ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఈ రోజు వికారాబాద్‌ జిల్లా కోత్రేపల్లి గ్రామంలో నిర్వహించిన మేగా ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ ఆయిల్‌ పామ్‌ సాగు ప్రాధాన్యత, దీని ద్వారా లభించే ఆర్థిక లాభాలు, మరియు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు.

Read More

విత్తన కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకోండి

ఆర్గనైజర్ల వ్యవస్థను రద్దు చేసి, విత్తన కంపెనీలు నేరుగా పత్తి విత్తనోత్పత్తి రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రూ.700 కోట్ల బకాయిలను నెల రోజుల్లో రైతులకు విడుదల చేయాలని, జాప్యం చేస్తే లైసెన్స్‌ల రద్దుకూ వెనకాడబోమని స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు రావాల్సిన పెండింగ్‌ బిల్లుల సమస్యపై సోమవారం సచివాలయంలో పర్యాటక, ఆబ్కారీశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ సంచాలకుడు గోపి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ… ”50 వేల ఎకరాల్లో పత్తి విత్తనోత్పత్తితో దేశంలోనే గద్వాల జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. పత్తి సాగు చేసినవారికి నిధులు వెను వెంటనే ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. విత్తన కంపెనీలు ఆర్గనైజర్లకు బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకొని వెనువెంటనే బిల్లులు చెల్లించాలి” అని సూచించారు.

Read More

అన్నదాతా సుఖీభవ మరియు పీఎం కిసాన్‌ నిధులు ఆగస్టు 2న విడుదల

ఆగస్టు 2న పీఎం కిసాన్‌ 20వ విడత వాయిదా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కానుంది. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 41.58 లక్షల రైతు కుటుంబాలకు రూ. 831.60 కోట్లు అందుతాయి. అదే రోజు అన్నదాతా సుఖీభవ సొమ్ము కూడా రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. పీఎం కిసాన్‌ నుంచి రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ కింద తొలివిడతగా రూ. 5 వేలు అందించనున్నాయి. రాష్ట్రంలో అన్నదాతా సుఖీభవ పథకానికి 46.64 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. వీరిలో 46.20 లక్షల కుటుంబాల్లోని రైతులు ఈకేవైసీ పూర్తి చేయగా.. ఇంకా 40,346 మంది రైతులు ఈకేవైసీ చేయాల్సి ఉంది. కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక కౌలు రైతులకు రెండో విడతలో.. మొదటి, రెండో విడత నిధులను కలిపి జమ చేస్తారు.

Read More

సహకార రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం: మంత్రి తుమ్మల

  • దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రాథమిక సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • ప్రాథమిక సహకార సంఘాలు ‘ఒన్‌ స్టాప్‌ సెంటర్‌’గా మారాలి
  • ఎఫ్‌.పి.ఓ.లుగా ఎంపికైన ప్రాథమిక సహకార సంఘాలన్ని బిజినెస్‌ మోడల్స్‌తో సిద్ధం కావాలి
  • ఎన్‌.సి.డి.సి. సహకారంతో రాష్ట్రంలో 311 ప్రాథమిక సంఘాలు ఎఫ్‌.పి.ఓ.లుగా మార్పు : మంత్రి తుమ్మల

ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మరియు వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సహకార పరపతి సంఘాలు తమ దృక్పథం మార్చుకోవాలని, కేవలం ఒకటి లేదా రెండు సేవలకు పరిమితం కాకుండా, రైతులకు సంబంధించి అన్ని సేవల రూపకల్పనలో పాలుపంచుకొన్నట్లయితేనే ఆర్థిక పరిపుష్టి సాధించడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనకారిగా ఉండగలమన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నేడు ఎన్‌.సి.డి.సి. మరియు కోఆపరేటివ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 311 ఎఫ్‌.పి.ఓ.లతో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఉండి సహకార రంగంలో దేశవ్యాప్తంగా రోల్‌ మోడల్‌గా గెలిచిన ముల్కనూరు సహకార పరపతి సంఘ విజయాల్ని ప్రస్తావిస్తూ.. సహకార సంఘ బాధ్యతలు నీతిగా, నిజాయితీగా చేస్తు, సంఘ అభివృద్ధికి పాటుపాడితే ముల్కనూరు లాంటి సహకార సంస్థలు మరిన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. భారత ప్రభుత్వం ద్వారా 10,000 రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్న సందర్భములో, ఇప్పటికే ఉన్న ప్రాథమిక సహకార పరపతి సంఘాలను ‘రైతు ఉత్పత్తి సంఘలుగా’ మార్చి, వారికి మరింత ఆర్థికతోడ్పాటు అందించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, తదనుగుణంగా ‘నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో, నిర్లిప్తంగా ఉన్న తెలంగాణ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ను క్లస్టర్‌ బేస్‌డ్‌ బిజినెస్‌ ఆర్గనైజేషన్‌గా నియమించి దాని ద్వారా రాష్ట్రంలో 311 సహకార పరపతి సంఘాలను ఎఫ్‌.పి.ఓ.లుగా ఎన్నిక చేయడం జరిగిందని, వీటికి ఒక్కొకదానికి 15 లక్షల ఈక్విటీ గ్రాంటు మరియు 18 లక్షల మేనేజ్‌ మెంట్‌ ఖర్చు (మొత్తం 33 లక్షలు) అనగా 311 ఎఫ్‌.పి.ఓ.లకు సుమారు 167.93 కోట్లు (సిబిబిఓ ఇచ్చే రూ 21 లక్షలు / ఎఫ్‌.పి.ఓ.తో కల్పి) మంజూరు చేయగా ఈ రోజు మొదటి విడతాగా 9 కోట్లు 85 లక్షల 40 వేల రూపాయలు (ప్రతి పి.ఎ.సి.ఎస్‌.కు 3,16,849 రూ) విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌లో భాగంగా ప్రతి ఎఫ్‌.పి.ఓ.లకు 2 కోట్లు వరకు లోన్‌ గ్యారంటీ సౌకర్యం కూడా ఉందని, కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్నిరకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉందని వాటిని సద్వినియోగం చేసుకొని ఎదిగే బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడి మీద ఉందన్నారు. ఈ సందర్భముగా మెడ్చల్‌ జిల్లా మరియు కొన్ని జిల్లాలలో సహకార పరపతి సంఘాలు సాధించిన విజయాలు ఊటంకిస్తూ రంగారెడ్డి జిల్లా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిదీ అని, ఆదేవిధంగా వ్యవసాయంలో ఎరువుల మరియు రసాయనాల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి సహకార సంఘం తీసుకోవల్సిందిగా సూచించారు.
రైతులకు కావాల్సిన అన్ని అవసరాలను, అనగా మట్టినమూనాలు, విత్తనాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, నిల్వ ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, డైరి, పౌల్ట్రీ ఇలా అన్నీ రంగాలలో వాటి సేవలను విస్తరించే విధంగా బిజినెస్‌ మోడల్‌ రూపకల్పన చేసుకోవాలని, అదే విధంగా సంఘ సమావేశాలలో ఆయరంగాల్లో నిష్ణాతుల సేవలను ఆహ్వానించి, వారి సలహాలు, సూచనలు పొంది సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
ఈ సందర్భముగా మంత్రితోపాటు ఎన్‌.సి.డి.సి. రీజనల్‌ డైరెక్టర్‌ శార్దూల్‌, తెలంగాణ కో ఆపరేటివ్‌ యూనియన్‌ ఛైర్మన్‌ మోహన రెడ్డి, టి.జి.సి.ఎ.బి. ఛైర్మన్‌ రవీందర్‌ రావుతో పాటు డి.సి.సి.బి.ల ఛైర్మన్‌లు, కోఆపరేటివ్‌ సిబ్బంది, రాష్ట్రం నలుమూలాల నుండి వచ్చిన 311 సొసైటీ ఛైర్మన్‌లు పాల్గొన్నారు.

Read More

తెలంగాణ సెక్రటేరియట్‌లో ఉద్యానశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల

  • జిల్లాల వారిగా ఉద్యానపంటల ప్రగతిని వివరించిన అధికారులు
  • రైతులకు బిల్లులు చెల్లింపులో ఆలస్యం కావద్దని ఆదేశించిన మంత్రి
  • హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలలో పెద్దఎత్తున కూరగాయల సాగును చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
  • డిసెంబర్‌ నెలాఖరు వరకు ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు
  • కమిషనరేట్‌ అధికారులు హైదరాబాద్‌ కే పరిమితం కాకుండా విస్తృతంగా పర్యటించాలని ఆదేశాలు జారీ చేశారు

తెలంగాణ రాష్ట్రంలో 12.96 లక్షలో ఎకరాలలో ఉద్యానపంటలు సాగులో ఉన్నాయని, 42.58 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి సాధించడం జరుగుతుందని ఉద్యానశాఖ డైరెక్టర్‌ మంత్రికి వివరించడం జరిగింది. ఉద్యానపంటలను ప్రొత్సహించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున తుంపర మరియు బిందు సేద్య పరికరాలపై రాయితీ ఇవ్వడం జరుగుతున్నదని, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీతో, చిన్న, సన్నకారు మరియు బిసి రైతులకు 90 శాతం రాయితీతో, ఇతరులకు 80 శాతం రాయితీతో బిందు సేద్య పరికరాలు మరియు అన్ని వర్గాల రైతులకు 70 శాతం తుంపర సేద్య పరికరాలను అందించడం జరుగుతున్నదని, కేంద్రం ఇచ్చే సబ్సీడి కన్నా అదనంగా 45 శాతం సబ్సిడీని ఎస్సీ, ఎస్టీ రైతులకు, 35 శాతం సబ్సిడీని చిన్న, సన్నకారు, బిసి రైతులు మరియు ఇతర రైతులకు ప్రభుత్వం అందచేయడం జరుగుతున్నదని మంత్రికి వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 29,821 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా 81,942 ఎకరాల విస్తీర్ణంలో బిందు మరియు తుంపర సేద్య పరికరాలను అందించడం జరిగిందని, 2025-26 సంవత్సరానికి 51,328 ఎకరాల విస్తీర్ణానికి పరిపాలన అనుమతులు తీసుకోవడం జరిగిందని, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 28,147 ఎకరాల విస్తీర్ణానికి బిందు మరియు తుంపర సేద్య పరికారాలు ఏర్పాటు చేయబడ్డాయి అని డైరెక్టర్‌ తెలిపారు. అదేవిధంగా 2024-25 సంవత్సరంలో 110.87 కోట్ల వ్యయంతో 12,054 మంది రైతులకు చెందిన 40,247 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టడం జరిగిందని, 2021-22 సంవత్సరంలో కొత్త జిల్లాలలో సాగులోకి తీసుకురాబడ్డ ఆయిల్‌ పామ్‌ తోటలు కాపుకు వచ్చాయని, ఆయా కంపెనీలు రైతుల వద్ద నుండి ఆయిల్‌ పామ్‌ గెలలను కొనుగోలు చేయడం జరుగుతున్నదని, ఆయిల్‌ పామ్‌ తోటల విస్తీర్ణానికి అనుగుణంగా ఆయిల్‌ పామ్‌ కర్మాగారాలను ఏర్పరచడం జరుగుతున్నదని తెలిపారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి 1,25,000 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, ఇప్పటికే 18 వేల మంది రైతులు 66 వేల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ నాటుటకు నమోదు చేసుకోవడం జరిగిందని, 26 వేల ఎకరాలకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సంవత్సరంలో జూన్‌ నెల నాటికి 6750 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ ను పూర్తి చేసుకోవడం జరిగిందని డైరెక్టర్‌ మంత్రికి వివరించారు.
తుమ్మల మాట్లాడుతూ.. కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నాయని, రాష్ట్రానికి అవసరమైన కూరగాయల ఉత్పత్తిని మన రాష్ట్రంలోనే పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని, అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్దం చేసి, డిప్యూటి డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులకు జిల్లాలు కేటాయించి, జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని, కూరగాయల సాగును పెంచేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాలు అయిన రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలలో పెద్ద ఎత్తున కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా డిమాండుకు అనుకూలంగా కూరగాయల సాగును రైతులకు అందించాలని పేర్కొన్నారు. ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ పురోగతి చాలా మందకోడిగా నడుస్తున్నదని, వారంవారిగా లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, జిల్లాలు, కంపెనీల వారిగా పురోగతిని సమీక్షించాలని డైరెక్టర్‌ని ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలో ఉన్న జాయింట్‌ డైరెక్టర్లు ఒక్కొక్కరికి 5 జిల్లాలు కేటాయించాలని, వారంలో మూడు రోజులు వారు ఆయా జిల్లాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ పెంచడానికి, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయిల్‌ పామ్‌ నర్సరీలలో ఎట్టి పరిస్థితులలో కూడా కల్లింగ్‌ మొక్కలు ఉండకూడదని, ఆయిల్‌ పామ్‌ రైతులకు ఆరోగ్యకరమైన, మంచి మొక్కలను అందించాలని ఇదివరకే నాటిన ఆయిల్‌ పామ్‌ తోటల రైతులకు, పంట యాజమాన్యం విషయంలో ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, ఆవగాహన కల్పించాలని తద్వారా అనుకున్న సమయానికి ఆయిల్‌ పామ్‌ గెలల దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని మంత్రిగారు తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్‌ నెలాఖరు కల్లా ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని, తదనుగుణంగా వారంవారిగా లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని, వ్యవసాయ మరియు ఉద్యానశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రిగారు ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్‌ రావు, ఉద్యానశాఖ సంచాలకులు శ్రీమతి యాస్మిన్‌ బాషా మరియు ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More
  • 1
  • 2