దేశ అవసరాల్లో 60% విత్తనాలను సరఫరా చేస్తూ తెలంగాణ.. దేశానికి విత్తనోత్పత్తి కేంద్రంగా ఎదిగిందని, 20కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విత్తన కంపెనీలు, ఆధునిక పరిశోధన, శుద్ధి, నిల్వ సదుపాయాలతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించడం ద్వారా తెలంగాణ విత్తనాలకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందన్నారు. గురువారం హైదరాబాద్‌లో భారత ఆహార, వ్యవసాయ వాణిజ్యమండలి (ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌) ఆఫ్రికా విత్తన వాణిజ్య సంస్థ (ఆఫ్రికన్‌ సీడ్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌)లు సంయుక్తంగా నిర్వహించిన భారత్‌-ఆఫ్రికా విత్తన సదస్సు -2025లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘భారత్‌, ఆఫ్రికా దేశాలు వ్యవసాయాభివృద్ధికి సంయుక్తంగా కృషి చేయాలి. రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతు సంక్షేమ విధానాలను ఆఫ్రికా దేశాలు అనుసరిస్తే నాణ్యమైన విత్తనాల వినియోగం పెరిగి ఆహార భద్రత గణనీయంగా మెరుగుపడుతుంది” అని పేర్కొన్నారు.