వివిధ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల వలన తెలంగాణాలో ప్రాజెక్టులు నిండటంతో వానాకాలం పంటలకు సమృద్ధిగా సాగునీటిని అందించనున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 388 టీఎంసీల నీటి అవసరాలు ఉన్నాయని, చివరి ఎకరా వరకు ఆటంకం లేకుండా సాగునీరు సరఫరా చేసేలా జిల్లా స్థాయి అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లో సచివాలయం నుంచి సీఈలు, ఎస్‌ఈలు ఇతర ఇంజినీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘జూరాల, శ్రీశైలం, సాగర్లకు భారీ ప్రవాహాలు వస్తున్నాయి. ఎస్సారెస్పీ, సింగూరుకు వరద వస్తోంది. రాష్ట్రంలో 34,740 చెరువులకు 12,023 నిండగా, మరో 9,100 చెరువులు 75-100 శాతం నిండాయి. వరదలకు 177 చెరువులు, కాలువలు, లిఫ్టులు దెబ్బతిన్నాయి. వాటి పునరుద్ధరణకు రూ.355 కోట్లతో అంచనాలు సిద్ధం చేశాం. ఇప్పటికే 3,500 చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేపట్టాం’ అని, యాసంగి పంటలకు కూడా సాగునీటి ప్రణాళిక ఉండాలని పేర్కొన్నారు.