వర్షాకాల ఒత్తిడి పాల దిగుబడిపై ఎలా ప్రభావం చూపుతుంది. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

భారతదేశంలో పాడి పరిశ్రమ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరులలో ఒకటి. చిన్న, సన్నకారు రైతుల నుంచి పెద్ద స్థాయి డెయిరీ రైతుల వరకు లక్షలాది కుటుంబాలు పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అయితే పశువుల నుంచి అధిక పాల దిగుబడి పొందాలంటే వాటి ఆరోగ్యం, పోషణ, నివాస వాతావరణం మరియు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వేసవి కాలంలో ఉష్ణోగ్రతల ప్రభావం గురించి రైతులకు బాగా అవగాహన ఉంటుంది. కానీ వర్షాకాలంలో కూడా పశువులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని చాలా మంది రైతులు గుర్తించరు. అధిక తేమ, బురద, నీటి నిల్వలు, తక్కువ సూర్యకాంతి, మేత నాణ్యతలో మార్పులు మరియు వ్యాధుల వ్యాప్తి వంటి అంశాలు పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా పాల ఉత్పత్తి తగ్గడం, పునరుత్పత్తి సమస్యలు పెరగడం, చికిత్స ఖర్చులు అధికమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

వర్షాకాలంలో పాల దిగుబడి ఎందుకు తగ్గుతుంది?

  1. అధిక తేమ ప్రభావం
    వర్షాకాలంలో గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పశువులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి చెమట ద్వారా వేడిని బయటకు పంపుతాయి. కానీ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆవిరైపోవడం కష్టమవుతుంది. దీంతో శరీరంలో వేడి నిల్వ ఉంటుంది, శక్తి వినియోగం పెరుగుతుంది, ఆకలి తగ్గుతుంది మరియు పాల ఉత్పత్తి తగ్గుతుంది. అధిక తేమ ఉన్న రోజుల్లో పాల దిగుబడి 5–15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
  2. మేత వినియోగం తగ్గడం
    పాల ఉత్పత్తికి అవసరమైన శక్తి ప్రధానంగా మేత ద్వారా లభిస్తుంది. వర్షాకాలంలో పశువులు తక్కువ మేత తింటాయి, ఆకలి తగ్గుతుంది మరియు మేత నాణ్యత మారుతుంది. పశువు తినే ఆహారం తగ్గితే పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.
  3. తడి మరియు బురద వాతావరణం
    బురదతో కూడిన ప్రదేశాల్లో పశువులు నడవడానికి ఇబ్బంది పడతాయి. దీంతో ఎక్కువ శక్తి ఖర్చవుతుంది, ఒత్తిడి పెరుగుతుంది మరియు విశ్రాంతి తగ్గుతుంది. విశ్రాంతి సరిగా లేకపోతే పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.
  4. వ్యాధుల పెరుగుదల
    వర్షాకాలం అనేక వ్యాధులకు అనుకూలమైన కాలం. ప్రధానంగా పొదుగు వాపు వ్యాధి, కాలిపుండ్ల వ్యాధి (Foot Rot), జ్వరాలు, చర్మ వ్యాధులు మరియు పరాన్నజీవుల సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన పశువు పాల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది.
  5. పొదుగు వాపు వ్యాధి ప్రభావం
    వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే సమస్య పొదుగు వాపు వ్యాధి. పొదుగు వాపు వ్యాధి వల్ల పాలు తగ్గుతాయి, పాల నాణ్యత పడిపోతుంది పొదుగు వాపు వ్యాధి మరియు చికిత్స ఖర్చు పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పాల ఉత్పత్తి 30 శాతం వరకు తగ్గవచ్చు.
  6. పరాన్నజీవుల దాడి
    వర్షాకాలంలో పేలు, ఈగలు, పురుగులు మరియు అంతర్గత పరాన్నజీవులు వేగంగా పెరుగుతాయి. ఇవి రక్తహీనత, బలహీనత మరియు ఆకలి మందగించడం వంటి సమస్యలకు కారణమవుతాయి.
  7. కలుషితమైన మేత
    వర్షాల కారణంగా మేతలో శిలీంధ్రం (ఫంగస్/ బూజు) పెరిగే అవకాశం ఉంటుంది. ఫంగస్ కలిగిన మేత విషపూరిత పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది, జీర్ణక్రియను దెబ్బతీస్తుంది మరియు పాల దిగుబడిని తగ్గిస్తుంది.
  8. తాగునీటి సమస్య
    వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ స్వచ్ఛమైన నీరు లభించకపోవచ్చు.
    కలుషిత నీటి వల్ల కడుపు సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు మరియు ఆకలి తగ్గడం జరుగుతాయి.

వర్షాకాల ఒత్తిడి లక్షణాలు
రైతులు గమనించాల్సిన ముఖ్య లక్షణాలు:

• పాల ఉత్పత్తి తగ్గడం
• మేత తక్కువగా తినడం
• నీరసం
• ఎక్కువసేపు నిలబడటం
• బరువు తగ్గడం
• పొదుగు సమస్యలు
• జ్వరాలు
• తరచుగా వ్యాధులు రావడం

రైతులు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు

  1. షెడ్ నిర్వహణ
    వర్షాకాలంలో మంచి షెడ్ నిర్వహణ అత్యంత కీలకం. నీరు నిల్వ కాకుండా చూడాలి, డ్రైనేజీ (పారుదల) ఏర్పాటు చేయాలి, నేలను ఎత్తుగా ఉంచాలి మరియు గాలి ప్రసరణ ఉండాలి
  2. పొడి పరుపు ఏర్పాటు
    పశువులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఎప్పుడూ పొడిగా ఉండాలి. వరి పొట్టు, పొడి గడ్డి మరియు చెక్క పొట్టు ఉపయోగించవచ్చు.
  3. పరిశుభ్రత పాటించాలి
    రోజువారీగా పేడ తొలగించాలి, నేలను శుభ్రపరచాలి మరియు క్రిమిసంహారకాలు ఉపయోగించాలి
  4. పొదుగు వాపు వ్యాధి నివారణ
    పాలు పితికే ముందు పొదుగులను శుభ్రం చేయాలి మరియు పాలు పితికిన తర్వాత టీట్ డిప్పింగ్ చేయాలి. పశువుల పొదుగు పరిశుభ్రతకు మరియు మాస్టిటిస్ (పొదుగు వాపు) వ్యాధిని నివారించడానికి పాలు పితికే ముందు మరియు తరువాత పొదుగును క్రిమిసంహారక ద్రావణంలో ముంచడాన్ని టీట్ డిప్పింగ్ (Teat dipping) అంటారు.ఇది బ్యాక్టీరియాను నాశనం చేసి, పాల నాణ్యతను పెంచుతుంది。
  5. నాణ్యమైన మేత మరియు శుభ్రమైన తాగునీరు అందించాలి
    వర్షాకాలంలో సైలేజ్ (Silage), ఎండుగడ్డి మరియు సమతుల్య దాణా అందించాలి. సైలేజ్ అనేది పాడి పశువులకు పెట్టే ఒక రకమైన పచ్చటి, రసవంతమైన పశుగ్రాసం. పచ్చి మేత పుష్కలంగా లభించే సమయంలో దానిని సేకరించి, చిన్న ముక్కలుగా కత్తిరించి, గాలి చొరబడని గుంతల్లో భద్రపరుస్తారు. పశువులకు రోజుకు అనేకసార్లు నీరు ఇవ్వాలి, నీటి తొట్లను శుభ్రంగా ఉంచాలి
  6. ఖనిజ మిశ్రమాలు
    పాలిచ్చే పశువులకు కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం మరియు జింక్
    అవసరం. ఖనిజ మిశ్రమాలను క్రమం తప్పకుండా ఇవ్వాలి.
  7. పరాన్నజీవుల నియంత్రణ
    క్రమం తప్పకుండా నులిపురుగుల నివారణ (Deworming), పేలు నివారణ, ఈగల నియంత్రణ చేయాలి.
  8. టీకాలు వేయించాలి
    వర్షాకాలానికి ముందు గాలికుంటు వ్యాధి (Foot and Mouth disease), గురక వ్యాధి (Hemorrhagic Septicemia), జబ్బవాపు రోగం (Black Quarter) వంటి వ్యాధుల టీకాలు వేయించాలి.

ముగింపు
వర్షాకాలంలో అధిక తేమ, బురద, వ్యాధులు, పరాన్నజీవులు మరియు మేత నాణ్యతలో మార్పులు పశువులపై ఒత్తిడిని పెంచి పాల దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఈ ఒత్తిడిని ముందుగానే గుర్తించి సరైన నిర్వహణ చర్యలు తీసుకుంటే రైతులు నష్టాలను నివారించగలరు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే – “ఆరోగ్యకరమైన పశువు మాత్రమే అధిక పాలు ఇస్తుంది.” వర్షాకాలంలో పశువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రైతు మాత్రమే స్థిరమైన ఆదాయం మరియు అధిక పాల దిగుబడిని సాధించగలడు.

డా. అలియా తహ్సీన్, ఎం.వి.ఎస్.సి., పీహెచ్.డి
పశుసంవర్ధక ఉత్పత్తుల సాంకేతిక శాస్త్రం
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. 8885189834

Read More

ఔషధ మొక్క… ఉత్తరేణి

ఏకవార్షిక లేదా బహువార్షిక మొక్క. ఇది ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. అనేక ప్రదేశాలలో కలుపు మొక్కగా పెరుగుతుంది. ఉత్తరేణి నిలువుగా 2 మీ. ఎత్తు వరకు పెరిగే మొక్క. దీని కాండం మొదలులో కొయ్యలా తయారవుతుంది. ఆకులు చిన్నకాడలు కలిగి పైవైపు ముదురు ఆకుపచ్చ రంగులోను, క్రిందివైపు లేత ఆకుపచ్చ రంగులోను ఉంటాయి. ఆకులు గుడ్డు ఆకారంలో ఉంటాయి. పూవులు చిన్నవిగా, ఆకుపచ్చ, తెలుపు రంగులో ఉంటాయి. పూలు పెరిగిన కొద్దీ క్రిందికి వంగి కాండానికి దగ్గరగా వత్తుకుంటాయి. కాయలు పదునైన మొనలతో నారింజ రంగు నుండి ఎరుపు ఊదారంగులో ఉంటాయి.

సాధారణ నామం : చాఫ్ ఫ్లవర్ శాస్త్రీయ నామం : అకిరాంథస్ ఆస్పెర కుటుంబం: అమరాంతేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వినాయక చవితి రోజు జరిపే గణేశ వ్రత పూజలో ఉపయోగించే 21 ఆకులలోఇది ఒకటి. ఈ మొక్క రసాన్ని గోడకు వేసే సున్నంలో ఒక ముఖ్య పదార్థంగా ఉపయోగిస్తారు.
  • ఉత్తరేణి భారతీయ సంస్కృతిలో ముఖ్య స్థానాన్ని ఆక్రమించింది. దీనిని పూర్వకాలం నుండి ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
  • ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు దీనిని గర్భస్రావానికి మందుగా ఉపయోగించేవారు.
  • ఉత్తరేణిని పశువుల వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఆస్త్మా, దురదలు, హిస్టీరియా, చర్మవ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • వేర్లను క్యాన్సర్, గాల్‌బ్లాడర్‌లో రాళ్ళు ఏర్పడినప్పుడు చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • ఉత్తరేణి ఇథైల్ ఎసిటేట్ ద్రావణం వంగ పంట నాశించి తీవ్ర నష్టం కలిగించే అక్షింతల పురుగు, హెనోసెపిలాక్నా విజింటియాక్టోపంక్టేటపై అత్యధిక యాంటిఫీడెంట్, కీటకనాశక చర్యలను ప్రదర్శించింది (జయశంకర్, అతని అనుచరులు, 2013).
  • తంగేడు, గన్నేరు, ఉమ్మెత్త, ఈశ్వర వేరు, అరిస్టొలోకియా బ్రాక్టియేట, అడవి ఆముదం (జట్రోఫాకర్కాస్), వేప, ఐలాంతాస్ ఎక్సెల్సా,తుమ్మి (ల్యూకాస్ ఆస్పెరా), జిల్లేడు ముడి పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన సహజ హెర్బల్ పురుగు మందు పంటలలో పురుగులు, తెగుళ్ళను నివారిస్తుంది. ఈ హెర్బల్ మొక్కలన్నిటినీ ఎండబెట్టి పొడిచేసి ఆవుపేడ, ఆవు మూత్రంతో కలిపి 20 రోజులు పులియబెట్టాలి. 1 లీ. పులిసిన ద్రావణాన్ని 20 లీ. నీటిలో కలిపి పంటలపై పిచికారి చేయాలి. దీనినుపయోగించడం వలన మొక్కలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఉత్తరేణి ఇథైల్ అసిటేట్ ద్రావణం ఈడెస్ ఈజిప్టి, క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్ లార్వాలను అత్యధికంగా చంపింది (భగవాన్,అ తని అనుచరులు, 2008).
  • ఉత్తరేణి కాండంలోని ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ కార్నియస్ శిలీంద్ర పెరుగుదలను 300 పిపియం వద్ద అరికట్టింది (మిశ్రా, అతని అనుచరులు, 1992).
  • ఉత్తరేణి ఇథైల్ అసిటేట్ ద్రావణం ఆలుగడ్డ, వంగ పంటల ఆకులను తిని అధికంగా నష్టపరిచే హెనోస్ ఎపిలాక్న విగ్నింట యాక్టోపంక్టేటని నివారిస్తుంది (కుప్పుసామి ఎలుమలై, అతని అనుచరులు, 2014).
Read More

వివిధ పంటలపై ‘పంచగవ్య’ ప్రభావం

‘పంచ’ అంటే అయిదు. ‘గవ్య’ అంటే గోమాత నుండి లభించే పదార్థాలు. గోమాత నుండి లభించే ఐదు ఉత్పత్తులను – పాలు, పెరుగు, పేడ, మూత్రం, నెయ్యి – సరైన నిష్పత్తిలో కలిపి పులియబెడితే వచ్చే ఉత్పత్తినే “పంచగవ్య’ అంటారు. పంచగవ్య ఒక సమర్థవంతమైన సేంద్రియ ఎరువు. ఇది పురుగులకు వికర్షిణిగా పనిచేస్తుంది. పంచగవ్యపై జరిపిన అనేక అధ్యయనాలలో 3 శాతం ద్రావణం సమర్థవంతంగా మొక్కల పెరుగుదలకు, పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా కాపాడటానికి పని చేస్తుందని తేలింది. వివిధ మొక్కలకు వివిధ నిష్పత్తులతో ప్రయోగాలు చేయవచ్చని సూచించబడింది.
పంచగవ్య మొక్కల పెరుగుదలకే కాకుండా, చీడపీడలకు తట్టుకునే శక్తిని కూడా ఇస్తుంది. దీనిని అన్ని రకముల మొక్కలపై వాడుకోవచ్చు. నారుమళ్ళకు బాగా శ్రేష్ఠం.

మామిడి : ఆ అధిక ఆడ పుష్పాలతో పూత సాంద్రతను పెంచుతుంది. ఆ పండ్లు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఏర్పడతాయి. క్రమం లేకుండా లేదా సంవత్సరం విడిచి సంవత్సరం పండ్లు ఏర్పడటం ఉండదు. ఆ గది ఉష్ణోగ్రత వద్ద పండ్ల నిల్వగుణాన్ని 12 రోజులు పెంచుతుంది. ఆ పండ్ల రుచి, వాసన అద్భుతం.

జామ : అధిక టోటల్ సాల్యుబుల్ షుగర్స్ ఆ పండ్ల నిల్వ గుణం 5 రోజులు పెరుగుతుంది.

పసుపు : దిగుబడులు 22% పెరుగుతాయి. ఆ అతి పొడవాటి చిల్ల కొమ్మలు. ఆ ¢డైనేజి నష్టాన్ని తగ్గిస్తుంది. ఆ తల్లి, చిల్ల కొమ్మల నిష్పత్తిని తగ్గిస్తుంది. ఆ పురుగులు, తెగుళ్ళను తగ్గించే తూనీగ, సాలీడులను వృద్ధి చేస్తుంది. ఆ తల్లి, విత్తన కొమ్మలకు ఎక్కువ ధర లభిస్తుంది. ఆ కుర్కుమిన్ పరిమాణాన్ని పెంచుతుంది.

నిమ్మ : సంవత్సరం పొడవునా పూత ఏర్పడేలా చేస్తుంది. ఆ పండ్లు పుష్టిగా, మంచి వాసన కల్గి ఉంటాయి. ఆ నిల్వ గుణం 10 రోజులు పెరుగుతుంది.

అరటి : సాగు నీటిలో కలిపి పారించడం, పిచికారి చేయడంతోపాటు 3% ద్రావణాన్ని (100 మి.లీ.) మగపూవుని తొలగించిన తర్వాత గెల చివర పాలిథిన్ సంచిలో పోసి కట్టాలి. గెల పరిమాణం ఒకే మాదిరిగా ఉంటుంది. గెల కోత సాధారణ పంటలలో కన్నా ఒక నెల ముందే జరుగుతుందని గమనించడమైనది. గెల పైభాగంలో, అడుగు భాగంలో వున్న హస్తాల పరిమాణం ఒకే మాదిరిగా వుంటుంది.

మల్లె : అరుదైన సువాసన, పరిమళం. ఆ మొగ్గ తొలుచు పురుగు ఆశించదు. ఆ సంవత్సరం పొడవునా పూత వస్తుంది.

Read More

తేనెటీగలు – పుప్పొడి

తేనెటీగలు పుప్పొడిని సేకరించుకొనుట
తేనెటీగలు పుప్పొడిని సేకరించుకోవాలనే ప్రేరణ తేనెపట్టు అవసరం మీద ఆధారపడి ఒక క్రమబద్ధీకరణ ద్వారా జరుగుతుంది. తేనెటీగలు పొలం వెళ్ళి సేకరించే పుప్పొడి పరిమాణం మీద ఆధారపడి పట్టులో పిల్లల అభివృద్ది ఉంటుంది. పట్టులో పిల్లల ఫ్రేములు రెండింతలు చేసినట్లయితే, సేకరించే పుప్పొడి పరిమాణం ఒకరోజులో రెండితలు పెరుగుతుంది. దీనికి తోడుగా రాణి ఈగ ఎక్కువగా గ్రుడ్లు పెట్టినట్లయితే ఇది పుప్పొడి సేకరణను పెంచుతుంది. ఈ పరిణామాలన్నీ ఫిరమోనుల ద్వారా జరిగించబడుతాయని సూచిస్తుంది.

తేనెటీగలు పుప్పొడిని ఎలా సేకరించి ప్యాక్ చేసుకుంటాయి?
కూలి ఈగ ఆహారము సేకరించుకొనే సమయములో దాని శరీరమంతా పుప్పొడి రేణువులతో ధూళిలాగ నింపబడుతుంది (dusted with pollen) తరువాత తేనెటీగ తన నాలుకను చాపి ఒక చుక్క మకరందమును లేక తేనెను ఉమ్ముతుంది, ముందు కాళ్ళు ఈ మకరందము లేక తేనెతో తడపబడతాయి. ఈ ముందు కాళ్ళు తల మీద స్పర్శకముల మీద మరియు మొండెము (thorax) ఎదుట వున్న పరాగ రేణువులను బ్రష్ చేస్తాయి. మొండెము వెనుక భాగమున ఉన్న పరాగ రేణువులను మద్య కాళ్ళు (middle legs) తొలగించి వేస్తాయి (combed off) మరియు ఉదరము మీద ఉన్న పరాగ రేణువులు వెనుక కాళ్ళ (hind legs) కదలికల ద్వారా సేకరించబడతాయి. చివరికి పుప్పొడి అంతా వెనుక కాళ్ళకు బదలీ చేయబడుతుంది. మధ్య కాళ్ళు, పుప్పొడిని మలచడానికి (mold) ప్యాక్ చెయ్యడానికి (pack) మరియు పుప్పొడి గుళికలు మూత్ర పిండాకారము (kidney shape) నకు మలచబడుతుంది.

పట్టులో పుప్పొడిని నిల్వ ఉంచుట
పుప్పొడి, తేనె పట్టులోనికి రాగానే, పుప్పొడిని సేకరించిన కూలిఈగ సాధారణంగా తన వద్ద వున్న పుప్పొడి ముద్దను విడిపించుకుంటుంది (grooms herself). తరువాత సరియైన ఏ మైనపు గదిలో ఈ పుప్పొడిని వుంచవలెనో ఆ గది కొరకు వెదకుతుంది. ఈ గది ఒకవేళ ఖాళీ గది కావచ్చును. సాధారణముగా లద్దె పురుగులు ఎదిగే ప్రాంతమై యుంటుంది లేదా ఇంతకు ముందే పుప్పొడి ఉన్న గది అయి కూడ వుండవచ్చును. కూలిఈగ మైనపు గదిని ఎంచుకున్నపుడు తన ఉదరమును గదిలో పూర్తిగాను, కాళ్ళను పాక్షికముగాను ముంచి, తన మధ్య కాళ్ళనుపయోగించి రహస్యముగా (pry) తన పుప్పొడి ముద్దను గదిలో పడునట్లుగా అనుమతిస్తుంది. పుప్పొడి తిత్తిలో (pollen basket) మిగిలియున్న చిన్న చిన్న పుప్పొడి ముద్దలు ఏవైనావున్నట్లయితే వాటినికూడా గదిలో వదిలించుకుంటుంది మరియు ఇంకొక కూలిఈగ వచ్చి పుప్పొడిని గది అడుగులోనికి త్రోసి తన దంతములు మరియు ముందు కాళ్ళతో అదిమి ప్యాక్ చేయటకు వీలుగా పొలం నుండి వచ్చిన ఈగ గదిని విడిచిపెడుతుంది.వెళ్ళిన కూలి ఈగ తను తీసుకొచ్చిన పుప్పొడిని మైనపుగదిలో వుంచిన తరువాత ఇంకొక కూలి ఈగ ఉండి సాధారణముగా కొంత తేనెను ఇమ్మని కోరుతుంది. మరియు తరువాత అహారం సేకరించుటకు పొలము వెళుతుంది.

పుప్పొడికి అనుబంధమైనవి మరియు పుప్పొడికి ప్రత్యామ్నాయ పదార్ధములు (Pollen supplements and substitutes)
పుప్పొడి అనుబంధ పదార్ధము అనగా, ఏ పదార్ధమునైతే, సహజ పుప్పొడికి (natural pollen) తేనెటీగలు సేకరించిన పుప్పొడికి (bee collected pollen) కలుపుతారో దానిని పుప్పొడి అనుంధ పదార్ధమని అంటారు. పుప్పొడి ప్రత్యామ్నాయ పదార్ధము అనగా అసలు అందులో పుప్పొడి వుండదు. అనుబంధ పదార్ధములలో సాధారముగా పదినుండి ఇరవై శాతము సహజ పుప్పొడిని కల్గియుంటుంది. ఈ పదార్థము ప్రాధమికముగా తేనెటీగలకు అనువుగా (రుచిగా) మరియు ఆకర్షనీయముగా వుంటుంది. పుప్పొడి అనుబంధ మరియు ప్రత్యామ్నాయ పదార్ధములు తేనెటీగలకు ఎక్కువ ఆకర్షనీయముగా వుండటకు గాను పంచదార పాకమును లేదా తేనెను కలుపుతారు.తేనెను కలిపినట్లయితే అది ఆపాయకరముగా వుండవచ్చును, కారణము, రోగమును/ వ్యాధికారక బాక్టీరియా లేక స్పోరులను కల్గియుండవచ్చును. పుప్పొడి అనుబంధ పదార్ధములకు చాక్ బ్రూడ్ లేక యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధితో కలుషితమైన పుప్పొడిని కలిపినట్లయితే వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.

సోయా చిక్కుడు పిండిని మరియు బ్రూయర్స్ ఈస్ట్ ఈ రెండిటిని తరచుగా పుప్పొడి అనుబంధ పదార్ధములలో మరియు ప్రత్యామ్నాయ పదార్ధములలో వాడతారు. ఎక్కువమంది తేనెటీగల పెంపకముదారులు వారి సొంత పుప్పొడి అనుబంధ మరియు ప్రత్యామ్నాయ పదార్ధములను తయారు చేసుకుంటారు. ఒక పేరుగాంచిన సూత్రములో 3 పాళ్ళు సోయా చిక్కుడు పిండి, ఒక భాగము పుప్పొడి, రెండు పాళ్ళు చక్కెర (పంచదార) మరియు ఒక పాలు నీరు కల్గియున్నది. ఒక వేళ పుప్పొడిని ఉపయోగించకపోయినట్లయితే బ్రూయర్స్ ఈస్ట్ ను ప్రత్యామ్నాయంగా వాడుకొనవచ్చును. ఈ పదార్ధములన్నింటిని, కలిపి గట్టి ముద్దగా ఒక పౌoడు బరువుగలదిగా చేసికొని, దీనిని మైనపు పేపరుపై ముక్కలుగా ఉంచుకొనవలెను అడుగున మైనపు పేపరుతో ఈ ముక్కలను (patties) చేసినట్లు ఫ్రేములపై (top bars) వసంత కాలములో ఉంచుకొనవలెను. ఒక్కసారి పుప్పొడి అనుబంధ పదార్థమును పట్టుకు ఇవ్వడము ఆరంభిస్తే సహజ సిద్దమైన పుప్పొడి పొలములో సేకరించుట ఆరంభించు వరకు ఇవ్వవలెను మాంసకృత్తులు లభ్యముకాని సమయంలో ఉపయోగించుకొనుటకు గాను ఈ కృత్రిమ ఆహారమును మధ్యలో ఆపివేసినట్లయితే, పెరిగిన పట్టుకు ఎంతో ప్రమాదకరముగా పరిణమిస్తుంది. అంతేకాకుండా పట్టు కూడా చనిపోవచ్చు.

Pollen Traps – పుప్పొడిని సేకరించు బోనులు
పొలముకెళ్ళి పుప్పొడిని సేకరించుకొని పట్టుకు తిరిగివచ్చు ఈగల కాళ్ళకున్న పుప్పొడి ముద్దలను పుప్పొడిని సేకరించుబోనులను పట్టు ద్వారమువద్ద బిగించి, పుష్పాడిని సేకరించుకొనుటకు సాధ్యమే. పుప్పొడిని సేకరించుబోను అనుపరికరమును పట్టు ద్వారమువద్ద బిగించుకొని, పట్టులోపలికి (pollen loads), బలవంతముగా నడచివెళ్ళు ఈగల కాళ్ళకు వున్న పుప్పొడిని సేకరించవచ్చును. కూలిఈగలు సన్నని రంధ్రముల ద్వారా వెళ్ళునపుడు వాటి వెనుక కాళ్ళు వెనుకకు నెట్టబడి, వైరు ద్వారా లాగ బడి, పుప్పొడి గుళికలు (pollen balls) తొలగించబడతాయి. తొలగించబడిన పుప్పొడి గుళికలు బోనులోని పెట్టెలో పడతాయి. ఎనిమిది మెష్ వైరును పెట్టెపై వాడటమువలన, తేనెటీగలు అడుగుకు ప్రవేశించి సేకరించబడిన పుప్పొడిని తొలగించలేవు. వివిధ కవర్లను పుప్పొడిని సేకరించుబోనులకు వాడుటవలన, వర్షము వచ్చినప్పుడు పుప్పొడి తడవకుండా వుంటుంది. పుప్పాడిని సేకరించు బోనులను ఎక్కువగా చెక్కతో తయారుచేస్తారు కాని, లోహపు బోనులు ఎక్కువ కాలము మన్నుతాయి. నీటిని తొలగించుకుంటాయి, బహుశ ఎక్కువ ఖర్చయినప్పటికిని విలువైనవి.

Pollination-పరాగ సంపర్కము
పుష్పములోని పురుష భాగమైన పరాగకోశము (anther) నుండి స్త్రీ భాగమైన కీలాగ్రము (stigma) మీదకు పరాగ రేణువు (pollen) చేరుటను పరాగసంపర్కము అని పిలుస్తారు. కొన్ని మొక్కలు స్వపరాగ సంపర్కము చెందుతాయి, కాని ఎక్కువ సందర్భములలో గాలి, నీరు, కీటకములు ప్రత్యేకముగా తేనెటీగలు పరాగరేణువుల బదిలీకి కారణమవుతాయి. కొన్ని మొక్కలలో పరాగ సంపర్కము జరుగదు, కాబట్టి వానిలో విత్తనములు ఏర్పడవు. కీటకములలో తేనెటీగలు అనేవాటిలో అనేక జాతులున్నవి. ప్రత్యేకముగా పరాగ సంపర్కము జరుపుటకు అనువైనవి. వీటి శరీరము మీద చీలికలుగా వున్న వెంట్రుకలుండుట వలన, పుప్పొడి సుళువుగా వీటి మధ్య చిక్కుకుంటుంది మరియు ఈ పుప్పొడి ఒక పుష్పము నుండి ఇంకొక పుష్పమునకు సులువుగా మోసికొని పోబడుతుంది.

జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.

Read More

వండని వంట… కరివేపాకు పచ్చడి

కరివేపాకు గుండెకు మంచిది. జుట్టుని నల్లగా పెరిగేట్టు చేస్తుంది. కడుపులో ఉండే నులిపురుగుల్ని చంపివేస్తుంది. కంటి చూపుకి మంచిది. ఇన్ని రకాలుగా ఆరోగ్యాన్నిచ్చే కరివేపాకు పచ్చడి చేసే విధానం…
కరివేపాకు పచ్చడి చాలా సులువుగా చేసుకోవచ్చు. కావల్సిందల్లా పది పదిహేను ఎండు మిర్చి, రాళ్ళ ఉప్పు, గోలీకాయంత చింతపండు, అర స్పూను జీలకర్ర, కొంచెం బెల్లం ఇంక శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న గుప్పెడు కరివేపాకు. కడిగిన నీటి తాలూకా తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి.

ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు రోట్లో వేసి నూరుకున్నాక చింతపండు, పసుపు, బెల్లం వేసి ఇంకొంచెం మెదిపి చివరగా కరివేపాకు వేసి బాగా నలిగేట్టు నూరుకోవాలి. అంతే.

Read More

ఔషధ మొక్క మురిపిండ

మురిపిండ / కుప్పింట / హరిత మంజరిగా పిలువబడే హరిత మంజరి ఏకవార్షిక హెర్బల్ మొక్క. ఇది ఒక కలుపు మొక్కగా అన్ని చోట్లా కన్పిస్తుంది. దీని పూలగుత్తులు కప్పులాంటి ఆకారంలో కప్పబడి ఉంటాయి. పూలు అతి చిన్నవిగా ఉంటాయి. ఈ మొక్క నిటారుగా 1.2 మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు వెడల్పుగా అండాకారంలో ఉంటాయి. ఈ మొక్క 1.2-6.55þ14 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకు మొదలు గుండ్రంగా ఉంటుంది. ఆకుకాడ 1.5 నుండి 5.5 సెం.మీ. పొడవుంటుంది. పూలకాడలు 2.5 నుండి 6 సెం.మీ. పొడవుంటాయి. పూలకాడ క్రింది భాగంలో ఆకుపచ్చ రంగులో ఆడపూలు ఉంటాయి. కాండం పొడవునా దళసరి ఈనెలలో నూగు కలిగి ఉంటుంది. కాయ 1.5þ2 మి.మీ. పరిమాణంలో 3 చీలినట్లున్నభాగాలతో నూగు కలిగి ఉంటుంది. మురిపిండ ఒక మీటరు ఎత్తు పెరిగే ఏకవార్షిక మొక్క. ఆకులు దాదాపు వృత్తాకారంలో ఉండి, కణుపుకు ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఆకు అంచులకు దంతాల వంటి నొక్కులుంటాయి. ఆడ, మగ పుష్పాలు వేర్వేరుగా ఒకే మొక్కపై ఏర్పడతాయి. ఫలాలు గుండ్రంగా ఉండి ఒకే విత్తనం కలిగి ఉంటాయి. పుష్పాలు, ఫలాలు సంవత్సరం పొడవునా మొక్కపై ఏర్పడతాయి. మురిపిండ మొక్కలు తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిపై మొలకెత్తి వర్షాకాలంలో ఏపుగా పెరుగుతాయి. ఇవి పంటపొలాలలోను, బీడు భూములలోను, కంచెల వెంబడి కలుపు మొక్కలుగా పెరుగుతాయి. మురిపిండ మొక్కలో అకాలైఫిన్, అరంటియమైడ్, కాన్నాబినాల్, ఫ్లేవకెంఫెరాల్, సక్సినిమైడ్ వంటి అనేక రసాయనాలుంటాయి.

సాధారణ నామం : ఇండియన్ అకలైఫా / ఇండియన్ నెటిల్ / ఇండియన్ కాపర్ లీఫ్ శాస్త్రీయ నామం : అకలైఫా ఇండికా కుటుంబం: యూఫర్బియేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • కుప్పింట అనేక సంప్రదాయ ఔషధ ప్రయోజనాలు కలిగి, వాంతిమందుగా, విరేచనకారిగా, నులిపురుగుల నివారిణిగా, గజ్జి నివారిణిగా ఉపయోగపడుతుంది.
  • నూరిన ఆకుల రసానికి ఉప్పు కలిపి లేదా కషాయంగా తీసుకుని గజ్జి చర్మవ్యాధులను నివారించుకోవచ్చు. దీని కషాయం ఆస్త్మా చికిత్సకి, కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది.
  • వేరు కషాయం విరేచనకారిగా పని చేస్తుంది.
  • ఆకులను కంటి జబ్బుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఆకుపొడిని గాయాల చికిత్సకు ఉపయోగిస్తారు.
  • భారతదేశంలో కుప్పింటని ఉబ్బసం, న్యుమోనియా చికిత్సకుపయోగిస్తారు. ఆఫ్రికా, ఇండియాలలో దీని ఆకులను కూరవండుకుని తింటారు.

వ్యవసాయరంగంలో …

  • కుప్పింట యాంటిఆక్సిడెంట్, యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఇన్‌ఫ్లమేటరి, యాంటిఅల్సర్, యాంటిహెల్మింటిక్, యాంటిక్యాన్సర్, యాంటివీనోమ్ చర్యలు కలిగి ఉంది (సుధాకర్, అతని అనుచరులు, 2016).
  • కుప్పింట మిథనాల్ ద్రావణాలు పంటలలో తెగుళ్ళు కలిగించే గ్జాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ బాక్టీరియా పెరుగుదలను గణనీయంగా అరికట్టింది (జాన్ డిబ్రిట్టె, అతని అనుచరులు, 2011).
  • కుప్పింట కాండం, బెరడు ద్రావణాలు మిడత, ఎపాక్రోమియా స్పీ. పై విషచర్యను ప్రదర్శించింది. (పుట్టరుద్రయ్య అండ్ భాటియా, 1955).
  • కుప్పింట బెరడు, ఆకుపొడులు, వాటి ఇథనాల్ ద్రావణాలు గొంగళిపురుగు, యూప్రోక్టిస్ ఫ్రెటిర్నా మరియు డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాలపై కీటక నాశక చర్యను ప్రదర్శించాయి (మెకిండూ, 1983).
  • కుప్పింట మొక్కలు పంటలలో శత్రు పురుగుల సహజ జీవనియంత్రణ కారకాలైన మిత్ర పురుగులకు ఆశ్రయమిస్తాయి (టిఎనఎయు అగ్రిటెక్‌పోర్టల్) కుప్పింట మొక్క భూమిలోని విషపూరిత లోహాలైన సీసం (లెడ్), నికిల్, క్రోమియం, కాడ్మియంలను గ్రహించి నిల్వ చేసుకుంటుంది. అందువలన ఈ లోహాలతో కలుషితమైన భూముల నుండి వీటిని తొలగించడానికి ఈ మొక్కను సిఫారసు చేయవచ్చు. (సుభాషిణి అండ్ స్వామి, 2015)
  • ఈ మొక్కలో ఉన్న “కన్నాబినాల” అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. వీటి ఆకులను ‘పంచపత్ర కషాయం’ తయారీలో ఉపయోగించవచ్చు.
  • ఈ కషాయాన్ని రైతులు స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇది స్పర్శ చర్య, ఉదర చర్య కలిగి ఉంటుంది. అందువలన ఈ కషాయం ఒక శక్తివంతమైన కీటకనాశనిగా పనిచేసి పురుగులను అదుపులో ఉంచుతుంది.
  • మురిపిండ ఆకు కషాయం (10 శాతం) ఆల్టర్నేరియా హీలియాంథి (ప్రొద్దుతిరుగుడు ఆకుమాడు తెగులు) శిలీంద్రం పెరుగుదలను (78.38%), బీజోత్పత్తిని (85.90%), బీజాలు మొలకెత్తడాన్ని (52.48%) నివారించింది.
  • వీటి ఆకుల ద్రావణానికి అపరాల నిల్వలో ఆశించే పుచ్చు పురుగును నివారించే శక్తి ఉన్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీనికి శిలీంద్ర నాశని లక్షణాలు కూడా ఉన్నాయి (జయకుమార్ సోలమన్, తమిళనాడు).
  • దోమల లార్వాలను నిర్మూలించే గుణం ఈ కషాయానికుందని కెల్మ్ (1997) పరిశోధనలు తెలియజేశాయి. పత్తి పంటలో ఆకులను తినే పురుగులు, ఎర్రనల్లి నివారణకు ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు.
  • మురిపిండ ఆకులు చాలా ఘాటైన వాసన కల్గి ఉంటాయి కనుక ఈ కషాయాన్ని పంటలపై పిచికారి చేస్తే, దీనిలోని రసాయనాలు కీటకాలకు ఆహార భక్షక నిరోధకాలుగా పనిచేస్తాయి (రఘునాథ్).
  • శ్రీగోమాత గాయత్రి ఆర్గానిక్స్ కుప్పింట మొక్కనుపయోగించి బహుళ పంటలలో విస్తృతంగా ఉపయోగించే వ్యవసాయ పురుగుమందుని తయారు చేశారు. దీని తయారీకి కావలసిన మొక్కల పదార్థాలు : పసుపు, వేప, మిరప, అల్లం, ఉల్లి, జిల్లేడు (కలోట్రాపిస్ జైగాంటియా, కలోట్రాపిస్ ప్రోసెరా), బొప్పాయి, కానుగ, తులసి, పొగాకు, లాంటానా, ఉమ్మెత్త, కుప్పింట, ఆముదం, సింబోపోగాన్ సిట్రేటస్, ఆముదం మొక్క, సదాపుష్ప (కాథరాంతస్ రోసియస్), గన్నేరు. వావిలి, ఉల్లి, మిరియాలు, సీతాఫలం, టేకు, వస, నీలగిరి చెట్టు, జట్రోఫా, పుదీన, గరిక, గోమూత్రం, గోమయం.
  • ఈ పురుగుమందు అనేక పంటలలో పురుగులను సంహరిస్తుంది. మొక్కలలో పురుగులు, తెగుళ్ళు, వైరస్‌ల నిరోధకశక్తిని పెంచుతుంది. తెగులుకారక సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. అనేక పురుగులను వికర్షిస్తుంది. శిలీంద్రాలు, లార్వాలు, క్రిములు, బాక్టీరియా, నులిపురుగులు, గుల్లలు, నత్తలను చంపుతుంది. దీనినుపయోగిస్తే ఇంకే పురుగుమందును వాడవలసిన అవసరం లేదు.
    మోతాదు : 3% (30 మి.లీ./లీ.) పురుగుమందు పిచికారి చేయాలి., ఎకరానికి 35 లీ. ఒకసారి పిచికారి చేయడానికి ఉపయోగించాలి.
    నిల్వ కాలం : 3 సంవత్సరాలు
  • కుప్పింట ఆకుల పొడి నీటి ద్రావణం (0.05 గ్రా./లీ.) టమాట కాయనాశించే బాక్టీరియం, క్ౙాంతోమోనాస్ వెసికటోరియాపై బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది (అడెడైర్, అతని అనుచరులు, 2017).
  • 5% కుప్పింట బెరడు ఆల్కహాల్ ద్రావణం 98% ప్లూటెల్లా మాక్యులిపెన్నిస్ మరియు పెరికేలియా రిసిని, 50% ప్రొడీనియాలిటూర, 40% క్రోసిడిలోమియా బైనొటాలిస్, 100% యూప్రూటిస్ ఫ్రెటర్నా లార్వాలను చంపింది. (పుట్టురుద్రయ్య అండ్ సుబ్రమణియన్, 1958).
  • కుప్పింట మొక్కలో టానిన్స్, టెర్పెనాయిడ్, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. కుప్పింట ద్రావణం వేరుశనగ పంట నాశించే ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం శిలీంద్రాల పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది (రాధిక, ఆమె అనుచరులు, 2016).
Read More

క్రిమిసంహారిణిగా ‘పంచగవ్య’

పంచగవ్యను ప్రకృతి వ్యవసాయంలోనే కాక రసాయన సేద్యం చేస్తున్న పొలాల్లో క్రిమి సంహారిణిగా వాడి మంచి ఫలితాలు పొందుతున్నారు రైతులు.

పంచగవ్య తయారీకి కావలసిన పదార్థాలు
ఆవుపేడ : 7 కిలోలు; ఆవు మూత్రం : 7 లీటర్లు; ఆవు పెరుగు : 2 లీటర్లు; ఆవు పాలు : 2 లీటర్లు; ఆవు నెయ్యి : 1 కిలో; లేత కొబ్బరి నీరు : 3 లీటర్లు; లేదా కల్లు : 3 లీటర్లు; బాగా మగ్గిన అరటిపండ్లు :12; నీరు : 15 లీటర్లు; నల్లబెల్లం : 1 కిలో

తయారు చేయు విధానం : మట్టి కుండలో వేసిన పేడలో నెయ్యివేసి బాగా కలిపి పెట్టాలి. ఈ విధంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నాలుగు రోజులు చేయగా పేడంతా నేతి వాసన వస్తుంది. 5వ రోజున మూత్రం, పాలు, పెరుగు, కల్లు, కొబ్బరి నీరు, బెల్లం, నీరు బాగా కలియబెట్టాలి. ఆ తరువాత అరటి పండ్లు మెత్తగా పిసికి ఈ మిశ్రమంలో కలియ తిప్పాలి. ఈ మిశ్రమం పోసిన మట్టి పాత్ర గాని ప్లాస్టిక్ డ్రమ్ముగాని వెడల్పాటి మూతికలిగి ఉండాలి. మూత బెట్టకుండా గుడ్డతో మూతిబిగించాలి. (లేకపోతే ఈగలు, క్రిములు మిశ్రమంలో పడతాయి) ఈ విధంగా 15 రోజులు వేసిన తరువాత మిశ్రమాన్ని పలుచటి గుడ్డలో వడబోయాలి. ఈ మిశ్రమాన్ని ఆరు నెలల వరకు వాడవచ్చు. పాత్ర మూత వదులుగా వుండాలి. ఒకవేళ పంచగవ్య గట్టిపడితే తగినంత నీరు కలుపుకుని వాడుకోవాలి. పంచగవ్య మొక్క పెరుగుదలకే కాకుండా చీడపీడలను దరిచేరనీయదు. అన్ని రకాల మొక్కలపై వాడుకొనవచ్చు. నారుమళ్ళకు బాగా శ్రేష్టం.

Read More

వరిలో నేరుగా విత్తు సాగు విధానం – మెళకువలు

ఆవశ్యకత :
ఉత్తర కోస్తా జిల్లాలలో ఖరీఫ్ పంటకాలంలో వరి ప్రధానమైన పంట, సుమారు 5 లక్షల 20 వేల ఎకరాలలో సాగు చేయబడుతుంది, అందులో సుమారు 50 శాతం విస్తీర్ణం నేరుగా విత్తే (ఎదసాగు) పద్దతిలోనే సాగు అవుతుంది. సాగు ఖర్చులు పెరగడం, కూలీలు సకాలంలో అందుబాటులో లేకపోవడం, కూలీల ఖర్చు పెరగడం వలన రైతులు నేరుగా విత్తే పద్ధతిలో వరిసాగువైపు మరలుతున్నారు.

మారిన వాతావరణ పరిస్థితులలో తక్కువ నీటితో లాభదాయక దిగుబడులు పొందడం వరిలో నేరుగా విత్తు విధానం ద్వారా సాధ్యం. అంతేకాకుండా ఈ సాగువిధానం వలన కొంతవరకు మీథెన్ వాయువు విడుదల తగ్గటం వలన పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అలాగే నీటి వినియోగం 25% ఊడ్పు పద్ధతి మీద తగ్గుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులలో వరిసాగు ఆలస్యం అయినపుడు నేరుగా వరి విత్తుసాగు పద్దతిలో సాగుచేయడం వలన సమయం ఆదా అవుతుంది.

నేరుగా విత్తే వరి సాగు చేయుటవలన లాభాలు :-

  1. తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
  2. నారుమడి పెంపకం, నాట్లకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. సుమారు ఎకరానికి 2500 నుండి 3000 రూపాయల వరకు కూలీల ఖర్చు ఆదా అవుతుంది.
  3. చెరువుల క్రింద, కాలువల క్రింద సాగుచేసే పరిస్థితులలో నాట్లు ఆలస్యం కాకుండా సకాలంలో పంటను సాగు చేయవచ్చు.
  4. విత్తన మోతాదు 40-50 శాతం తగ్గుతుంది.
  5. పంట పడిపోదు, పంట వారం నుండి 10 రోజుల ముందు కోతకు వస్తుంది.
  6. పురుగులు, తెగుళ్ళు సమస్య కొంతవరకు తక్కువగా ఉంటుంది.
  7. నీటిని ఆదా చేసుకోవచ్చు.
  8. కోత యంత్రాలతో సులువుగా పంట కోత చేపట్టవచ్చు.

నేరుగా విత్తే వరిలో అదిక దిగుబడికి కీలక యాజమాన్య పద్దతులు
రకాల ఎంపిక :-

ముంపు ప్రాంతాలకు / లోతట్టు ప్రాంతాలకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 1061 (ఇంద్ర) ఎం.టి.యు – 1064 (అమర), ఆర్.జి.ఎల్-2537 (శ్రీకాకుళం సన్నాలు) ఎత్తు పెరిగి, కాండం దృడంగా వుండి, పడిపోని రకాలను సాగుచేసుకోవాలి.
సాధారణ కాలువ ప్రాంతాలు, చెఱువుల క్రింద వరి సాగుకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 3291 (సోనామసూరి), ఎం.టి.యు-1210 (సుజాత), ఎం.టి.యు -7029 (2), ఎం.టి.యు -1121 (శ్రీదృతి), ఎం.టి.యు-1224 (మారుటేరు సాంబ) బి . పి టి -5204
కాలువ చివరి భూములు ఆలస్యంగా విత్తే ప్రాంతాలకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 1156 (తరంగిణి), ఎం.టి.యు – 1153 (చంద్ర) ఎన్.ఎల్.ఆర్- 34449,
ఆర్.ఎన్.ఆర్ – 15048

నేల తయారీ : తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకొని పలుమార్లు దున్ని మెత్తని దుక్కి
చేసినట్లయితే కలుపు సమస్యను కొంతవరకు అదిగమించవచ్చు. ఆఖరి దుక్కిలో సిఫారసు మేరకు పోషకాలు వేసి కలియదున్ని బాగా చదును చేయాలి. నేల సుమతులంగా / చదునుగా లేనట్లయితే తేమ సరిగా అందక మొలక సరిగా రాదు. పంట ఎదుగుదల కూడా సమానంగా ఉండదు, నీటి యాజమాన్యం సమస్యఅవుతుంది. అఖరు దుక్కిని రోటావేటర్‌తో వేసుకోవడం మంచిది.
వాలును బట్టి నీరు బయటకి పోవుటకు వీలుగా ప్రతి 2 మీటర్లకు బాటలు చేసుకోవడం వలన తర్వాత ఎరువులు వేయుటకు, సస్యరక్షణ చర్యలు చేపట్టుటకు ఉపయోగపడటమే కాకుండా దోమపోటు ఎక్కువగా ప్రభలకుండా వుంటుంది.

విత్తన మోతాదు : ఎకరానికి 16Ð20 కిలోల విత్తనము ఉపయోగించాలి.

విత్తన శుద్ధి : విత్తేముందు సూడోమోనాస్‌తో విత్తన శుద్ధిచేయాలి.

విత్తే విధానం: శుద్ధిచేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా గాని
20 సెం.మీ. దూరంలో నాగటి సాలు వెనకగాని, గొర్రుతోగాని, ట్రాక్టరుతో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే గొర్రుతో (ఫర్టికమ్ సీడ్ డ్రిల్) గాని వేసుకోవాలి.

విత్తనాన్ని ఎక్కువ లోతులో వేసినట్టయితే మొలకశాతం దెబ్బతినే అవకాశం ఉంది. కనుక పై పోరల్లో సుమారు (2.5 – 5 సెం.మీ) లోతులో వేసుకోవాలి.

దమ్ముచేసి సాగు చేయు పద్ధతిలో మొలకెత్తిన విత్తనాలను దమ్ము చేసిన పొలాల్లో వెదజల్లడం ద్వారా లేదా డ్రమ్‌సీడరు ద్వారా విత్తుకోవచ్చు.

మొక్కలు లేనిచోట కొత్త మొక్కలు వేసుకొనుట :

వేదజల్లు పద్ధతిలో సాగు చేయు రైతులు విత్తే రోజే ఎకరానికి అరసెంటు నారుముడి పోసుకున్నట్లయితే అధిక వర్షాల వలన లేదా పల్లపు ప్రాంతాలలో మొక్కలు చనిపోయి ఖాళీలు
ఏర్పడిన ప్రాంతాలలో ఈ నారును ఉపయోగించడం వలన కావలసిన మొక్కల సాంధ్రత ఉంటుంది. అలాగే ఒత్తుగా ఉన్న మొక్కలు తగ్గించి పలుచగా ఉన్న ప్రాంతాలలో నాటుకోవచ్చు. మంచి దిగుబడికి పొలం తయారీ సమయంలో ఎకరానికి 8 – 10 టన్నుల పశువుల గెత్తం వేసుకోవాలి.

ఎరువుల యాజమాన్యం: నేరుగా విత్తే వరి పొలాలలో భూ ఆరోగ్యానికి, సేంద్రీయ కర్బనం పెంచడం కోసం
తొలకరి వర్షాలకు పెసర వంటి అపరాల పంటలు వేసి భూమిలో కలియదున్నుకోవాలి.

జీవన ఎరువులను తప్పని సరిగా వేసుకోవాలి. ఎకరానికి 500మి.లీ. అజోస్పైరిల్లం 500 మి.లీ.లు పాస్పోబాక్టీరియాను 100 కిలోల పశువుల గెత్తంతో కలిపి విత్తిన తరువాత తగు తేమ వున్నపుడు వేసుకోవాలి. సిఫారసు చేసిన పోషకాలను తప్పనిసరిగా అందించాలి.

కలుపు యాజమాన్యం : కలుపును మనుషుల సహాయంతో మొదటగా నిర్మూలించి, సరైన సమయంలో నీరు పెట్టి, ఆ నీటిలో సిఫారసు చేసిన మోతాదులో అజొల్లాను వేయాలి.

నీటి యాజమాన్యం : పంటకు 7-10 రోజుల కొకసారి అవసరం మేరకు తడులు పెట్టాలి.

ఈ పద్ధతిలో ఎల్లప్పుడు నీరు నిలువ ఉంచవలసిన అవసరం లేదు. అయితే పంటకు కావలసిన తేమను అందించి పంట కీలక దశల్లో బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. నీటి లభ్యతనుబట్టి విత్తనము ఎద పెట్టిన 30 నుంచి 40 రోజుల్లో పొలంలో నీరు పారించి మాగాణి వరి మాదిరిగా మార్చుకోవాలి.

విత్తిన దగ్గర నుండి మొదటి 30 రోజులు ఆరుతడి నీటి యాజమాన్యం పాటించాలి. వర్షాలు పడిన తరువాత లేదా కాలువలకు చెఱువులకు నీరు అందుబాటులో ఉన్నపుడు సాధారణ మాగాణి నాట్లు వరి మాదిరి నీటి యజమాన్యం చేపట్టాలి. దుబ్బుచేసే దశలు 1-2 అంగుళాలు మేర నీటిని ఉంచి, పూత దశ నుండి గింజనిండే దశ వరకు 2-4 అంగుళాల నీటిని ఉంచడం ద్వారా అదిక పిలకలు, వెన్నులు వచ్చి దిగుబడి పెరుగుతుంది.
సస్యరక్షణ చర్యలు : నాట్లు పద్ధతిలో లాగానే పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

డా॥ ఎం.ఎం.వి.శ్రీనివాసరావు, డా॥ కె. లక్ష్మణ , ప్రధాన శాస్త్రవేత్తలు, ఏరువాక కేంద్రం, విజయనగరం. ఫోన్: 94401 23223

Read More

పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది

పశుసంవర్ధకంలో అధిక లాభాలు పొందాలంటే పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా వాటి పునరుత్పత్తి సామర్థ్యం కూడా చాలా ముఖ్యం. ఒక ఆవు లేదా గేదె సమయానికి ఈనకపోతే రైతుకు ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ సమస్యలలో చాలా వరకు సరైన పోషకాహారం లేకపోవడమే ప్రధాన కారణం.

పశువుల శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు శక్తి, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు మరియు నీరు సమతుల మోతాదులో అవసరం. వీటిని సమతుల ఆహారం లేదా బ్యాలెన్స్‌డ్ ఫీడ్ అంటారు. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు పశువుల శక్తి అవసరాలను.
ప్రసవం ముందు మరియు తర్వాత ప్రత్యేక పోషకాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల పశువులు త్వరగా కోలుకుని మళ్లీ సమయానికి గర్భం దాల్చుతాయి. అలాగే పశువులకు క్రమం తప్పకుండా కృమినాశక మందులు వేయించడం, శుభ్రమైన నీరు అందించడం అవసరం.

  1. శక్తినిచ్చే ఆహారం: ధాన్యాలు, మక్కజొన్న, జొన్న, బార్లీ, గోధుమ పొట్టు వంటి పదార్థాలు పశువులకు శక్తిని అందిస్తాయి. పశువులకు తగిన శక్తి అందకపోతే అవి బలహీనంగా మారి, వేడి లక్షణాలు సరిగా కనిపించవు. గర్భధారణ శాతం కూడా తగ్గుతుంది. ప్రసవం తర్వాత శక్తి లోపం ఉంటే పశువులు తిరిగి గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది.
  2. ప్రోటీన్ల ప్రాముఖ్యత: ప్రోటీన్లు శరీర కణాల నిర్మాణానికి, ఎదుగుదలకు మరియు పునరుత్పత్తి అవయవాల పనితీరుకు చాలా అవసరం. నూనె గింజల పిండి, పత్తి గింజల పిండి, సోయాబీన్ మీల్, శనగ చొప్ప వంటి పదార్థాలు మంచి ప్రోటీన్ వనరులు. ప్రోటీన్ లోపం ఉంటే ఆడ పశువుల్లో అండోత్పత్తి సరిగా జరగదు. మగ పశువుల్లో వీర్య నాణ్యత తగ్గుతుంది.
  3. ఖనిజ లవణాలు పునరుత్పత్తిలో కీలక పాత్ర: కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల బలానికి మాత్రమే కాకుండా గర్భధారణకు కూడా అవసరం. కాపర్, కోబాల్ట్, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ ఖనిజాలు పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటి లోపం వల్ల గర్భస్రావాలు, వంధ్యత్వం, పిల్లలు బలహీనంగా పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పశువులకు ప్రతిరోజూ మినరల్ మిక్చర్ ఇవ్వడం చాలా మంచిది.
  4. విటమిన్ల: ముఖ్యంగా విటమిన్ A, D మరియు E పునరుత్పత్తికి చాలా అవసరం.
    విటమిన్ A లోపం వల్ల వేడి లక్షణాలు తగ్గిపోవచ్చు. విటమి+న్ D ఎముకల బలానికి అవసరం. విటమిన్ E మరియు సెలీనియం కలిసి పనిచేసి గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పచ్చి గడ్డి మరియు నాణ్యమైన మేతలో ఇవి సహజంగా లభిస్తాయి.
  5. నీటి ప్రాముఖ్యతను: శుభ్రమైన నీరు సరిపడా ఇవ్వకపోతే ఆహారం జీర్ణం సరిగా కాదు. పాల ఉత్పత్తి తగ్గుతుంది. శరీరంలో జీవక్రియలు దెబ్బతిని పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. వేసవికాలంలో మరింత ఎక్కువ నీరు అవసరం.
  6. గర్భధారణ సమయంలో పోషకాహారం : గర్భిణీ పశువులకు సాధారణ ఆహారంతో పాటు అదనపు పోషకాలు ఇవ్వాలి. ముఖ్యంగా చివరి మూడు నెలల్లో పిల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరైన ఆహారం ఇవ్వకపోతే పిల్ల బలహీనంగా పుడుతుంది. అలాగే ప్రసవం తర్వాత పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.

ప్రసవం తర్వాత పశువుల సంరక్షణ కూడా ఎంతో ముఖ్యం.ప్రసవం జరిగిన వెంటనే తగినంత నీరు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఖనిజ లవణాలు మరియు శక్తినిచ్చే ఆహారం ఇవ్వడం ద్వారా పశువు త్వరగా కోలుకుంటుంది. తద్వారా తిరిగి సమయానికి గర్భం దాల్చుతుంది.

  1. పచ్చిమేత ప్రాముఖ్యత :

నాపియర్ గడ్డి, జొన్న గడ్డి, మక్క సైలేజ్, లూసెర్న్ వంటి పచ్చిమేతల్లో మంచి పోషకాలు ఉంటాయి. పచ్చిమేత ఇవ్వడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. పునరుత్పత్తి సమస్యలు తగ్గుతాయి.

రైతు సోదరులారా,
పశువులలో కనిపించే అనేక పునరుత్పత్తి సమస్యలకు సరైన పోషకాహారం ద్వారానే పరిష్కారం లభిస్తుంది. సమతుల ఆహారం, మినరల్ మిక్చర్, పచ్చిమేత, పరిశుభ్రమైన నీరు మరియు క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు ఉంటే పశువులు ఆరోగ్యంగా ఉండి సమయానికి ఈనుతాయి. దీంతో పాల ఉత్పత్తి పెరిగి రైతు ఆదాయం కూడా మెరుగుపడుతుంది.

పశువుల పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపరచడానికి అనుగుణంగా కొన్ని సూచనలను కింద ఇవ్వడం జరిగింది
• పశువులకు సరైన సమయానికి, సరైన మోతాదులో ఆహారం ఇవ్వడం వల్ల వేడి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో చేయగలుగుతారు.
• ప్రసవం తర్వాత ఎక్కువకాలం ఈనకపోవడానికి ప్రధాన కారణాల్లో పోషకాల లోపం ఒకటి. సమతుల ఆహారం ఇవ్వడం ద్వారా “సర్వీస్ పీరియడ్” తగ్గుతుంది.
• అధిక పాల ఉత్పత్తి ఇచ్చే పశువులకు సాధారణ పశువుల కంటే ఎక్కువ శక్తి మరియు ప్రోటీన్లు అవసరం. లేకపోతే శరీర బరువు తగ్గి పునరుత్పత్తి సమస్యలు వస్తాయి.
• శరీర స్థితి స్కోర్ (Body Condition Score) సరైన స్థాయిలో ఉండాలి. చాలా లావుగా ఉన్నా, చాలా సన్నగా ఉన్నా గర్భధారణ శాతం తగ్గుతుంది.
• పొడి దశలో (Dry period) సరైన పోషకాహారం ఇవ్వడం తదుపరి పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి పనితీరును మెరుగుపరుస్తుంది.
• ప్రసవానికి ముందు “స్టీమింగ్ అప్” పద్ధతిలో క్రమంగా అదనపు కాంసన్‌ట్రేట్ ఆహారం ఇవ్వడం వల్ల ప్రసవం సాఫీగా జరుగుతుంది మరియు పాల ఉత్పత్తి పెరుగుతుంది.
• గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడటానికి విటమిన్ E మరియు సెలీనియం ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి గర్భాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
• మినరల్ మిక్చర్ నిరంతరం ఇవ్వడం వల్ల “సైలెంట్ హీట్” సమస్యలు తగ్గుతాయి.
• పచ్చిమేతలో ఉండే సహజ విటమిన్లు మరియు ఖనిజాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి.
• వేసవికాలంలో వేడి ఒత్తిడి (Heat stress) వల్ల పశువులలో గర్భధారణ శాతం తగ్గుతుంది. ఈ సమయంలో చల్లటి నీరు, ఆకుకూర మేత మరియు ఖనిజ లవణాలు ఇవ్వడం చాలా అవసరం.
• సరైన ఆహారం ఇచ్చిన పశువుల్లో గర్భస్రావాలు తక్కువగా ఉంటాయి మరియు ఆరోగ్యకరమైన దూడలు పుడతాయి.
• మగ పశువుల్లో కూడా పోషకాహారం చాలా ముఖ్యం. సరైన ప్రోటీన్, జింక్ మరియు విటమిన్లు ఉంటే వీర్య నాణ్యత మెరుగుపడుతుంది.
• కాల్షియం లోపం వల్ల ప్రసవానంతర సమస్యలు, ముఖ్యంగా మిల్క్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
• ఆహారంలో అకస్మాత్తుగా మార్పులు చేయకూడదు. అలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతిని పునరుత్పత్తిపై ప్రభావం పడుతుంది.
• సైలేజ్ మరియు హే వంటి నిల్వ మేతలను సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా సంవత్సరమంతా పోషకాహారం అందించవచ్చు.
• కృమినాశక మందులు వేయకపోతే పశువులు తీసుకునే పోషకాలు పూర్తిగా శరీరానికి అందవు. అందుకే క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయాలి.
• పరిశుభ్రమైన మేత మరియు నీరు ఇవ్వడం ద్వారా వ్యాధులు తగ్గి పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది.
• పోషకాహారం సరైన స్థాయిలో ఉంటే పశువుల హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరిగి సమయానికి అండోత్పత్తి జరుగుతుంది.

అందువల్ల ప్రతి రైతు “పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది” అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Dr.K.Archana
Assistant Professor
College of Veterinary Science, Korutla

Read More

వండని వంట… వెజ్ మిక్స్

  1. పండిన టొమాటోలు రెండు, మూడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సన్నగా తరిగి, కొంచెం కొత్తిమీర తరుగుతో సహా అన్నీ ఒక గిన్నెలో వేసుకుని, ఉప్పు వేసి చేత్తో గట్టిగా పిసుకుతున్నట్లు కలిపితే, అన్నీ చక్కగా కలిసిపోతాయి… వేడి వేడి అన్నంలో అయితే భలే ఉంటుంది!
  2. పైన చెప్పిన అన్నీ పెరుగులో కలిపి కూడా తినవచ్చు. రైతాలా ఉంటుంది.
  3. కూర దోసకాయ ముక్కలు సన్నగా తరిగి, పైన చెప్పిన పదార్థాలు అన్నీ కలిపినా, అది కూడా ఒక కూర లాగానే ఉంటుంది.
  4. పైన చెప్పిన అన్ని పదార్థాలు మరియు కీర దోస ముక్కలు కలిపినా, అది కూడా కూర లాగా తినవచ్చు.
  5. ఎండుమిరప కాయలు, ఉప్పు ..చింత పండు గుజ్జులో కలిపి తింటే బావుంటుంది. మనకు అనుకూలంగా ఉల్లిగడ్డ తరిగి వేసుకోవచ్చు. కొంచెం నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ కలుపుకోవచ్చు. లేక పోయినా చాలా బావుంటుంది.
  6. పచ్చి మిరప కాయలు, ఉప్పు, కొంచెం చింత పండు మంచిగా నూరుకుని, కూర దోసకాయలు ముక్కలుగా తరిగి దానిలో వేసి కచ్చా పచ్చాగా దంచి, ఒక పచ్చడి లాగ తినొచ్చు.
  7. మనం పచ్చిగా తినగలిగే అన్ని కూరగాయ ముక్కలు (క్యారెట్, దోసకాయ, టొమాటో, ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తి మీర) అన్ని ఉప్పుతో కలిపి చేత్తో గట్టిగా కలిపి పెరుగుతో అయినా, లేకుండా అయినా తినొచ్చు.
    పల్లీల పొడి, పచ్చి కొబ్బరి తురుము ఆప్షనల్.
    ఇవన్నీ… సైడ్ డిష్ లాగ తినొచ్చు….లేదా ఎమర్జెన్సీ కూరలుగా కూడా పనికొస్తాయి.
  • ప్రశాంతి

Read More