ఫిలిప్పీన్స్‌కు 10 లక్షల టన్నులు..
ఉత్పత్తి, ఎగుమతులకు ప్రోత్సాహం

  • రాష్ట్ర మంత్రి ఉత్తమకుమార్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం నుంచి ఏటా 60 లక్షల టన్నుల వరకు బియ్యం ఎగుమతికి అవకాశం ఉందని పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమకుమార్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా, కేంద్ర నిల్వలన్నింటికీ కలిపి వినియోగించే దొడ్డు, సన్న బియ్యం పోనూ రాష్ట్రంలో భారీగా మిగులు నిల్వలు ఉంటాయన్నారు. ఫిలిప్పీన్స్‌కు దొడ్డు బియ్యం ఎగుమతి ప్రారంభించామని.. ఏడాదికి 10 లక్షల టన్నులు పంపేందుకు వీలుందన్నారు. ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘బియ్యం ఎగుమతి విధానం’ అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”తెలంగాణ ఈ ఏడాదిలో రికార్డుస్థాయిలో 280 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. రైతుల కృషితో పాటు అనుకూల వాతావరణ పరిస్థితులు, ప్రకృతి సహకారం, నూతన వరి రకాల వల్లే ఇది సాధ్యమైంది. రైతులను ప్రోత్సహించేందుకు సన్నధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇచ్చి ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. దొడ్డు రకాలైన ఎంటీయూ-1010, ఐఆర్‌-64లకు ఫిలిప్పీన్స్‌లో మంచి డిమాండ్‌ ఉంది. వరి నేరుగా విత్తడం, రోజు విడిచి రోజు నీరు పెట్టడం, తక్కువ రసాయన ఎరువులు, పురుగుమందులు వాడటం వంటి విధానాలతో వరి రకాలను ఉత్పత్తి చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఎగుమతికి అనుకూల రకాల ఉత్పత్తికి రైతులకు.. వాటి ఎగుమతికి ఔత్సాహికులకు.. విధానపరమైన ప్రోత్సాహకాలిస్తాం. ఆధునిక రైస్‌ మిల్లు నమూనాను అగ్రి వర్సిటీలో ఏర్పాటుచేసి రైతులకు, యువతకు శిక్షణ ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం” అని మంత్రి తెలిపారు. విశ్వవిద్యాలయ వీసీ అల్దాస్‌ జానయ్య, పరిశోధన సంచాలకుడు బలరాం, శాస్త్రవేత్త దామోదర్‌రాజు, వరల్డ్‌ ఫుడ్‌ప్రైజ్‌ ఫౌండేషన్‌ అవార్డు గ్రహీత, యూజీసీ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ సమరేందు మహంతి, అఖిలభారత రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యకక్షుడు కృష్ణారావు, ఎఫ్‌సిఐ, అపెడా అధికారులు, రైతు నాయకులు, విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, పౌర సరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు.