గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి నివారణ ఎలా?

ఈ వ్యాధిని మూతివాపు, మూతిపుండ్లు, పూతరోగం మొదలగు పేర్లతో వివిధ ప్రాంతాలలో వ్యవహరిస్తారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న గొర్రెలలో నాలుక నీలిరంగుకు మారుతుంది. కావున ఈ వ్యాధిని నీలిరంగు వ్యాధి అని వ్యవహరిస్తారు.

వ్యాధి ఎలా వస్తుంది?
ఈ వ్యాధి వైరస్ వలన కలుగుతుంది. దోమకాటు వలన ఈ క్రిములు గొర్రె శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. వర్షాకాలంలో వ్యాధి క్రిముల అభివృద్ధికి మరియు అవి విస్తరింపచేసే దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది.

వ్యాధి లక్షణాలు:

  • వ్యాధి సోకిన గొర్రెలలో జ్వరం ఎక్కువగా ఉంటుంది.
  • క్రమేణా జ్వరం ఉన్న గొర్రెలకు చొంగ కారుతూ, పెదవులు మరియు చిగుళ్ళు వాచి, పెదవుల లోపలి భాగం ఎర్రబడి, చిన్న చిన్న గుల్లలు ఏర్పడతాయి.
  • వ్యాధి తీవ్రంగా ఉన్న గొర్రెలలో ఈ వ్యాధి కాళ్ళకు కూడా పాకుతుంది. గిట్టల మొదటి భాగం వాచి, గిట్టల మధ్య ఎర్రగా ఉంటుంది. కావున గొర్రెలు సరిగా నడవలేక మేత సమయంలో వెనుకపడతాయి.
  • వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుకు మారుతుంది. మరియు మెడ వంకర పోతుంది.
  • వ్యాధి తీవ్రతను బట్టి 5Ð6 రోజులు మేత మేయక, నీరు త్రాగకపోవుట వలన గొర్రెలు నీరసించి చివరికి చనిపోతాయి.

వ్యాధిని ఎలా నివారించాలి?

  • వ్యాధి నివారణ టీకాల ఉత్పత్తికి ప్రస్తుతము పరిశోధనలు చివరి దశలో ఉన్నాయి.
  • వర్షాకాలంలో కొట్టం, పరిసర ప్రాంతాలలో ఈగలు, దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలి.
  • రోజుకు రెండు పర్యాయాలు వేపాకుతో పొగ వేసిన యెడల దోమలను నివారించవచ్చు.

చికిత్స:

  • వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యుని సంప్రదించి, యాంటిబయోటిక్ మరియు నొప్పి నివారణ మందులు వాడడం ద్వారా వ్యాధిగ్రస్తమైన గొర్రెలు చనిపోకుండా కాపాడుకోవచ్చు.
  • నోటిలోని పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేటు ద్రావణంలో కడిగి జింక్ పౌడర్ నీటితో రుద్దాలి. గిట్టల మధ్య ఉన్న పుండ్లను కడిగి హిమాక్స్, నీమ్‌లెంట్ వంటి ఆయింట్‌మెంటులు పూయాలి.
  • కస్తూరి దిలీప్, పిహెచ్.డి. స్కాలర్, వి.వి.వి. అమృత్‌కుమార్, ప్రొఫెసర్, పశువైద్య విభాగం, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్: 9391097150
Read More

వండని వంట… మామిడి పిందెల పచ్చడి

మామిడి పిందెలను కొన్నిటిని, నీళ్లలో వేసి కొద్దిగా నాననిచ్చి, పిందెల మీద గట్టిపడి ఉన్న సొనను కడగాలి.
కడిగిన మామిడి పిందెలను శుభ్రంగా గుడ్డతో తుడవాలి.

ఏ మాత్రం తేమ లేకుండా, నీడకు ఆరబెట్టాలి. నీటి తేమ ఉంటే, పచ్చడి నిల్వ ఉండదు, బూజు పడుతుంది.

ఉప్పు తగినంత లేకపోయినా, నిల్వ పచ్చడి బూజు పడుతుంది.

పిందెలను కత్తితో నాలుగు ముక్కలు కోసుకోవాలి. ముక్కల్లో ఉన్న జీడిని తీసెయ్యాలి. అప్పటికి ఇంకా పిందెల్లో పిక్క గట్టి పడదు. పిక్క పొయ్యని పిందెలను, మామిడి రోటి పచ్చడి చేసుకోవచ్చు. లేదా ముదిరితే, కండను కోసుకుని, పిక్కను జీడిని తీసేసి, పచ్చడి చేసుకోవచ్చు.

మనకు లభించిన మామిడి పిందెలను బట్టి చేసుకోవాలి. మార్కెట్లో కూడా దొరుకుతాయి.

ఒక రకం మామిడి మొక్కలు, సంవత్సరం పొడవునా పూత పిందె వచ్చేవి కూడా ఉన్నాయి. వాటిని మిద్దెతోట, పెరటితోట సేద్యంలో చక్కగా పెంచుకోవచ్చు. (మామిడి జీడిని కూడా ఎండబెట్టి పొడి చేసుకొని వాడుతారు అని, నేలకొండపల్లి ప్రకృతి వైద్యుడు ఒకరు చెప్పారు)

జీడి తీసిన మామిడి పిందె ముక్కలకు తగినంత ఉప్పు, కారం, ఆవపొడి, కొద్దిగా మెంతిపొడిని కలపాలి.

తగినన్ని వెల్లుల్లి పాయలను, జీలకర్రను కూడా మెత్తగా నూరి ముక్కల్లో కలపాలి. ఇక్కడి వరకు, ఇది మామిడి బద్దల పచ్చడి పద్ధతి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని రోట్లో వేసి మెత్తగా నూరి, కొద్దిగా గానుగ నూనె పోసుకుని, సీసాలోకి ఎత్తుకోవాలి.

బయట వాతావరణంలో కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది.
పచ్చడి బూజు పట్టింది అంటే, ఉప్పు తక్కువ అవడం వలన కానీ, తడి తగలడం వలన కానీ అవుతుంది. జాడి లేదా సీసా నుండి నిల్వ పచ్చడిని స్పూన్‌తో తీసేటప్పుడు, మన చేతి వ్రేళ్లకు కూడా ఏ మాత్రం తేమ ఉండకూడదు.

వేడివేడి అన్నం మీద, మామిడి పిందెల రోటి పచ్చడి వేసుకొని, కాస్తా గానుగ నూనె లేదా నెయ్యి వేసి తింటే, ఆవ ఘాటుతో ఎంతో రుచికరంగా ఉంటుంది.

ఇందులోని దినుసుల్లో ఎవరి అభిరుచి ప్రకారం వారు, స్వల్ప మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉప్పు మాత్రం తగినంత ఉండాలి. వంటలకు కొత్తవారు కూడా ట్రై చెయ్యవచ్చు. మొదట ఉప్పు తక్కువగా వేసి, రుబ్బిన తరువాత రుచి చూసుకుని, అవసరం ఉంటే, మరింత కలుపుకోవాలి.

మామిడి పిందెలతో వేపని, ఉడికించని, నిల్వ రోటి ‘పచ్చి పచ్చడి’ తయ్యారు!

మామిడి పిందెలు కుటుంబం అవసరాలకు మించి, చెట్ల నుండి రాలుతున్నప్పుడు, ఇలా నిల్వ పచ్చడి పెట్టి అమ్మవచ్చు.

రచన: తుమ్మేటి రఘోత్తమరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

కుళ్ళిన పండ్లు లేక కూరగాయల మిశ్రమ ద్రావణం

ఈ మిశ్రమం సూక్ష్మక్రిములకు, వానపాములకు ఆహారంగా ఉపయోగపడి మొక్క ఆరోగ్యంగా పెరుగుటకు దోహదపడుతుంది.

మోతాదు : ఎకరానికి 50 లీటర్లు

కావలసిన పదార్థాలు : ఆవుపేడ : 25 కిలోలు; నీరు : 50 లీటర్లు; కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలు : 20 కిలోలు.

తయారు చేయు విధానం: ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో నీరు, ఆవుపేడ కలిపి నాలుగు రోజులు మురగబెట్టాలి. కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలను ఒక డ్రమ్ములో వేసి మూతబెడితే 4 రోజులలో కుళ్ళిపోతాయి. వీటిని అదే రోజున మెత్తగా పిసికి, ఆవుపేడ, నీళ్ళు కలిపిన డ్రమ్ములో వేసి కలియ పెట్టాలి. ఆపైన మూత వదులుగా పెట్టి, మరుసటి రోజున ఈ మిశ్రమాన్ని కర్రతో కలిపి డ్రమ్ముపై మూతపెట్టాలి. 10 రోజులలో మిశ్రమం తయారవుతుంది. 11వ రోజున ఈ మిశ్రమాన్ని వడబోసి, సుమారు 50 లీటర్లు ఒక ఎకరం పొలంలో నీటిద్వారా గాని, లేదా కళ్ళాపిలా గాని నేలపై చల్లాలి.

Read More

ఔషధ మొక్క…. అడవి సీతాఫలం

అడవి సీతాఫలం అనోనేసి కుటుంబంలోని ఒక పూల మొక్క. ఈ మొక్కని సెనెగల్ నుండి సేకరించారు. ఇది ఒక పొద లేదా చిన్న చెట్టు. ఈ మొక్క 2 నుండి 6 మీ. ఎత్తు పెరుగుతుంది. బెరడు నున్నగా లేదా గరుకుగా గ్రే సిల్వర్ లేదా గ్రే బ్రౌన్ రంగులో ఉంటుంది. కొత్త కొమ్మలు మందమైన గ్రే, గోధుమ రంగు లేదా పసుపు రంగుతొడుగు కలిగి ఉంటుంది. తర్వాత వయసుతో పాటు ఊడిపోతుంది. ఆకులు ఆకుపచ్చ లేదా నీలి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుపై వైపున నూగు ఉండదు. అడుగువైపున నూగు ఉంటుంది. పూవ్వు 3 సెం.మీ. వ్యాసం కలిగి ఉండి 2 సెం.మీ. కాడపై ఏర్పడతాయి. కాయలు అనేక కలిసిపోయిన మెత్తని, ఉబ్బెత్తు 2.5-5.0 సెం.మీ. అండాకారం లేదా గుండ్రని పుష్పపు గర్భకోశాలు కలిగి ఉంటాయి.

సాధారణ నామం : వన్యసీతాఫలం / ఆఫ్రికన్ సీతాఫలం శాస్త్రీయ నామం : అనోనాసెనెగలెన్సిస్ కుటుంబం: అనోనేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • పండులోని తెల్లని గుజ్జు ఆహ్లాదకరమైన అనాస పండు వాసనలో ఆప్రికాట్ రుచి కలిగి ఉంటుంది.
  • ఆకులను కొన్నిసార్లు కూరగా వండుకుని తింటారు. పూలను సుగంధద్రవ్యంగా ఉపయోగిస్తారు.
  • విచ్చుకోని పూల మొగ్గలను సూపులో ఉపయోగించుతారు.
  • మొక్క బెరడుని డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్, పాముకాటు, పళ్ళనొప్పి, శ్వాసకోశ అంటువ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • బెరడుని కొరికి గాయలపై లేపనంగా పూస్తారు. బెరడు, వేర్లను కలిపి నూరి పాము కాటు గాట్లపై పూస్తారు.
  • బెరడు నుండి కారే బంకను తెగిన చోట, గాయాలపై పూస్తారు.
  • ఆకులను న్యుమోనియా చికిత్సలో, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి టానిక్‌గా ఉపయోగిస్తారు.
  • వేర్లను కడుపునొప్పి, సుఖవ్యాధులు, రొమ్ము జలుబు చికిత్సలో ఉపయోగిస్తారు.
  • కాయలను డయేరియా, డిసెంట్రి, వాంతుల నివారణకుపయోగిస్తారు.
  • అనేక మొక్క భాగాలను కలిపి చర్మ వ్యాధులు, క్షయ వల్ల కలిగే సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • అడవి సీతాఫలం గింజలు, బెరడుని పురుగుల నివారణకు ఉపయోగిస్తారు.
  • రిపబ్లిక్ ఆఫ్ బెనిన్‌లో వన్య సీతాఫలం తాజా ఆకులను కోళ్ళగూళ్ళలో పరచి అవి ఎండే వరకు ఉంచుతారు. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేసి ఫ్లీస్, నల్లులను నివారిస్తారు.
  • వన్యసీతాఫలంలో టానిన్లు, ఫ్లేవనాయిడ్స్, సపానిన్స్, ఆల్కలాయిడ్స్, గ్లెåకోసైడ్లు, స్టీరాయిడ్లు, ఆవిరైపోయే నూనెలు, యాంథోసయనిన్స్ వంటి రసాయనాలు ఉంటాయి. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్, మాంగనీస్, ప్లాటినం, క్రోమియం వంటి ఖనిజాలతో పాటు ఆస్కార్బిక్ యాసిడ్, అమినో యాసిడ్లు కూడా ఉంటాయి. అందువలన అది ఒక ముఖ్య పోషక మూలం. దీని కాండం బెరడులో ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉంటుంది. కాంగో అనే శాస్త్రవేత్త ఈ మొక్క ఆకులు, కాండం బెరడు, వేరు బెరడు, ఎపికార్ప్, మీసోకార్ప్‌లో ఎసెన్షియల్ ఆయిల్‌ని కనుగొన్నారు. దీని భాగాల నుండి వేరు చేసిన రసాయనాలు యాంటి మైక్రోబియల్ లక్షణాలు కూడా కలిగి ఉన్నాయి.
  • కాండం, బెరడు ఇథనాల్ ద్రావణం బెండ, జొన్న, టమాట గింజల నాశించి మొలక శాతాన్ని తగ్గించే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్, శిలీంద్రాలను నివారించింది. (అక్పోర్, అతని అనుచరులు, 2015)
  • వన్య సీతాఫలం జీవ పురుగు మందు. అలసంద పంటలో పేనుబంక పురుగులను నివారించింది (కోలో, అడము, 2016)
  • వన్య సీతాఫలం బెరడు, ఆకు పొడి, ద్రావణం మిరియాల పంటనాశించే వేరు బుడిపె నులి పురుగు (మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట)ల సంఖ్యను తగ్గించాయి (అగాఒ, ఫావోల్, 2015).
  • వన్య సీతాఫలం ఎండు ఆకులను ధాన్యం గింజలకు కలిపి నిల్వ సమయంలో ఆశించే పురుగులను నివారించవచ్చు. (థాకర్, 2002).
  • వన్యసీతాఫలం ద్రావణం కొన్ని జీవ చర్య మిశ్రమాలను కలిగి ఉండి, కీటక నాశక మరియు యాంటీ ఫీడెంట్ చర్యలతో నిల్వ ధాన్యంలో ఆశించే రెడ్ ఫ్లోర్ బీటిల్ (ట్రైబోలియం కాస్టానియం)ని అరికట్టింది (ఒసెని, అతని అనుచరులు, 2013).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… వంకాయ – ఊరగాయ

కొద్దిగా ముదిరిన వంకాయలు ఆరు తీసుకుని కడిగి, తడి లేకుండా తుడిచి, చిన్న చిన్నముక్కలుగా కోసుకోవాలి.

ఈ ముక్కలకు కొంచెం పసుపు, తగినంత ఉప్పు కలపండి.

శుభ్రంచేసిన చింతపండు నిమ్మకాయంత తీసుకుని, వంకాయ ముక్కల మధ్యలో పెట్టి మూత పెట్టండి. ఒక పూట అయిన తర్వాత మూత తీసి, చింతపండు విడిగా తీసి, దానికి తగినంత కారం, ఇష్టమయితే వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీలో బరకగా చేసుకోవాలి.

ఇప్పుడు వంకాయలను గట్టిగా పిసికి వచ్చిన రసానికి ఈ గుజ్జు కలిపి, వంకాయ ముక్కలకు బాగా కలిసే లాగ చేయాలి. చిన్నగిన్నెడు గానుగ నూనెను, ఈ మిశ్రమంలో వేసి కలపాలి. నాలుగైదు గంటలు వూరిన తరువాత, కమ్మటి నెయ్యితోగాని, నూనెతో గాని వేసుకుని, వేడి అన్నంతో తింటే బాగుంటుంది.

రచన: సుబ్బలక్ష్మి మంచికంటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

నేలసారాన్ని పెంచే అమృత జలం

ఇది నేలసారాన్ని మెరుగుపరచి, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను వృద్ధిచేస్తుంది. మొక్కలు బలంగా, ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. సేంద్రియ మరియు సహజ వ్యవసాయానికి ఇది చాలా అనువైనది.

మోతాదు: ఎకరాకు 200 లీటర్లు సాగు నీరు ద్వారా గానీ, భూమిపైన గాని చల్లాలి.

కావలసిన పదార్థాలు : ఆవుపేడ: 10 కేజీలు; ఆవు నెయ్యి : 250 గ్రాములు; తేనె / నల్లబెల్లం : 500 గ్రాములు.

తయారు చేయు విధానం: ముందుగా ఆవుపేడ మట్టి కుండలో వేసి పావుకిలో ఆవునెయ్యి వేసి సుమారు 2 గంటలు బాగా కలిపి తర్వాత తేనె లేక బెల్లపు నీరు (అరకేజి బెల్లంకు అర లీటరు నీరు) పోసి 2 గంటలు ఆవుపేడను బాగా పిసుకుతూ కలపాలి. తర్వాత నీటిలో కళ్ళాపిలాజేసి 200 లీటర్ల డ్రమ్ములో పోసి డ్రమ్మునిండా నీరు పోస్తూ కలుపుతుండాలి. డ్రమ్ము నింపిన తర్వాత మిశ్రమాన్ని సుమారు 3 లేక 4 గంటలు కర్రతో త్రిప్పి ఆ తర్వాత ఎకరం పొలంలో కళ్ళాపిలా చిమ్మడం గాని లేక పారుతున్న నీటిలో పోస్తూ గాని భూమికివ్వాలి.

Read More

ఔషధ మొక్క…. నేలవేము

సాధారణ నామం : కింగ్ బిట్టర్స్ శాస్త్రీయ నామం : ఏండ్రోగ్రాఫిస్ పెనిక్యులేటా కుటుంబం: అకాన్థేసి

కొన్ని ప్రాంతాలలో ‘కాల్‌మేఘ’ అని కూడా పిలువబడే మొక్క సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే మందు మొక్క. అనేక శాఖలున్న ఈ మొక్కల ఆకులు కణుపుకి రెండు చొప్పున ఏర్పడి కోలాకారంలో ఉంటాయి. పూలు జనవరి-అక్టోబర్ మాసాలలో ఎక్కువగా పూస్తాయి. ఈ మొక్క రబీ సీజన్‌లో (నవంబర్-జనవరి) ఎక్కువగా కనబడుతుంది. ఎక్కువగా అడవులకు దగ్గరగా ఉన్న భూములలోను, తేలికపాటి నేలల్లోను అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత కాలంలో ఈ మొక్కను వైద్యం కోసం గృహాలలో కూడా పెంచుకోవడం జరుగుతుంది..

ఉపయోగాలు : వ్యవసాయరంగంలో

  • నేలవేము మొక్కల్లో ఉన్న ‘ఆండ్రోగ్రాఫోలిడ’ అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, భక్షక నిరోధకంగా, క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. అందువల్ల ఆకులను సస్యరక్షణలో “కషాయం”గా కానీ, “పంచపత్ర కషాయం (వివిధ ఆకుల ద్రావణం)”లో గానీ రైతులు ఉపయోగించుకోవచ్చు.
  • నేల వేము కషాయంలో ఉన్న రసాయనాలు ఎంతో శక్తివంతమైనవి, ఈ కషాయాన్ని పంటలనాశించే రసం పీల్చే పురుగులు, ఆకులను తినే గొంగళి పురుగులు, కాండం తొలిచే పురుగులపైన వాడి, సమర్ధవంతంగా నివారించవచ్చని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

నేలవేము కషాయం తయారీ విధానం

  • ఒక ఎకరం పొలంలోని పంటకవసరమయే కషాయం తయారు చేయడానికి సుమారు 5 కిలోల నేలవేము ఆకులవసరమవుతాయి. ఈ ఆకులను 10 లీటర్ల నీటిలో ఒక గంటసేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన ద్రావణం సుమారు 5 లీటర్ల వరకు ఉంటుంది. ఈ కషాయాన్ని బాగా చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. వడపోసిన కషాయానికి 100 గ్రా. సబ్బుపొడిని లేదా 50 గ్రా. కుంకుడు కాయరసాన్ని కలపాలి. ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి ఒక ఎకరం పొలంలో సాయంత్రం వేళ పిచికారి చేయాలి. కషాయం బాగా ఉడుకుతున్నపుడు ద్రావణాన్ని మధ్యమధ్యలో ఒక కర్రతో బాగా కలుపుతూ ఉండాలి. నేల వేము కషాయాన్ని కనీసం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు ఉపయోగించి వరిలో కాండం తొలుచు పురుగు (తెల్లకంకి)ని నివారించవచ్చు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

జార్జియా వంట… ఇదో విదేశీ వండని వంట!

ఈ వంట ‘వండని వంటలు’ శీర్షిక క్రిందికి వస్తుందో రాదో కాస్తా అనుమానంగా ఉంది. ఇందులో బచ్చలి ఆకులను ఆఫ్ బాయిల్ చేస్తారు. మిగతావి అన్నీ పచ్చి పదార్థాలనే వాడతారు. అవన్నీ దాదాపు మనకు కూడా దొరుకుతాయి!

జార్జియన్ బచ్చలి కూర కొత్తిమీర మరియు వాల్‌నట్ సలాడ్ – ‘ఇస్పానాఖిస్ ప్ఖాలీ’
ఇస్పానాఖిస్ ప్ఖాలీ అనేది “ప్ఖాలీ” వర్గానికి చెందిన ఒక సాంప్రదాయ జార్జియన్ వంటకం, ఇది జార్జియాలో వివిధ కూరగాయల ఆధారిత స్ప్రెడ్‌లు లేదా సలాడ్‌లకు ఉపయోగించే పదం. ప్ఖాలీ వంటకాలు తరచుగా చల్లగా వడ్డిస్తారు, మరియు జార్జియన్ విందులు మరియు వేడుకల్లో ప్రముఖ భాగంగా ఉంటాయి.

Pkhali యొక్క ఇతర సలాడ్స్ కూడా ఉన్నాయి. అవి బీట్‌రూట్, వంకాయ, పుట్టగొడుగులు, క్యాబేజీ లేదా రెడ్ బీన్స్ నుండి తయారు చేస్తారు. కానీ ఇస్పానాఖిస్ ప్ఖాలీ యొక్క ఆకర్షణీయమైన ముదురాకు పచ్చ రంగు, మరియు ఘాటైన బచ్చలి కూర రుచి నోరూరించే వంటకాలలో ఒకటి.

జార్జియన్ బచ్చలి కూర వాల్‌నట్ కొత్తిమీర సలాడ్ – ఇస్పానాకిస్ ప్కాలీ సలాడ్ చేసుకునే విధానం చాలా సులభం.

కావలసినవి:

  • 700 గ్రా. తాజా బచ్చలి కూర ఆకులు
  • 1 కప్పు (120 గ్రా) వాల్‌నట్‌లు, పచ్చివి లేదా కాల్చినవి.
  • 3 మీడియం లవంగాలు మరియు వెల్లుల్లి.
  • 60 గ్రా కొత్తిమీర
  • 1/4 కప్పు పార్స్లీ
  • 3 టేబుల్ స్పూన్లు (45 ml) కూరగాయల లేదా వాల్‌నట్ నూనె
  • 2 టేబుల్ స్పూన్లు (30 మి.లీ) వెనిగర్
  • 1/2 టీస్పూన్ (2.5 గ్రా) ఉప్పు
  • 1 1/2 టీస్పూన్లు (4.5 గ్రా) ఖ్మేలీ సునెలీ అనగా జార్జియన్ మసాలా మిక్స్ అదేమీ బ్రహ్మ పదార్థం కాదు.
  • (-1/2 టీస్పూన్ (1.5 గ్రా) గ్రౌండ్ బ్లూ మెంతులు, 1/2 టీస్పూన్ (1.5 గ్రా) పసుపు, 1/2 టీస్పూన్ (1.5 గ్రా)తో భర్తీ చేయవచ్చు.
  • దనియాలు
  • 1/4 టీస్పూన్ (0.5 గ్రా) ఎరుపు కారపు మిరియాలు
  • 1/4 టీస్పూన్ (0.5 గ్రా) నల్ల మిరియాలు వీటన్నిటినీ రోట్లో దంచుకొని తయారు చేసుకోవచ్చు).
  • చివరగా దానిమ్మ గింజలు, గార్నిష్ కోసం.
    * * *
    బచ్చలి కూరను కడగాలి మరియు అది వడలిపోయే వరకు ఒక గిన్నెలో గోరువెచ్చని లేదా వేడినీటిలో ఉంచాలి (సుమారు 3 నిమిషాలు) (దీన్నే ఆఫ్ బాయిల్ అన్నాము)

తర్వాత చల్లని నీటిలో బచ్చలి కూరను వేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బచ్చలి కూర చల్లారాక, బచ్చలికూరలో ఉన్న నీటిని చేతితో పిండి బచ్చలి కూరను పక్కన పెట్టుకోవాలి.

వాల్‌నట్‌లను కాస్త బరకగా దంచుకోవాలి, పూర్తిగా పౌడర్ చెయ్యకూడదు. అదే రోట్లో మిగిలిన పదార్థాలను (బచ్చలి కూర మినహా) వేసి, కాస్త నెమ్మదిగా అన్ని కలిసే వరకు దంచుతుండాలి. రోట్లో నుండి ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు నీళ్ళని పిండేసి పక్కన పెట్టుకున్న బచ్చలి కూరను రోట్లో వేసి ముద్దగా దంచుకోవాలి.

అన్ని దినుసులు వెనిగర్ మసాలాలు వాల్‌నట్‌లతో నూరిన ముద్దని వేరే గిన్నెలోకి వేసి, దాంట్లోనే బచ్చలి కూర ముద్దని వేసి రెండు మిశ్రమాలను చక్కగా కలుపుకొని ఒక గిన్నె సహాయంతో చక్కగా ముద్దలుగా మరో ప్లేట్‌లో పేర్చుకొని, పైన కొన్ని దానిమ్మ గింజలతో అలంకరించుకుంటే వంట రెడీ..

ఇది ఇలాగే తినొచ్చు, కావాలంటే దీనికి సరైన కాంబినేషన్ మజ్జిగ. ఇది తింటూ మజ్జిగ తాగుతుంటే ఆ రుచే వేరు.

రచనః మాందాటి రఘు

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

సేంద్రియ సేద్యం – రైతుకు నవశకం

ప్రస్తుత కాలంలో రైతులు, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. రసాయన రహిత ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. 

సేంద్రియ వ్యవసాయం అనేది కృత్రిమ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా, కేవలం ప్రకృతి సిద్ధమైన వనరులతో పంటలు పండించే ఒక సాంప్రదాయ మరియు సుస్థిర సాగు పద్ధతి. దీనిని జీవ వ్యవసాయం లేదా పర్యావరణ వ్యవసాయం అని కూడా పిలుస్తారు.

సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి?
కృత్రిమ రసాయనాలు, జన్యుమార్పిడి విత్తనాలు, పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా తొలగించి, ప్రకృతిలో లభించే సేంద్రియ పదార్థాల సహాయంతో చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం.
ఇందులో ఆవుపేడ, గోమూత్రం, శనగపిండి, బెల్లం, చెట్ల ఆకులు మొదలైన వాటితో ఎరువులను, పురుగుమందులను తయారు చేస్తారు. ఈ విధంగా పండించిన పంటల వల్ల కేవలం ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా, భూమి సారాన్ని కూడా కాపాడుతుంది.

ప్రధాన సాగు పద్ధతులు

పంటల మార్పిడి: ఒకే రకమైన పంటను పదే పదే వేయకుండా, పంటను మార్చిమార్చి వేయడం ద్వారా భూమిలో నత్రజని శాతం పెరిగి నేల సారవంతమవుతుంది.

పచ్చిరొట్ట పైర్లు: జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి అవి పూతకు రాకముందే భూమిలో కలియదున్నడం.

వర్మికంపోస్ట్: వానపాముల సహాయంతో సేంద్రియ వ్యర్థాలను నాణ్యమైన ఎరువుగా మార్ౘ్ి పొలానికి అందించడం.

జీవామృతం: ఇది నేల సారాన్ని పెంచడానికి మరియు పంటలకు అవసరమైన సూక్ష్మజీవులను అందించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తయారు చేయడానికి ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్లు నీటికి, 10 కిలోల ఆవుపేడ, 10 లీటర్ల గోమూత్రాన్ని వేసి బాగా కలపాలి. తరువాత 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు దినుసుల పిండిని, పుట్టమట్టి లేదా గట్టు మట్టిని ఒక గుప్పెడు నీటిలో వేర్వేరుగా గడ్డలు రాకుండా కలుపుకొని గోనె సంచి లేదా కాటన్ గుడ్డను కప్పాలి. తయారైన రోజు నుండి 10 నుండి 12 రోజుల లోపు దీనిని సాగు నీటితో కలిపి గాని, లేదా వడకట్టి పంటలపై నేరుగా పిచికారి చేయడానికి ఉపయోగించవచ్చు.

సహజ తెగుళ్ల నివారణః వేప కషాయం, బ్రహ్మాస్త్రం వంటి సహజ కషాయాలను వాడి చీడపీడలను అరికడతారు.

కలిగే ప్రయోజనాలు
రసాయన సాగు నుండి సేంద్రియ సాగుకు మారిన మొదటి రెండు, మూడేళ్లు దిగుబడి కొంత తగ్గే అవకాశం ఉంది. మార్కెట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులకు మంచి ధర లభించాలంటే ఖచ్చితమైన ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందడం రైతులకు కొంత ఖర్చుతో, ప్రక్రియతో కూడుకున్న పని. పండించిన పంటను సరైన ప్రీమియం ధరకు అమ్ముకోవడానికి కోల్డ్ స్టోరేజ్, రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. పేడ, బయోÐఫర్టిలైజర్స్ వంటి సహజ ఎరువుల తయారీకి, కలుపు తీయడానికి ఎక్కువ మందే కూలీలు అవసరమవుతారు.

ముగింపు:
మొదట్లో దిగుబడి కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రెండు లేదా మూడు పంటల తర్వాత స్థిరమైన మరియు మెరుగైన దిగుబడులను సాధించవచ్చు. నేటి తరానికి విషరహిత ఆహారాన్ని అందించాలన్నా, రేపటి తరానికి జీవమున్న భూమిని వారసత్వంగా ఇవ్వాలన్నా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంతైనా అవసరం.

డా. వై. చైతన్య, పిహెచ్.డి. స్కాలర్, హైదరాబాద్, ఫోన్: 9949804951

Read More

ముంచుకొస్తున్న కరువు… పాడి రైతు గుండె చెరువు

ఎల్‌నినో ప్రభావం వలన పశుగ్రాస కొరత నానాటికీ పెరిగిపోతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాడిరంగం కునారిల్లుతోన్న ఈ పరిస్థితికి పాడి పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందకపోవడం వలన చాలామంది పాడికి దూరం అవుతున్నారు. పశువుల దాణా, మేపు ఖర్చులు  పెరగడం, పచ్చిమేత లభ్యత తగ్గడం, గ్రామాల్లో పశువైద్య సేవలు అరకొరగా ఉండటం, పాలకు గిట్టుబాటు ధర రాకపోవడం - ఇలా ఎన్నో కారణాల వలన పాల ఉత్పత్తి తగ్గుతున్న మాట వాస్తవం. గత 7 సం॥ల్లో 35% పాడి పశువులు తగ్గాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణంగా ఉన్నా మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కన్నా తక్కువ ఉండవచ్చు.
3.7.26 ప్రకారం ఖరీఫ్ నాట్లు వరి (-15%), పల్లీ (-18%), సోయా (-65%), పత్తి (-28%) మాత్రమే నమోదయింది. ఈ ఆలస్యం ధాన్యం/నూనెగింజల ఉత్పత్తిపైనే కాక, ఎండుమేత, తవుడు, పత్తి చెక్కల లభ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే, భారత ప్రభుత్వం 262 జిల్లాలను కరువు ప్రభావితంగా గుర్తించింది.
ఎన్‌డిడిబి అంచనా ప్రకారం, ఎండుమేత నిలువలు, అవసరమైనది 431 మిలియన్ మెట్రిక్ టన్నులు అయినా, 620 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు, పచ్చిమేత అవసరం 1140 మి.మె.ట. కాగా, 752 మి.మె.ట. ఉన్నట్లు, దాణా 32% కొరత ఉన్నట్లు గుర్తించింది.
దేశంలోని వాణిజ్యస్థాయి దాణా తయారీ, 14.5 మి.మె.ట. కాగా, ఈ వాతావరణ ప్రతికూలత వలన లభ్యత 5Ð10% తగ్గగలదని అంచనా.
మార్చి 26 నుండి జూన్ 26 వరకు చూస్తే, పచ్చిమేత ధరలు రూ. 3/80 నుండి రూ. 4/04 కి ఎగబాకగా, దాణాధరలు రూ.23.80 కిలో నుండి రూ.25.06 కి చేరింది. దాణా తయారీకి ముఖ్యమైన తవుడు ధరలు ఏకంగా 21% పెరిగాయి.
17 రాష్ట్రాల్లోని 262 కరువు ప్రభావిత జిల్లాల్లో పశు జనాభా ఇలా ఉంది.
పాలు ఇచ్చే పశువులు  31.19 మిలియన్లు
ఎండిపోయిన పశువులు   13.34 మిలియన్లు
దూడలు       37.16 మిలియన్లు
మొత్తం      81.70 మిలియన్లు
దీనికై, ఎండుమేత 1.1 మిలియన్ మె.ట., పచ్చిమేత 1.4 మి.మె.ట, దాణా 0.4 మి.మె.ట. గా ఉంటుంది. ముఖ్యంగా ఈ అవసరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిసా, బిహార్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఉంది.

కార్యాచరణ ప్రణాళికః

  1. కరువును తట్టుకునే పశుగ్రాసాల పెంపకం బాజ్రా, మక్కలు చేపట్టాలి
  2. పశుగ్రాస విత్తనాల లభ్యత ఉండాలి.
  3. బహువార్షిక పశుగ్రాసాల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
  4. మాగుడుగడ్డి వాడకం పెంచాలి.
  5. సహకార డెయిరీల ద్వారా ‘సైలేజ్’ సరఫరా చేయించాలి.
  6. టోటల్ మిక్స్‌డ్ రేషన్ (టిఎంఆర్) వాడకం పెంచాలి.
  7. ఉపయోగంలోకిరాని దాణా తయారీ సామర్థ్యం వినియోగించి, 3.6 లక్షల టన్నుల అదనపు దాణా తయారీ చేపట్టి రాబోవు 3 నెలల్లో కరువు ప్రభావిత ప్రాంతాల పాడిరైతులకు అందుబాటులోకి తేవాలి.
  8. ఎల్‌నినో ప్రభావం పాలఉత్పత్తిపైన కూడా ఉంటుంది. కాబట్టి, చల్లని వాతావరణంలో కృత్రిమ గర్భధారణ చేపట్టడం, శక్తివర్ధక దాణా సరఫరా ప్రోత్సహించాలి.
    ఏది ఏమైనా, పాడిపశువులకు పచ్చిమేత, ఎండుమేత, ఉత్పాదకత పెంపుదల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    అంతేకాక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు మాగుడుగడ్డి తయారీ, టిఎంఆర్ వాడకం బాహుళ్యంలో తెచ్చినపుడే పాలఉత్పత్తి నిలకడగా ఉండగలదు. అంతేకాక, పాలధర పెంపుదల కోసం ప్రభుత్వ ప్రోత్సాహకం, పశుగ్రాస పెంపకం కోసం పశుగ్రాస విత్తనాల సరఫరా, బీమా ప్రయోజనాలు విజయ డెయిరీ అందిస్తోంది. వీటితో పాడిరైతులు సహకార డెయిరీకి రక్షణ కవచంలా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  • మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553
Read More