రైతులకు వెంటనే వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు

మంత్రి గొట్టిపాటి రవికుమార్

వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు రైతులు దరఖాస్తు చేసిన వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రా¢ష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో కలిసి మంగళవారం ఆయన విద్యుత్తుశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్డీఎసఎస్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం సూర్యఘర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్మార్ట్ మీటర్లపై ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని స్పష్టం చేశారు.

Read More

రికార్డు ధర పలికిన వేరుశనగ

వేరుసెనగ క్వింటాలుకు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గరిష్ఠ ధర రూ.12,020 రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన పూసల ప్రభాకర్ 30 గుంటల భూమిలో వేరుసెనగ సాగుచేయగా.. 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. చేతికొచ్చిన పంటను మంగళవారం మార్కెట్‌కు తీసుకురాగా ఈ ధర పలికింది. గత ఏడాది క్వింటాలు రూ.6 వేలకు మించలేదని రైతు తెలిపారు. ఎనుమాముల మార్కెట్‌కు మంగళవారం మొత్తం 253 బస్తాల వేరుసెనగ రాగా. క్వింటాలుకు కనిష్ఠ ధర రూ.6,500, మోడరేట్ ధర రూ.9,500 పలికింది.

Read More

సహకార బ్యాంకుల్లో నగదు రహిత సేవలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో (డీసీసీబీ) యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా ఉమ్మడి పశ్చిమగోదావరిలోని సహకార బ్యాంకుల్లో సోమవారం ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి దాకా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసే విధానం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు సహకార బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన రైతులకు లేకపోయేసరికి ప్రధానంగా పొగాకు, ఆయిల్ పామ్, కోకో రైతులు వాణిజ్య బ్యాంకుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ రైతుల సరకు విక్రయ లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే ముడిపడి ఉంటున్నాయి. దీంతో ఈ రకమైన యూపీఐ సేవలు సహకార బ్యాంకుల్లో ప్రారంభించే విషయంపై ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఉన్నతాధికారులతో మాట్లాడి తొలుత తన సొంత జిల్లా ఉమ్మడి పశ్చిమ నుంచే దీనికి శ్రీకారం చుట్టారు. ఇకపై ఖాతాదారులు మొబైల్ ఫోన్లను వినియోగించి తక్షణమే ఇతరులకు డబ్బులు పంపొచ్చు. స్వీకరించొచ్చు. నగదు రహిత సేవలను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా బ్రాంచిని సందర్శించకుండా వినియోగించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సహకార బ్యాంకుల్లో త్వరలోనే యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

Read More

నారాయణపేటలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

తెలంగాణాలోని నారాయణపేట జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.కోటి విలువైన పత్తి విత్తనాలను పట్టుకున్నారు. సోమవారం జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ డా. వినీత్ వివరాలు వెల్లడించారు. నారాయణపేట మండలం బండగొండ, కొత్తపల్లి మండలం భూనీడ్ గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాలు అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. జిల్లా పోలీసులు, టాస్క్‌ఫోర్స్, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా ఆదివారం సాయంత్రం ఆయా గ్రామాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. భూనీడ్‌కు చెందిన తండ్రీకొడుకులు బాలకృష్ణనాయుడు, శశివర్దన్‌నాయుడు ఇళ్ల నుంచి రూ.కోటి విలువైన 10 టన్నుల (100 క్వింటాళ్లు) నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలను సరఫరా చేసినా, అమ్మినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కేసును ఛేదించిన డీఎస్పీ లింగయ్య, సీఐలు శివశంకర్, సైదులు, ఎస్సైలు రాముడు, విజయ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ బృందం, వ్యవసాయశాఖ అధికారులను అభినందించారు.

Read More

రైతు ఆదాయం పెంపు, విలువ జోడింపులే ప్రధాన లక్ష్యం

రైతు ఆదాయ పెంపు, విలువ జోడింపు లక్ష్యంగా వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పులు చేపడుతున్నట్లు, వచ్చే మూడేళ్లలో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని అదనంగా ఉద్యాన పంటల సాగులోకి తీసుకురానున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వివరించారు. మంగళగిరిలోని వ్యవసాయశాఖ డైరెక్టరేట్‌లో బుధవారం ‘కృషి రోడ్ మ్యాప్’ పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ అగర్వాల్, ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఉద్యాన) డాక్టర్ సంజయ్ కుమార్ సింగ్, వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్, పలువురు కేంద్ర, రాష్ట్ర అధికారులు దీనికి హాజరయ్యారు. స్థూల విలువ జోడింపులో 15శాతం వృద్ధి సాధన లక్ష్యంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్ని రాజశేఖర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర అధికారులకు వివరించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా కృషి రోడ్ మ్యాప్‌ను రూపొందించామన్నారు. ఏపీకి కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందుతుందని.. విలువ ఆధారిత పంటల సాగుతోపాటు కేంద్ర, రాష్ట్రాల సమన్వయం ఎంతో కీలకమని సంజయ్‌కుమార్ అగర్వాల్ ఈ సందర్భంగా చెప్పారు.

Read More

పెరుగుతున్న మిరప ధరలు

ప్రస్తుతం మిర్చికి డిమాండ్ ఏర్పడింది. వరంగల్ ప్రాంతంలో సాగయ్యే ఎల్లో మిర్చి (స్నాక్స్ తయారీలో వినియోగించే కారం) రకానికి రికార్డు స్థాయిలో క్వింటాకు రూ. 44 వేలు ధర పలుకుతోంది. వండర్ హాట్ రకానికి గత వారంతో పోలిస్తే ఇప్పటికి రూ.5 వేలు పెరిగి బుధవారం క్వింటా రూ.30 వేలు పలికింది. అత్యధికంగా సాగయ్యే తేజ రకం రెండు వారాల క్రితం రూ.15 వేలు పలకగా, ఇప్పుడు రూ.20,200 పలుకుతోంది. 341 రకానికి రూ. 25,600, దీపిక రకానికి రూ.26,200 ధర నడుస్తోంది.

Read More

త్రివిధ సజ్జతో అనేక ప్రయోజనాలు

ఆర్‌హెచ్‌బీ 273 పేరిట ప్రపంచంలోనే మొట్టమొదటి త్రివిధ సజ్జ సంకర (త్రీ వేపెర్ల్ మిల్లెట్ హైబ్రిడ్) రకాన్ని ఇక్రిశాట్, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), రాజస్థాన్ వ్యవసాయ పరిశోధన సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తాజాగా దానిని విడుదల చేశారు. సాధారణ హైబ్రిడ్ రకాలు రెండు మాతృకల నుంచి తయారైతే, ఈ త్రివిధ హైబ్రిడ్ మూడు మాతృకల కలయికతో రూపొందింది. అధిక దిగుబడి, నాణ్యమైన పశుగ్రాస లక్షణాలు చేకూరుతాయని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్, ప్రధాన శాస్త్రవేత్త ఎస్.కే. గుప్తా మంగళవారం వెల్లడించారు. త్రివిధ సజ్జ రకం.. ఏటా 400 మి.మీ. కంటే తక్కువ వర్షపాతం ఉండే రాజస్థాన్, గుజరాత్, హరియాణాల్లో మెట్ట ప్రాంతాలకు అనుకూలమైందన్నారు. దానిని మరింత అభివృద్ధి చేసి ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామన్నారు. ఈ సజ్జ సగటున హెక్టారుకు 2,230 కిలోల దిగుబడి వచ్చిందన్నారు.

Read More

దానిమ్మ రైతులకు మంచి రోజులు

దానిమ్మ రైతులకు మంచి రోజులొచ్చాయి, నాణ్యతను బట్టి టన్ను రూ.2 లక్షలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలల క్రితం రూ.50 వేలు, నెల క్రితం రూ. లక్ష నుంచి రూ.1.10 లక్షలు పలికింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,422 హెక్టార్లలో దానిమ్మ పంటను సాగు చేస్తుండగా 3.85 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. అత్యధికంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 11 వేల హెక్టార్లలో దానిమ్మ పండిస్తున్నారు. స్థానికంగా ఫ్రూట్ కవర్స్ ప్లాంట్ కవర్స్ విధానంతో దానిమ్మ పండ్ల నాణ్యత పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

Read More

భూమి రసాయనమయంగా మారుతుంది

అధిక రసాయన ఎరువుల వాడకంతో భూమి సారం కోల్పోయి రసాయనమయంగా మారుతోందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. రైతుల శ్రేయస్సు, సహజ సాగు విధానాలపై అవగాహన కోసం ఆయన మంగళవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రధాన కూడలి వరకూ రైతు సుఫలా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక బౌద్ధ మహా స్తూపం వద్దనున్న సిద్ధార్థ యోగా విద్యాలయంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని చినజీయర్ మాట్లాడారు. భూమికి సైతం విరామం అవసరమని, పంటల మార్పిడి, వ్యవధి పాటించడం వంటి పద్ధతులతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సేంద్రియ ఎరువుల వాడకంతో సగానికి పైగా సమస్య పరిష్కార మవుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు చినజీయర్‌కు నాగలి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్యులు డా. పద్మారామచంద్రారావు, పర్యావరణవేత్త విజయ్‌రాం, సీపీఐ నాయకుడు నారాయణ, రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీనివాస్, ఏర్నేని రామారావు, రైతునేస్తం వెంకటేశ్వరరావు, గున్నా రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.

Read More

పురుగు మందుల నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యం

మనదేశంలో పురుగు మందులు వినియోగిస్తే కొన్నిసార్లు పురుగులు కాకుండా పంటలు నాశనమవడం, తెగుళ్లపై ఎలాంటి ప్రభావం కనిపించకపోవడం, రైతులు మరణించడం, పర్యావరణానికి తీవ్ర హాని జరగడం సర్వసాధారణంగా మారింది. మరోవైపు ఈ విపరిణామాల బాధ్యులు చట్టం నుంచి సులువుగా తప్పించుకుం టున్నారు. ఈ ధోరణిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నాణ్యతకు, ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ… వాటిని ఉల్లంఘించిన వారికి రూ. అర కోటి జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నూతన పురుగు మందుల నిర్వహణ (పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్) చట్టం తెస్తోంది. ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు తెలపాలంటూ తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. రైతులు, పౌరసమాజం సైతం సూచనలు చేయడానికి ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువునిచ్చింది. ముసాయిదా బిల్లును మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ agriwelfare.gov.inలోనూ ఉంచింది.
కేంద్రానికి సర్వాధికారాలు
ప్రస్తుతం అమలులో ఉన్న పురుగు మందుల చట్టం(1968), పురుగు మందుల నిబంధన(1971)ల్లో ఉన్న లోపాలను సవరించడానికే కొత్త చట్టం తెస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ‘పురుగు మందుల తయారీ, అమ్మకం నుంచి వాడకం వరకు పారదర్శకతను తీసుకురావడం, రైతులకు నాణ్యమైనవే అందేలా చూడటం, వాటి ప్రమాణాలు గుర్తింపు సామర్థ్యం పెంచడం, నకిలీలను నియంత్రించడం, కఠిన జరిమానాలు విధించడం, తయారయ్యే ప్రతి మందునూ ప్రయోగశాలల్లో పరీక్షల అనంతరమే ధ్రువీకరించడం, జీవ పురుగు మందుల వినియోగాన్ని ప్రోత్సహించడం, మానవులు, జంతువులు, పర్యావరణానికి కలిగే ముప్పును తగ్గించడం, స్వదేశీ తయారీ భారీఎత్తున పెంచడం” తమ లక్ష్యాలని వెల్లడించింది. ఈ చట్టం అమలులోకి వచ్చాక దేశవ్యాప్తంగా పురుగు మందుల నాణ్యత, పంపిణీ అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తాయి.
తయారీదారులు ప్రమాణాలు పాటించాలి
పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీలను డబ్బాపై ముద్రించాలి. తయారీ సంస్థ పేరు, చిరునామా, ఉత్పత్తి స్థలం, వాడిన రసాయనాలు, ఇతర వివరాలుండాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో, భద్రత ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే ఉత్పత్తి జరగాలి. క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు వెల్లడించే సాంకేతికతను వినియోగించాలి.
ఉల్లంఘిస్తే శిక్ష
పురుగు మందుల రసాయన మిశ్రమంలో మార్పులు ఉండి, ప్రభావాన్ని చూపలేకపోయినా, రైతుల ఆరోగ్యానికి హాని కలిగించినా, నాణ్యత తగ్గించేలా ఇతర పదార్థాలు కలిపినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. చట్ట నిబంధనలను ఉల్లంఘించి పురుగుమందుల తయారీ, దిగుమతి చేసుకున్నా… వాటి విక్రయంతో ఎవరైనా మృతి చెందినా, తీవ్రంగా గాయపడినా… ఉత్పత్తిదారుడు, సంస్థను బాధ్యులుగా పరిగణిస్తారు. వారికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, లేదంటే రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. నేర తీవ్రతను బట్టి ఒకేసారి రెండూ విధించొచ్చు. రెండోసారి నేరం చేస్తే… మొదటిసారి విధించిన జరిమానా కంటే రెట్టింపు జరిమానా వేస్తారు. మూడోసారి నేరం చేస్తే… సంబంధిత సంస్థ రిజిస్ట్రేషన్, లైసెన్స్ శాశ్వత రద్దుకు పెస్టిసైడ్ ఇన్‌స్పెక్టర్ సిఫార్సు చేస్తారు. జరిమానాను చెల్లించకుంటే రిజిస్ట్రేషన్ కమిటీ ఇచ్చే రికవరీ సర్టిఫికెట్ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆ మొత్తాన్ని భూమి శిస్తు బకాయిల్లా వసూలు చేస్తారు. అవసరమైతే ఆస్తిని జప్తు చేస్తారు.

Read More