వండని వంట… జ్యూస్

వేసవిలో శరీరంలో వేడి తగ్గించి శరీరానికి చలవచేసి అధిక దాహం తగ్గించే జ్యూస్ తయారీ…

కావలసిన పదార్థాలు: కర్బూజా పండు, గోండ్ కటోరా, సబ్జా గింజలు

తయారు చేయు విధానం: సబ్జా గింజలు, బాదం కటోరాలను రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి.

కర్బూజా పండును తొక్క తీసి, ముక్కలు చేసుకుని జ్యూస్ చేసుకోవాలి.

గ్లాస్ జ్యూస్‌కి ఒక స్పూను సబ్జా గింజలు,

ఒక స్పూను బాదం కటోరా కలుపుకొని త్రాగడమే!

ఎంతో రుచికరంగా చల్లగా ఉంటుంది.

రచన: శాంత కర్రి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… పచ్చి కొబ్బరి కూర, కోసంబరి

  1. పచ్చి కొబ్బరి తురుముతో కూర !

కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు (రుచికి సరిపడా), పచ్చి మిరపకాయలు, పులుపుకి నిమ్మరసం లేదా తురుమిన మామిడికాయ వాడుకోవచ్చు.

ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి తురుము, దంచుకున్న పచ్చిమిర్చి, ఉప్పు, నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకుంటే, కొబ్బరి తురుము కూర సిద్ధం.

అన్నం, రొట్టెల్లోకి రుచికరంగా ఉంటుంది. (మీకు కావాలని అనిపిస్తే, పోపు కూడా వేసుకోవచ్చు.)
మామూలుగా అయితే, ఒక్క చుక్క నూనె అవసరం లేదు.

  1. కోసంబరి (కర్ణాటక, తమిళనాడు వంటకం)

కావలసినవి: పచ్చి పెసరపప్పు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి క్యారట్ తురుము, కీరా ముక్కలు, నిమ్మరసం, ఉప్పు.

పైన చెప్పిన పదార్ధాలు అన్నీ గిన్నెలో వేసి కలుపుకోవడమే. మంచి రుచికరమైన రీరిఖిలి ఖిరిరీనీ సిద్ధం.

రచన: సంధ్యా శశికాంత్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ముంత మసాలా

ఇది పాక్షికంగా వండని వంటలు కిందికి వస్తుంది.
సాయంత్రం పూట చిరుతిండిలా లేదా ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకొనేదే ముంత మసాలా.

కావలసినవి: మరమరాలు ఒక 50 గ్రాములు, పెద్ద ఉల్లిపాయ, రెండు బాగా పండిన టొమాటోలు, పుట్నాలు రెండు చెంచాలు, నిమ్మకాయ ఒకటి, కొత్తిమీర తరుగు కొంచెం. ఉప్పు, పసుపు, కారం సరిపడా.
కావాలి అంటే వేసుకునేవి: చిటికెడు గరం మసాలా, కారెట్ తురుము, వేయించిన పల్లీలు, కొబ్బరి తురుము.

తయారీ విధానం: ఉల్లిపాయ, టమాటో సన్నగా తరిగి ఉంచుకోవాలి. నిమ్మరసం గింజలు రాకుండా తీసి పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో ఉల్లి, టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా పిసికితే కొంచెం నీరులా వస్తుంది. అప్పుడు మరమరాలు, పుట్నాలు వేసి ఇంకోసారి గట్టిగా పిసికితే మరమరాలు మెత్తబడతాయి. తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి తినడమే.

ఇదే పద్ధతిలో అటుకులు కూడా చేసుకోవచ్చు. అటుకులు ఒక్క నిమిషం నీటిలో వేసి, తర్వాత నీరు పిండి మరమరాల్లాగే చేసుకోవచ్చు.

ఇంకొంచెం రుచిగా ఉండాలి అంటే కారట్ – కొబ్బరి తురుము, కొన్ని వేయించిన వేరుశనగలు కలుపుకోవచ్చు. కారం బదులు పచ్చిమిర్చి లేదా సాంబార్ కారం, పులుపుకి నిమ్మకాయ లేదా మామిడి తురుము వేసుకోవచ్చు. నిమ్మరసం తినేముందు పిండుకోవాలి.

రచన: కనకదుర్గ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… కడుపులో చల్లటి భోజనం

మామూలుగా ఎండాకాలంలో ఏమి తినాలనిపియదు. నీళ్లు బాగా తాగిన తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది, కాసేపటికి నీరసం వస్తుంది, అటువంటి పరిస్థితుల్లో దీన్ని బాగా తినొచ్చు.

కావాల్సిన వస్తువులు: ఒక సగం కీర, చిన్న దోసకాయ ముక్క, మూడు నాలుగు క్యారెట్ ముక్కలు అంటే చిన్న క్యారెట్ ఒకటి, చిన్న బీట్రూట్ ముక్క రెడ్ కలర్ ఉండొద్దు అనుకుంటే బీట్రూట్ వేయకుండా ఉండొచ్చు. ఒక టమాటా, ఒక చిన్న కప్పు పెరుగు, కొంచెం సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు కొన్ని….

చేసుకునే విధానం: అన్ని ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు తక్కువ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది గట్టిగా లేకుండా కొంచెం లూస్‌గా ఉంటేనే బాగుంటుంది. ఉదయము, మధ్యాహ్నము ఎప్పుడైనా మనం దీన్ని తినొచ్చు. అమృత ఆహారం అనలేము, ఎందుకంటే సాల్ట్ కలుస్తుంది కాబట్టి. ఉప్పు లేకుండా కూడా బాగానే ఉంటుంది.
అన్నం తింటేనే కడుపు నిండుతుంది అనుకునేవాళ్ళు కరెక్ట్‌గా ఒక ముద్ద అన్నాన్ని పిసికి, దీంట్లో కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది

కీర లేకున్నా టమాటా, ఉల్లిగడ్డ, పెరుగు…. వీటితో కూడా ట్రై చేసుకోవచ్చు.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… సత్తుపిండి

సత్తుపిండిని కేవలం రెండే రెండు పదార్థాలతో తయారు చేస్తారు. తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగకు కట్టుకుపోయే ‘సద్ది’లో, ఈ సత్తుపిండి ఒకటి.

సత్తుపిండిని, మొక్కజొన్నలను ‘వేపి’ తయారు చేస్తారు.
మన వండని వంటలు కాన్సెప్ట్ ప్రకారం, మొక్కజొన్నలను వేపకుండానే తయారు చేసాను.

కిలో మొక్కజొన్నలను బాగా ఎండబెట్టి, శుభ్రం చ్రేసి, మెత్తగా మర పట్టించాలి.

విసుర్రాయితో విసురుకుంటే, ‘కోల్డ్ విసుర్డ్ పిండి’ వస్తుంది, అది మరీ శ్రేష్టమైన పిండి.

మర(గిర్ని) పట్టిస్తే పిండి ఎక్కువ వేడెక్కుతుంది. ఆ మేరకు జీవశక్తి నష్టపోతుంది. కనుక విసుర్రాయి (తిరుగలి) ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండాలి.

సత్తుపిండి తయారీ విధానం: రెండు కప్పుల మొక్కజొన్న పిండికి, తగినంత ముడిబెల్లాన్ని తీసుకోవాలి. కాస్తా వెడల్పు గిన్నెలో అరకప్పు మంచినీరు తీసుకుని, ఆ నీటిలో బెల్లాన్ని కరిగించాలి. కరిగిన బెల్లపు నీటిలో, మొక్కజొన్న పిండిని బాగా కలిపి, ముద్దలు చేసుకోవాలి. అంతే! వెరీ సింపుల్!

మొక్కజొన్న పిండి సహజ సువాసనతో తియ్యగా ఉంటుంది.

పెద్దలు, పిల్లలు సత్తుపిండిని ఉపాహారంగా తినవచ్చు.

బెల్లం మోతాదు ఎవరి అబిరుచిని బట్టి వారు, కాస్తా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.

పిండి తయారుగా ఉంటే, సత్తుపిండి తయారీ నిముషాలలో అవుతుంది. సత్తుపిండిలో ఎండుద్రాక్ష లేదా ఖర్జూర పండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

పూర్వం ప్రయాణాల్లో సత్తుపిండిని, బెల్లాన్ని వెంట తీసుకుని పొయ్యేవారు. వంటకు వీలుకాని పూట, సత్తుపిండిని తినేవారు.

  • రచన: తుమ్మేటి రఘోత్తమరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

దోసకాయ-మామిడికాయ పచ్చడి

వేపకుండా, ఉడికించకుండా తయారుచేసే సహజాహార వంటకం ఈ ‘దోసకాయ-మామిడికాయ’ పచ్చడి
దోసకాయను-మామిడికాయను బాగా కడిగి, చెక్కు తీసి కానీ, తీయకుండా కానీ, చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పచ్చిమిర్చి కానీ, పండుమిర్చి కానీ, బాగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. (కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు).

సముద్రపు రాళ్ళ ఉప్పు కానీ, రాక్ సాల్ట్ కానీ తగినంత తీసుకోవాలి. మిక్సీలో కానీ రోట్లో కానీ పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి నూరుకోవాలి. తరువాత మామిడికాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నూరుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నూరు కున్న పచ్చడిని, మామిడికాయ పచ్చడిగా కూడా తినవచ్చు. లేదంటే దోసకాయ ముక్కలు దానిలో కలిపి దోసకాయ ష మామిడికాయ పచ్చడిగా కూడా తినవచ్చు.

రెండు రకాలుగా చేసుకోవచ్చు.

అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. రోటీ, పుల్కా, చపాతీలలో కూడా బాగుంటుంది.

ఎండుమిర్చికంటే పచ్చిమిర్చి కానీ పండుమిర్చి కానీ వాడుకుంటే రుచి ఎక్కువ ఉంటుంది.
పండుమిర్చిఎండిన తర్వాత కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎండుమిర్చి తక్కువ వాడుకుంటే మంచిది.

మామిడికాయ బదులుగా చింతపండు కూడా వాడుకోవచ్చు. కానీ చింతపండు ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. అందుకని మామిడికాయ వాడుకుంటే రుచిగా ఉంటుంది.

ఈ పచ్చడిని ఏ రోజుకు ఆరోజు తయారు చేసుకుని వాడుకోవడం మంచిది.

రచన : లతా కృష్ణమూర్తి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… మామిడల్లం పచ్చడి

ప్రకృతి మానవాళికి ప్రసాదించిన ఒక మంచి ఆహారం ‘మామిడి అల్లం’ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇది అల్లం జాతికి చెందిన దుంప. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చూడ్డానికి అల్లం దుంపలా వున్నా, గిచ్చి చూస్తే పచ్చి లేత మామిడికాయ వాసనతో చిన్న పాటి వగరుతో వుంటుంది.

మామిడి అల్లాన్ని ఉపయోగించి ‘వండనివంట’గా రోజువారీగా ఉపయోగపడే రోటి పచ్చడి చేసుకోవచ్చు.
కొన్ని రోజులు నిల్వ వుండే ఆవకాయ పచ్చడి లాగా కూడా చేసుకోవచ్చు.

మామిడల్లంతో రోటి పచ్చడి తయారీ…
మామిడల్లాన్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. దీనికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి చేర్చి చింత పండు లేదా నిమ్మ రసం కలిపి కచ్చాపచ్చాగా నూరుకుని, అన్నంలోకి లేదా రోటీలోకి తింటే చాలా బావుంటుంది.. (అవసరం అనుకున్న వారు ఎండుమిర్చితో తాలింపు పెట్టుకుంటే మరింత రుచి.. )
ఈ పచ్చడి ఏరోజుకారోజు చేసుకోవడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ వుండదు.

రెండవ పద్దతి ‘మామిడి అల్లం – ఆవకాయ’
మామిడల్లాన్ని కడిగి తేమ లేకుండా ఆరబెట్టాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
కోసుకున్న ముక్కలకు కొద్దిగ ఆవపిండి, కొద్దిగ కారం, సరిపడ ఉప్పు కలిపి, నువ్వుల నూనె కూడా సరిపడా కలిపి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా కలపాలి. తరువాత నిమ్మ రసం కలిపి వూరనివ్వాలి. ఇది అచ్చు చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిలా వుంటుంది. కొన్ని రోజులు ఫ్రిజ్ సహాయం లేకుండా నిల్వ వుంటుంది. ఫ్రిజ్‌లో దాస్తే మరింత తాజాగా వుంటుంది. అభిరుచినిబట్టి తాలింపు అదనం. గింజలు తీసిన పచ్చిమిర్చి ముక్కలు, కారెట్ ముక్కలు, మామిడి పొడి కూడా కలిపి మిక్సెడ్ పచ్చడి చేయవచ్చు.

  • రచన : సుబ్బారెడ్డి మేడపాటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More