కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు మరింత రుణ సదుపాయం

కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)ల ద్వారా ప్రస్తుతం రైతులకు వ్యవసాయం, పశుపోషణ, పాడి పరిశ్రమ, మత్స్య సంపద, పట్టు పరిశ్రమ, తేనెటీగల పెంపకం కోసం రుణాలు ఇస్తుండగా… ఇకపై భూసార పరీక్షలు, వాతావరణ అంచనా సమాచార లభ్యత, సేంద్రియ ధ్రువీకరణ పొందేందుకు సైతం రుణాలు అందించేందుకు ఆర్బీఐ సంకల్పించి సంబంధిత ముసాయిదా మార్గదర్శకాలను గురువారం బ్యాంకులకు జారీచేసింది. వీటితోపాటు మరిన్ని మార్పుల కోసం రైతులు, ఇతర వినియోగదారులు మార్చి 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ఆర్బీఐ వెబ్‌సైట్ ద్వారా తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. దేశవ్యాప్తంగా 7.75 కోట్ల మంది రైతులకు ప్రస్తుతం కేసీసీలున్నాయి. మొత్తం 11 కోట్ల మంది రైతులకు ఈ కార్డులు ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా ఆర్బీఐ తాజాగా నిబంధనల్లో మార్పులు చేసింది.

Read More

కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 9600/- సబ్సిడీ

తెలంగాణా రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో ఎకరంలో ఆరుటన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును అంచనా వేసి అందులో 40 శాతం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యానశాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో ఏటా 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు అవసరం. ఇందుకు అదనంగా 1.33 లక్షల ఎకరాల్లో 12.68 లక్షల టన్నులు ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఈఏడాది 10 వేల ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగు చేపట్టాలన్నది లక్ష్యం. దీని కోసం సమీకృత ఉద్యాన మిషన్‌ పథకం కింద సాయం అందించేందుకు మంత్రి ఆదేశించారు. ఎకరంలో కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, సస్యరక్షణ, పోషక యాజమాన్యం కోసం రూ.24 వేలు ఖర్చవుతుందని ఉద్యానశాఖ గుర్తించింది. ఇందులో 40 శాతం.. అంటే రూ. 9600 సాయం అందించేందుకు సిఫార్సు చేయగా.. మంత్రి ఆమోదం తెలిపారు. టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, మిర్చి, బీర, క్యాప్సికం, చిక్కుడు, కాకర, దొండ, సొరకాయ తదితర తోటల సాగుకు ముందుకొచ్చే రైతులు స్థానిక ఉద్యాన అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తారు. సాగు ప్రారంభించిన వెంటనే నారు, విత్తనాలను ఉద్యానశాఖకు చెందిన లేదా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేస్తే వారికి 40 శాతం సబ్సిడీ సాయం రూ.9600 రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కో రైతుకు 2.50 ఎకరాల చొప్పున సబ్సిడీ సాయం అందిస్తారు. సాగుకు అవసరమైన నారును సిద్దిపేట జిల్లా ములుగు, హైదరాబాద్‌ సమీపంలోని జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లలో ఉద్యానశాఖ సాగు చేస్తోంది. ఎంపికైన రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందజేస్తుంది.

Read More

రొయ్యకు దేశీయ మార్కెట్‌ పెరగాలి

దేశీయంగా రొయ్యలకు బలమైన మార్కెట్‌ కల్పించేందుకు ఆర్థిక తోడ్పాటు అందించాలని.. కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని రొయ్య రైతుల సమాఖ్య అధ్యకక్షుడు మోహన్‌రాజు కోరారు. ప్రధాని మోదీ, కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డులకు ఆయన ఈ మేరకు లేఖలు రాశారు. ఇటీవల మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన సూచన మేరకు దేశీయ మార్కెట్‌ పెంచేందుకు అవసరమైన సవివర ప్రాజెక్టు నివేదికలు రూపొందించి పంపినట్లు ఆయన తెలిపారు. మత్స్య అభివృద్ధి బోర్డు ద్వారా ఒక్కోటి రూ.50 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 3 వేల టన్నుల సామర్థ్యంతో 20 రొయ్యల నిర్వహణ, మార్కెటింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Read More

ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఈ రోజు వికారాబాద్‌ జిల్లా కోత్రేపల్లి గ్రామంలో నిర్వహించిన మేగా ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ ఆయిల్‌ పామ్‌ సాగు ప్రాధాన్యత, దీని ద్వారా లభించే ఆర్థిక లాభాలు, మరియు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు.

Read More

తెలంగాణ రాష్ట్రంలో రాయితీలతో ఉద్యాన పంటలకు ఊతం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాయి. మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌-ఆయిల్‌ పామ్‌, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన తదితర పథకాలను అమలు చేస్తూ రాయితీలను అందజేస్తున్నాయి.
సమీకృత ఉద్యాన అభివృద్ధి.. పథకం ద్వారా పండ్ల తోటలు, నీటి కుంటలు, కూరగాయల సాగును ప్రోత్సహిసున్నారు. రాయితీతో కూరగాయల నారును అందించడంతోపాటు, ప్రస్తుత సంవత్సరం డ్రాగన్‌ ఫ్రూట్‌, బొప్పాయి, మామిడి, జామ, కూరగాయలు, తదితర పంటల సాగుకు సైతం రాయితీని కల్పిస్తున్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.ఈ సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు బిందు, తుంపర సేద్యంపై రాయితీ ఇస్తున్నారు. ఎకరాకు రూ.4,200 ల చొప్పున నాలుగేళ్లపాటు రాయితీ అందుతుంది.

రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన
20 గుంటల విస్తీర్ణంలో పందిరి నిర్మాణానికి రూ.50 వేల సబ్సిడీ అందిస్తున్నారు. గరిష్టంగా 2.20 ఎకరాల వరకు రాయితీ అందుతుంది. సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకొని కూరగాయలు సాగు చేపట్టొచ్చు. రైతులకు అవగాహన కల్పిస్తూ వీటిపై మొగ్గు చూపేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

జాతీయ వెదురు పథకం
సాగుకు యోగ్యం కాని భూముల్లో, పొలం గట్లపైన, వెదురు మొక్కలు నాటే రైతులకు ప్రభుత్వం రెండేళ్ల వరకు నిర్వహణ ఖర్చు కింద మొదటి సంవత్సరం రూ. 75 రెండో సంవత్సరం రూ. 45 చొప్పున అందజేస్తారు.

బిందు సేద్యం
ఉద్యాన పంటలు సాగు చేయడానికి డ్రిప్‌, స్ప్రింకర్లను సబ్సిడీపై అందించనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీతో పరికరాలను అందిస్తున్నారు. బీసీ రైతులకు 90 శాతం, అయిదెకరాల్లోపు ఉన్న ఓసీ రైతులకు 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. తుంపర సేద్యం పరికరాలకు అందరికీ 75 రాయితీని అందిస్తున్నారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు పొందేందుకు రైతులు పట్టాదారు పాస్‌బుక్‌, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, పాస్‌పోర్టు సైజు ఫొటోతో సంబంధిత ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు అందజేయాలి. గరిష్ఠంగా అయిదెకరాల భూమి కలిగిన రైతులు అర్హులు.
-కేఆర్‌ లత, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారిణి

Read More

మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ సాయం

21న తొలి విడత చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి

అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతులకు మూడు విడతల్లో అందజేస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పీఎం కిసాన్‌ కింద కేంద్రమిచ్చే రూ.2 వేలు, రాష్ట్రం వాటా రూ.5 వేలు కలిపి ఈ నెల 21న తొలివిడతలో రూ.7 వేలు జమ చేస్తామన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏరువాక పౌర్ణమిని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఇటీవల గుంటూరు నుంచి ఎగుమతి అయిన మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని కంటెయినర్లను చైనా అధికారులు తిరస్కరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన పంటను ఉత్పత్తి చేయాలి” అని వెల్లడించారు.

కోకో రైతులకు న్యాయం చేస్తాం
పెదవేగిలో సాగవుతున్న కోకో, పామాయిల్‌ పంటలను మంత్రి పరిశీలించి రైతులు, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. పామాయిల్‌ తరహాలోనే కోకో గింజల కొనుగోలుకు విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. సరకు నాణ్యతతోనే గిట్టుబాటు ధరలు సాధ్యమవుతాయని స్పష్టంచేశారు. కంపెనీలు సాగు సమయంలో చెప్పే మాటలు ఆచరణలో విస్మరిస్తున్నాయని రైతులు మంత్రికి మొర పెట్టుకున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు రాయితీపై పరికరాలివ్వాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కోరారు. ఏలూరు మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన 50 కిలోవాట్ల సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు.

Read More