ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్‌గా ఉన్న బీఎస్సీ (అగ్రికల్చర్‌), కమ్యూనిటీ సైన్స్‌, ఫుడ్‌ సైన్స్‌ టెక్నాలజీ, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులకి అదనంగా 2025- 26 విద్యా సంవత్సరం నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్ట్రేలియాలోని వెస్టర్న్‌ సిడ్ని విశ్వవిద్యాలయం (డబ్ల్యుఎస్‌యు) తో కలసి నాలుగు సంవత్సరాల బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ కోర్సు ప్రారంభించనుంది. విద్యార్థులు నాలుగు సంవత్సరాల కోర్సు వ్యవధి లో మూడు సంవత్సరాలు పీజేటీఏయూ లోనూ,ఒక ఏడాది వెస్టర్న్‌ సిడ్ని విశ్వవిద్యాలయంలోనూ విద్య అభ్యసిస్తారు. తద్వారా రెండు విశ్వవిద్యాలయాల్లోనూ విద్యనభ్యసించే అవకాశం విద్యార్థులకి కలుగుతుంది. అదే విధంగా విద్యార్థులు ఎం.ఎస్సీ కూడా చదవాలని భావిస్తే మరో ఏడాది వెస్టర్న్‌ సిడ్ని విశ్వవిద్యాలయం(డబ్ల్యుఎస్‌యు)లో చదువవలసిఉంటుంది. తద్వారా బీ.ఎస్సీ డిగ్రీ పీజేటీఏయూ నుంచి, ఎం.ఎస్సీ డిగ్రీ వెస్టర్న్‌ సిడ్ని విశ్వవిద్యాలయం నుంచి పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు పీజీ తర్వాత కూడా వెస్టర్న్‌ సిడ్ని విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కూడా చేయదలచుకుంటే ఎటువంటి రుసుములు లేకుండా స్కాలర్‌ షిప్‌ సాయంతో పీహెచ్‌డీ పూర్తి చేయవచ్చు.ఈ అంశాల పై రెండు విశ్వవిద్యాలయాల మధ్య ఒప్పందం కుదిరే ప్రక్రియ తుదిథలో ఉందని పీజీటీఏయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య తెలిపారు. ఈ వెస్టర్న్‌ సిడ్ని విశ్వవిద్యాలయం అందించే అన్ని వ్యవసాయ కోర్సులకి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్‌) గుర్తింపు ఉందని జానయ్య పేర్కొన్నారు.ఈ మేరకు ఐసిఏఆర్‌ మరియు డబ్ల్యుఎస్‌యు ల మధ్య గత సంవత్సరం ఒక ఒప్పందం కూడా కుదిరిందని జానయ్య వివరించారు. ఈ ప్రత్యేక కోర్సుల ప్రవేశాల కోసం త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు జానయ్య తెలిపారు.

ఈఏపిసెట్‌ ర్యాంకర్లకి అభినందనలు
ఈఏపిసెట్‌-2025 ఫలితాలలో పాస్‌ అయి ర్యాంకులు సాధించిన వారికి జానయ్య అభినందనలు తెలిపారు. పీజేటీఏయూలో రెగ్యులర్‌, ప్రత్యేక కోటా సీట్లని పెంచడంతో పాటు, ఫీజులు కూడా తగ్గించామని జానయ్య వివరించారు. కొత్త కళాశాలలు కూడా రానున్నాయన్నారు.ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం అదే విధంగా ఎన్‌ఆర్‌ఐ కోటా ప్రవేశాల కోసం ఈ వారంలోనే నోటిఫికేషన్‌ రానుందని జానయ్య ప్రకటించారు.

విద్యార్థులు, తల్లితండ్రులకి జాగ్రత్తలు
రాష్ట్రంలో ఐసిఏఆర్‌ గుర్తింపు, అనుమతి లేని చాలా ప్రయివేటు సంస్థలు బీ.ఎస్సీ కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌లు ఇస్తున్నాయని వాటిపట్ల విద్యార్థులు, తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని జానయ్య సూచించారు. రాష్ట్రంలో బీ.ఎస్సీ (అగ్రికల్చర్‌) విద్యా కోర్సు అందించేందుకు ఐసిఏఆర్‌ గుర్తింపు, అనుమతి ఒక్క పీజేటీఏయూ కి మాత్రమే ఉన్నాయని విద్యార్థులు, వారి తల్లి తండ్రులు గుర్తించాలని ఉపకులపతి ఆల్దాస్‌ జానయ్య వివరించారు.