అఖిల భారత కాటన్‌ వార్షిక సమావేశంలో శాస్త్రవేత్తలుగులాబీ రంగు పురుగు విజృంభణ, దిగుబడి తగ్గుదలపై ఆందోళనఆంధ్రాలో పూర్తిగా పడిపోయిన సాగు విస్తీర్ణం

దేశవ్యాప్తంగా సంభవించిన వాతావరణ మార్పులతో జీవచ్చవంలా మారిన పత్తికి ప్రాణం పోయాల్సిన తరుణం ఆసన్నమైందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. గుంటూరు సమీపంలోని లాం ఫామ్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అఖిల భారత పత్తి వార్షిక సమావేశం-2025 శుక్రవారం ఆరంభమయింది. మూడు రోజులు పాటు జరగనున్న ఈ సమావేశంలో జాతీయ స్థాయికి చెందిన 160 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన భారతదేశ పత్తి మనిషిగా పిలువబడే డాక్టర్‌ సీడీ మాయీ మాట్లాడుతూ దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన మొదటి ‘టెక్నాలజీ మిషన్‌ ఆఫ్‌ కాటన్‌’ దేశంలో సాగు రూపురేఖలు మార్చిందన్నారు. అప్పుడు ప్రవేశపెట్టిన మొదటి మిషన్‌లోనే బీటీ పత్తి వంగడం రూపుదిద్దుకున్నది చెప్పారు. దాని ఫలితంగా పత్తి పంటలో ఉత్పత్తి, ఉత్పాదకత, లాభదాయకత పెరిగాయన్నారు. కొన్ని థాబ్దాల తర్వాత గులాబిరంగు పురుగు తిరిగి రావడం ఆందోళనకరమన్నారు. దాన్ని తట్టుకొని, వాతావరణ పరిస్థితులను ఎదిరించే నూతన వంగడాల సృష్టి ద్వారానే దేశ భవిష్యత్‌ వస్త్ర అవసరాలు తీర్చగలమని పేర్కొన్నారు. నూతనంగా ఆరంభం కానున్న రెండవ మిషన్‌లో ‘మిషన్‌ ఫర్‌ కాటన్‌ ప్రొడక్టివిటీ’ నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలని అన్నారు. ఈ మిషన్‌ ఉత్పాదకత, సుస్థిరతను పెంపొందించడం, అతి పొడవైన స్టేపుల్‌ పత్తి రకాల సాగును (పొడవు పింజ పత్తి) ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. యూనివర్సిటీ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యంగా పత్తి దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని దృష్టిలో ఉంచుకొని వార్షిక దిగుమతులు 3 మిలియన్‌ బేళ్లను మించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. స్వదేశీ ఉత్పత్తిని పెంచడానికి తక్షణ విధి విధానాలు అవసరమని చెప్పారు. విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ ఆర్‌ శారదా జయలక్ష్మీ మాట్లాడుతూ భారతదేశంలో పత్తి కాయతొలిచే పురుగును సమర్థవంతంగా నియంత్రించడం ద్వారా పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడంలో బీటీ వంగడాలు సమర్థవంతంగా పనిచేశాయని అన్నారు. ఎన్‌ జీ రంగా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసి విడుదల చేసిన పత్తి రకం ‘నరసింహ (ఎన్‌ ఏ-1325)’ గణనీయమైన విజయాన్ని సాధించినదని అన్నారు. నాగపూర్‌ ఐసీఏఆర్‌ – సీఐసీఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి. ప్రసాద్‌ మాట్లాడుతూ పత్తి ఉత్పత్తి 15 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుందని, ఒకప్పుడు రెండవ అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా ఉన్న ఏకీకృత ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతం ఇప్పుడు వాతావరణ మార్పుల కారణంగా సాగు విస్తీర్ణం తగ్గుతుందని పేర్కొన్నారు. డాక్టర్‌ ఎస్‌.కె. శుక్లా మాట్లాడుతూ భారతీయ పత్తిలో అధిక కలుషిత స్థాయిలపై ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్‌ ప్రశాంత కుమార్‌ దాస్‌ మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితులలో పత్తి నిరోధకతను, ఉత్పాదకతను పెంచడానికి జన్యుమార్పిడి సాంకేతికత చాలా అవసరమని అభిప్రాయ పడ్డారు.

రాష్ట్రంలో పాతాళానికి పడిపోయిన పత్తి సాగు..

ఆంధ్రప్రదేశ్‌లో పత్తి సాగు విస్తీర్ణం పాతాళానికి పడిపోయింది. 2001-2002 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో 10.02 లక్షల హెక్టార్లలో పత్తి సాగుచేయగా, 2023-2024 సంవత్సరంలో సాగు విస్తీర్ణం 4.27 లక్షలకు పడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి విస్తీర్ణం, దిగుబడి పూర్తిగా పడిపోయినట్లు వార్షిక సమావేశం 2025 నివేదిక స్పష్టం చేస్తున్నది. పత్తి ధరల పతనం, గులాబీ రంగు పురుగు వల్ల రైతాంగం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.