దిల్లీ, కాన్పుర్‌, రోపార్‌లలో ఉత్కృష్ట కేంద్రాల ప్రారంభం


కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం.. సుస్థిర నగరాల అభివృద్ధి కోసం కేంద్ర విద్యాశాఖ భారీ కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు దిల్లీ, కాన్పుర్‌, రోపార్‌లలో ఉత్కృష్ట కేంద్రాల (సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌)ను వర్చువల్‌ పద్ధతిలో మంగళవారం ప్రారంభించింది. దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఈ కేంద్రాలు సూచించిన పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించనున్నాయి. ఇందులో భాగంగా పరిశోధనలు, అంకుర సంస్థలకు తోడ్పాటు కోసం వచ్చే నాలుగేళ్లలో రూ. 990 కోట్లు ఖర్చుచేయనున్నట్లు కేంద్రం తెలిపింది. పంజాబ్‌, హరియాణా సహా రైతులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వ్యవసాయం లాభసాటిగా మార్చే పరిశోధనలను ఐఐటీ రోపార్‌ ఉత్కృష్ట కేంద్రం పర్యవేక్షించనుంది.