వ్యవసాయంలో కృత్రిమ మేధ వినియోగంపై ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బిట్స్‌ పిలానీల మధ్య శుక్రవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. రాజేంద్రనగర్‌ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని అగ్రి హబ్‌లో జరిగిన కార్యక్రమంలో పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య, బిట్స్‌ పిలానీ ఉపకులపతి ప్రొఫెసర్‌ వి. రాంగోపాల్‌ రావు సమక్షంలో అవగాహన ఒప్పందం పత్రాలపై ఇరుసంస్థల అధికారులు సంతకాలు చేశారు. పరస్పరం ఒప్పంద పత్రాల్ని మార్చుకున్నారు. ఈ రెండు ప్రతిష్టాత్మకమైన సంస్థల మధ్య జరిగిన ఈ అవగాహన ఒప్పందం సంయుక్తంగా పరిశోధన ప్రాజెక్టుల రూపకల్పనకు, పీహెచ్‌.డీ. విద్యార్థులకు పరిశోధన సలహాలు ఇవ్వడానికి దోహదం చేస్తుందని బిట్స్‌ పిలాని ఉపకులపతి ప్రొఫెసర్‌ వి. రాంగోపాల్‌ రావు అన్నారు. ఇరు సంస్థల శాస్త్రవేత్తలు కలిసి నాణ్యమైన పరిశోధనా పత్రాలు ప్రచురించడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. దుబాయ్‌ తోపాటు దేశంలోని 4 చోట్ల బిట్స్‌ క్యాంపస్‌లు ఉన్నాయని, అందులో ప్రతి ఏటా సుమారు 600 మంది పీహెచ్‌.డీ.లో ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. దేశంలోనే మూడవ అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టార్టప్‌ నెట్వర్క్‌ బిట్స్‌ పిలానీ సంస్థ కు ఉందని తెలిపారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించి రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని వివరించారు. పిజేటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రాచీన వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండోదని, ఇది అమెరికా ల్యాండ్‌ గ్రాంట్‌ మోడల్‌లో ఏర్పాటయిందని తెలిపారు. గ్రామీణ స్థాయి వరకు అత్యంత పటిష్టమైన పరిశోధన నెట్‌ వర్క్‌ కలిగి ఉండడంతోపాటు అనేక వ్యవసాయ విద్య, విస్తరణ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా కలిగి ఉండి రైతులకు మెరుగైన సేవలు అందించడంలో నిమగ్నమైందని అన్నారు. 2047 నాటికి మానవ రహిత వ్యవసాయం తీసుకురావాలనే లక్ష్యంతో తాము ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం డిజిటల్‌ అగ్రికల్చర్‌ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. బిట్స్‌ పిలానీతో జరిగిన ఈ అవగాహన ఒప్పందం వల్ల తాము అనుకున్న మానవ రహిత వ్యవసాయ లక్ష్యాలను సాధించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ పరిజ్ఞానం (హార్డ్‌ వేర్‌), బిట్స్‌ పిలానీలోని సాఫ్ట్‌ వేర్‌ కలిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటల సాగుకి ఉపయోగపడే అగ్రి రోబోల రూపకల్పన జరగాలని జానయ్య ఆకాంక్షించారు.
పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ బలరాం అవగాహన ఒప్పందం ముఖ్య లక్ష్యాల గురించి సమావేశంలో వివరించారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సీహెచ్‌. విద్యాసాగర్‌, బిట్స్‌ ఫిలానీ డీన్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ డాక్టర్‌ సంకేత్‌ గోయల్‌, పిజేటిఏయు అంతర్జాతీయ కార్యక్రమాల సంచాలకులు డాక్టర్‌ రాములు, డిజిటల్‌ అగ్రికల్చర్‌ సంచాలకులు డాక్టర్‌ బాలాజీ నాయక్‌, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, బిట్స్‌ పిలానీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.