చిరుధాన్యాలను ప్రతిఒక్కరూ ఆహారంలో భాగం చేసుకునేందుకు వీలుగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యా లయం(హెచ్‌సీయూ)లోని మిల్లెట్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ ‘జీనోమ్‌ ఎడిటింగ్‌’ ద్వారా నూతన వంగడాలను సృష్టిస్తోంది. కొర్రల్లో ఫైటిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉండి… జీర్ణక్రియ స్వల్పంగా మందగించేలా చేస్తుంది. అందుకే ఎక్కువ మంది ఆహారంగా తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో ఫైటిక్‌ యాసిడ్‌ను తగ్గించడంపై మిల్లెట్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ పరిశోధకులు దేశంలోనే తొలి సారిగా రెండేళ్ల క్రితం జీనోమ్‌ (జన్యు) ఎడిటింగ్‌ ప్రక్రియను చేపట్టారు. అందులో భాగంగా హైదరాబాద్‌ శివారులోని ఇక్రిశాట్‌ నుంచి 155 రకం కొర్రలను, దిల్లీ శివారులోని వ్యవసాయ వర్సిటీ నుంచి 185 రకాన్ని తెప్పించారు. ల్యాబ్‌లో ప్రయోగాల ద్వారా 155 రకంలో ఫైటిక్‌ యాసిడ్‌ను 70 శాతానికి.. 185 రకంలో 81 శాతానికి తగ్గించి కొత్త రకం వంగడాలను సృష్టించారు.