పాలవెల్లువ 2.0

గ్రామీణ స్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, తద్వారా పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా 19.9.2024న కేంద్ర సహకార మరియు పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ పాలవెల్లువ 2.0కు శ్రీకారం చుట్టింది. మహిళల భాగస్వామ్యంతో 5 సంవత్సరాల్లో సహకార సంఘాల ద్వారా 50% పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. కొత్తగా 75000 బహుళార్థ సాధక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, 46000 పాలఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం, ఐదు సంవత్సరాల చివరికి రోజుకు 1000 లక్షల లీటర్ల పాలఉత్పత్తి లక్ష్య సాధన దిశగా కేంద్ర సహకార మరియు పశుసంవర్థక పాడి పరిశ్రమ శాఖలు ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో సమావేశాలు జరిపి నిరంతరం ప్రగతిని సమీక్షిస్తున్నాయి.

1998 నుండి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రస్థానం పదిలపరుచుకుంటున్న భారత్, స్థూల ఉత్పత్తికి 25% వాటా సమకూరుస్తుంది. డిసెంబర్ 2014 నుండి అమలవుతోన్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గేదెల్లో పాలఉత్పాదకత 36.63% పెరిగిందని తెలుస్తోంది. అంతేకాక ఆధునిక పాలపరీక్షా పరికరా…తో పాల నాణ్యత పరిశీలన పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది.

రాష్ట్రాలవారీగా 2024 నుండి 2029 వరకు పాలఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు లక్ష్యం ఇలా ఉంది.

తెలంగాణాపరంగా చూస్తే –
2024-2026కు గాను కొత్త సంఘాల ఏర్పాటు 8%, బలోపేతం 42% గా నమోదయింది.
ప్రస్తుత సంవత్సరంకి 306 కొత్త సంఘాల ఏర్పాటు లక్ష్యంగా ఉంది.
పాడి సుస్థిర అభివృద్ధికి 3 అంచెల సహకార వ్యవస్థ రామరక్షగా నాడే క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ చెప్పారు. కాగా తెలంగాణలో బలహీనంగా ఉన్న గ్రామస్థాయి సహకార సంఘాల పాల సేకరణకు సవాల్‌గా మారింది.
ఉన్న సంఘాల్లో ఆడిట్ జరగక పోవడం, సభ్యుల నిర్లిప్త భావన, సంఘ స్ఫూర్తికి విఘాతంగా నిలిచింది.
తెలంగాణ సహకార యూనియన్ మరింతగా సభ్యుల అవగాహనా కార్యక్రమాలు విస్తృతపరచాల్సిన అవసరం ఉంది.
గ్రామస్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు, జిల్లా స్థాయిలో యూనియన్లు రాష్ట్ర స్థాయిలో సమాఖ్య వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.
పాడి రైతులు సంఘటితంగా ఉంటే, పక్క రాష్ట్రం, కర్నాటకలో రోజుకు కోటి లీటర్లు పాలసేకరణ సాధ్యపడుతుండగా, విస్తృత విపణి అవకాశాలున్నా, తెలంగాణలో వివిధ సహకార వ్యవస్థలు, ప్రైవేటు ఆధిపత్యానికి దారితీస్తోంది.
తెలంగాణలో కరీంనగర్ పాడి రైతుల కంపెనీ, ముల్కనూర్ మహిళా డెయిరీ, నల్లగొండ రంగారెడ్డి యూనియన్, విజయడెయిరీ ఇలా 4 రకాల వ్యవస్థలు నడుస్తున్నాయి.
1964 చట్టంలో ఉన్న విజయ డెయిరీ వ్యవస్థాగత అసమానతలతో ఆశించినంతగా పాలసేకరణ, మార్కెటింగ్ లక్ష్యాలకు చేరువ కావాలంటే, పాడిరైతుల సంఘటిత ముందడుగు ఎంతో అవసరం.
సహకారశాఖ ద్వారా త్వరితగతిన సంఘాల ఏర్పాటు, పశుసంవర్థక శాఖ ద్వారా పాడిరైతులకు సేవలు సమ్మిళితంగా లభిస్తే, పాడి రైతు బతుకులో భరోసా వస్తుంది. అలాగే, సబ్సిడీతో పాడిపశువులకు రుణాలు దొరకకపోవడం, పాడిపరిశ్రమపై బడ్జెట్ లో తగు కేటాయింపులు జరగకపోవడం పాడిపరిశ్రమపై నీలినీడలు ప్రసరించడానికి కారణం అవుతోంది. కర్నాటకలో ఏటా 2000 కోట్లు ప్రోత్సాహకం ఇస్తుంది కాబట్టే, పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. తద్వారా నిర్వహణ ఖర్చులు అదుపులో ఉన్నాయి.
అదేవిధంగా తెలంగాణలో కూడా –
1) పాడి పశువులను సబ్సిడిపై ఇచ్చే పథకం అమలు
2) పాల ప్రోత్సాహకం విడుదల
3) సాంకేతిక వనరుల సరఫరా
4) పశు ఆరోగ్యంకై నిరంతర సేవలు
5) సంఘాల ఏర్పాటు అనివార్యం చేయడం
అనే పంచ సూత్రాలు అమలయితే పాల ఉత్పత్తి పెరిగి, జీవనోపాధులు మెరుగు కాగలవు.

మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553

Read More

వర్మి కంపోస్టు తయారీలో మెళకువలు

నేల నాణ్యతను, భూ ఫలదతను కాపాడటానికి, ప్రస్తుత విస్తృత వ్యవసాయ సాగు విధానంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పునరుద్ధరించడం ఎంతో అవసరం. పశువుల గెత్తము లభ్యత నానాటికి తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కొని వేసుకోవటం లాభదాయకం కాదు. కనుక, ప్రత్యామ్నాయంగా కంపోస్టు ఎరువులను సులభపద్ధతుల్లో తయారు చేసుకొని వేసుకోవటం ఎంతో అవసరం. దీని వల్ల వరిసరాల పరిశుభ్రత కూడా వస్తుంది. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా కనిపించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం వలన వానపాముల సంఖ్య గణనీయంగా తగ్గడం జరిగింది. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర వహిస్తాయని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ మొట్టమొదటిగా 1881లో ప్రపంచానికి తెలియజేశారు.

వర్మికంపోస్టుకు అనువైన వానపాములు – రకాలు
వానపాములు వెన్నెముక లేని జీవులు. ఇందులో 3600 రకాలు ఉన్నాయి. వీటిలో సగం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. వీటిని రెండు రకాలుగా విభజించడం జరిగింది.

  1. బొర్రోయింగ్ అనగా బొరియలు చేయు రకము నేలను గుల్లచేసి భూమి లోపలి పొరలలో ఉంటాయి. మన దేశంలో ఈ రకమే ఎక్కువగా ఉంది. నీటి ఎద్దడిని బాగా తట్టుకుని 90 శాతం మట్టిని 10 శాతం వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. 8 నుండి 10 అంగుళాల పొడవు ఉండి సుమారు 15 సంవత్సరాలు జీవిస్తుంది. అయితే ఈ రకం వానపాము వర్మి కంపోస్ట్ తయారీకి అంతగా పనికి రాదు.

ఉదా: ఫెరిటిమా ఎలాంగేటా, ఫెరిటిమా ఏసియాటికా మొదలగునవి

  1. నాన్ బొర్రోయింగ్ అనగా బొరియలు చేయని రకము భూమి పై పొరలలో ఉంటూ బొరియలు చేయని రకము. ఇది వర్మి కంపోస్ట్ తయారీకి బాగా అనుకూలంగా వుండి మట్టిలో గల సేంద్రియ పదార్థాలను తునాతునకలు చేసి జీవన ఎరువును తయారు చేస్తాయి. ఇవి 90 శాతం వ్యర్థ పదార్థాలను 10 శాతం మట్టిని ఆహారంగా తీసుకొని నాణ్యమైన కంపోస్ట్ గా మారుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ. కనుక రైతులు ఇటువంటి రకాలను ఎన్నుకోవడం మంచిది. వీటి జీవిత కాలము సుమారు రెండున్నర సంవత్సరాలు.
    ఉదా: ఐసీనియా ఫొటెడ, యుడ్రిలస్ యూజిని మొదలగునవి.

వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్ధాల సద్వినియోగం: వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మి కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలను వర్మి క్యాస్టింగ్స్ అని, వీటి ద్వారా తయారయ్యే ఎరువును వర్మి కంపోస్ట్ అని అంటారు. మానవునికి ఉపయోగంలేక, వదలివేసిన కుళ్ళిన కూరగాయలు, పండ్లు, ఆకులు, చెత్తా చెదారం, కొబ్బరి పీచు, పశువుల పెంట మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్ధాలను తిని, కాలుష్య నివారణకు తోడ్పడటమేగాక విలువైన ఎరువును రైతుకు అందిస్తాయి. వానపాముల ఉనికి, కదలికల వల్ల నేల గుల్లబారుతుంది. ఫలితంగా నేలలో గాలి, నీరు చొరబడే శక్తి పెరుగుతుంది.

వర్మి కంపోస్టు తయారీ విధానం:
తొట్టి సైజు : షుమారు 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు.
తొట్టి తయారీ : సిమెంటు తొట్టిని 3 అడుగుల వెడల్పు x 1.5 అడుగుల ఎత్తులో వీలైనంత పొడవుగా తయారు చేసుకోవాలి. సిమెంటు వరలను కూడా ఇందుకు వాడుకోవచ్చు. ఈ సిమెంటు తొట్టి అడుగుభాగం నున్నగా, గట్టిగా ఉండేటట్లు ప్లాస్టరింగ్ చేయాలి. నీరు తొట్టిలో నిలబడకుండా, తొట్టికి ఒక వైపున చిన్న రంధ్రం ఏర్పాటు చేయాలి. సిమెంటు తొట్టికి ఎండ తగలకుండా, చల్లటి పందిరి నీడను కల్పించాలి. ముందుగా కంపోస్టు చేయవలసిన వ్యర్థపదార్థాలన్నిటినీ (చెత్త, ఆకులు, పంటకోసాక మిగిలిన పంట అవశేషాలు, పిచ్చిమొక్కలు మొదలైనవి) సుమారు ఒక నెల రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి, అవి ఒక మాదిరిగా కుళ్ళే వరకు కుళ్ళబెట్టాలి. ఆ తరువాత పాక్షికంగా కుళ్లిన ఈ వ్యర్ధపదార్ధాలను తెచ్చి, వర్మి కంపోస్టు తొట్టిలో వేసి కంపోస్టు చేసుకోవాలి. అయితే తొట్టిలో వీటిని వేయబోయే ముందు తొట్టి అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారు 15 సెం.మీ. మందాన తయారు చేసుకోవాలి, ముక్కిన కొబ్బరి పీచు లేదా కొద్దిగా ముక్కిన చెరకు పిప్పిని ముక్కలుగా కొట్టి, సమానంగా తొట్టి అంతా పలుచగా పరచి వెయ్యాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక, దాని మీద పాక్షికంగా కుళ్లబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్ధాలను వెయ్యాలి. తరువాత పేడ నీళ్లు చిలకరించాలి. కొద్దిగా ముక్కిన పేడను (10 సెం.మీ. మందాన) ఈ వ్యర్థ పదార్థాలను వేసిన పొరపైన వెయ్యాలి. పచ్చిపేడను వెయ్యకూడదు. వానపాములను (చదరపు మీటరకు వెయ్యి/1 కిలో చొప్పున) వర్మీ కంపోస్టు తొట్టిలోకి వదలాలి. వర్మికంపోస్టుకు అనువయిన వానపాములు బరియలు చేయని రకాలు: ఐసీనియా ఫోటెడా, యూడ్రిలస్ యూజిని ముఖ్యమైనవి. పాత గోనె సంచులను గాని (లేదా) వరిగడ్డిని గాని తొట్టిపైన కప్పాలి. ప్రతి రోజు పల్చగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్ళు ఎక్కువగా పోయకూడదు. రెండు-మూడు నెలల్లో మంచి, సస్య పోషణ గల వర్మీ కంపోస్టు తయారవుతుంది. సిమెంటు తొట్టి నుండి తయారైన వర్మీ కంపోస్టును తీయటానికి 4-5 రోజుల ముందు, తొట్టిలో నీరు చల్లరాదు. ఇలా చేయటం వల్ల, వానపాములు తేమను వెదుక్కుంటూ తొట్టి అడుగు భాగానికి చేరతాయి. కనుక తయారైన కంపోస్టును తీసుకోవచ్చు. తొట్టిలో నుండి కంపోస్టును బయటకు తీసి, శంఖాకారంగా గుట్టలు, గుట్టలుగా పోసి, ముతక జల్లెడతో జల్లించి, పంట పొలాలకు వేసుకోవాలి. బాగా తయారైన వర్మీ కంపోస్టు, పొడి పొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈవిధంగా ఒక తొట్టి నుండి 4 సార్లు కంపోస్టు చేసుకోవచ్చు. దీని వల్ల షుమారు 3 టన్నుల కంపోస్టు లభిస్తుంది.

వర్మీ కంపోస్ట్ ఉపయోగాలు :

  • నేల ఉత్పాదకతకు కావాల్సిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి.
  • వేసిన పైరుకే కాక తర్వాత 2-3 పైర్లపై దీని ప్రభావం ఉంటుంది.
  • మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత ఉంటుంది.
  • వర్మీ కంపోస్ట్ తయారు చేయడం సులభం, ఖర్చు తక్కువ
  • రసాయన ఎరువులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి ఖర్చు ఆదా అవుతుంది.
  • పలు రకాల ఎంజైములు, హార్మోన్లు, అమైనోఆమ్లములు తయారై, మొక్కలు చురుకుగా పెరగడానికి తోడ్పడతాయి.
  • రోగ నిరోధక శక్తి పెంచే ఆక్సినోమైట్లు తయారవడం వల్ల పైరు ఆరోగ్యంగా ఉండి పురుగుమందులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి, లాభం చేకూరుతుంది.
  • భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నేల సహజసిద్ధమైన ఆరోగ్యం కలిగి ఉంటుంది.
  • కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. వాటికి మంచి రంగు, రుచీ, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం పెరుగుతుంది.
  • సేంద్రియ వ్యర్ధాలను వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగించడం వల్ల, మంచి ఎరువు లభ్యమవుతుంది. పరిసరాల కాలుష్య నివారణకు తోడ్పడుతుంది.
  • దిగుబడితో పాటు ఫలసాయం నాణ్యత పెరుగుతుంది.

వర్మీ కంపోస్టుకు ఉపయోగించిన వ్యర్థ పదార్ధాలను బట్టి, స్థానిక వాతావరణం పరిస్థితులను బట్టి, తయారైన కంపోస్టులోని పోషకాల శాతంలో కొద్దిపాటి తేడాలుండవచ్చు. నత్రజని 1.5 నుండి 2.0 శాతం, భాస్వరం 0.5 నుండి 1.5 శాతం, పొటాషియం 0.5 నుండి 1.00 శాతం ఉంటుంది. ఇవికాక కాల్షియం, మెగ్నీషియం, గంధకం, రాగి, ఇనుము, మాంగనీసు, జింకు, మాలిబ్డినం, బోరాన్ పోషకాలు కూడా లభిస్తాయి. సాధారణ పైర్లన్నింటికి ఎకరానికి 1.0 నుండి 1.5 టన్నుల చొప్పున వర్మీ కంపోస్టు వేయవచ్చు. కుండీలలోని మొక్కలకు 200 గ్రా. చొప్పున వేయవచ్చును.

వర్మీ వాష్: వానపాముల శరీర భాగాల నుండి అవి విసర్జించే వర్మి క్యాస్టింగ్స్ నుండి తయారయ్యే ద్రవాన్ని “వర్మీ వాష్” అంటారు. ఇందులో మొక్క పెరుగుదలకు దోహదపడే హార్మోన్లు, అమైనో అమ్లములు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

తయారీ విధానం: వానపాములు ఉండడానికి అనువుగా బెడ్ ఏర్పాటు చేయాలి. దీనికి ఒక పెద్ద సైజు మట్టి పాత్ర (కుండ) లేదా పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ము ఉపయోగించుకోవచ్చు. పాత్ర అడుగు భాగంలో ఒక రంధ్రం ఏర్పాటు చేసి, దానిని దూది సహాయంతో మూసి ఉంచాలి. పాత్ర అడుగు భాగాన్ని మొదటి 3-4 అంగుళాలు ఇసుకతో ఆపైన 3 అంగుళాలు చిన్న చిన్న ఇటుక ముక్కలు, రాళ్ళతో నింపాలి. దీనిమీద బాగా మాగిన సేంద్రియపదార్ధాన్ని పాత్రలో నాలుగింట మూడు వంతుల వరకు నింపాలి, ఇందులో వీలయినన్ని ఎక్కువ (150 నుండి 200) వానపాములు వదలాలి. పాత్రలో ఎల్లప్పుడు 50-60 శాతం తేమ ఉండేటట్లు ప్రతిరోజు నీటిని చిలకరిస్తూ ఉండాలి. వానపాముల విసర్జన పూర్తిగా తయారైన తర్వాత ఎక్కువ నీరు పోయాలి. పాత్ర అడుగు భాగంలోని రంధ్రం నుండి టీ డికాక్షన్ వంటి ద్రవం బొట్టు బొట్టుగా స్రవించడం మొదలవుతుంది. దీనిని సేకరించాలి. ఇలాగే మరో రెండు సార్లు నీరు పోసి వచ్చిన ద్రవాన్ని సేకరించాలి. దీనినే వర్మి వాష్ అంటారు. ఇది అత్యంత విలువైన సేంద్రియ ద్రవ ఎరువు. సేంద్రియ పదార్ధమంతా వర్మి క్యాస్టింగ్గా మారి పోయినప్పుడు, దానిని తీసివేసి కొత్తగా సేంద్రియ పదార్థాన్ని వేస్తే వానపాముల నుండి మరల క్యాస్టింగ్స్ తయారవడం ప్రారంభమవుతుంది. ఇదే పద్ధతి పలుమార్లు ఆచరించడం వల్ల అవసరమైనంత వర్మివాష్ లభిస్తుంది.

పోషక విలువలు: నత్రజని – 500 పి.పి.యం., భాస్వరం – 390 పి.పి.యం., పొటాషియం- 460 పి.పి.యం. కాల్షియం-540 పి.పి.యం.. మెగ్నీషియం-110 పి.పి.యం., ఇనుము-273 పి.పి.యం., మాంగనీసు- 180 పి.పి.యం., జింకు – 180 పి.పి.యం., రాగి-21 పి.పి.యం.

వెర్మి కల్చర్: వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మికల్చర్ అంటారు. వానపాములను ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చేయడానికి 1:1 నిష్పత్తిలో పేడ మరియు ఎండిన ఆకులను కలుపుకోవాలి. ఇలా కలుపుకొన్న, ప్రతీ 10 కిలోల వ్యర్థ పదార్ధాలకు 50 వానపాములు చొప్పున వదులుకుని, నీడలో పెట్టుకొని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పిస్తే (ఉష్ణోగ్రత 15-30° సెంటీగ్రేడ్, తేమ శాతం 70-80%) రెండు నెలల్లో వానపాముల సంఖ్య వంద రెట్లు పెరుగుతుంది.

డా.ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), డా.కె. లక్ష్మణ, ప్రధాన శాస్త్రవేత్త(విస్తరణ), డా.కే. తేజేశ్వర రావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ పరిశోధన స్థానం, విజయనగరం. మొబైల్ నెంబర్ : 9440123223

Read More

వండని వంట… కరివేపాకు పచ్చడి

వేపకుండా, ఉడికించకుండా, నూనె కూడా వాడకుండా, కరివేపాకుతో రుచికరంగా పచ్చడి తయారు చేసుకోవచ్చు.

గుప్పెడు లేత కరివేపాకును తీసుకోవాలి. అందులో తగినంత చింతపండు, మనం తినగలిగేంతగా ఎండుమిర్చి, పసుపు, సరిపడ ఉప్పు చేర్చుకుని, అన్నిటినీ కలిపి రోట్లో నూరాలి. మిక్సీలోను చేయొచ్చు. కరివేపాకు పచ్చడి రెడీ!

తాజా కరివేపాకు పచ్చడిని వేడి వేడి అన్నంలో కలిపి తింటే చాలా బాగుంటుంది. అలా తినలేని వారు కొద్దిగా గానుగ నూనెను చేతి మీద వేసుకుని అన్నంలో కలిపి తినవచ్చు. లేదా నెయ్యి కలిపి కూడా తినవచ్చు.
రెండు రోజులు తిన్నాక పచ్చడిని మిగిలితే, కరివేపాకు పచ్చడికి సరిపడ అన్నం కలిపి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలతో అతి తక్కువ నూనెలో తిరగమోత వేస్తే, ‘కరివేపాకు రైస’ తయారు అవుతుంది. కరివేపాకు సువాసనతో, పచ్చడి బాగుంటుంది.

పులుపు కావాలనుకుంటే, కాస్త నిమ్మరసం కలుపుకోవచ్చు.
ఈ కరివేపాకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఒకటి, రెండు రోజుల్లో వాడుకోవాలి.
ఏ పచ్చడి అయినా అప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవడం ఆరోగ్యదాయకం!
ఇదే విధంగా కొత్తిమీరతోను పచ్చడి చేసుకోవచ్చు.

  • రచన : ఇందిర జమ్మలమడక

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

మొక్కకు పోషకాలనందించే సస్యామృతం

వివిధ రకాల ఔషధ మొక్కలు, ఆవు పేడ ఆవు మూత్రంలో పులియబెట్టడం ద్వారా దీనిని తయారు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు : ఇది మొక్కకు పోషకాలను అందించడమే కాకుండా కీటకాలు, తెగుళ్ళను నివారిస్తుంది.

 తయారీకి కావలసిన పదార్థాలు : ఆవు పేడ - 30-40 కి.; ఆవు మూత్రం - 5 లీ.; పాలుకారే మొక్కల (పాలకొడిశ, జిల్లేడు, జట్రోఫా, బొప్పాయి మొదలైనవి) ఆకులు - 5 కి.; ఘాటైన వాసనగల మొక్కల (వయ్యారిభామ, అత్తాకోడలు, తంగేడు తదితరాలు) ఆకులు - 5 కి.; నూనె గింజల చెక్క (వేరుశనగ, ఆముదం, కానుగ, నువ్వులు, వేప) చెక్కలో ఏదైనా - 2 కి.; బెల్లం - 1కి.; నువ్వులు, కంది లేదా పొగాకు కట్టెలు కాల్చిన  బొగ్గు లేదా పిడకబూడిద; నీరు - 100 లీ.; పై పదార్థాలన్నీ పట్టే ప్లాస్టిక్ డ్రమ్ము లేదా తొట్టి. 

తయారీ విధానం :

  • ముందుగా సేకరించిన ఆకులను తరిగి పెట్టుకోవాలి.
  • వీటిని ఆవుపేడ, మూత్రాలతో కలిపి డ్రమ్ములో వేసుకోవాలి.
  • దీనికి నూనె చెక్క బూడిద, బెల్లం కలపాలి.
  • డ్రమ్ములో వేసిన ఈ పదార్థాలను రోజు కలుపుతూ ఉండాలి.
  • తొట్టి లేదా డ్రమ్ము పై గోనె పట్టా కప్పి వుంచాలి.
  • వారం రోజుల్లో పూర్తిగా పులిసిపోయిన తర్వాత తయారైన ద్రావణాన్ని వడపోయాలి. ఆకులు, ఇతర పదార్థాల పిప్పి ఏదైనా మిగిలి వుంటే మొక్కలకు మల్చింగ్గా ఉపయోగించాలి.
  • తయారైన ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్లు డ్రిప్పు ద్వారా లేదా కాలువ ద్వారా పారించాలి.
  • మొక్కల పూత, కాత, గింజకట్టే దశల్లో 5 శాతం ద్రావణాన్ని పిచికారి చేయాలి.
Read More

మొక్క ఎదగుదల, పంట దిగుబడికి ఇ కో ఎంజైమ్

ఇకో ఎంజైమ్ తయారీ విధానం: 10 లీటర్ల నీరు, పండ్లు, కూరగాయలు, పూలు వీటిలో ఏవైన 3 కిలోలు, బెల్లం 1 కిలో. వీటన్నిటిని ఒక ప్లాస్టిక్ డ్రమ్ లేదా తొట్టిలో 10:3:1 నిష్పత్తిలో తీసుకొని బెల్లం కరిగే వరకు కలియ తిప్పి దానిపై మూత ఉంచి 3 నెలల పాటు ఊరబెట్టాలి. మూడు నెలల తరువాత ఊరిన ద్రావణాన్ని శుభ్రంగా వడబోస్తే కావలసిన ఇ కో ఎంజైమ్ తయారైనట్లే. దీనిని ప్లాస్టిక్ సీసాలలో నిలవబెట్టుకోవచ్చు. తయారైన 1 లీటరు ఇ కో ఎంజైమ్‌ని 50 లీటర్ల నీటితో కలిపి పంటలపై పిచికారి చేసుకుంటే తక్కువ ఖర్చుతో మొక్క ఎదుగుదల, పంట దిగుబడి బాగుంటుంది.

Read More

పురుగుల నివారణకు సహవాస పంటగా… వెల్లుల్లి

వెల్లుల్లితో మానవుల అనుబంధం 7000 సంవత్సరాలు. ఇది ఒక ఔషధ గడ్డ మొక్క. సులభంగా సాగు చేయవచ్చు. వెల్లుల్లిని పాయల ద్వారా ప్రవర్థనం చేస్తారు. సేంద్రియ పదార్థమెక్కువగా ఉన్న భూముల్లో వెల్లుల్లి బాగా పెరుగుతుంది. ఇది 1.2 మీ. ఎత్తు పెరుగుతుంది. 0.75 నుండి 1.0 అడుగు వరకు విస్తరిస్తుంది. ఏప్రిల్-మేలో పుష్పిస్తుంది. పూత ఎరుపు తెలుపు రంగులో ఉంటుంది. పూలు అందంగా ఉంటాయి. సీతాకోక చిలుకల నాకర్షిస్తాయి. వెల్లుల్లి వార్షిక, హెర్బల్ మొక్క. ఆకులు సువాసన కలిగి ఉంటాయి. ఆకులు ఆకుపచ్ౘ్ రంగులో సన్నగా గడ్డిలాగా ఉంటాయి..

సాధారణ నామం : గార్లిక్ శాస్త్రీయ నామం : అల్లియం సెటైవం కుటుంబం: అమరిల్లిడేసి

ఉపయోగాలు : ఆరోగ్యరంగంలో … ఆయుర్వేద రంగంలో

  • వెల్లుల్లి చాలా శక్తివంతమైన ఔషధ మొక్క. అనేక వ్యాధుల చికిత్సలో దీనిని 5000 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్నారు. అనేక శాస్త్రీయ అధ్యయనాల తర్వాత వెల్లుల్లి తన ప్రాశస్త్యాన్ని తిరిగి సంతరించుకుంది.
  • ట్యూమర్, క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. ఉదర, కోలన్, ఊపిరితిత్తులు, రెక్టం క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. శక్తివంతమైన సహజ ఆంటిబయాటిక్, యాంటిసెప్టిక్, యాంటివైరల్, యాంటిఇన్‌ఫెక్షన్, జీర్ణాశయ, ఉదర పారసైట్లపై పోరాడుతుంది.
  • శ్వాసకోశ సంబంధిత అంటువ్యాధులు, బ్రోంకైటిస్ నుండి కాపాడుతుంది. పసుపుతో కలిసి వాతావరణ కాలుష్యం, పొగాకు పొగ నుండి, జలుబు, జ్వరం నుండి రక్షిస్తుంది. కొలెస్టరాల్‌ని అధికంగా తగ్గిస్తుంది. నోటి పుళ్ళు, గొంతునొప్పి, అలసట, ప్లేగ్, కలరా, రాబీస్ నుండి కాపాడుతుంది.
  • హృదయ సంబంధిత వ్యాధులు, రక్తపోటు నుండి కాపాడుతుంది. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించి తగ్గిస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది.
  • తగ్గిన శక్తి, ధైర్యాన్ని తిరిగి తెస్తుంది. వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. శరీరావయవాలను చలి నుండి కాపాడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

వ్యవసాయరంగంలో
పురుగుల నివారణ :

  • వెల్లుల్లి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించి నష్టం కలిగించే ట్రెబోలియం కాస్టేనియంని అతితక్కువ గాఢతలో వికర్షించింది. పెద్ద పురుగులు, లార్వాలపై ఫ్యూమిగెంట్, కాంటాక్టు చర్యలను ప్రదర్శించి, పెద్ద పురుగులలో గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని తగ్గించింది. అభివృద్ధి ప్రక్రియలలో జోక్యం చేసుకుని లార్వాలు ప్యూపాలుగా, ప్యూపాలు పెద్ద పురుగులుగా మారడాన్ని నిరోధించింది. యాంటిఫీడెంట్ చర్యలను ప్రదర్శించింది. (ముఖేష్‌కుమార్ బేబే, 2013)
  • వెల్లుల్లి నీరు మరియు మిథనాల్ ద్రావణాలు (1000 పిపియం) పొగాకులద్దె పురుగు లార్వాలను 81% మరియు 64% చంపాయి (మెరిగ, అతని అనుచరులు, 2012)
  • వెల్లుల్లిని అనేక సంవత్సరాలుగా ప్రధాన పంటగా పురుగుల నివారణకు సహవాస పంటగా సాగు చేస్తున్నారు.
  • క్యాబేజి వరుసల మధ్య వెల్లుల్లి లేదా ఉల్లి అంతర పంటగా నాటితే పురుగులను వికర్షిస్తాయి. కనుక చిన్న కమతాల రైతులు వెల్లుల్లి లేదా ఉల్లిని క్యాబేజి పంటలో అంతర పంటగా వేసి పురుగుల తాకిడిని తగ్గించవచ్చు. (దేబ్రా, మిషెక్, 2014)
  • వెల్లుల్లి పొడి, వెల్లుల్లి ద్రావణం, వెల్లుల్లి నూనె పిచికారి పురుగులను నివారిస్తుంది. గార్లిక్ నూనె యాంటి బాక్టీరియల్, యాంటిఫంగల్, కీటకనాశన లక్షణాలు కలిగి ఉంది. గార్లిక్ నూనెని మినరల్ ఆయిల్, సబ్బు ద్రావణంతో కలిపితే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది (లేరాగోమెజ్, సైంటిస్ట్, సియంపిఆర్, కేరళ)

వెల్లుల్లి గడ్డ ద్రావణం :
కావలసిన పదార్థాలు : తరిగిన వెల్లుల్లి 85 గ్రా., మినరల్ ఆయిల్ (కిరోసిన్ లేదా వెజిటబుల్ ఆయిల్) 50 మి.లీ., సబ్బు ద్రావణం 10 మి.లీ., నీరు 950 మి.లీ., ప్లాస్టిక్ బాటిల్ 1

తయారు చేసే పద్ధతి : వెల్లుల్లిని వెజిటబుల్ ఆయిల్‌కి కలపాలి. ఈ మిశ్రమాన్ని 24 గంటలు నిల్వ ఉంచాలి. తర్వాత దీనికి నీరు, సబ్బు ద్రావణం కలిపి కలియత్రిప్పి బాటిల్‌లో నిల్వ ఉంచాలి.

ఉపయోగించే విధానం : ఒక భాగం ఎమల్షన్‌ని 19 భాగాల నీటికి కలపాలి (50 మి.లీ. ఎమల్షన్‌ని 950 మి.లీ. నీరు కలపాలి. పిచికారి చేసే ముందు బాగా కదిపి ఉదయం వేళ పంటపై పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు, తెగుళ్ళు : ప్రత్తి బోల్‌వర్మ్, ఆర్మీవర్మ్, కాటన్ స్టెయినర్, ఉల్లి, తామర పురుగులు, పొటాటో మాత్, రూట్ నాట్ నెమటోడ్, చెరకు కాండం తొలుచు పురుగు, బాక్టీరియా తెగుళ్ళు, ఆంత్రాక్నోస్, బూజు తెగులు, వరి అగ్గితెగులు, కాయకుళ్ళు తెగుళ్ళు, బూడిద తెగులు, త్రుప్పు తెగుళ్ళు.

వెల్లుల్లి నూనె :
కావలసిన పదార్థాలు : వెల్లుల్లి 100 గ్రా., మినరల్ ఆయిల్ 2 చెంచాలు, నీరు 10.5 లీటర్లు, సబ్బు ద్రావణం 10 మి.లీ., మూత ఉన్న పాత్ర 1

తయారు చేసే పద్ధతి : వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఈ ముక్కలను మినరల్ ఆయిల్‌లో ఒక రోజు నానబెట్టాలి. అరలీటరు నీరు, సబ్బుద్రావణం కలిపి బాగా కలియ త్రిప్పాలి.
ఉపయోగించే విధానం : వడపోసిన ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలపాలి. స్ప్రేయర్లో నింపి నూనె నీటిపై తేలకుండా అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. మొక్క పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు : క్యాబేజి వర్మ్, పచ్చదీపపు పురుగులు, స్క్వాష్ బగ్స్, తెల్లదోమలు (ప్రకాష్, రావు ;1997)

గార్లిక్ ఆయిల్ ఎమల్షన్ :
కావలసిన పదార్థాలు : గార్లిక్ ఆయిల్ 50 మి.లీ., నీరు 950 మి.లీ., సబ్బు ద్రావణం 1 మి.లీ.

తయారు చేసే విధానం : సబ్బు ద్రావణాన్ని నూనెకి కలిపి బాగా కలపాలి. నీరు కలిపి బాగా కలియ త్రిప్పాలి.

ఉపయోగించే విధానం : నూనె నీటిపై తేలకుండా తయారు చేసిన వెంటనే పిచికారి చేయాలి. ఉదయం వేళల్లో పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు, తెగుళ్ళు : బోల్‌వర్మ్, పొటాటోట్యూబర్‌మాత్, వరి అగ్గి తెగులు, వరి గోధుమ మచ్చ తెగులు, రూట్‌నాట్ నెమటోడ్ (విజయలక్ష్మి, ఆమె అనుచరులు, 1999)

వెల్లుల్లి ద్రావణం నివారించే పురుగులు, తెగుళ్ళు

  • వేరుశనగలో నులి పురుగులు, స్ట్రాబెర్రీ వెస్ట్రన్ ఫ్లవర్ తామర పురుగులు
  • వెల్లుల్లి ద్రావణం ఆల్టర్నేరియా, బోట్రైటిస్, మాగ్నపోర్థె, ఫ్యుజేరియం శిలీంద్రాల పెరుగుదలను అరికట్టింది.
  • వరిలో అగ్గితెగులు, ఫైటోఫ్తోరా ఇన్‌ఫెస్టాన్స్ (పొటాటోలేట్ బ్లెåట్)
  • దోస పంటలో బూడిద తెగులు, బూజుతెగుళ్ళను నివారించింది.
  • టమాటలో ఆకుతొలుచు పురుగు, కందిలో ఎర్రనల్లి, నులి పురుగులు
  • వెల్లుల్లి, మిరప ఆకు ద్రావణాలు క్యాబేజి పంటనాశించే ప్లుటెల్లా క్ౙెలోస్టెల్లా, బ్రెవికారినెబ్రాసికె, హెలుల్లా అండాలిస్, ట్రైకోప్లూసియాని పురుగులను రసాయన పురుగుమందు “అటాక” కన్నా తక్కువ ఖర్చులో నివారించాయి. గార్లిక్ ద్రావణం అత్యధిక ఖర్చు : లాభం నిష్పత్తి (1:16)ని నమోదు చేసింది. అటాక్ పిచికారి చేసిన ప్లాట్లలో ఖర్చు : లాభం నిష్పత్తి 1:9.2 మాత్రమే. అందువలన వెల్లుల్లి ద్రావణాన్ని రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. (బైడు, మోచయ్య, 2016).
  • గోధుమ గింజల నిల్వ సమయంలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం పురుగుని వెల్లుల్లి, పసుపు ద్రావణాలు సమర్ధవంతంగా నివారించాయి (సజ్ౙద్ ఆలీ, అతని అనుచరులు, 2014)
  • వెల్లుల్లి పొడి, ద్రావణం, నూనె నిల్వ ఉంచిన అలసంద గింజలను కాల్లొసోబ్రూకస్ మాక్యులేటస్ కల్గించే నష్టం నుండి కాపాడాయి (డెన్లోమె, 2010)
  • గార్లిక్ ద్రావణం {+1% సబ్బు ద్రావణం పీచ్ పొటాటో పేనుబంక, మైజస్ పెర్సికెని నివారించింది (డాన్స్‌విక్ౙ్, అతని అనుచరులు, 2011)
  • వెల్లుల్లి, వేప, పొగాకు, కలబంద ద్రావణాలు పురుగుల నివారణకుపయోగిస్తాయి. వీ\న్నింటిలో వెల్లుల్లి ద్రావణం అతి సమర్ధవంతంగా పనిచేస్తుంది (మెలెస్, అతని అనుచరులు, 2012)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… మామిడల్లం పచ్చడి

ప్రకృతి మానవాళికి ప్రసాదించిన ఒక మంచి ఆహారం ‘మామిడి అల్లం’ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇది అల్లం జాతికి చెందిన దుంప. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చూడ్డానికి అల్లం దుంపలా వున్నా, గిచ్చి చూస్తే పచ్చి లేత మామిడికాయ వాసనతో చిన్న పాటి వగరుతో వుంటుంది.

మామిడి అల్లాన్ని ఉపయోగించి ‘వండనివంట’గా రోజువారీగా ఉపయోగపడే రోటి పచ్చడి చేసుకోవచ్చు.
కొన్ని రోజులు నిల్వ వుండే ఆవకాయ పచ్చడి లాగా కూడా చేసుకోవచ్చు.

మామిడల్లంతో రోటి పచ్చడి తయారీ…
మామిడల్లాన్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. దీనికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి చేర్చి చింత పండు లేదా నిమ్మ రసం కలిపి కచ్చాపచ్చాగా నూరుకుని, అన్నంలోకి లేదా రోటీలోకి తింటే చాలా బావుంటుంది.. (అవసరం అనుకున్న వారు ఎండుమిర్చితో తాలింపు పెట్టుకుంటే మరింత రుచి.. )
ఈ పచ్చడి ఏరోజుకారోజు చేసుకోవడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ వుండదు.

రెండవ పద్దతి ‘మామిడి అల్లం – ఆవకాయ’
మామిడల్లాన్ని కడిగి తేమ లేకుండా ఆరబెట్టాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
కోసుకున్న ముక్కలకు కొద్దిగ ఆవపిండి, కొద్దిగ కారం, సరిపడ ఉప్పు కలిపి, నువ్వుల నూనె కూడా సరిపడా కలిపి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా కలపాలి. తరువాత నిమ్మ రసం కలిపి వూరనివ్వాలి. ఇది అచ్చు చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిలా వుంటుంది. కొన్ని రోజులు ఫ్రిజ్ సహాయం లేకుండా నిల్వ వుంటుంది. ఫ్రిజ్‌లో దాస్తే మరింత తాజాగా వుంటుంది. అభిరుచినిబట్టి తాలింపు అదనం. గింజలు తీసిన పచ్చిమిర్చి ముక్కలు, కారెట్ ముక్కలు, మామిడి పొడి కూడా కలిపి మిక్సెడ్ పచ్చడి చేయవచ్చు.

  • రచన : సుబ్బారెడ్డి మేడపాటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వరల్డ్‌ జూనోసిస్‌ డే

జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా. అని ఓ మహాకవి తన గీతంలో పేర్కొన్నట్లు పెంపుడు జంతువులకు ఉండే విశ్వాసం కన్న కొడుకులకు కూడా ఉండదనే నానుడి ఏనాటి నుంచో వినిపిస్తుంది. పెంపుడు జంతువు కనబరిచే విశ్వాసం దాని పట్ల మనం ఏర్పర్చుకొనే ఆత్మీయత మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. మనిషి జంతువు మధ్య ఇలాంటి బంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. ఈ బంధం వెనుక ప్రాణాలను హరించే అంటురోగాల ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రేమను పెంచుకోవడం ఎంత అవసరమో అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా అంతే అవసరం. ఆప్యాయతలోనూ అప్రమత్తత! పెంపుడుజంతువుల పెంపకంలో జాగ్రత్తలు అవసరం . ముఖ్యంగా జంతులన్నింటిలో ఇళ్ళ దగ్గర ప్రత్యేకంగా మక్కువగా పెంచి పోషించడం తరతరాలుగా ఒక సంప్రదాయంగా వస్తుంది. జమిందారుల నుంచి రైతు కూలి వరకు తనకు సహాయంగా కుక్క ఉంటుందని పెంచుకుంటారు. కొన్ని చోట్ల యజమాని ఇంటి వద్ద లేనప్పుడు ఇంటికి కాపలా కాయడం మనకు తెలిసిందే. దొంగలను తరిమికొట్టడం దగ్గర నుంచి నాగుపాములను సైతం ఇంట్లోకి చొరబడకుండా అడ్డుకునే సంఘటనలు కూడా ఉన్నాయి. అటువంటి చోట పెంపుడు జంతువులన్నిటికన్నా ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ వాటి వల్ల వచ్చే రేబిస్‌ వ్యాధి కూడా అంతటి భయంకరమైనదే.

రేబిస్‌ వ్యాధినివారణకు సకాలంలో వ్యాక్సిన్‌ తీసుకోకపోతే ప్రాణానికే నష్టం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కుక్కకాటు మరణాలు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఆస్పత్రుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రేబిస్‌ నివారణ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండక ఎన్నో ప్రాణాలు హరించుకుపోతున్నాయి.

వ్యాక్సిన్‌ ఉత్పత్తి అంతంత మాత్రంగా ఉండడంతో కొరత చాలా ఎక్కువగా కన్పిస్తుంది. ఒక్క మనదేశంలోనే కాదు ఎన్నో దేశాల్లో ఇది తీవ్రమైన సమస్యగా ఉంటుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 95 శాతం మానవ మరణాల్లో రేబిస్‌ వ్యాధి వల్ల మృతులైనవారే ఎక్కువ శాతం మంది ఉంటున్నారు. 5 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కుక్కకాటు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో వ్యాక్సిన్‌ధర 40 డాలర్లు ఉంటే ఆసియా దేశాల్లో 49 డాలర్ల వరకు వ్యాక్సిన్‌కు ఖర్చుపెడితే కానీ దొరకడం లేదు. సామాన్యుని సగటు సంపాదన రెండు డాలర్లకు మించి లేనప్పుడు ఈ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి వినియోగించడం అనేది తన శక్తికి మించిన పని. అందుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి రేబిస్‌ రహిత ప్రపంచంగా మార్చాలని విశ్వప్రయత్నం చేస్తోంది. ఏటా పదిహేను మిలియన్‌ ప్రజలు కుక్కకాటు వల్ల రేబిస్‌ వ్యాధికి గురవుతున్నారు. పెంపుడు జంతువుల నుంచి సహజ సిద్ధంగా సంక్రమించే వ్యాధులను జునోసెస్‌ అంటారు. ఇలాంటి జూనోటిక్‌ వ్యాధులు దాదాపు200వరకు ఉన్నాయి.

అసలు జూనోసిస్‌ అంటే..

జూనోటిక్‌ అనే ఇటాలియన్‌ పదం నుంచి పుట్టిందే జూనోసిస్‌. ‘జూ’ అంటే జంతువులకు సంబంధించిన అంశం. మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్నే జూనోటిక్‌ వ్యాధులంటారు. ఇలాంటి వాటిని ఇప్పటి వరకు 253 వరకు గుర్తించారు.

వీటిలో ‘ర్యాబిస్‌’ (పిచ్చికుక్క వ్యాధి) అనేది అత్యంత ప్రమాదకరమైనది, ప్రాణాంతకరమైన వ్యాధి. లూయిస్‌పాశ్చర్‌ అనే వ్రఖ్యాత శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి జూలై ఆరు 1885 వ సంవత్సరంలో మొట్ట మొదటిసారిగా యాంటీర్యాబిస్‌ టీకాను వేసి సఫలీకృతులయ్యారు. ఆ రోజును అంటే జూలై ఆరో తేదీని ఆనాటి నుంచి వ్రతి సంవత్సరం ‘వరల్డ్‌ జూనోసిస్‌ డే’గా నిర్వహిరచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జూనెటిక్‌ వ్యాధుల గురించి వ్రజలను అవ్రమత్తర చేసి, రోగాల బారిన వడకుండా చేయటమే వరల్డ్‌ జూనోసిస్‌ డే ప్రధానోద్దేశ్యము . జంతువులు, వక్షులకు సంభంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సరక్రమించి సాధారణ సమస్యలతోపాటు ప్రాణహాని కలిగేంతటి వ్రమాద పరిస్థితులెదురవుతున్నాయి. ఈ కారణముగా జంతువులు, కోళ్లు, పక్షులను పెంచేవారు, ప్రయోగశాలలు, వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో వనిచేసేవారు, వశువుల ఆస్పత్రుల సిబ్బంది, చర్మము , తోళ్ల వరిశ్రమల కార్మికులు ఈ జూనోటిక్‌ ప్యాధుల వట్ల ఆప్రమత్తముగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఇలాంటి జూనోటిక్‌ వ్యాధులు దాదాపు200వరకు ఉన్నాయి. వీటిలో ర్యాబిస్‌ (పిచ్చి కుక్క వ్యాధి) అనేది అత్యంత ప్రమాదకర మైన, ప్రాణాంతకమైన వ్యాధి. లూయీస్‌ పాశ్చర్‌ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త, పిచ్చికుక్క కాటుకు గురి అయిన వ్యక్తికి జూలై 6, 1885 వ తేదీన మొట్టమొదటిసారిగా ఏంటీ ర్యాబిస్‌ టీకాను విజయవంతంగా చేశారు.చారిత్రకంగా, సాంకేతికంగా, వైజ్ఞానికంగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపో యే ఆ రోజును అంటే జూలై 6వ తేదీని ఆనాటి నుండి ప్రతి సంవ త్సరం వరల్డ్‌ జూనోసిస్‌ డే (ప్ర పంచ జూనోసిస్‌ దినోత్సవం)గా నిర్వహించుకోవటం ఆనవాయితీగావస్తోంది.

జంతువుల నుండి మ నుషులకు,మనుషుల నుండి జంతువులకు సంక్రమించే ఈ జూనో టిక్‌ వ్యాధుల గురించి ప్రజలకు, రైతులకు, పశువైద్య సిబ్బందికి అవగాహనను కల్పించడం ద్వారా, వారిని అప్రమత్తం చేసి, రోగాల బారిన పడకుండా చేయడం వరల్డ్‌ జూనోసిస్‌ డే ప్రధాన ఉద్దేశ్యం. జంతువులు, పక్షులను పెంచుకునేవారు వాటితో సన్నిహితంగా ఉంటారు. పాలను, పాలఉత్పత్తులను,మాంసం, జంతు ఉత్పత్తుల ను ఉపయోగించనివారు బహుశా ఎవరూ ఉండరు. ఆ క్రమంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జూనోటిక్‌ వ్యాధి బారినపడేఅవకాశం ప్రతి ఒకరికి ఉంటుంది. కాబట్టి వినియోగదారుల దృష్టిని ఆకర్షించి, ఈ వ్యాధులపట్ల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరూ తెలుసుకునేలా, ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించడానికి వరల్డ్‌ జూనోసిస్‌ డే నాడు పశు సంవర్థక శాఖ, పశు వైద్య కళాశాలలు, సంబంధిత సంస్థలు వివిధ కార్యక్రమాలను నిర్వహించటం జరుగు తుంది.

జూనోటిక్‌ వ్యాధులు మనుషులకు రావటానికి ఎన్నో మార్గాలున్నాయి. అవేంటంటే..మనిషి తన జీవనోపాధికి, పశువుల పెంపకం, గొర్రెల, మేకల పెంపకం, కోళ్లపెంపకం వంటి వృత్తుల పైన ఆధారపడటం సర్వసాధారణం. మరికొందరు వృత్తిగా కాకపోయినా,అవసరార్థం ఆసక్తితో,ఆకర్షణతో కొన్ని రకాల జంతువ్ఞలు, పక్షులను, పెంచుతూ ఉంటారు. వృత్తిగా చేపట్టినవారు ఆదాయాన్ని పొందుతున్నారు. దాంతో పాటే పాలు, గ్రుడ్లు,మాంసం వంటి పౌష్టి కాహారాన్ని తద్వారా ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఒక ఆసక్తితో పెంచేవారు ఆనందాన్ని, వినోదాన్ని పొందుతున్నారు.ఆదాయాన్ని ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే ఈ జంతువులు, పక్షుల పెంపకంలో కొన్ని సమస్యలు, ప్రమాదాలు కూడా పొంచిఉంటాయి.వృత్తిగా చేపట్టినా, ఆసక్తితో పెంచినా, యజమానులు, పనిచేసే వారు ఆయా జంతువులు, పక్షులకు అత్యంత సన్నిహితంగా మెలు గుతూఉంటారు.అలాంటప్పుడు ఆ జంతువులు,పక్షులకు సంబంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమించి, సాధారణ సమస్యల నుండి ప్రాణ హానిని కూడా కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి పశువులు, జంతువులు, కోళ్ళు, పక్షులను పెంచేవారు, జంతు ప్రయోగశాలలు, వ్యాధినిర్ధారణా కేంద్రాలలో పనిచేసేవారు, పశు వైద్యశాల సిబ్బంది, చర్మం, తోళ్ల పరిశ్రమలలో పనిచేసేవారు, ధాన్యపు గిడ్డంగుల్లో పనిచేసేవారు ఈ జూనోటిక్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకోవచ్చు. బ్యాక్టీరియా, వైరస్‌,ప్రోటోజోవా, ఫంగస్‌, క్లామిడే వంటి జీవుల వలన ఈ జూనోటిక్‌ వ్యాధులు వస్తాయి. 

వ్యక్తుల వయసు, ఆరోగ్య పరిస్థితి, శరీరంలోని వ్యాధినిరోధకశక్తి వంటి అంశాలను అనుసరించి ఈ వ్యాధులు సోకటం,వాటి తీవ్రత అవి కలిగించేహానీ ఆధారపడి ఉంటాయి. అలాగే వ్యాధి కారకం మనిషికి ఎంత వరకు హాని కలిగించగలుగుతుంది అనేది ఆ వ్యాధి కారకం రకం. జాతిపైన ఆధారపడి ఉంటుంది. గాలి, నీరు, ఆహారం, జంతు ఉత్పత్తులను వినియోగించటం ద్వారా వ్యాధి సంక్రమణ జరుగుతుంది.

  • వైరస్‌ ద్వారా వ్యాపించే జూనోటిక్‌ వ్యాధులు ర్యాబిస్‌, మెదడు వాపు, మ్యాడ్‌కౌ.
  • బాక్టీరియావల్ల వ్యాపించే జూనో టిక్‌ వ్యాధులు బ్రూసెల్లోసిస్‌, క్షయ, సాల్మొనెల్లోసిస్‌, ఆంత్రాక్స్‌, గ్లాండర్స్‌,
  • పరాన్న జీవుల వలన వ్యాపించే జూనోటిక్‌ వ్యాధులు ఏంకైలో, స్టోమియాసిస్‌, హైడాటియోసిస్‌, అలర్జీ, ఎగ్జిమా(గజ్జి) అమీబియాసిస్‌, బాలంటీడియోసిస్‌, టాక్సోప్లాస్మా.

ఏయే వృత్తుల లో ఉన్న వారికి ఏయే జూనోటిక్‌ వ్యాధులు రాగల అవకాశం ఉందో పరిశీలిద్దాం. పిచ్చి కుక్క కాటు వలన ర్యాబిస్‌, కుక్కపిల్లలతో ఆడే వారికి టాక్సోకారియాసిస్‌, కుక్కులను, లేగదూడలను తాకినప్పుడు గజ్జి, చర్మవ్యాధులు,పందులు, దోమలవలన మెదడువాపు వ్యాధి, అపరిశుభ్రమైన పాలు, గ్రుడ్లు,మాంసం వల్ల బ్రూసెల్లోసిస్‌, ఎలుకల వలన ప్లేగు, పశువులతో సన్నిహితంగా మెలగటం వల్ల క్షయవ్యాధి, ఉన్ని, తోళ్ల పరిశ్రమలలో పనిచేసేవారికి దొమ్మరోగం ( ఆంత్రాక్స్‌), సరిగా వుడకని గ్రుడ్లు, మాంసం వలన సాల్మొనెల్లోసిస్‌, పంది మాంసం వలన టినియా సోలియం, కర్ర కోత పనిచేసేవారికి సాల్మ నెల్లోసిస్‌, గొర్రెలు, మేకల కాపరులకు గజ్జి దురద, కోళ్ల ద్వారా రాణికెట్‌, సిట్టకోసిస్‌, మాంసపు పరిశ్రమలలోని కూలీలకు క్యూఫీవర్‌ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.

ప్రపంచాన్ని వణికించిన ముఖ్యమయిన జూనోటిక్‌ వ్యాధులు:

ర్యాబిస్‌ : పిచ్చికుక్క కాటు వలన ఈ వ్యాధి కలుగుతుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం 30వేల మంది ఈ వ్యాధి వలన చని పోతున్నట్లు ఒక అంచనా. మూగజీవాల ద్వారా మనుషులకు సోకే ప్రాణాంతకమైన వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది రాబిస్‌. తోడేళ్లు, నక్కలు, ముంగిసల్లో ఈవ్యాధికారక క్రిములు ఎప్పుడూ ఉంటాయి.
ఆంత్రాక్స్‌: జూనోటిక్‌ వ్యాధుల్లో , ఆంత్రాక్స్‌ ప్రాణాంతకమైనవి. ఈవ్యాధి స్పోర్స్ ఉన్న పచ్చగడ్డి ద్వారా పశువులకు సంక్రమిస్తుంది. గాలి ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. వ్యాధి నివారించాలంటే ఆంత్రాక్స్‌ వ్యాధి గుర్తించిన ఆరు కిలోమీటర్ల పరిధిలో ఐదేళ్లపాటు నిర్ణీతగడువులో వ్యాధినిరోధకటీకాలు చేయించాలి. మనుషుల్లో వ్యాధి సోకినట్లు అనిపిస్తే పరీక్షలు చేయించి అత్యవసర చికిత్స అందించాలి.

మెదడువాపు : మెదడు వాపు ని ఆంగ్ల భాషలో ఎన్‌సెఫలైటిస్ అని పిలుస్తారు. మెదడులోని కణజాలం ఒరుపుని (ఇన్‌ఫ్లమేషన్) మెదడు వాపు అని పిలుస్తారు. ఇది సాధారణంగా వైరస్‌ల వల్ల వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిలో అనేక రకాలను గుర్తించారు. భారతదేశంలో జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వైరస్ వల్ల మెదడు వాపు వస్తుంది. ఈ వైరస్ లు పక్షులు, పందులు, ఎలుకల్లాంటి వాటిలో ఉంటాయి. ఈ జీవులు వైరస్ లకు ఆశ్రయంగా పనిచేస్తాయి. వీటి నుంచి క్యూలెక్స్ దోమకాటు ద్వారా మానవుడిలోకి ప్రవేశిస్తాయి.ఈ వ్యాధి పందుల శరీరంపైన ఉండే దోమలు కాటు వేయటం ద్వారా సోకుతుంది. ఎందరో చిన్న పిల్లలు ఈ వ్యాధి వలన మరణిస్తున్నారు. తలనొప్పి, జ్వరం, మెదడు సక్రమంగా పనిచేయక ఒకవైపు పక్షవాతం కలగడం, మూర్ఛ రావడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు.

మ్యాడ్‌ కౌ వ్యాధి : ఆహారం వలన కలిగే వ్యాధి (దీనిని ఆహారం వలన కలిగే రోగము మరియు వ్యవహారికంగా విషాహార వ్యాధి అంటారు). కలుషితమైన ఆహారం తినడం వల్ల ఇది సంభవిస్తుంది ఒకప్పుడు ఇంగ్లండ్‌లో ఈ వ్యాధి వలన విప రీతమైన జన నష్టం జరిగింది. మ్యాడ్‌ కౌ డిసీజ్‌ గతంలో యూరప్‌ దేశాలను వణికించిన మహమ్మారి ఇది! గొడ్డు మాంసం(బీఫ్‌) ద్వారా ఈ వ్యాధి మనిషి మెదడుకి వ్యాపిస్తుంది. దీంతో వ్యాధి సోకిన వ్యక్తి. వ్యవహార శైలిలో తీవ్రమైన మార్పు చోటు చేసుకుంటుంది. ఒక రకంగా మానసిక రోగిగా మారిపోతాడు. జ్ఞాపక శక్తి కోల్పోవడం, శారీరకంగా నీరసించిపోవడం, పొంతన లేకుండా మాట్లాడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కారణంగా అప్పట్లో యూరప్‌ ప్రజలు లక్షలాదిగా గోవులను వధించారు. చాలా సంవత్సరాలపాటు గొడ్డు మాంసానికి దూరంగా ఉన్నారు.

బర్డ్‌ప్లూ: ఈ వ్యాధి అవయిన్‌లూప్లెంజా అనే సూక్ష్మక్రిమివల్ల వస్తుంది. ఇది గాలి ద్వారా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి వచ్చేటప్పుడు కోళ్ళుచాలా ఎక్కువగా చనిపోతాయి. ఈ వ్యాధితో ఉన్న కోళ్ళ మాంసం, రెట్టల ద్వారా మనుషులకూ వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా చలి కాలంలో వస్తుంది.
టీబీ: దీనిని ట్యూబోలలోసిస్ అంటారు. ఇది బ్యాక్టిరీయా ద్వారా మనుషులకు, పశువులకు వచ్చి ప్రతీ సంవత్సరం అనే మంది చనిపోతున్నారు. టీబీతో ఉన్న పశువుల పాలు బాగా మరిగించకుండా తాగినట్లైయితే మనుషులకు, చిన్న పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • వ్యాధి సోకిన జంతువులు, కోళ్ల మాంసం తినకూడదు, పూర్తిగా ఉడికిన మాంసాన్ని మాత్రమే తినాలి,సరిగా ఉడకని గ్రుడ్లను తిన కూడదు.
  • వ్యాధి సోకిన పశువుల పాలను సేవించకూడదు. చెడిపోయిన అపరిశుభ్రమైన పాలు, మాంసం, గ్రుడ్లు తినకూడదు. పాలను బాగా మరగించి తాగాలి.
  • పాడిపశువులను, జంతువులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు కాలాను గుణంగా ఇవ్వాల్సిన వ్యాధినిరోధక టీకాలను తప్పనిసరిగా చేయించాలి.
  • పాలను క్షేత్ర స్థాయిలో తప్పనిసరిగా ప్రాథమికంగా పరీక్షించాలి. పశువులు,జంతువులు, పక్షుల కొనుగోలు, అమ్మకాల కేంద్రాలలో డాక్టర్‌ సర్టిఫికేట్‌ తీసుకునే విధానం సక్రమంగా అమలు చేయాలి.
  • పోస్ట్‌మార్టం పరీక్షలు విధిగా నిర్వహించాలి, వధశాలల దగ్గర శుభ్రత, జంతువుల ఆరోగ్యంపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. ర్యాబిస్‌,ఆంత్రాక్‌, గ్లాండర్స్‌ వంటి వ్యాధులగురించి రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి.
  • మృత జంతు కళేబరాలను లోతైన గోతిలో సున్నం చల్లి వూడ్చివెట్టాలి.
  • జంతు ఆవాసాలను అప్పుడప్పుడు క్రిమిసంహారాకాలతో శుభ్రము చేయాలి
  • పెంపుడుకుక్కలకు తప్పనిసరిగా ఏంటీ ర్యాబిస్‌ టీకాను వేయించాలి. కుక్కలను పెంచేవారు, పశువైద్య సిబ్బంది ఏంటీర్యాబిస్‌ టీకాను ముందుగానే వేయించుకోవాలి.
  • పశువులు, జంతువులకు విధిగా నట్టల నివారణ చేయాలి, పౌల్ట్రీఫారాలు, జంతుప్రదర్శన శాలలు, సర్కస్‌ కంపెనీలలో పనిచేసే వారు, డైరీ ఫారాలలో పనిచేసేవారు, పశుపోషకులు,జంతుప్రేమికుల వ్యక్తి గత పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధచూపాలి. మాస్క్‌ ధరించటం శ్రేయ స్కరం. మృత జంతు కళేబరాలను లోతైన గోతిలో సున్నంచల్లి పూడ్చిపెట్టాలి.

పాటించాల్సిన జాగ్రత్తలివీ..

  • వీధి కుక్కల నిర్మూలన,
  • ఊరికి దూరంగా 3, 4 కిలోమీటర్ల దూరంలో పరిశుభ్రమైన వాతావరణంలో పందులు పెంచాలి.
  • పశుపెంపకం దారులు పాలఉత్పత్తిలో పరిశుభ్రత పాటించాలి.
  • పెంపుడు కుక్కలకు తప్పక రాబిస్‌ నిరోధక టీకాలు వేయించాలి.
  • చిన్నపిల్లలు కుక్కలతో ఆడేటపుడు నోట్లో చేతులు పెట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.

పశుసంవర్థకశాఖ, ఆరోగ్యశాఖ,పంచాయితీ, మున్సిపల్‌ అధికారులు ర్యాబిస్‌ నివారణకు సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు, జూనోటిక్‌ వ్యాధుల ప్రచారం, నివారణలో క్రియాశీలక పాత్ర వహించాలి. జూనోసిస్‌ డేను విజయవంతం చేసి ప్రజలలో అవగాహనను పెంచటంలో అందరూ సహకరించాలి.

కుక్క కరిస్తే తప్పక రాబిస్‌ వ్యాధి వస్తుందా?

  • మనుషుల్ని కుక్కలు కరవడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇలా కుక్కలు కరవడం వలన మనకు రాబిస్‌ వ్యాధి వచ్చేమాట నిజమే అయినా అది అన్ని కుక్కలకూ వర్తించదు. కేవలం పిచ్చి కుక్క కరిచినప్పుడు మాత్రమే మనకు రాబిస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మరి మనల్ని కరిచిన కుక్క పిచ్చిదో కాదో ఎలా తెలుస్తుంది అంటారా? అందుకో చక్కటి ఉపాయం ఉంది.
  • ఏదైనా ఒక కుక్క ఎటుపోవాలో ఎందుకు పోవాలో తెలీకుండా ఎక్కడి కంటే అక్కడికి పోతూ ఉండటం, దాని నోటి నుంచి చొంగ కారుతూ ఉండటం, అది ఎవరినిపడితే వారిని అకారణంగా కరుస్తూ ఉండటం వంటివి చేసినట్లయితే అది నిస్సందేహంగా పిచ్చికుక్కే అయి ఉంటుంది. అలాగే ఏదైనా ఓ కుక్క మనల్ని కరిచిన తరువాత పదిరోజుల్లోగా చనిపోయినా అది పిచ్చికుక్క అని తేలినట్లే.
  • ఏదేమైనా కుక్క కరిచినప్పుడు మన శరీరంపై అయ్యే గాయాలను కనీసం 5 -10 సార్లు సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి. దాంతో పాటు స్పిరిట్‌తో గానీ, అయోడిన్‌తోగానీ గాయాలను శుభ్రం చేస్తే కుక్కకాటు వల్ల సంభవించేందుకు అవకాశం ఉన్న ప్రమాదం నుండి మనం 90 శాతం బయటపడినట్లే. అయినాసరే, ఈ ప్రథమచికిత్స చేశాక డాక్టర్ని తప్పక సంప్రదించాలి.
  • ఏదేమైనా మనల్ని కరిచిన కుక్క పిచ్చిదో కాదో తెలుసుకోవడం కొంచెం కష్టమైన వ్యవహారం కాబట్టి, కుక్క కరిచినప్పుడు ముందుజాగ్రత్త చర్యగా టీకాలు వేసుకోవడమే మంచిది.
  • డాక్టర్.జి.రాంబాబు, పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు, కడప. Ph: 9494588885
Read More

జంతువులలో గాలికుంటు వ్యాధిని పోలి ఉండే వ్యాధులు మరియు వాటి భేదాత్మక నిర్ధారణ

జంతువులలో కనిపించే అంటువ్యాధులలో గాలికుంటు వ్యాధి ఒక అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది ముఖ్యంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులలో కనిపిస్తుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు నోటిలో పుండ్లు, కాళ్ల వద్ద గాయాలు, జ్వరం మరియు ఆహారం తినకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే గాలికుంటు వ్యాధి లాంటి లక్షణాలు మరికొన్ని వ్యాధులలో కూడా కనిపిస్తాయి. అందువల్ల సరైన చికిత్స మరియు నియంత్రణ చర్యల కోసం భేదాత్మక నిర్ధారణ చాలా అవసరం.

ఒక నిర్దిష్ట వ్యాధి లేదా పరిస్థితిని, అదే విధమైన లక్షణాలు చూపించే ఇతర వ్యాధుల నుంచి వేరు చేసి గుర్తించడాన్నే భేద నిర్ధారణ లేదా భేదాత్మక నిర్ధారణ అంటారు. ఇందులో మొదట సంభావ్య వ్యాధుల జాబితా తయారు చేసి, తరువాత పరీక్షలు లేదా మూల్యాంకనాలు చేసి ఒక్కో అవకాశాన్ని తొలగిస్తూ చివరికి అత్యంత సంభావ్యమైన నిర్ధారణకు చేరుకుంటారు. జంతువులలో ఒకే విధమైన లక్షణాలు అనేక వ్యాధులలో కనిపిస్తాయి. ఉదాహరణకు గాలికుంటు వ్యాధి, వెసిక్యులర్ స్టొమటైటిస్, నీలినాలుక వ్యాధి వంటి వ్యాధులలో నోటిలో పుండ్లు మరియు కాళ్ల వద్ద గాయాలు కనిపించవచ్చు. అందువల్ల సరైన వ్యాధిని ఖచ్చితంగా గుర్తించడం చాలా అవసరం. 

సాధారణంగా భేదాత్మక నిర్ధారణ కోసం చరిత్ర తెలుసుకోవడం (అంటే ఇతర జంతువులకు వ్యాపించిందా, ఇటీవల కొత్త జంతువులు తీసుకొచ్చారా, టీకాలు వేయించారా), క్లినికల్ పరిశీలన (జంతువులో కనిపించే లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించడం) మరియు ప్రయోగశాల పరీక్షలు (ఎలైసా & పి.సి.ఆర్)  వంటి పద్ధతులను పాటిస్తారు.

భేదాత్మక నిర్ధారణ యొక్క ప్రాముఖ్యత

  • సరైన వ్యాధి గుర్తింపు – లక్షణాలు ఒకేలా ఉన్నా నిజమైన వ్యాధిని గుర్తించడంలో సహాయపడుతుంది.
  • సరైన చికిత్స అందించడం – వ్యాధిని సరిగ్గా గుర్తిస్తే తగిన మందులు మరియు చికిత్స ఇవ్వవచ్చు.
  • వ్యాధి వ్యాప్తి నియంత్రణ – అంటువ్యాధులను త్వరగా గుర్తించి ఇతర జంతువులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు.
  • ఆర్థిక నష్టాన్ని తగ్గించడం – పాల ఉత్పత్తి తగ్గడం, జంతువుల మరణాలు వంటి నష్టాలను తగ్గించవచ్చు. .
  • అనవసర చికిత్స నివారణ – తప్పు నిర్ధారణ వల్ల అవసరం లేని మందులు వాడకుండా ఉంటుంది.
  • టీకాలు మరియు నివారణ చర్యలకు సహాయం – సరైన వ్యాధి తెలిసిన తర్వాత తగిన టీకాలు మరియు నియంత్రణ చర్యలు తీసుకోవచ్చు.
  • పశుసంపద రక్షణ – రైతుల పశుసంపదను ఆరోగ్యంగా కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
  • ప్రయోగశాల పరీక్షల అవసరాన్ని నిర్ణయించడం – ఏ పరీక్షలు చేయాలో నిర్ణయించడానికి సహాయపడుతుంది. ఈ వ్యాసంలో గాలికుంటు వ్యాధిలో ఉండే లక్షణాలు ఏంటి మరియు దానిని పోలిఉండే ఇతర వ్యాధులు, వాటి లక్షణాలు, సరైన వ్యాధిని గుర్తించడం ఎలా అనే వాటి గురించి తెలుసుకుందాము.

గాలికుంటు వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు

  • అధిక జ్వరం
  • నోటిలో పుండ్లు మరియు బుడగలు
  • నాలుకపై గాయాలు
  • కాళ్ల గిట్టల వద్ద పుండ్లు
  • ఎక్కువగా లాలాజలం కారడం
  • కుంటుతూ నడవడం
  • పాల ఉత్పత్తి తగ్గడం వ్యాధికి గురయ్యే జంతువులు – ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులు
    గాలికుంటు వ్యాధి ని పోలిఉండే ఇతర వ్యాధులు:
  1. వెసిక్యులర్ స్టొమటైటిస్:
    కారణం : రేబ్డో విరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులో వైరస్ వల్ల వచ్చే వ్యాధి.

లక్షణాలు

  • నోటిలో బుడగలు
  • నాలుకపై గాయాలు
  • కాళ్ల వద్ద పుండ్లు
  • అధిక లాలాజలం
    వ్యాధికి గురయ్యే జంతువులు – గుర్రాలు, ఆవులు, పందులు, గొర్రెలు, మేకలు మరియు అడవి జంతువులు
    గాలికుంటు వ్యాధితో తేడా – ఇది ముఖ్యంగా గుర్రాలలో కూడా కనిపిస్తుంది, కానీ గాలికుంటు వ్యాధి గుర్రాలలో సాధారణంగా రాదు.
  1. బోవైన్ వైరల్ డయేరియా:
    కారణం – ఫ్లేవి విరిడే కుటుంబానికి చెందిన పెస్టి వైరస్ వల్ల వచ్చే వ్యాధి

లక్షణాలు

  • నోటిలో గాయాలు
  • విరేచనాలు
  • బలహీనత
  • జ్వరం
    వ్యాధికి గురయ్యే జంతువులు – గుర్రాలు, ఆవులు, పందులు, గొర్రెలు, మేకలు మరియు అడవి జంతువులు
    గాలికుంటు వ్యాధితో తేడా – కాళ్ల వద్ద బుడగలు సాధారణంగా ఉండవు మరియు విరేచనాలు ఎక్కువగా కనిపిస్తాయి.
  1. రిండర్పెస్ట్ పశువుల్లో పారుడు వ్యాధి:
    కారణం – పేరామిక్సో విరిడే కుటుంబానికి చెందిన మోర్బిలి వైరస్.
    లక్షణాలు
  • అధిక జ్వరం
  • నోటిలో పుండ్లు
  • విరేచనాలు
  • నీరసం
    వ్యాధికి గురయ్యే జంతువులు ఆవులు, గేదెలు
    గాలికుంటు వ్యాధితో తేడా – తీవ్రమైన విరేచనాలు ప్రధాన లక్షణం. కాళ్ల గాయాలు తక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి ఇండియాలో అధికారికంగా నిర్మూలించబడింది.
  1. నీలినాలుక వ్యాధి :
    కారణం – రియో విరిడే కుటుంబానికి చెందిన ఆర్బి వైరస్
    లక్షణాలు
  • నోటి వాపు
  • నాలుక నీలం రంగులో మారడం
  • జ్వరం
  • కుంటడం
    వ్యాధికి గురయ్యే జంతువులు – గొర్రెలు, మేకలు, ఆవులు మరియు జింకలు
    గాలికుంటు వ్యాధితో తేడా – గొర్రెలలో ఎక్కువగా కనిపిస్తుంది మరియు మరియునాలుక నీలం రంగులో ఉండటం ప్రత్యేక లక్షణం.
  1. కాంటాక్ట్ డెర్మటైటిస్:
    కారణం – రసాయనాలు లేదా విషపదార్థాల వల్ల చర్మం దెబ్బతినడం.
    లక్షణాలు
  • కాళ్ల వద్ద గాయాలు
  • చర్మ వాపు
  • నడవడంలో ఇబ్బంది
    వ్యాధికి గురయ్యే జంతువులు – ఏ జంతువైనా రసాయనాలు మరియు విషపూరిత పదార్థాలను తాకడం లేదా తినడం వల్ల
    గాలికుంటు వ్యాధితో తేడా – నోటిలో పుండ్లు ఉండవు. ఇది అంటువ్యాధి కాదు.
  1. ఫుట్ రాట్:
    కారణం – ఫ్యూజోబ్యాక్టీరియం నెక్రోఫోరం మరియు డైకిలోబ్యాక్టార్ నొడోసస్ వంటి బ్యాక్టీరియా.
    లక్షణాలు:
  • కాళ్లలో వాపు
  • నడవడంలో ఇబ్బంది లేదా కుంటడం
  • గిట్టల మధ్య దుర్వాసనతో కూడిన పుండ్లు
  • తీవ్రమైన నొప్పి మరియు ఇన్ఫెక్షన్
    వ్యాధికి గురయ్యే జంతువులు: గొర్రెలు, మేకలు, పశువులు మరియు ఇతర గిట్టలున్న జంతువులు
    గాలికుంటు వ్యాధితో తేడా – గాలికుంటు వ్యాధి వల్ల నోటిలో మరియు గిట్టలపై బొబ్బలు ఏర్పడతాయి. కాగా ఫుట్రాట్ ప్రధానంగా గిట్టల ప్రాంతానికే పరిమితమై, కుంటడం మరియు గిట్టలు దెబ్బతినడం కలిగిస్తుంది, గిట్టల మధ్య భాగంలో దుర్వాసనతో కూడిన కుళ్లిన కణజాలాన్ని కలిగిస్తుంది. ఇందులో సాధారణంగా నోటిలో పుండ్లు కనిపించవు.
  1. మౌత్ రాట్:
    కారణం – అవకాశవాద బ్యాక్టీరియా లైన ఏరోమోనాస్, సూడోమోనాస్ మరియు సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా
    లక్షణాలు
  • నోటిలో దుర్వాసన
  • పుండ్లు
  • తినకపోవడం
    వ్యాధికి గురయ్యే జంతువులు – ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పక్షులు మరియు వేరే ఏ జంతువైనా పైన పేర్కొన్న బ్యాక్టీరియా సోకినప్పుడు
    గాలికుంటు వ్యాధితో తేడా – కాళ్ల వద్ద గాయాలు ఉండవు. ప్రధానంగా నోటిలోనే సమస్య ఉంటుంది.

ముగింపు
గాలికుంటు వ్యాధిని పోలి కనిపించే అనేక వ్యాధులు జంతువులలో కనిపిస్తాయి. భేద నిర్ధారణ అనేది పశువైద్యంలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. సరైన భేద నిర్ధారణ లేకపోతే తప్పు చికిత్స జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల క్లినికల్ లక్షణాలు, ప్రయోగశాల పరీక్షలు మరియు జంతువు చరిత్ర ఆధారంగా ఖచ్చితమైన నిర్ధారణ చేయాలి. రైతులు మరియు పశువైద్యులు అప్రమత్తంగా ఉండి సమయానికి చర్యలు తీసుకుంటే పశుసంపదను రక్షించవచ్చు. దీని ద్వారా జంతువుల ఆరోగ్యం మెరుగుపడి రైతులకు ఆర్థిక రక్షణ లభిస్తుంది.

డా.తనూజ నాదెళ్ళ, సహాయ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ గాలికుంటు వ్యాధి సహకార కేంద్రం, వి.బి.ఆర్.ఐ., విజయవాడ. ఫోన్: 9121000747

Read More

తులసి – కలబంద ద్రావణం

తులసి కలబంద ద్రావణం శక్తివంతమైన ద్రావణ ఎరువేకాకుండా బ్యాక్టీరియా, వైరస్ నిరోధకంగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేసుకోవడం చాలా తేలిక కూడా. మన పొలంలోనే లభించే తులసి ఆకులు మూడు నాలుగు కిలోలు, కలబంద మూడు నాలుగు కిలోలు సేకిరించి చిన్న ముక్కలుగా తరగాలి. వాటిని ఒక తొట్టెలో లేదా డ్రమ్ములో వేసి దానికి పది కిలోల కోళ్ల ఎరువు, పది కిలోల పేడ, పదిలీటర్ల మూత్రం కలపాలి. ఈ విశ్రమానికి ఒక కిలో బెల్లం చేర్చాలి. రోజూ కలుపుతూ పోతే వారం రోజుల్లో తులసి, కలబంద నీటిలో పూర్తిగా కలిసి ద్రావణంగా మారుతుంది. దీన్ని పైరుకు పైపాటుగా పిచికారి చేయడంతో పాటు నేల తడిలో కలిపి కూడా ఇవ్వవచ్చు. పై పాటు పిచికారికి లీటరుకు 50 మిల్లీ లీటర్ల ద్రావణం కలుపుకోవాలి. ఈ ద్రావణం శక్తివంతమైన ద్రవ ఎరువే కాకుండా శిలీంద్ర, బ్యాక్టిరియా, వైరల్ సమస్యలను అడ్డుకుంటుంది.

రైతునేస్తం ప్రచురణ ‘ స్వేద వేదం ’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More