తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025” ప్రధాన లక్ష్యం రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం అని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సుమారు 200 బిలియన్ డాలర్ల వద్ద ఉందని, వచ్చే రెండు దశాబ్దాల్లో తెలంగాణను 15 రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే మహాదృక్పథానికి ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రధాన వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల సమ్మిట్లో ప్రదర్శించాల్సిన ఏవీల కంటెంట్ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి సామర్థ్యాలు, విదేశీ పెట్టుబడి అవకాశాలు, భవిష్యత్ విజన్ స్పష్టంగా ప్రతిబంబించేలా ఏవీలను రూపొందించాలన్నారు. వ్యవసాయ రంగమే రాష్ట్ర ఆర్థిక లక్ష్య సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ జనాభాలో 66 శాతం మందికి ఉపాధి అందించే వ్యవసాయం రాష్ట్ర జిఎస్ఏలో 17 శాతం వరకు వాటా కలిగి ఉందని, అందువల్ల తెలంగాణ ఆర్థిక వృద్ధిలో వ్యవసాయ అభివృద్ధి కేంద్రబిందువుగా ఉంటుందని పేర్కొన్నారు. రైతు ఆదాయం పెరగడం, ఉత్పాదకత పెరుగుదల, విలువ ఆధారిత వ్యవసాయం విస్తరణ, ఎగుమతుల పెంపు ఇవన్నీ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత కీలక అంశాలు అని మంత్రి అధికారులకు వివరించారు. ఐఓటి ఆధారిత సూక్ష్మ నీటిపారుదల, నేల ఆరోగ్య నిర్వహణ, అగ్రిటెక్ పరిశోధన, టిఏఆర్ సిసి, గ్లోబల్ సీడ్ లీడర్ షిప్, హార్టీకల్చర్ మెగా క్లస్టర్లు, ఆయిల్ష్పామ్ విస్తరణ, ఫామ్ టూరిజం, ఎఫ్పిఓలను ఫుడ్ డెలివరీ కంపెనీలతో అనుసంధానం చేయడం, పాలు, మాంసం, మత్స్య రంగాల పెంపు, అధునాతన అగ్రిలాజిస్టిక్స్ వంటి కార్యక్రమాలు తెలంగాణ వ్యవసాయాన్ని గ్లోబల్ ప్రమాణాలకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఇవి రైతుల ఆదాయాలను గణనీయంగా పెంచడమే కాకుండా, వేల కోట్ల రూపాయల విలువైన అగ్రి-ఎగుమతులకు మార్గం సుగమం చేయనున్నాయని, విజన్ 2047 డాక్యుమెంట్ తెలంగాణ వ్యవసాయ రంగానికి ఒక దిశ నిర్దేశిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అని, రైతు భరోసా, రుణమాఫీ, పంట నష్టపరిహారం, రైతు బీమా వంటి పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవనోపాధిని మెరుగపరచడంతో పాటు భవిష్యత్ వృద్ధికి బలమైన పునాది వేసిందన్నారు. ఇకపై సాంకేతిక-ఆధారిత, డేటా-ఆధారిత, మార్కెట్-ఆధారిత వ్యవసాయ మోడల్ ద్వారా రైతులను మరింత సాధికారులను చేయడం ప్రభుత్వం యొక్క సంకల్పమని స్పష్టం చేశారు.”వ్యవసాయ రంగం బలపడితేనే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రైతు శ్రమే రాష్ట్ర అభివృద్ధికి మూలం. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ, వ్యవసాయం-సాంకేతికత-పెట్టుబడుల నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, డైరెక్టర్ గోపి, అగ్రికల్చర్ యూనివర్సిటీ విసి జానయ్య, హార్టీకల్చర్ యూనివర్సిటి విసి రాజిరెట్టి, మార్కెఫెడ్ ఎండి శ్రీనివాస రెడ్డి, హాకా ఎండి చంద్రశేఖర్ రెడ్డి మరియు మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.