కుంకీ ఏనుగుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేపట్టిన తొలి ఆపరేషన్‌ విజయ వంతమైందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పరిధిలోని మొగిలి వద్ద మామిడితోటలు ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపును కుంకీ ఏనుగులు విజయవంతంగా తరిమికొట్టాయని చెప్పారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ కొనసాగిన ఈ ఆపరేషన్‌లో కృష్ణ, జయంత్‌, వినాయక్‌ అనే కుంకీ ఏనుగులు పాల్గొనగా కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కృష్ణ అనే కుంకీ ఏనుగు చాలా చురుగ్గా పాల్గొందని వివరించారు. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్‌ ద్వారా భరోసా కల్పించామని చెప్పారు. పుంగనూరు అటవీ ప్రాంతంలో తదుపరి ఆపరేషన్‌ చేపట్టనున్నట్లు చెప్పారు.