ప్రకృతి ప్రసాదించిన వెల్లుల్లిలోని ఎలిసిన్‌… అంటువ్యాధులు, శ్వాసకోశ రుగ్మతలపై పనిచేస్తుంది. గంధక ధాతువులు.. అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి. సెలీనియం క్యాన్సర్‌ కణాలవ్యాప్తిని తగ్గిస్తుంది. ఫ్లేవనాయిడ్లు గుండె ధమనులను కాపాడతాయి. యాంటీఆక్సిడెంట్లు మధుమేహం, వృధ్ధాప్యం మీద పనిచేస్తాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. వెల్లుల్లిపై సరికొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. వెల్లుల్లికి ఉన్న ఈ సహజ రోగ నిరోధక లక్షణాలను నానో టెక్నాలజీతో మరింత ఇనుమడింపజేయవచ్చని అలహాబాద్‌ విశ్వవిద్యాలయ ఆచార్యుడు కె.ఎన్‌. ఉత్తమ్‌ నిర్ధారించారు. ఆయన ఆధ్వర్యంలో పరిశోధకులు వెల్లుల్లి మొక్కపై టైటానియం డయాక్సైడ్‌ నానో పార్టికిల్స్‌ను ప్రయోగించారు. ఈ నానో అణువులు వెల్లుల్లిలోని పోషక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయి. ఫలితంగా వెల్లుల్లిలో గంధకం, భాస్వరం, క్యాల్షియం, జింక్‌, ఇనుము ధాతువులు సాధారణం కన్నా ఎక్కువగా ఏర్పడ్డాయి. యాంటీ ఆక్సిడెంట్లు 30 నుంచి 40 శాతం పెరిగాయి. వెల్లుల్లిలోని ఏ ధాతువు ఏ వ్యాధి చికిత్సకు తోడ్పడుతుందో నిర్ధారించుకుని ఆయా రోగాల చికిత్సకు పరిశోధనశాలలో వేర్వేరు వెల్లుల్లి రకాలను రూపొందించి పొలాల్లో సాగు చేయించాలని ఉత్తమ్‌ బృందం యోచిస్తోంది. ఇలాంటి రకాలకు పేటెంట్లు తీసుకుని రెండేళ్లలో రైతులకు అందించాలనుకుంటున్నమని ఉత్తమ్‌ చెప్పారు.