ఉత్తమ పోషక విలువలు, మార్కెటింగ్‌ సామర్థ్యం గల స్ట్రాబెర్రీ.. డ్రాగన్‌ఫ్రూట్‌.. అవకాడో.. రాంబూటాన్‌.. బ్లూబెర్రీ.. లాంగన్‌.. మకాడమియా నట్‌.. కివీ.. మ్యాంగోస్టీన్‌.. ఇలాంటి విదేశీ రకాల ఫలాలను మన దేశంలో సాగు చేయడం రైతులకు లాభదాయకమని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వెల్లడించింది. 2024-25లో రూ.10 వేల కోట్ల విలువైన ఇలాంటి ఫలాలను దిగుమతి చేసుకున్న నేపథ్యంలో.. మన దేశంలో వీటి సాగును పెంచడం ద్వారా ఏటా ఆ మొత్తం ఆదా అవుతుందని వెల్లడించింది. ‘విదేశీ ఫలాల’ సాగుపై అధ్యయనం చేపట్టి తాజాగా నివేదికను విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలివి..
కొన్ని రకాల విదేశీ ఫలాలకు మన దేశంలో ఆదరణ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వీటి సాగును ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అవకాడో, డ్రాగన్‌ ఫ్రూట్‌, స్ట్రాబెర్రీ, ప్యాషన్‌ ఫ్రూట్‌ వంటి రకాలను పండిస్తున్నారు. సాగు వ్యయం కొంత ఎక్కువైనా.. తక్కువ నీటితోనే ఇవి పండుతాయి. పెట్టుబడికి తగిన లాభాలు వస్తాయి. దేశంలో వీటి సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చరల్‌ రీసెర్చ్‌ ఈ పంటలపై పరిశోధన, సాగు అభివృద్ధి, సాంకేతికత వ్యాప్తిలో కీలకపాత్ర పోషిస్తోంది. డ్రాగన్‌ ఫ్రూట్‌, అవకాడో వంటి పంటలకు ప్రామాణిక సాగు నియమావళిని అభివృద్ధి చేసింది. కేంద్రం సిఫార్సులివీ..
ఉద్యాన పంటలను ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాల ఉద్యాన విభాగాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు.. విస్తృతంగా రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. మార్కెటింగ్‌తో పాటు కోల్డ్‌ స్టోరేజి సౌకర్యాలు, ప్యాక్‌ హౌస్‌లు, గ్రేడింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య అనుసంధానాలను బలోపేతం చేయాలి. ప్రైవేటు వ్యవసాయ వ్యాపార సంస్థలు, స్టార్టప్‌లు, సహకార సంస్థల సహకారంతో సంబంధిత మౌలిక సదుపాయాల వృద్ధి, సాంకేతిక సహకారం, పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలి.