అమరావతిలో అంతర్జాతీయ స్థాయి గార్డెన్‌ సెంటర్‌ నెలకొల్పేందుకు ఇజ్రాయెల్‌ ప్రతినిధులు ఆసక్తి కనబర్చారు. విజయవాడలోని అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి. లక్ష్మీపార్థసారథితో ఇజ్రాయెల్‌ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. శీతోష్ణస్థితిని బట్టి పెంచగలిగే వివిధ రకాల పండ్లు, పూలు, కూరగాయలు తదితరాల గురించి దృశ్య మాధ్యమం ద్వారా వివరించారు. వారి సొంత నర్సరీల్లో పండించిన కూరగాయలు, ఇతర ఉత్పత్తులను సమావేశానికి తీసుకొచ్చారు. తమ ప్రతిపాదనలను సీఎండీకి వివరించారు. సమావేశంలో గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ ఇజ్రాయెల్‌ ప్రతినిధులు డేవిడ్‌ మిజ్రహి, ప్రశాంత్‌, కిషోర్‌, ఏడీసీ హార్టీకల్చర్‌ విభాగాధిపతి వి. ధర్మజ, అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లానింగ్‌ అధికారులు పి.సురేష్‌ బాబు, కె.వి. గణేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.