వ్యవసాయంలో ఆవిష్కరణలు, పరిశోధనలు, ప్రయోగ ఫలితాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులోకి రావాలని, అన్నదాతల ఆదాయం రెట్టింపు అయ్యేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషిచేయాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పిలుపునిచ్చారు. అగ్రివర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య, రిజిస్ట్రార్‌ విద్యాసాగర్‌, పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డిలు… సోమవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వ్యవసాయ వర్సిటీ ప్రగతి నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. ‘వాతావరణ మార్పులు, మార్కెట్‌ ఒడుదొడుకులతో ధరల పతనం, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. వీటికి వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిష్కారం చూపాలి. అగ్రివర్సిటీ చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. అధిక ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలు, కరువు, చీడపీడలను ఎదుర్కొనే విత్తన రకాలను కనిపెట్టాలి’ అని సూచించారు. వర్సిటీలో పెండింగులో ఉన్న మూడు బ్యాచ్‌లకు వచ్చే ఫిబ్రవరిలో స్నాతకోత్సవం నిర్వహించి 2,800 మందికి పీహెచ్‌డీ, పీజీ, డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తామని ఈ సందర్భంగా వీసీ తెలిపారు.