ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించండి

ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందనీ, రసాయన వ్యవసాయాన్ని క్రమంగా వీడి ప్రకృతి సేద్యానికి మళ్లాలని రైతులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒక సీజన్‌కు ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించాలని, తద్వారా రాబడి పొందుతూ ఆత్మవిశ్వాసం పెరిగే కొద్దీ దానిని విస్తరించుకోవాలని ఆయన సూచించారు. ప్రకృతి సేద్యం వల్ల దీర్ఘకాలంలో బహుళ ప్రయోజనాలున్నాయని తెలిపారు. భూమి సారవంతం కావడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సమకూరుతాయని సామాజిక మాధ్యమం ‘లింక్డిన్‌’లో బుధవారం పెట్టిన పోస్టు ద్వారా వివరించారు. గత నెలలో కోయంబత్తూరులో నిర్వహించిన ‘దక్షిణ భారత ప్రకృతి సేద్యం సదస్సు-2025’కు రైతులు ఆహ్వానించగా వెళ్లినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా సాధిస్తున్న విజయాలు తననెంతో విస్మయపరిచాయని పేర్కొన్నారు. వ్యవసాయదారులతో పాటు శాస్త్రవేత్తలు, విద్యాధికులు, వృత్తి నిపుణులు, కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలి వచ్చిన వ్యక్తులు కూడా ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారని తన దృష్టికి వచ్చిందని వివరించారు. ప్రకృతి సేద్యం ద్వారా వివిధ రకాల ఆహార ధాన్యాలు పండించడం, అంతర పంటలుగా కూరగాయలు, వివిధ రకాల పండ్ల మొక్కల సాగు, వీటికి అనుబంధంగా పాడి పశువులు, చేపల పెంపకం తదితరాలను చేపట్టి విజయపథంలో కొనసాగుతున్నారని తెలిపారు. సంప్రదాయ పంటల విత్తనాల పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలనూ ప్రధాని మోదీ ప్రశంసించారు. వివిధ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మలచుకుంటున్నారని తెలిపారు.

Read More

రొయ్యకు దేశీయ మార్కెట్‌ పెరగాలి

దేశీయంగా రొయ్యలకు బలమైన మార్కెట్‌ కల్పించేందుకు ఆర్థిక తోడ్పాటు అందించాలని.. కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని రొయ్య రైతుల సమాఖ్య అధ్యకక్షుడు మోహన్‌రాజు కోరారు. ప్రధాని మోదీ, కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డులకు ఆయన ఈ మేరకు లేఖలు రాశారు. ఇటీవల మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన సూచన మేరకు దేశీయ మార్కెట్‌ పెంచేందుకు అవసరమైన సవివర ప్రాజెక్టు నివేదికలు రూపొందించి పంపినట్లు ఆయన తెలిపారు. మత్స్య అభివృద్ధి బోర్డు ద్వారా ఒక్కోటి రూ.50 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 3 వేల టన్నుల సామర్థ్యంతో 20 రొయ్యల నిర్వహణ, మార్కెటింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Read More