ఔషధ మొక్క… గొబ్బి

గొబ్బి 60-100 సెం.మీ. ఎత్తు పెరిగే ఒక పొద. ఆకుల పైభాగం ముదురు ఆకుపచ్చ రంగులో, అడుగుభాగం లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకులు అండాకారం నుండి వెడల్పు తక్కువ గుడ్డు ఆకారంలో ఉంటాయి. పూలు సుమారు 5 సెం.మీ. పొడవు కలిగి గరాట ఆకారంలో ఉంటాయి. ఊదారంగు, లేత గులాబి రంగు లేదా తెలుపు రంగులో ఉంటాయి. కాయ 1.5 సెం.మీ. పొడవుండి కోడిగుడ్డు ఆకారంలో చిన్న సంచివలె ఉంటుంది. కాయ ముదిరినపుడు మెరుస్తూ ఉంటుంది.

సాధారణ నామం : హైగ్రోఫిలా/టెంపుల్‌ప్లాంట్/మార్ష్‌బార్బెల్ శాస్త్రీయ నామం : బార్లేరియా క్రిస్టేట కుటుంబం: అకాంథేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • థాయ్‌లాండ్‌లో గొబ్బిని సంప్రదాయ మూలికా సంబంధ మందుగా ఉపయోగిస్తారు. ఇది టానిక్, మూత్ర వర్థకం, మరియు రక్తశుద్దికారిణిగా పనిచేస్తుంది. తమిళనాడులో మహిళలు ఈ పూలను పూల చెండుగా ఉపయోగిస్తుంటారు.
  • దీని ఆకులు, వేర్ల వగరు రసం యాంటిబాక్టీరియల్, స్వేదనకారి, కఫహర లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తీవ్ర జలుబు చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఆకులు, వేర్ల కషాయాన్ని ఉడుకు, పుండుపై వాపులను తగ్గించడానికి పూస్తారు. గొబ్బి విత్తనాలను పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.
  • ఆకుల మిథనాల్ ద్రావణం వాపు, నొప్పి తగ్గించే చర్యలను ప్రదర్శిస్తుంది. ఈ మొక్కలను అలంకరణ హెడ్ౙిగా పెంచుతారు.
  • ఈ మొక్కకి యాంటి ఆక్సిడెంట్, యాంటి డయాబెటిక్ లక్షణాలున్నాయి. బార్లేరియా ఇమ్‌ప్యూలినా మొక్కకి గాయం నయం చేసే ప్రభావముంది.

వ్యవసాయరంగంలో…

  • బార్లేరియా లాంగిఫోలియా ఇథైల్ ఎసిటేట్ ద్రావణంలోని కౌమారిన్, సపానిన్స్, టానిన్స్, స్టీరాయిడ్స్, స్పోడోప్టెరా లిటూరాపై అధికంగా 79.40% యాంటి ఫీడెంట్ చర్య, 77.36% లార్వానాశక చర్య ప్రదర్శించాయి. హెలికోవర్పా ఆర్మిజరాపై 70.96% యాంటి ఫీడెంట్ చర్య, 68-70% లార్వానాశక చర్య ప్రదర్శించింది. రూపుమారిన లార్వాలు, ప్యూపాలు, పెద్ద పురుగుల శాతం కూడా ఇథైల్ ఎసిటేట్ ద్రావణంలో నమోదైంది. పెద్ద పురుగులు విడుదలయ్యే శాతం కూడా తగ్గింది (చెన్నియన్, అతని అనుచరులు, 2016).
  • బార్లేరియా ప్రయోనిటిస్ యాంటిఆక్సిడెంట్, యాంటిమైక్రోబియల్ చర్యలను ప్రదర్శించింది. దీనిని పాముకాటు చికిత్సలో ఉపయోగిస్తారు (కరుప్పుసామి, 2007)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

జంతువులలో గాలికుంటు వ్యాధిని పోలి ఉండే వ్యాధులు మరియు వాటి భేదాత్మక నిర్ధారణ

జంతువులలో కనిపించే అంటువ్యాధులలో గాలికుంటు వ్యాధి ఒక అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది ముఖ్యంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులలో కనిపిస్తుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు నోటిలో పుండ్లు, కాళ్ల వద్ద గాయాలు, జ్వరం మరియు ఆహారం తినకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే గాలికుంటు వ్యాధి లాంటి లక్షణాలు మరికొన్ని వ్యాధులలో కూడా కనిపిస్తాయి. అందువల్ల సరైన చికిత్స మరియు నియంత్రణ చర్యల కోసం భేదాత్మక నిర్ధారణ చాలా అవసరం.

ఒక నిర్దిష్ట వ్యాధి లేదా పరిస్థితిని, అదే విధమైన లక్షణాలు చూపించే ఇతర వ్యాధుల నుంచి వేరు చేసి గుర్తించడాన్నే భేద నిర్ధారణ లేదా భేదాత్మక నిర్ధారణ అంటారు. ఇందులో మొదట సంభావ్య వ్యాధుల జాబితా తయారు చేసి, తరువాత పరీక్షలు లేదా మూల్యాంకనాలు చేసి ఒక్కో అవకాశాన్ని తొలగిస్తూ చివరికి అత్యంత సంభావ్యమైన నిర్ధారణకు చేరుకుంటారు. జంతువులలో ఒకే విధమైన లక్షణాలు అనేక వ్యాధులలో కనిపిస్తాయి. ఉదాహరణకు గాలికుంటు వ్యాధి, వెసిక్యులర్ స్టొమటైటిస్, నీలినాలుక వ్యాధి వంటి వ్యాధులలో నోటిలో పుండ్లు మరియు కాళ్ల వద్ద గాయాలు కనిపించవచ్చు. అందువల్ల సరైన వ్యాధిని ఖచ్చితంగా గుర్తించడం చాలా అవసరం. 

సాధారణంగా భేదాత్మక నిర్ధారణ కోసం చరిత్ర తెలుసుకోవడం (అంటే ఇతర జంతువులకు వ్యాపించిందా, ఇటీవల కొత్త జంతువులు తీసుకొచ్చారా, టీకాలు వేయించారా), క్లినికల్ పరిశీలన (జంతువులో కనిపించే లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించడం) మరియు ప్రయోగశాల పరీక్షలు (ఎలైసా & పి.సి.ఆర్)  వంటి పద్ధతులను పాటిస్తారు.

భేదాత్మక నిర్ధారణ యొక్క ప్రాముఖ్యత

  • సరైన వ్యాధి గుర్తింపు – లక్షణాలు ఒకేలా ఉన్నా నిజమైన వ్యాధిని గుర్తించడంలో సహాయపడుతుంది.
  • సరైన చికిత్స అందించడం – వ్యాధిని సరిగ్గా గుర్తిస్తే తగిన మందులు మరియు చికిత్స ఇవ్వవచ్చు.
  • వ్యాధి వ్యాప్తి నియంత్రణ – అంటువ్యాధులను త్వరగా గుర్తించి ఇతర జంతువులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు.
  • ఆర్థిక నష్టాన్ని తగ్గించడం – పాల ఉత్పత్తి తగ్గడం, జంతువుల మరణాలు వంటి నష్టాలను తగ్గించవచ్చు. .
  • అనవసర చికిత్స నివారణ – తప్పు నిర్ధారణ వల్ల అవసరం లేని మందులు వాడకుండా ఉంటుంది.
  • టీకాలు మరియు నివారణ చర్యలకు సహాయం – సరైన వ్యాధి తెలిసిన తర్వాత తగిన టీకాలు మరియు నియంత్రణ చర్యలు తీసుకోవచ్చు.
  • పశుసంపద రక్షణ – రైతుల పశుసంపదను ఆరోగ్యంగా కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
  • ప్రయోగశాల పరీక్షల అవసరాన్ని నిర్ణయించడం – ఏ పరీక్షలు చేయాలో నిర్ణయించడానికి సహాయపడుతుంది. ఈ వ్యాసంలో గాలికుంటు వ్యాధిలో ఉండే లక్షణాలు ఏంటి మరియు దానిని పోలిఉండే ఇతర వ్యాధులు, వాటి లక్షణాలు, సరైన వ్యాధిని గుర్తించడం ఎలా అనే వాటి గురించి తెలుసుకుందాము.

గాలికుంటు వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు

  • అధిక జ్వరం
  • నోటిలో పుండ్లు మరియు బుడగలు
  • నాలుకపై గాయాలు
  • కాళ్ల గిట్టల వద్ద పుండ్లు
  • ఎక్కువగా లాలాజలం కారడం
  • కుంటుతూ నడవడం
  • పాల ఉత్పత్తి తగ్గడం వ్యాధికి గురయ్యే జంతువులు – ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులు
    గాలికుంటు వ్యాధి ని పోలిఉండే ఇతర వ్యాధులు:
  1. వెసిక్యులర్ స్టొమటైటిస్:
    కారణం : రేబ్డో విరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులో వైరస్ వల్ల వచ్చే వ్యాధి.

లక్షణాలు

  • నోటిలో బుడగలు
  • నాలుకపై గాయాలు
  • కాళ్ల వద్ద పుండ్లు
  • అధిక లాలాజలం
    వ్యాధికి గురయ్యే జంతువులు – గుర్రాలు, ఆవులు, పందులు, గొర్రెలు, మేకలు మరియు అడవి జంతువులు
    గాలికుంటు వ్యాధితో తేడా – ఇది ముఖ్యంగా గుర్రాలలో కూడా కనిపిస్తుంది, కానీ గాలికుంటు వ్యాధి గుర్రాలలో సాధారణంగా రాదు.
  1. బోవైన్ వైరల్ డయేరియా:
    కారణం – ఫ్లేవి విరిడే కుటుంబానికి చెందిన పెస్టి వైరస్ వల్ల వచ్చే వ్యాధి

లక్షణాలు

  • నోటిలో గాయాలు
  • విరేచనాలు
  • బలహీనత
  • జ్వరం
    వ్యాధికి గురయ్యే జంతువులు – గుర్రాలు, ఆవులు, పందులు, గొర్రెలు, మేకలు మరియు అడవి జంతువులు
    గాలికుంటు వ్యాధితో తేడా – కాళ్ల వద్ద బుడగలు సాధారణంగా ఉండవు మరియు విరేచనాలు ఎక్కువగా కనిపిస్తాయి.
  1. రిండర్పెస్ట్ పశువుల్లో పారుడు వ్యాధి:
    కారణం – పేరామిక్సో విరిడే కుటుంబానికి చెందిన మోర్బిలి వైరస్.
    లక్షణాలు
  • అధిక జ్వరం
  • నోటిలో పుండ్లు
  • విరేచనాలు
  • నీరసం
    వ్యాధికి గురయ్యే జంతువులు ఆవులు, గేదెలు
    గాలికుంటు వ్యాధితో తేడా – తీవ్రమైన విరేచనాలు ప్రధాన లక్షణం. కాళ్ల గాయాలు తక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి ఇండియాలో అధికారికంగా నిర్మూలించబడింది.
  1. నీలినాలుక వ్యాధి :
    కారణం – రియో విరిడే కుటుంబానికి చెందిన ఆర్బి వైరస్
    లక్షణాలు
  • నోటి వాపు
  • నాలుక నీలం రంగులో మారడం
  • జ్వరం
  • కుంటడం
    వ్యాధికి గురయ్యే జంతువులు – గొర్రెలు, మేకలు, ఆవులు మరియు జింకలు
    గాలికుంటు వ్యాధితో తేడా – గొర్రెలలో ఎక్కువగా కనిపిస్తుంది మరియు మరియునాలుక నీలం రంగులో ఉండటం ప్రత్యేక లక్షణం.
  1. కాంటాక్ట్ డెర్మటైటిస్:
    కారణం – రసాయనాలు లేదా విషపదార్థాల వల్ల చర్మం దెబ్బతినడం.
    లక్షణాలు
  • కాళ్ల వద్ద గాయాలు
  • చర్మ వాపు
  • నడవడంలో ఇబ్బంది
    వ్యాధికి గురయ్యే జంతువులు – ఏ జంతువైనా రసాయనాలు మరియు విషపూరిత పదార్థాలను తాకడం లేదా తినడం వల్ల
    గాలికుంటు వ్యాధితో తేడా – నోటిలో పుండ్లు ఉండవు. ఇది అంటువ్యాధి కాదు.
  1. ఫుట్ రాట్:
    కారణం – ఫ్యూజోబ్యాక్టీరియం నెక్రోఫోరం మరియు డైకిలోబ్యాక్టార్ నొడోసస్ వంటి బ్యాక్టీరియా.
    లక్షణాలు:
  • కాళ్లలో వాపు
  • నడవడంలో ఇబ్బంది లేదా కుంటడం
  • గిట్టల మధ్య దుర్వాసనతో కూడిన పుండ్లు
  • తీవ్రమైన నొప్పి మరియు ఇన్ఫెక్షన్
    వ్యాధికి గురయ్యే జంతువులు: గొర్రెలు, మేకలు, పశువులు మరియు ఇతర గిట్టలున్న జంతువులు
    గాలికుంటు వ్యాధితో తేడా – గాలికుంటు వ్యాధి వల్ల నోటిలో మరియు గిట్టలపై బొబ్బలు ఏర్పడతాయి. కాగా ఫుట్రాట్ ప్రధానంగా గిట్టల ప్రాంతానికే పరిమితమై, కుంటడం మరియు గిట్టలు దెబ్బతినడం కలిగిస్తుంది, గిట్టల మధ్య భాగంలో దుర్వాసనతో కూడిన కుళ్లిన కణజాలాన్ని కలిగిస్తుంది. ఇందులో సాధారణంగా నోటిలో పుండ్లు కనిపించవు.
  1. మౌత్ రాట్:
    కారణం – అవకాశవాద బ్యాక్టీరియా లైన ఏరోమోనాస్, సూడోమోనాస్ మరియు సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా
    లక్షణాలు
  • నోటిలో దుర్వాసన
  • పుండ్లు
  • తినకపోవడం
    వ్యాధికి గురయ్యే జంతువులు – ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పక్షులు మరియు వేరే ఏ జంతువైనా పైన పేర్కొన్న బ్యాక్టీరియా సోకినప్పుడు
    గాలికుంటు వ్యాధితో తేడా – కాళ్ల వద్ద గాయాలు ఉండవు. ప్రధానంగా నోటిలోనే సమస్య ఉంటుంది.

ముగింపు
గాలికుంటు వ్యాధిని పోలి కనిపించే అనేక వ్యాధులు జంతువులలో కనిపిస్తాయి. భేద నిర్ధారణ అనేది పశువైద్యంలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. సరైన భేద నిర్ధారణ లేకపోతే తప్పు చికిత్స జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల క్లినికల్ లక్షణాలు, ప్రయోగశాల పరీక్షలు మరియు జంతువు చరిత్ర ఆధారంగా ఖచ్చితమైన నిర్ధారణ చేయాలి. రైతులు మరియు పశువైద్యులు అప్రమత్తంగా ఉండి సమయానికి చర్యలు తీసుకుంటే పశుసంపదను రక్షించవచ్చు. దీని ద్వారా జంతువుల ఆరోగ్యం మెరుగుపడి రైతులకు ఆర్థిక రక్షణ లభిస్తుంది.

డా.తనూజ నాదెళ్ళ, సహాయ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ గాలికుంటు వ్యాధి సహకార కేంద్రం, వి.బి.ఆర్.ఐ., విజయవాడ. ఫోన్: 9121000747

Read More

తులసి – కలబంద ద్రావణం

తులసి కలబంద ద్రావణం శక్తివంతమైన ద్రావణ ఎరువేకాకుండా బ్యాక్టీరియా, వైరస్ నిరోధకంగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేసుకోవడం చాలా తేలిక కూడా. మన పొలంలోనే లభించే తులసి ఆకులు మూడు నాలుగు కిలోలు, కలబంద మూడు నాలుగు కిలోలు సేకిరించి చిన్న ముక్కలుగా తరగాలి. వాటిని ఒక తొట్టెలో లేదా డ్రమ్ములో వేసి దానికి పది కిలోల కోళ్ల ఎరువు, పది కిలోల పేడ, పదిలీటర్ల మూత్రం కలపాలి. ఈ విశ్రమానికి ఒక కిలో బెల్లం చేర్చాలి. రోజూ కలుపుతూ పోతే వారం రోజుల్లో తులసి, కలబంద నీటిలో పూర్తిగా కలిసి ద్రావణంగా మారుతుంది. దీన్ని పైరుకు పైపాటుగా పిచికారి చేయడంతో పాటు నేల తడిలో కలిపి కూడా ఇవ్వవచ్చు. పై పాటు పిచికారికి లీటరుకు 50 మిల్లీ లీటర్ల ద్రావణం కలుపుకోవాలి. ఈ ద్రావణం శక్తివంతమైన ద్రవ ఎరువే కాకుండా శిలీంద్ర, బ్యాక్టిరియా, వైరల్ సమస్యలను అడ్డుకుంటుంది.

రైతునేస్తం ప్రచురణ ‘ స్వేద వేదం ’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

బహుళ ప్రయోజనాలుగల ఔషధ మొక్క…. ఉల్లి

ఉల్లి ఒక ఏకదళ, ద్వైవార్షిక లేదా బహువార్షిక మొక్క అయినప్పటికీ, సాధారణంగా దీనిని ఏకవార్షిక మొక్కగా సాగు చేస్తారు. ఉల్లి మొక్క అనేక గొట్టంలాంటి నీలిఆకుపచ్చ రంగు నుండి ముదురు ఆకుపచ్చ రంగు ఆకులను కలిగి ఉంటుంది. మొక్క క్రింది భాగం చిన్న గడ్డ కలిగి ఉండి ఊరిన తర్వాత ఉల్లిగడ్డగా మారుతుంది. గడ్డలు కురచబడిన, భూమిలోపల అణచబడిన కాండముల చుట్టూ మెత్తని మార్పు చెందిన పొలుసులు (ఆకులు) కాండం చివర మధ్యలో ఉన్న మొగ్గను కప్పి ఉంచుతాయి. వసంతకాలంలో ఆకులు ఎండి చనిపోయి గడ్డ పైపొరలు ఎండి పెళుసుగా మారతాయి. ఉల్లి ప్రతి సంవత్సరం గడ్డలను, రెండు సంవత్సరాలకొకసారి గింజలను ఉత్పత్తి చేస్తుంది. పూలకాడ గట్టిగా, గొట్టంలా ఉండి మైనపు పొరతో 1 మీ. ఎత్తు పెరుగుతుంది. పూగుచ్ఛం గొడుగు ఆకారంలో గుండ్రంగా ఉంటుంది. పూలు తెల్లని రంగులో ఉంటాయి. కాయ ఒక కాప్సూల్. పునరుత్పత్తి విత్తనాల ద్వారా జరుగుతుంది.

సాధారణ నామం: ఆనియన్ శాస్త్రీయ నామం: అల్లియంసెపా కుటుంబం: అమారిల్లిడేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • ఉల్లి కాడలు, గడ్డలు, గింజలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
  • ఉల్లి యాంటి ఆక్సిడెంట్, రోగనిరోధకశక్తి, యాంటి ఇన్‌ఫ్లమేటరి లక్షణాలు కలిగి ఉండి అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
  • ఉల్లిని ఊబకాయం కలిగి ఉన్న వారికి బరువు తగ్గించే చికిత్సలో ఉపయోగిస్తారు.ఆహారంగా ఉల్లి శరీరానికి అనేక పోషకాలనందిస్తుంది.
  • ఔషధంగా ఉల్లి అధిక కొలెస్టరాల్, మధుమేహం, కీళ్ళ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, గాల్ బ్లాడర్ వ్యాధులు, ఆకలి మందగించడం, అధిక రక్తపోటు, గొంతు నొప్పి, ఆస్త్మా, బ్రోంకైటిస్, దగ్గు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో నులిపురుగుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
  • ఉల్లిలో కీంప్‌ఫెరాల్, మిరిస్టిన్, క్వెర్సెటిన్, క్వెర్సిట్రిన్, అల్లెåల్‌సల్ఫైడ్ అనే రసాయనాలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది క్వెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్. ఇది మంచి యాంటిఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇంకొక ముఖ్య రసాయనం, అల్లెåల్ సల్ఫైడ్, యాంటిఆక్సిడెంట్, యాంటి ఇన్‌ఫ్లమేటరి లక్షణాలు కలిగి ఉంటుంది.
  • ఉల్లి యాంటి ఆక్సిడెంట్, యాంటిఇన్‌ఫ్లమేటరి, యాంటికొలెస్టరాల్, యాంటీహైపర్ సెన్సిటివ్, యాంటిక్యాన్సర్, యాంటిఆర్థ్రెåటిక్, యాంటిబాక్టీరియల్ లేదా యాంటిబయాటిక్, బ్రాంకోడైలేటర్, ఎక్స్‌పెక్టొరెంట్, యాంటిస్పాస్మోడిక్, యాంటిసెప్టిక్, కార్మినేటల్, పైబ్రినోలైటిక్, యాంథెల్మిటిక్, యాంటికోయాగ్యులెంట్ ఔషధ గుణాలు కలిగి ఉంది.
  • ఉల్లి శరీరంపై మచ్చలు తొలగించడానికి, కాల్పులు, గాయాలు, కేశనష్టం, మధుమేహం, అధిక కొలెస్టరాల్, అధిక రక్తపోటు, ఆస్త్మా, సాధారణ జలుబు, పొడి దగ్గు, గొంతునొప్పి, బ్రాంక్రైటిస్, ఆకలి లేకపోవడం, కడుపులో కలవరం, కంటిచూపు, శుక్లాలు, గుండెనొప్పి వంటి సమస్యల నివారణలో ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో …

  • క్యాబేజి పంటలో ఉల్లి, వెల్లుల్లి పంటలను పురుగు నివారణ అంతర పంటలుగా సాగు చేస్తారు. ఈ అంతర పంటలు అల్లిసిన్ ఉత్పత్తి ద్వారా పురుగులను వికర్షిస్తాయి. వీటి వేర్ల నుండి స్రవించే ద్రవాలు వాటి వాసన ద్వారా పురుగులను వికర్షిస్తాయి. అంతర పంటలు వేసిన క్యాబేజి క్షేత్రంలో డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లాక్ౙెåలోస్టెల్లా లార్వాలు, ప్యూపాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంతర పంటలు సాగు చేసిన క్యాబేజి క్షేత్రంలో అధిక సంఖ్యలో క్యాబేజి మొక్కలు బతికి ఉన్నాయి. ఉల్లి, వెల్లుల్లి యాంటిఫీడెంట్ చర్య ద్వారా ఆకుతినే పురుగులను పారదోలాయి. అంతర పంటలు వేసిన క్యాబేజి పంటలో దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. సన్న, చిన్న కారు రైతులు క్యాబేజిలో ఉల్లి, వెల్లుల్లిలను అంతర పంటలుగా సాగు చేసి అధిక దిగుబడులు, అధిక ఆదాయం పొందవచ్చని ఫలితాలు వెల్లడించాయి (దేబ్ర అండ్ మిషెక్, 2014).
  • పైన్ మొక్కల మీద అల్లం, వెల్లుల్లి ద్రావణాలను పిచికారి చేసి మిడతలను వికర్షింపజేశారు. మిడతలు అల్లం, వెల్లుల్లి ద్రావణాల వాసనను అసహ్యించుకుని దూరంగా పారిపోయాయి.
  • ఉల్లి, వెల్లుల్లి, అల్లం ద్రావణాలు ఆల్టర్నేరియా సొలాని శిలీంద్ర పెరుగుదల నరికట్టాయి. అందువలన వీటిని సహజ శిలీంద్ర నాశినులుగా ఉపయోగించవచ్చు. (ముడ్యివ, అతని అనుచరులు, 2016).
  • ఉల్లి ద్రావణం నుండి తయారు చేసిన సిల్వర్ నానోపార్టికల్స్ బాసిల్లస్ సబ్‌టైలిస్, క్లెబ్సియెల్లాన్యుమోనియే, ఎస్కరిచియాకోలి, బాసిల్లస్ ఎంటరోబాక్టర్ (బాక్టీరియా), ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ ఓక్రేసియస్ (శిలీంద్రాలు)లపై గణనీయమైన యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్ చర్యలను ప్రదర్శించాయి (బాలమణికందన్, అతని అనుచరులు, 2015).
  • ఉల్లిగడ్డను సన్నగా తరిగి రెండు చెంచాల నూనెలో ఒక రోజు నానబెట్టాలి. తర్వాతి -ఒక అర లీటరు సబ్బు నీటిలో కలిపి వడపోయాలి. ఈ ద్రావణాన్ని 1:20 నిష్పత్తిలో నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  • నివారించబడే తెగుళ్ళు : సెర్కోస్పొరా ఆకుబూజు, ఆకుమచ్చ, ఎర్లీబ్లెåట్, కప్పకన్ను తెగులు, కొల్లెటోట్రైకం ఆకుమచ్చ, ఆంత్రాక్నోస్, కాయకుళ్ళు, స్మడ్ౙి, కర్వులేరియా ఆకుమచ్చ, ఆకుమాడు
  • ఎరుపు రంగు పొరలున్న ఉల్లిపాయలలో కెటచాల్ అనే ఫినాలిక్ కాంపౌండ్ స్మడ్ౙి తెగులు కలిగించే శిలీంద్రం, కొల్లెటోట్రైకం సిర్సినాన్స్, సోకకుండా వ్యాది నిరోధక శక్తిని సమకూరుస్తుంది (లింక్ అండ్ వాకర్, 1933).
  • ఉల్లి బోట్రైటిస్ సినరియా ఆశించినపుడు సైక్లోపెంటోన్‌క్లాస్‌కి చెందిన సిబ్యులిన్స్ అనే ఫైటోఎలక్సిన్‌ని ఉత్పత్తి చేసి శిలీంద్రబీజం మొలకెత్తడాన్ని, జెర్మ్‌ట్యూబ్ పెరగడాన్ని అరికడుతుంది (డిమత్రీన్, అతని అనుచరులు, 1990).
  • కంద దుంప నిల్వ సమయంలో ఆశించే మాత్ డాసిసెస్ రుగోసెల్లాని మిరప (కాప్సికం యాన్యువమ్, కాప్సికం ఫ్రూటెసెన్స్) పొడులు అతి సమర్ధవంతంగా 24 గంటలలోపే 100% మాత్ పురుగులను చంపాయి. సిడియంగ్వినీన్స్, ఉల్లి, వెల్లుల్లి పొడులనుపయోగించిన 3 రోజులలో సమర్దవంతంగా నివారించాయి (అషామొ, 2010).
  • ఉల్లిని అన్ని పురుగుల (పిండినల్లితో సహా)ను సమర్ధవంతంగా అరికట్టి, మొక్కలలో రోగనిరోధక శక్తిని పెంచి, దిగుబడులను అదికం చేసే గోమూత్ర జంతునాశక ద్రావణం తయారీలో ఉపయోగిస్తారు. దీనిని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలన్నీ స్థానికంగా లభిస్తాయి. దీని తయారీ విధానం సులభం. అంతేగాక ఇది పర్యావరణహిత పద్దతి. కూరగాయల పంటలలో దీనినుపయోగిస్తే కూరగాయల రుచి, వాసన పెరుగుతాయి.
  • ఉల్లిలో ఉండే ఆల్కలాయిడ్లు చాలా రకాల తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడతాయి. ఉల్లి కషాయం వ్యాదికారకాల పెరుగుదలను నిలిపివేయడంలోను, తెగులు కారకాల బీజాలు మొలకెత్తడాన్ని నియంత్రించడంలోను ఉపయోగపడుతుంది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

వ్యవసాయ యంత్ర పరికరాల సబ్సిడీకి రూ.112.50 కోట్ల కేటాయింపు

రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, గొర్రులు, కోత, నూర్పిడి యంత్రాలు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు వంటి వ్యవసాయ యంత్ర పరికరాలను అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఖరీఫ్, రబీ సాగు ఆధారంగా 2025-26 సంవత్సరానికి 28 జిల్లాలకు రూ.112.50 కోట్లు కేటాయించింది. ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.

*నిబంధనలు*

ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు యంత్రాల యూనిట్ ధరలో 50% చొప్పున, ఇతర రైతులకు 40% చొప్పున రాయితీ వర్తిస్తుంది. 40 హెచ్‌పీ వరకు సామర్థ్యం గల ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, అనుబంధ పరికరాలు, విత్తే, నాటే, తవ్వే యంత్రాలు, స్ప్రేయర్లు, స్వీయచోదక పరికరాలు, పవర్ టిల్లర్లు, కోత, నూర్పిడి యంత్రాలు, పంట కోత తర్వాత విలువ జోడింపు యంత్రాలు అందిస్తారు. లబ్ధిదారులను జిల్లా సంయుక్త కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. జిల్లాల్లో మండలాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. జిల్లా ఇంఛార్జి మంత్రి ఆమోదం తర్వాత లబ్ధిదారుల జాబితా విడుదలవుతుంది. ఎంపికైన వారి మొబైల్ ఫోన్లకు మెనేజ్‌లు పంపిస్తారు. ప్రొసీడింగ్స్ ఇచ్చిన 15 రోజుల్లో రైతులు పరికరానికి సంబంధించి తమ వాటా మొత్తాన్ని డీలర్లకు చెల్లించాలి. ఆర్డర్ అందాక 15 రోజుల్లో రైతులకు యంత్రాన్ని అందిస్తారు.

రాయితీపై యంత్ర పరికరాలకు రైతు సేవా కేంద్రాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. నచ్చిన డీలర్ వద్ద పరికరాన్ని కొనుక్కోవచ్చు. మే 5 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలి. 23 నుంచి 25 వరకు లాటరీ ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి మంజూరు పత్రం ఇస్తారు. లబ్ధిదారు మే 26 నుంచి జూన్ 9లోగా తన వాటా సొమ్ము డీలర్‌కు చెల్లించాలి. మే 26 నుంచి జూన్ 26 వరకు యంత్రాలు సరఫరా చేస్తారు. జూన్ 30 నుంచి డీలర్ ఖాతాలోకి రాయితీ సొమ్ము విడుదల ప్రక్రియ మొదలవుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు వెబ్ సైట్: https://eseed.ap.gov.in/FM/*కౌలు రైతులూ అర్హులే* సొంత భూమి కలిగిన రైతులతో పాటు గత మూడేళ్లలో కనీసం మూడు సీజన్లలో ఈ పంటలో నమోదైన ‘కౌలు రైతు కార్డులు’ పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అటవీ హక్కుల పత్రాలున్న(ఆరఓఎఫఆర్) రైతులూ అర్హులే. 2024-25 సంవత్సరంలో రాయితీ పొందినవారు అర్హులు కాదు. కుటుంబంలో ఒక సభ్యుడే దరఖాస్తు చేసుకోవాలి. భూమి రికార్డులు, అటవీ హక్కుల పత్రాలు, ఈ-పంట తదితర సమా చారం ఆధారంగా అర్హుల్ని ఎంపిక చేస్తారు.

Read More

న్యూట్రిహబ్ సహకారంతో రోజుకు ఒక పూట చిరుధాన్యాల భోజనం

మిల్లెట్ మార్వెల్స్ సంస్థ భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్)కు చెందిన న్యూట్రిహబ్ సహకారంతో ‘రోజుకు ఒక పూట చిరుధాన్యాల భోజనం’ జాతీయ మిషన్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ఐఐఎంఆర్ ప్రారంభించింది. ఐఐఎంఆర్ డైరెక్టర్ తారాసత్యవతి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిలు దీనిని ప్రారంభించారు. న్యూట్రిహబ్ డైరెక్టర్, సీఈఓ స్టాన్లీ, మిల్లెట్ మార్వెల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ భరత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిషన్‌కు సినీనటుడు నాగార్జున, ఏపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వీడియో ప్రసంగాల ద్వారా మద్దతు తెలిపారు.

Read More

నేల ఆరోగ్యంతోనే పౌష్టికాహారం

నేల ఆరోగ్యంగా ఉంటేనే పౌష్టికాహారం అందుతుంది కాబట్టి రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్)ల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో భూసార ఆరోగ్య వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ‘పిల్లి పెసర, జీలుగ లాంటి పచ్చిరొట్ట పైర్ల ద్వారా నేల సారాన్ని పెంచాలి. పంట అవశేషాలు తగల బెట్టకుండా వాటిని ఎరువులుగా ఉపయోగించాలి. నేల ఆరోగ్య పరిరక్షణను ఉద్యమంలా నిర్వహించేందుకు ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నాం. వారు రైతులకు నేల యాజమాన్యంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే నైపుణ్యాలను వృద్ధి చేస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలి” అని మంత్రి సూచించారు. అంతకుముందు మంత్రి ఇక్రిశాట్‌లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) హిమాన్ష్ పాఠక్, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మిన్ బాషా, అగ్రివర్సిటీ వీసీ రాజిరెడ్డి, అగ్రివర్సిటీ పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

Read More

తెలంగాణ రాష్ట్రంలో పశుసంపద పెంచాలని ప్రభుత్వానికి విజయ డెయిరీ ప్రతిపాదనలు

తెలంగాణలో రాష్ట్రంలో రోజుకు కేవలం 4 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తవుతున్నాయి, 26 లక్షల లీటర్ల పాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఇక్కడ పశుసంపద వృద్ధి చెందకపోవడమే. గేదెలు, ఆవుల సంఖ్య తగ్గడంతో.. పాడి, దాని అనుబంధ ఉత్పత్తులపై ప్రభావం పడింది. పాడి రైతులు పోసే పాలు రోజువారీ 50 వేల లీటర్ల మేరకు తగ్గాయి. సమస్య తీవ్రత, ప్రజావసరాల దృష్ట్యా పాడి రంగాన్ని ఆదుకునేందుకు పాడిపశువుల సంఖ్య పెంపుదల, ఇతర చర్యలు చేపట్టాలని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 2019తో పోలిస్తే తాజాగా జరిగిన పశుగణనలో పాలిచ్చే గేదెలు, ఆవులు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గింది.

పశువుల సంఖ్య తగ్గింది: 2019లో ఆవులు 42,32,383 ఉండగా.. తాజాగా వాటి సంఖ్య 30,69,524 (27.48%)కి తగ్గింది. గేదెల సంఖ్య 42,26,603 నుంచి 3052102 (27.78%) కి తగ్గింది. మేకలు 49,34,673 నుంచి 45,48,999 (7.82%) కి తగ్గాయి.
సూర్యాపేట జిల్లాలో ఆవులు 62.65%, సంగారెడ్డి 50.74%, మెదక్‌ 45.26%, మహబూబాబాద్‌లో 43.64% తగ్గాయి. గేదెలు సంగారెడ్డి జిల్లాలో 46.14%, కామారెడ్డి 45.92%, మెదక్‌ 45,32%, మహబూబాబాద్‌ లో 43.23% తగ్గాయి. మేకలు హైదరాబాద్‌లో 40.87%, రంగారెడ్డి జిల్లాలో 25.83 % క్షీణించాయి.

పాడిపరిశ్రమకు ఆశించిన ప్రోత్సాహం లేకపోవడం వల్ల రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. రాష్ట్రంలోని గ్రామీణ రైతు కుటుంబాల్లో 0.87% మాత్రమే పాడిపశువుల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్నాయని జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. పాడిపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పశువుల పంపిణీ పథకాన్ని చేపట్టి, లబ్దిదారులకు వాటిని పంపిణీ చేయాలని విజయ డెయిరీ ప్రభుత్వాన్ని కోరింది.
Read More

యూరియా వాడకం తగ్గించిన రైతులకు రూ. 800 లు ప్రోత్సాహం

రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని రైతులకే బదిలీ చేస్తామని, యూరియా వాడకం తగ్గించే రైతులు, కౌలు రైతులకు బస్తాకు రూ.800 చొప్పున ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చెప్పారు. సచివాలయంలో సోమవారం జీఎస్‌ డీపీపై జరిగిన సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘యూరియా విక్రయాలను సరిగా నిర్వహించి ఉంటే సమస్య ఉండేది కాదు. ప్రభుత్వంలో అన్ని శాఖలనూ ప్రక్షాళన చేశాం. ఎరువుల విభాగాన్ని చేయలేకపోయాం. అందుకే సమస్య వచ్చింది’ అని పేర్కొన్నారు. ‘రబీకి యూరియా ఇబ్బంది లేకుండా ఈ-క్రాప్‌ ద్వారా ఎవరికి ఎంత అవసరమో గుర్తించాలి. అవసరమైతే ఆధార్‌ అనుసంధానించి ఇంటికే డెలివరీ చేద్దాం’ అని చెప్పారు. పంటల అమ్మకాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్దేశించారు.

Read More

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 24వ ర్యాంక్

  • జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి NIRF (National Institutional Ranking Framework) 2025 లో 24వ ర్యాంక్ – గత ఏడాదితో పోలిస్తే 13 ర్యాంకుల మెరుగుదల.
  • ప్రభుత్వ మద్దతు, సిబ్బంది కృషి ప్రధాన కారణాలు – ఉపకులపతి అల్థాస్ జానయ్య

దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పనితీరుపై భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే నివేదిక NIRF (National Institutional Ranking Framework) 2025 ఈరోజు విడుదల అయ్యింది. ఈ జాబితాలో దేశంలోని అన్ని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలు, సంస్థల జాబితాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) 24వ ర్యాంక్ ను సాధించింది. 2015 లో PJTAU ఆరవ ర్యాంక్ సాధించగా, 2023లో ఆ ర్యాంక్ 37కు పడిపోయింది. ఇప్పుడు పనితీరు మెరుగు పరుచుకుని 24 ర్యాంకు సాధించిందని PJTAU ఉపకులపతి అల్దాస్ జానయ్య వివరించారు. దక్షిణాదిలోని అన్ని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో 4వ స్థానంలో PJTAU నిలవడం గర్వకారణమని జానయ్య అన్నారు. 10 నెలల క్రితం తాను PJTAU ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశ్వవిద్యాలయ ర్యాంకింగ్ మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ ఏడాది ర్యాంకు మెరుగుపడిందని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలో ప్రత్యేకంగా 4 ఆధునిక పరిశోధన కేంద్రాలు ప్రారంభించానన్నారు. మానవ రహిత వ్యవసాయమే ధ్యేయంగా డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెంపునకు సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ ను, సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణ పరిశోధనలకు గాను సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ను, అదేవిధంగా సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సిస్టమ్స్ ను, అలాగే బోధన, బోధనేతర సిబ్బంది లో నైపుణ్యాల పెంపుదలకి సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సహజ వనరుల పరిరక్షణ, యూరియా, ఇతర రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు, నీటి సమర్థ యాజమాన్యం వంటి ముఖ్యమైన అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ”రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేసి సుమారు 1200 గ్రామాల్లో 1,20,000 మంది రైతులని శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా కలిసి ఆ అంశాలపై అవగాహన కల్పించారని జానయ్య వివరించారు. అలాగే సుమారు 11వేల గ్రామాల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకి నాణ్యమైన 40 వేల విత్తన కిట్లను పంపిణీ చేశామని జానయ్య పేర్కొన్నారు. సామాన్యులకి, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వ్యవసాయ విద్యను చేరువ చేయాలన్న ఉద్దేశంతో సీట్లను పెంచి, ఫీజులు తగ్గించామని, వ్యవసాయ కూలీల పిల్లలకు ప్రత్యేక సీట్లు కేటాయించామని జానయ్య వివరించారు. అలాగే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని విస్తృత పరిశోధనలు చేపట్టామని జానయ్య తెలిపారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR), రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ కార్యదర్శి శ్రీ M. రఘునందన్ రావు ల నిరంతర మార్గదర్శకత్వం, తోడ్పాటుతో ఈ ర్యాంకు సాధించగలిగామన్నారు. అదేవిధంగా బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల కృషి, తోడ్పాటు ర్యాంకుల పెరుగుదలకు దోహదం చేసిందని జానయ్య అన్నారు. వారందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో 2026 లో 10వ ర్యాంకు, 2027లో 5వ ర్యాంకు సాధిస్తామని అల్థాస్ జానయ్య ధీమా వ్యక్తం చేశారు.

Read More