చిరుధాన్యాల సాగు విస్తరణకు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్‌) వివిధ రాష్ట్రాల్లో ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఆర్థిక తోడ్పాటుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. వీటిని అందిపుచ్చుకుంటున్న ఎఫ్‌పివోలకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని ఐఐఎంఆర్‌ శాస్త్రవేత్తలు సంకల్పించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం రాజుపాకలు కేంద్రంగా చిరుధాన్యాల సాగు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై పనిచేస్తున్న లంబసింగి ట్రైబల్‌ ప్రొడక్ట్స్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌కు తోడ్పాటును అందించేందుకు ముందుకొచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో లంబసింగి ఎఫ్‌పిఓసభ్యులు పండిస్తున్న చిరుధాన్యాలతోపాటు వాటితో తయారుచేసిన విలువ ఆధారిత ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా సంచార విక్రయశాలను ఐఐఎంఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తారా సత్యవతి ప్రారంభించారు