రెట్టింపునకు యోచన
‘మా విద్యార్థులు మెరికలు. 15 ఏళ్లుగా ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం పొందారు. ఈ కోర్సుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా సీట్ల సంఖ్యకు 120కి పెంచాలని ఆలోచిస్తున్నాం’ అని నార్మ్ ప్రాంగణ నియామకాల సమన్వయకర్త గణేశ్కుమార్ తెలిపారు. ‘ఈ కోర్సులో చేరిన వారు 15 ఏళ్ళుగా వంథాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. క్రమశిక్షణతో పాటు పర్యావరణ హితమైన వాతావరణంలో తరగతులు సాగుతున్నాయి. ఉద్యోగాలు పొందిన వారు వ్యవసాయ రంగానికి గణనీయమైన సేవలందిస్తున్నారు’ అని చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అనీజా తెలిపారు.










