ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె
జన్యు సవరణ ద్వారా సృష్టి
ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ (జీన్ ఎడిటింగ్) ద్వారా సృష్టించడంలో జమ్మూ కశ్మీర్లోని షేర్-ఎ-కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి (ఎస్కేయూఏఎస్టీ) చెందిన పరిశోధకులు విజయం సాధించారు. ఇది భారత్లో తొలి జన్యు సవరణ గొర్రె అని, చరిత్రాత్మక మైలురాయి అని వారు వివరించారు. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్ జన్యువును సవరించడం ద్వారా వారు దీనిని సాధించగలిగారు. నాలుగేళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశు వైద్య విభాగం డీన్ రియాజ్ అహ్మద్ షా నాయకత్వం వహించారు. ‘జన్యు సవరణ ద్వారా 30 శాతం ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని సృష్టించగలిగాం. భారతీయ రకాల్లో సహజంగా మాంసం వాటా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని ఐరోపా గొర్రె జాతుల్లో మాంసం అధికంగా ఉండేలా జన్యు నిర్మాణం ఉంటుంది’ అని అహ్మద్ షా తెలిపారు. ‘సంకరం ద్వారా కాకుండా జన్యు సవరణ ద్వారా జన్యు మార్పిడి సాధించడం ఒక నవ్య సాంకేతిక ఘన విజయం. ఇది 21వ శతాబ్దంలో ఆవిర్భవించిన కృత్రిమ మేధ లాంటిదే’ అని పేర్కొ న్నారు. ‘ఇది కేవలం ఒక గొర్రె పిల్లను పుట్టించడం కాదు. జన్యు ఆధారిత పశుగణాభివృద్ధిలో ఒక కొత్త ఆవిష్కారం. కొత్త జన్యు పదార్థాన్ని ప్రవేశపెట్టకుండా ప్రయోజనకరమైన జన్యు సవరణ చేసే సత్తా మనకుందని చాటుకున్నాం’ అని ఆయన వివరించారు. అహ్మద్ షా నేతృత్వంలోని పరిశోధక బృందం 2012లో అత్యంత ఖరీదైన ఉన్నిని అందించే కశ్మీరీ పష్మీనా గొర్రె ‘నూరీ’ అనే జన్యు సమరూప జీవిని (క్లోన్) ఆవిష్కరించింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.




