పెరటిలో పోషకాహార తోటలతో ఆరోగ్యం, ఆర్థిక పొదుపు – మహిళ సాధించిన విజయగాథ

మహిళా రైతు విజయ గాధ

వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రీమతి సి. విజయ కుమారి వైఎస్సార్ కడప జిల్లా, మైదుకూరు మండలం, పప్పనపల్లి వాసి. విజయ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం సామూహిక నిర్వహణ విభాగంలో మైదుకూరు మండలం పోషణ మరియు ఆరోగ్యం కార్యకర్తగా పనిచేస్తుంది. ఆమె గతంలో తన కుటుంబానికి అవసరమైన కూరగాయలను మార్కెట్ నుంచి కొనుగోలు చేసేది. పెరుగుతున్న కూరగాయల ధరలు, రసాయన అవశేషాలపై ఆందోళన, అలాగే కుటుంబ సభ్యులు తగినంత ఆకుకూరలు, కూరగాయలు తీసుకోకపోవడం వల్ల పోషకాహార లోపం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఆమె గమనించింది.

ఈ నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం (KVK), వొనిపెంట, ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటి పెరటిలో పోషకాహార తోటలు పెంపకం శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శిక్షణలో సమతుల్య పోషకాహారం ప్రాముఖ్యత, ఇంటి పరిసరాల్లో శాస్త్రీయ పద్ధతిలో పోషకాహార తోటలు ఏర్పాటు, సీజన్కు అనుగుణంగా కూరగాయల ఎంపిక, వంటింటి వ్యర్థాలతో సేంద్రీయ ఎరువుల తయారీ, నీటి పొదుపు పద్ధతులు మరియు సహజ పురుగు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అంతేకాక కూరగాయలు, పండ్ల తోటల్లో వాడే వివిధ రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు, వాటివల్ల పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి కలిగే నష్టాలను గూర్చి తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమం అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం (KVK), వొనిపెంట శాస్త్రవేత్తలు జాతీయ ఉద్యానవన పరిశోధన మరియు అభివృద్ధి ఫౌండేషన్ కూరగాయల విత్తనాల కిట్‌ను అందజేయటం జరిగింది. ఈ కిట్‌లో పాలకూర, మిరప, టమాటో, వంగ, బెండకాయ, నేతిబీర, సొరకాయ, ఉల్లి, అలసందలు, ముల్లంగి మరియు గోరు చిక్కుడు వంటి కూరగాయ విత్తనాలు ఉంటాయి

శిక్షణ ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీమతి సి. విజయ కుమారి తన ఇంటి వెనుక ఖాళీ స్థలంలో టమాటా, బెండకాయ, వంకాయ, పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, కాకరకాయ, నేతిబీర, సొరకాయ, ఉల్లి, అలసందలు, ముల్లంగి, బీరకాయ తదితర కూరగాయలను సేంద్రీయ పద్ధతిలోఎటిఎం విధానంలో సాగు చేశారు. కొద్ది వారాల్లోనే కుటుంబ అవసరాలకు సరిపడా తాజా, పోషక విలువలు అధికంగా ఉన్న కూరగాయలు ఆమెకు అందుబాటులోకి వచ్చాయి.

దీని ఫలితంగా కుటుంబం మార్కెట్‌పై ఆధారపడటం గణనీయంగా తగ్గింది. కూరగాయల కొనుగోలు ఖర్చులో నెలకు సుమారు ₹1500–₹2,500 ల వరకు పొదుపు సాధించారు. కుటుంబ సభ్యుల ఆహారంలో ఆకుకూరలు, కూరగాయల వినియోగం పెరగడంతో వారి ఆరోగ్య పరిస్థితిలో సానుకూల మార్పులు కనిపించాయి. మిగులు ఉత్పత్తిని పొరుగువారికి విక్రయించడం ద్వారా ₹4,500 -5,000 లఅదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. అలాగే ఆమె తమ పెరటి తోటలో పండిన కాయగూరలను , ఆకుకూరలను దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో మరియు పాఠశాలలో పిల్లలు భోజనానికి అందించేది.

శ్రీమతి సి. విజయ కుమారి గారి న్యూట్రి గార్డెన్ విజయాన్ని చూసి గ్రామంలోని అనేక మంది తమ ఇళ్లలో కూడా పోషక తోటలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ గ్రామంలో పోషకాహారం, సేంద్రీయ సాగు మరియు కుటుంబ ఆహార భద్రతపై అవగాహన కల్పించే ఆదర్శ మహిళగా ఆమె నిలిచారు.

విజయ అభిప్రాయం
కృషి విజ్ఞాన కేంద్రం అందించిన శిక్షణతో మా ఇంటి ఖాళీ స్థలం పోషకాహారాన్ని అందించే తోటగా మారింది. ఇప్పుడు మా కుటుంబానికి తాజా కూరగాయలు ఇంట్లోనే లభిస్తున్నాయి. డా॥బి. శ్రీ కాంతి శ్రీ, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త తనకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడం వల్లే నేను ఈ విజయం సాధించగలిగాను. ఇప్పుడు మా ఇంటికి కూరగాయల ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడింది. ప్రతి ఇంట్లో న్యూట్రి గార్డెన్ ఉంటే కుటుంబ ఆరోగ్యం, పోషకాహార భద్రత మరియు ఆర్థిక పొదుపు ఒకేసారి సాధ్యమవుతాయి.

సమాచారం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 7032463875.

డా॥బి. శ్రీ కాంతి శ్రీ , డా ఎం. బాలకృష్ణ, డా ॥ఎన్ .శ్రీ విద్యారాణి, డా ॥టి. విజయ నిర్మల, డా ॥ఎస్ . ఫిరోజ్ హుస్సైన్, డా . బి. గోవిందరాజులు మరియు డా ॥ సి హెచ్ . రూత్, కృషి విజ్ఞాన కేంద్రం, ఒనిపెంట – డా॥వై. ఎస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్న గూడెం. Ph: 9493993523

Read More

ద్వితీయ వ్యవసాయం – రైతుకు అదనపు ఆదాయం అందించే బంగారు బాట

“పంట ఒక్కటే కాదు… పంటతో పాటు మరెన్నో ఆదాయ మార్గాలు ఉన్నాయి”

ఈరోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగా పంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండవు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి.
ఇదే భావనతో ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు శాస్త్రవేత్తలు “ద్వితీయ వ్యవసాయం (Secondary Agriculture)” అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.

ద్వితీయ వ్యవసాయం అంటే ఏమిటి?
పొలంలో పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను శుభ్రపరచడం, ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు.

సరళంగా చెప్పాలంటే…
“పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవడమే ద్వితీయ వ్యవసాయం.”

  1. పంటలకు విలువ జోడించండి – ఎక్కువ ధర పొందండి
    చాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేస్తారు. అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది.
    వరిని బియ్యంగా మార్చడం ,బియ్యంతో అటుకులు, మురమురాలు తయారు చేయడం ,వేరుశెనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం ,మిరపతో మిరప పొడి తయారు చేయడం ,పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం , మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం.దీనివల్ల రైతు సాధారణంగా పొందే ఆదాయం కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలకు విలువ జోడించడం అనేది ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన మరియు స్థిరమైన రంగం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే రైతులు గణనీయమైన అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. మహిళా సంఘాలు, యువ రైతులు, FPOలు మరియు గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఇది ఉపాధి కల్పించడంతో పాటు, పోషకాహార భద్రతను మెరుగుపరచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అందువల్ల చిరుధాన్యాల విలువ జోడింపును ద్వితీయ వ్యవసాయం అభివృద్ధికి ఒక ప్రధాన వ్యూహంగా ప్రోత్సహించడం అవసరం.
  2. కోత అనంతర నష్టాలను తగ్గించండి
    భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో కోత అనంతరం గణనీయమైన నష్టం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం.

రైతులు ఈ చర్యలు పాటించాలి:
పంటను బాగా ఆరబెట్టాలి, నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేయాలి ,తేమ రాకుండా నిల్వ చేయాలి, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ ఉపయోగించాలి, శుభ్రమైన సంచుల్లో ప్యాకింగ్ చేయాలి.

  1. గ్రామంలోనే చిన్న ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి
    గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది.అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.
    చిన్న పరిశ్రమలు : రైస్ మిల్లు, నూనె గానుగ , పప్పు మిల్లు, పిండి మిల్లు , మసాలా తయారీ, పండ్ల ప్రాసెసింగ్
  2. పాల ఉత్పత్తుల ద్వారా ప్రతిరోజూ ఆదాయం
    రైతు ఇంట్లో ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు ఆదాయం వస్తుంది.
    పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్
    తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది.పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి.
  3. తేనెటీగల పెంపకం – తేనెతో పాటు పంట దిగుబడీ పెరుగుతుంది
    తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు.
    దీని ద్వారా తేనె , బీస్‌వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి.
    అంతేకాదు, తేనెటీగలు పరాగసంపర్కం చేయడం వల్ల ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు, పండ్ల పంటల దిగుబడి బాగా పెరుగుతుంది.
  4. పుట్టగొడుగుల సాగు – చిన్న గదిలో పెద్ద ఆదాయం
    వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషాలను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు.
    చిన్న గదిలోనే సాగు చేయవచ్చు.ఈ వ్యాపారం మహిళలకు, యువతకు , స్వయం సహాయక సంఘాలకు
    అత్యంత అనుకూలంగా ఉంటుంది.
  5. చేపల పెంపకం – నీటి వనరులతో అదనపు ఆదాయం
    వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్ పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు.
    వరి సాగుతో పాటు చేపల పెంపకం (Rice-Fish Farming) చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయం పొందవచ్చు.
  6. పశుపోషణ – రైతుకు నమ్మకమైన ఆదాయం
    వ్యవసాయం మరియు పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి.
    పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి.
    పశువుల పేడ : వర్మీకంపోస్ట్ ,బయోగ్యాస్ ,సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.
  7. కోళ్ల పెంపకం – తక్కువ పెట్టుబడి, త్వరగా ఆదాయం
    పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బతింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. గుడ్లు, మాంసం సొంత అవసరాల వినియోగానికే కాకుండా అమ్మకాలతో ఆదాయం కూడా పొందవచ్చు. గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా మార్కెట్ ఉంటుంది. చిన్న స్థాయిలో ప్రారంభించి క్రమంగా విస్తరించవచ్చు. గిరిరాజ, వనరాజ, గ్రామ ప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలు రకం కోడి పిల్లలను పెంచుకోవచ్చు

ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75-80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే.. గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవ త్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే. సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.

  1. వ్యవసాయ వ్యర్థాలను సంపదగా మార్చండి
    చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవశేషాలను కాల్చివేస్తారు.
    అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్ , కంపోస్ట్ ,బయోగ్యాస్ ,బయోచార్ ,పుట్టగొడుగుల సాగు , పశుగ్రాసం తయారు చేయవచ్చు. ఇది పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుతుంది.
  2. పూలు, ఔషధ మొక్కలు – తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయం
    మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
  3. నర్సరీలు మరియు విత్తన ఉత్పత్తి
    నాణ్యమైన నారు మొక్కలు, ధృవీకరించిన విత్తనాలకు రైతుల్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. కూరగాయల నారు , పండ్ల మొక్కలు, పూల మొక్కలు ,అటవీ మొక్కలు తయారు చేసి విక్రయించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

స్వపరాగసంపర్క పంటల్లో వరి , శనగ ,పెసర , మినుము ,ఉలవలు మరియు వేరుశెనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. ధృవీకరించిన విత్తన ఉత్పత్తి, శుభ్రపరచడం, గ్రేడింగ్, విత్తన శుద్ధి, ప్యాకింగ్, బ్రాండింగ్ వంటి విలువ జోడింపు చర్యలను చేపట్టడం ద్వారా రైతులు సాధారణ ధాన్యం విక్రయంతో పోలిస్తే అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇది రైతుల ఆర్థికాభివృద్ధికి, గ్రామీణ ఉపాధి పెంపుకు మరియు నాణ్యమైన విత్తనాల లభ్యతకు ముఖ్యమైన సాధనంగా నిలుస్తుంది.

  1. అగ్రో టూరిజం – వ్యవసాయాన్ని ఆదాయ వనరుగా మార్చండి
    ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభవించడానికి ఆసక్తి చూపుతున్నారు.
    రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు , గ్రామీణ ఆహారం ,పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
  2. రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడే అనుబంధ ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలు:
    టెర్రస్ వ్యవసాయం (Terrace Farming) : ఇళ్ల పైకప్పులపై (Terrace) కుండీలు, గ్రో బ్యాగులు, ట్రేలు లేదా ఎత్తైన బెడ్లలో కూరగాయలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, పూలు మరియు ఔషధ మొక్కలను సాగు చేయడాన్ని టెర్రస్ వ్యవసాయం అంటారు. పట్టణ ప్రాంతాల్లో భూమి కొరత ఉన్నప్పటికీ, పైకప్పు స్థలాన్ని సద్వినియోగం చేసుకొని తాజా, సురక్షితమైన మరియు రసాయన అవశేషాలు తక్కువగా ఉండే కూరగాయలను ఉత్పత్తి చేయవచ్చు. టెర్రస్‌లో పండించిన ఉత్పత్తులను సేంద్రియ కూరగాయలుగా విక్రయించడం, నారు మొక్కలు తయారు చేసి అమ్మడం, సేంద్రియ ఎరువులు తయారు చేయడం, విలువ జోడింపు చేసి ప్యాకింగ్ చేయడం
    ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.

కిచెన్ గార్డెన్ (Kitchen Garden / పోషక తోట)
ఇంటి పరిసరాల్లో లేదా పెరట్లో కుటుంబ అవసరాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు మరియు ఔషధ మొక్కలను పండించే తోటను కిచెన్ గార్డెన్ లేదా పోషక తోట అంటారు.
దీని ప్రధాన లక్ష్యం కుటుంబానికి ఏడాది పొడవునా తాజా పోషకాహారాన్ని అందించడం.

పండించే పంటలు : టమాట, వంకాయ, బెండ, మిరప, పాలకూర, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, మునగ, బొప్పాయి

కిచెన్ గార్డెన్ ద్వారా ఉత్పత్తి చేసిన అదనపు కూరగాయలు, నారు మొక్కలు లేదా విత్తనాలను విక్రయించడం ద్వారా కుటుంబానికి అదనపు ఆదాయం లభిస్తుంది. అలాగే ఇంట్లో తయారుచేసిన కంపోస్ట్, వర్మీకంపోస్ట్, జీవామృతం వంటి సేంద్రియ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది.

ప్రభుత్వ పథకాల వినియోగం
రైతులు ఈ పథకాల ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు.
• ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం (PMFME)
• వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (Agriculture Infrastructure Fund)
• జాతీయ తేనెటీగల మరియు తేనె మిషన్
• డెయిరీ అభివృద్ధి పథకాలు
• NABARD గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు

నేటి వ్యవసాయ పరిస్థితుల్లో “పంట పండించడం మాత్రమే కాదు… పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం.” ద్వితీయ వ్యవసాయం ద్వారా రైతులు పంటలతో పాటు పాలు, తేనె, పుట్టగొడుగులు, చేపలు, కోళ్లు, సేంద్రియ ఎరువులు, ప్రాసెసింగ్ ఉత్పత్తులు, నర్సరీలు వంటి అనేక ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు. దీనివల్ల కుటుంబానికి సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయం లభించడమే కాకుండా, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల ప్రతి రైతు తన వ్యవసాయానికి అనువైన కనీసం ఒకటి లేదా రెండు ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టి “ఉత్పత్తిదారుడు” నుండి “వ్యవసాయ పారిశ్రామికవేత్త”గా ఎదగడానికి కృషి చేయాలి.”వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం” అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

డా. కె.తేజస్వర రావు మరియు డా . బి. సహదేవ రెడ్డి
ఆచార్య N G రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయము

Read More

చేప వ్యర్థాలతో పోషక మిశ్రమం

వికె-నార్డెప్ స్థానికంగా లభించే వనరుల ద్వారా సేంద్రియ పద్ధతిలో పంటల పెరుగుదలకవసరమైన ముఖ్య పోషకాలన్నీ కలిగి ఉన్న పోషక మిశ్రమాన్ని చేప వ్యర్థాలనుపయోగించి చేసే కొత్త టెక్నాలజీని రూపొందించింది.

 తయారీ విధానం : దీని తయారీకి సుమారు 20 కి. చేపల వ్యర్థాలను సేకరించి 40 లీ. సామర్థ్యం ఉన్న ప్లాస్టిక్ క్యాన్‌లో నిల్వ ఉంచాలి. దీనికి 10 లీ. నీటిని, 20-30 మి.లీ. బొప్పాయి పాలను (పపైన్) కలపాలి. (ముదిరిన ఆకుపచ్ౘ్రంగు బొప్పాయి కాయపై బ్లేడుతో చిన్నగాట్లు చేసి పాలను సేకరించాలి).

చేప వ్యర్థాలను పపైన్‌తో బాగా కలిపి 5-8 గంటలుంచాలి. పాత్రను మూసి ఉంచి ప్రతి గంటలకు ఒకసారి కలియత్రిప్పాలి.

పులియ బెట్టడం
5-8 గంటల తర్వాత బెల్లం ద్రావణాన్ని (4 కి. బెల్లాన్ని 5 లీ. నీటిలో కలిపి) చేప వ్యర్థాలకు కలిపి బాగా కలియత్రిప్పాలి. ఈ మిశ్రమాన్ని 15-20 రోజులు బాగా పులియనివ్వాలి. ఈ సమయంలో చేప పొలుసులు, ఎముకలు బాగా క్షీణించి పోతాయి.
15-20 రోజులు పులిసిన తర్వాత పులిసిన పదార్థానికి 2 నుండి 5 రెట్లు నీరు కలిపి ద్రావణం తయారు చేయాలి. ఈ ద్రావణాన్ని వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. పూర్తిగా కరగని పదార్థమేదైనా ఉంటే దానిని భూమికి ఎరువుగా వేయాలి.
పంటపై పిచికారి చేయడానికి 250 నుండి 500 మి.లీ. ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఈ ఫార్మ్యులేషన్‌ని అన్ని కూరగాయలు, పూల పంటల్లో ఉపయోగించవచ్చు. బెండ, తోటకూర, పాలకూర, వంగ, టమాట పంటలపై విస్తృత పరిశోధనలు జరిపి మంచి ఫలితాలను పొందారు.

రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం ’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆకుకూరల సాగు

భారతీయ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ, మన రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు తీస్తున్నారు.

మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలను నిత్యం 125 గ్రాముల చొప్పున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కాగా, మార్కెట్లో వీటికి ఉన్న నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేపడితే ఆకుకూరల ద్వారా రైతులకు గరిష్ట లాభాలు లభిస్తాయి.”

ఆకుకూరలు తక్కువ కాలంలో (20-30 రోజులు) మరియు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర వంటివి నేరుగా విత్తనాలు చల్లి అన్ని కాలాల్లోనూ (వారానికి/పదిహేను రోజులకు ఒకసారి విత్తనాలు వేసుకోవడం ద్వారా) విజయవంతంగా సాగు చేయవచ్చు.

గోంగూర సాగు:
ఆకుకూరలన్నింటి కంటే గోంగూర రుచి ఎక్కువ. నీరు నిల్వ ఉండని తేలికపాటి గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు గోంగూర సాగుకు చాలా అనుకూలం. ఇది ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఏఎన్‌జిఆర్ఏయూ1 ఇది ఎర్ర గోంగూర రకం. విత్తనాలు నాటిన 30 నుండి 35 రోజులకే పంట కోతకు వస్తుంది. నీటి వసతి కలిగిన భూముల్లో ఒక ఎకరానికి దాదాపు 4 – 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు.

పాలకూర:
పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. ఇందులో అధికంగా విటమిన్ ‘ఎ’, ‘సి’, కాల్షియం మరియు ఇనుము వున్నవి. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో మంచి లాభాలను అందించే ఆకుకూర. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కాని ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనం అవసరం. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆల్‌గ్రీన్ రకం ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.

తోటకూర: తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. అర్క వర్ణ, కో-1, కో-2, కో-3, కో-4, అర్కా సుగుణ వంటి రకాలు ఎంపిక చేయవచ్చు. ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 4 నుండి 5 టన్నులు వస్తుంది.

బచ్చలికూర :
బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలి కూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ‘ఎ’, ‘సి’ లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కాని అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎకరాకు 5 – 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. . దిగుబడి 4 నుండి 6 టన్నులు వస్తుంది.

చుక్క కూర:
చుక్కకూరలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థాలు (ఫైబర్), తిన్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణమవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు 20 నుండి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

కొత్తిమీర:
కొత్తిమీర ఆకులతో పాటు విత్తనాల (ధనియాలు) ఉత్పత్తి కొరకు సాగయ్యే కొత్తిమీర, వంటల్లో సువాసనను, రుచిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. పోషక విలువల పరంగా చూస్తే.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సుగంధ తైలాలు, పీచు పదార్థాలు మరియు విటమిన్-కె, ఎ, సి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విశేష గుణాలు ఉండటం వల్ల, దీనిని జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఔషధంగానే కాకుండా వివిధ ఆయుర్వేద చికిత్సల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, వర్షాధార పంటగా పండించేటప్పుడు మాత్రం మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న బంక నేలలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరం. సురుచి, సుగుణ, సాధన, సింధు ముఖ్యమైన రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.

పుదీన:
పుదీనాను అటు ఆకుకూరగాను, ఇటు సుగంధ తైలం ఉత్పత్తి కొరకు విరివిగా సాగు చేస్తారు. మనదేశంలో జపనీస్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది. దీని నుండి తీసే తైలాన్ని సుగంధ పాన్‌మసాలాల తయారీలోనే కాకుండా.. దగ్గు, జలుబు, నొప్పుల నివారణ ఔషధాలలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు. ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. జపాన్ పుదీన, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎకరానికి 12-16 టన్నులు దిగుబడి వస్తుంది.

మెంతి కూర:
దీనిని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్య పంటల్లో ఇదోకటి. ఈ పంట సాగుకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత తేమ అనుకూలం. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర లేతపాటి నేలల్లో సాగుకు అనుకూలం. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1 రకం అనువైనది. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకొకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. ఎకరానికి 4-5 టన్నులు దిగుబడి వస్తుంది.

బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU). Ph: 8374275258

Read More

పచ్చని డాబా… ఆరోగ్యానికి బాట

పట్టణ ప్రాంతాలలో, జనాభా పెరుగుదలతో ఎక్కువ భూమి ఇంటి నిర్మాణానికి వినియోగించబడుతుంది. అందువలన కూరగాయలను పండించడానికి భూమి దొరకడం కష్టంగా మారింది. ప్రత్యేకంగా కుండీలను, కంటైనర్లను ఉపయోగించి పండ్ల మొక్కలను, కూరగాయలను ఇంటి ఖాళీస్థలంలో లేదా డాబాపై పెంచుకోవడం ఒక్కటే మార్గం. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడే కూరగాయలను పండించడానికి 40-50చ.మీ. స్థలం సరిపోతుంది. కంటైనర్లలో మట్టిని సంవత్సరానికొకసారి మార్చాలి. పాటింగ్ మిశ్రమంలో మట్టి, ఇసుక, వేపపిండి, జీవన ఎరువులు సరైన పాళ్ళలో ఉండాలి. పెరటిలోను, ఇంటి పైకప్పుపైనా మొక్కలు సాగు చేసుకోవచ్చు. సేంద్రీయ ఎరువులతో కూరగాయలు, పండ్లు పండించి ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందంపొందవచ్చు.

ఇంటి మిద్దెపై ఒక సెంటు స్థలం ఉన్నప్పటికీ ఇంటికి సరిపడా కూరగాయలు చాలా సులువుగా సాగు చేసుకోవచ్చు. పురుగు మందుల అవశేషాలు లేని చక్కని రుచికరమైన కూరగాయలన్నింటినీ స్వయంగా పండించవచ్చు.

మిద్దె తోటలో మొక్కల పెంపకము వల్ల లాభాలు: మిద్దె తోటలో మొక్కల పెంపకం ద్వారా ఏడాది పొడవునా పురుగు మందుల అవశేషాలు లేని తాజా ఉత్పత్తులు లభిస్తాయి. ఆహార, ఆరోగ్య భద్రత పొందవచ్చు. పచ్చదనాన్ని పెంపొందించడంతో ప్రాణవాయువు పెరిగి, గాలిలో హానికర బొగ్గుపులుసు వాయువు తగ్గుతుంది. ఉత్పత్తులు నాణ్యంగా పోషకాలతో నిండి ఉంటాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఇంటి పై మిద్దె తోటలో మొక్కల పెంపకం వలన మంచి వ్యాయామం లభిస్తుంది. పండ్ల, కూరగాయల ఖర్చు తగ్గుతుంది. స్థలం, అపార్టుమెంట్ల విలువ పెరుగుతుంది. పైగా ఈ మిద్దె తోటల పెంపకం వలన వేసవిలో ఉష్ణోగ్రతలను కొంతవరకు తగ్గించుకోవచ్చు.

మిద్దె తోటను ఏర్పాటు చేసుకునే విధానం : పీవీసీ పైపులతో స్టాండ్లు ఏర్పాటు చేసుకొని, వాటిపై ఖాళీ ప్లాస్టిక్‌ డబ్బాలు పెట్టాలి. ఆ ఖాళీ డబ్బాల్లో ఎర్రమట్టి, వర్మీ కంపోస్టు, పశువుల పేడ నింపాలి.

మిద్దెపై వార్షిక కూరగాయల మరియు పండ్ల మొక్కల పెంపకం యొక్క ప్రణాళిక: మొక్కల పెంపకం చేపట్టే ముందు ప్రణాళిక తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ డాబాపై పెంచుతున్నదైతే ముందుగా ఇంజనీరు చేత డాబా పైకప్పు గట్టిదనాన్ని పరీక్షింపజేయాలి. అంటే మన ప్రణాళిక ప్రకారం కూరగాయలు, పండ్లు మొదలైనవి పెంచడానికి తట్టుకోగలదో లేదో పరీక్షించాలి. పైకప్పు కారకుండా ఉండాలి. మురుగు నీటి పారుదల సౌకర్యం తప్పని సరిగా ఉండాలి. ప్రణాళికబద్ధంగా మొక్కలను నాటాలి. కుండీల్లో నింపే మిశ్రమం తేలికపాటి బరువు కలిగి ఉండాలి. మొక్కలను పెంచడానికి ఎత్తైన మడులను ఏర్పాటు చేయాలి. ట్రెల్లీస్ ఏర్పాటుచేసి తీగలు పారించాలి. డాబాలపైన, బాల్కనీలలోనూ పెరిగే మొక్కలు ఎక్కువ గాలికి, ఎక్కువ వేడికి గురవుతాయి. ఎత్తులో అమర్చిన కుండీలు ఒకే వరుసలో ఉండాలి. వీటిని తేలికపాటి మట్టి మిశ్రమంతో నింపాలి. మట్టి మిశ్రమంతో నింపక ముందు సరైన మురుగునీటి పారుదల సౌకర్యం ఏర్పాటుచేయాలి. షేడ్ నెట్ కాని, పందిరికాని ఏర్పాటుచేసుకొని ఏడాది పొడవునా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పూలను కూడా పెంచుకోవచ్చు.

కుండీల ఎంపిక: కుండీలను ఎంచుకునేటప్పుడు మురుగునీరు పోవడానికి రంధ్రాలున్న వాటినే ఎంచుకోవాలి. కుండీలలోపల వైపు మెరుపులేని కుండీలు ఎంచుకోవాలి. మెరుపు ఉంటే సీసం, మట్టి మిశ్రమంలో కలుస్తుంది. కుండీలను బంకమట్టితో, ప్లాస్టిక్, చెక్క లేదా లోహంతో తయారుచేస్తారు. కుండీల ఎంపికలో మొక్కలు పెరిగే ఎత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

తొట్టి/ప్లాస్టిక్ సంచులు: మనకున్న ఖాళీ స్థలాన్ని బట్టి కావలసినంత పొడవు 9-20″ లోతు సిమెంట్ తొట్లు నిర్మించుకొని /ప్లాస్టిక్ సంచులు ఉపయోగించుకొని మట్టి మిశ్రమాన్ని (2 భాగాలు ఎర్రమట్టి + 1 భాగం ఇసుక + 1 భాగం కంపోస్టు) నింపుకొని పండ్లు, కూరగాయల పంటలను పెంచుకోవచ్చు. పై అంచునుండి అంగుళం ఖాళీని నీరు పెట్టడానికి వీలుగా వదలాలి.

మట్టి కుండీలు: కుండీల ప్రక్క నిలువుగాను, పైభాగం వెడల్పుగాను ఉంటుంది. ఇటువంటి కుండీలలో ఎక్కువ మట్టి, ఎరువుల మిశ్రమాన్ని నింపవచ్చు.

ప్లాస్టిక్ కుండీలు: గుండ్రంగా, చదరంగా ఉన్న ప్లాస్టిక్ కుండీలను ఇంటిలో పెరిగే మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తారు. ఇవి తేలికగా మరియు రంధ్రాలు కలిగి తిరిగి వాడుకోవడానికి అనువుగా ఉండి తక్కువ స్థలంలో నిల్వచేసుకోవడానికి వీలుగా ఉంటాయి.

కుండీలు నింపే పద్ధతి: మిద్దె తోటల పెంపకంలో మట్టి అతి ముఖ్యమైనది. మంచి మట్టి వాడితే మొక్కలు బాగా పెరుగుతాయి. మార్కెట్లో అనేక పాటింగ్ మిశ్రమాలు లభిస్తాయి. 3 భాగాల కంపోస్ట్ లేదా కంపోస్టు ఎరువును ఒక భాగం తేలిక బరువున్న పీట్ తో కలిపి పాటింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. నాటే కూరగాయలకు నారు మొక్కల పెంపకానికి లోతు తక్కువ పళ్ళాలను /తొట్లను మట్టి, ఇసుక, కంపోస్ట్ (1:1:1) మిశ్రమంతో కలిపి విత్తనాలను చల్లాలి. మట్టి మిశ్రమాన్ని తొట్లు/బారిల్స్/బకెట్లు/ప్లాస్టిక్ సంచుల్లో నింపే ముందు వాటి అడుగున నీరుపోయే రంధ్రాన్ని ఏర్పర్చాలి. తొలుత నీరుపోయే రంధ్రాన్ని చిన్న చిన్న పెంకులతో కప్పాలి. దీని వలన నీరుపోయే రంధ్రం గుండా మట్టి మిశ్రమం జారిపోకుండా అదనపు నీరు మాత్రమే బయటకు పోతుంది. ఆ తర్వాత గరుకు ఇసుక పోసి సమం చేయాలి. దానిపై ఒక అంగుళం మందంతో ఎండుటాకులు లేదా కొబ్బరి పొట్టు పరిచి దానిపై మట్టి మిశ్రమాన్ని అంచువరకు నింపాలి. ఇంటి మేడపైన మొక్కలు పెంచే కంటైనర్లను ఒక పద్ధతిలో ఉంచాలి. నీరు పోయడం, కలుపు తీత అంతరకృషి కాయ/ఆకు కోతకు అనువుగా మనిషి నడిచేందుకు వీలుగా దారి వదలాలి. మిద్దెపై చుట్టూ ఉండే పెరాపెట్ గోడపై 6 అడుగుల దూరంలో ఇనుప చువ్వలు నాటి వాటికి ట్రెల్లీస్ లా బైండింగ్ వైర్ అల్లించాలి. వాటిపైకి తీగజాతి కూరగాయల్ని పాకించి, నిలువు స్థలంలోను ఫలసాయం పొందవచ్చు.

ఎరువుగా ఇంటి వ్యర్థాలు: మొక్కల ఎండిన ఆకులను తొలగించి ఓ బకెట్‌లో నిల్వ ఉంచాలి. కూరగాయల వ్యర్థాలను సైతం అందులో వేయాలి. వాటిపై కొద్దిగా మట్టి వేసి ఆవు మూత్రం చల్లితే కంపోస్టు ఎరువు వాటంతట అదే తయారవుతుంది. రోజూ కొంత సమయం కేటాయించగలిగితే కుటుంబానికి అవసరమైన కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు డాబా పైనే పండించుకోవచ్చు.

డా. పోతురాజు ప్రదీప్ కుమార్, డా. మీగడ లక్ష్మి కమల, డా. యల్లపు రామ్ మోహన్
డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం. Ph: 9160477365

Read More

ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న పీఎండీఎస్, ఏ గ్రేడ్, ఏటీఎం, కిచెన్ గార్డెన్, బీఆర్సీ సెంటర్ వంటి నమూనాలను కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలంలోని గ్రామాల్లో ఏఎన్ఆర్ఎయూ, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సీటీ, ఐఐఎంఆర్ శాస్త్రవేత్తల బృందం సోమవారం పరిశీలించింది. ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే 9 రకాల సార్వతిక సూత్రాలను శాస్త్రవేత్తలకు చూపించారు.

Read More