క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పుబట్టారు. ఇప్పటికే దేశీయ ఆయిల్‌ పామ్‌ రైతుల ప్రయోజనార్థం దిగుమతి సుంకాన్ని 27.5% నుంచి 40%కి పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అభ్యర్థించినప్పటికి, దీనికి విరుద్ధంగా కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం వలన ఆయిల్‌ పామ్‌ రైతులకు గెలల ధర తగ్గడంతో పాటు దీర్ఘకాలికంగా దేశీయ ఆయిల్‌ పామ్‌ సాగును తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు. ప్రస్తుతం సాగు సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రాలు, రైతులకు తగిన ప్రోత్సాహం కల్పిస్తూ, ఈ పంట సాగు పెంపుపై దృష్టిసారిస్తున్న తరుణంలో, కేంద్ర నిర్ణయం రైతుల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ఈ దిగుమతి సుంకం తగ్గింపు వలన కొత్తగా ఆయిల్‌ పామ్‌ సాగు ప్రారంభించాలనుకునే రైతులు వెనక్కి తగ్గే అవకాశం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది స్వదేశీ నూనె ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న కేంద్ర – రాష్ట్రాల ఉద్దేశ్యాలకు విరుద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ పాం సాగును ప్రోత్సహించేందుకు పలు ప్రోత్సాహక కార్యక్రమాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెద్ద ఎత్తున రైతుల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిగుమతి సుంకాన్ని తగ్గించాలన్న నిర్ణయం వల్ల చేపడుతున్న కార్యక్రమాలన్నింటికి తగిన ఫలితాలు రాకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ పై దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమలశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ని లేఖ ద్వారా కోరడం జరిగింది. ఇదేవిషయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ దృష్టికి లేఖ ద్వారా తీసుకొచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా రైతుల ఆకాంక్షలు నిలబెట్టడంకోసం, దేశ ఆత్మనిర్భరత లక్ష్యాన్ని సాధించేందుకు ఆయిల్‌ పామ్‌ వంటి నూనె పంటల ఉత్పత్తికి భరోసా కల్పించే విధానాలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు.