నాబార్డు మాజీ ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు
ఘనంగా ఆంగ్రూ వజోత్సవాలు ప్రారంభం

సన్న, చిన్నకారు రైతులకు ఉపయోగపడేలా, అధిక దిగుబడులు సాధించేలా మరిన్ని పరిశోధనలు చేయాలని నాబార్డు మాజీ చైర్మన్‌ చింతల గోవిందరాజులు సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 60 సంవత్సరాల వజ్రోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. తొలుత వేడుకను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఆంగ్రూ వజ్రోత్సవ పైలాన్‌ను, ఆచార్య ఎన్జీరంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్టాల్స్‌ను సందర్శించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ మాట్లాడుతూ ఆంగ్రూ ఐకానిక్‌ భవన డిజైన్‌ ఎంపికకు చాలా సమయం పట్టిందని, 2018లో పనులు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం మరికొంత నిధులు అవసరం ఉందన్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ ఆంగ్రూలో చదువుకుని ఎంతో విజ్ఞానాన్ని పొందానన్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు ఢిల్లీరావు మాట్లాడుతూ పూర్వ విద్యార్థిగా విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ.2 లక్షలు అందించనున్నట్లు ప్రకటించారు. నాబార్డు మాజీ చైర్మన్‌ చింతల గోవిందరాజులు రూ.2 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ జానయ్య, ప్రొఫెసర్‌ విజయపాల్‌శర్మ, రైతు సాధికార సంస్థ వైస్‌ చైర్మన్‌ టి. విజయకుమార్‌, అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ మర్రిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడారు. సావనీర్‌, ఆంగ్రూ పుస్తకాలను మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఆంగ్రూ వీసీ డాక్టర్‌ ఆర్‌. శారదజయలక్ష్మిదేవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, వీసీలు జె.వి. రమణ, డాక్టర్‌ గోపాల్‌, మత్స్యవిశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి టి. సుగుణ, రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వై. వేంకటేశ్వరరావు, ఆంగ్రూ పూర్వ వీసీ దామోదర్‌ నాయుడు పాల్గొన్నారు.