ద్వితీయ వ్యవసాయం – రైతుకు అదనపు ఆదాయం అందించే బంగారు బాట

“పంట ఒక్కటే కాదు… పంటతో పాటు మరెన్నో ఆదాయ మార్గాలు ఉన్నాయి”

ఈరోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగా పంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండవు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి.
ఇదే భావనతో ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు శాస్త్రవేత్తలు “ద్వితీయ వ్యవసాయం (Secondary Agriculture)” అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.

ద్వితీయ వ్యవసాయం అంటే ఏమిటి?
పొలంలో పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను శుభ్రపరచడం, ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు.

సరళంగా చెప్పాలంటే…
“పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవడమే ద్వితీయ వ్యవసాయం.”

  1. పంటలకు విలువ జోడించండి – ఎక్కువ ధర పొందండి
    చాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేస్తారు. అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది.
    వరిని బియ్యంగా మార్చడం ,బియ్యంతో అటుకులు, మురమురాలు తయారు చేయడం ,వేరుశెనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం ,మిరపతో మిరప పొడి తయారు చేయడం ,పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం , మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం.దీనివల్ల రైతు సాధారణంగా పొందే ఆదాయం కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలకు విలువ జోడించడం అనేది ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన మరియు స్థిరమైన రంగం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే రైతులు గణనీయమైన అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. మహిళా సంఘాలు, యువ రైతులు, FPOలు మరియు గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఇది ఉపాధి కల్పించడంతో పాటు, పోషకాహార భద్రతను మెరుగుపరచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అందువల్ల చిరుధాన్యాల విలువ జోడింపును ద్వితీయ వ్యవసాయం అభివృద్ధికి ఒక ప్రధాన వ్యూహంగా ప్రోత్సహించడం అవసరం.
  2. కోత అనంతర నష్టాలను తగ్గించండి
    భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో కోత అనంతరం గణనీయమైన నష్టం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం.

రైతులు ఈ చర్యలు పాటించాలి:
పంటను బాగా ఆరబెట్టాలి, నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేయాలి ,తేమ రాకుండా నిల్వ చేయాలి, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ ఉపయోగించాలి, శుభ్రమైన సంచుల్లో ప్యాకింగ్ చేయాలి.

  1. గ్రామంలోనే చిన్న ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి
    గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది.అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.
    చిన్న పరిశ్రమలు : రైస్ మిల్లు, నూనె గానుగ , పప్పు మిల్లు, పిండి మిల్లు , మసాలా తయారీ, పండ్ల ప్రాసెసింగ్
  2. పాల ఉత్పత్తుల ద్వారా ప్రతిరోజూ ఆదాయం
    రైతు ఇంట్లో ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు ఆదాయం వస్తుంది.
    పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్
    తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది.పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి.
  3. తేనెటీగల పెంపకం – తేనెతో పాటు పంట దిగుబడీ పెరుగుతుంది
    తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు.
    దీని ద్వారా తేనె , బీస్‌వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి.
    అంతేకాదు, తేనెటీగలు పరాగసంపర్కం చేయడం వల్ల ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు, పండ్ల పంటల దిగుబడి బాగా పెరుగుతుంది.
  4. పుట్టగొడుగుల సాగు – చిన్న గదిలో పెద్ద ఆదాయం
    వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషాలను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు.
    చిన్న గదిలోనే సాగు చేయవచ్చు.ఈ వ్యాపారం మహిళలకు, యువతకు , స్వయం సహాయక సంఘాలకు
    అత్యంత అనుకూలంగా ఉంటుంది.
  5. చేపల పెంపకం – నీటి వనరులతో అదనపు ఆదాయం
    వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్ పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు.
    వరి సాగుతో పాటు చేపల పెంపకం (Rice-Fish Farming) చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయం పొందవచ్చు.
  6. పశుపోషణ – రైతుకు నమ్మకమైన ఆదాయం
    వ్యవసాయం మరియు పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి.
    పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి.
    పశువుల పేడ : వర్మీకంపోస్ట్ ,బయోగ్యాస్ ,సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.
  7. కోళ్ల పెంపకం – తక్కువ పెట్టుబడి, త్వరగా ఆదాయం
    పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బతింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. గుడ్లు, మాంసం సొంత అవసరాల వినియోగానికే కాకుండా అమ్మకాలతో ఆదాయం కూడా పొందవచ్చు. గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా మార్కెట్ ఉంటుంది. చిన్న స్థాయిలో ప్రారంభించి క్రమంగా విస్తరించవచ్చు. గిరిరాజ, వనరాజ, గ్రామ ప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలు రకం కోడి పిల్లలను పెంచుకోవచ్చు

ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75-80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే.. గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవ త్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే. సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.

  1. వ్యవసాయ వ్యర్థాలను సంపదగా మార్చండి
    చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవశేషాలను కాల్చివేస్తారు.
    అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్ , కంపోస్ట్ ,బయోగ్యాస్ ,బయోచార్ ,పుట్టగొడుగుల సాగు , పశుగ్రాసం తయారు చేయవచ్చు. ఇది పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుతుంది.
  2. పూలు, ఔషధ మొక్కలు – తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయం
    మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
  3. నర్సరీలు మరియు విత్తన ఉత్పత్తి
    నాణ్యమైన నారు మొక్కలు, ధృవీకరించిన విత్తనాలకు రైతుల్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. కూరగాయల నారు , పండ్ల మొక్కలు, పూల మొక్కలు ,అటవీ మొక్కలు తయారు చేసి విక్రయించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

స్వపరాగసంపర్క పంటల్లో వరి , శనగ ,పెసర , మినుము ,ఉలవలు మరియు వేరుశెనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. ధృవీకరించిన విత్తన ఉత్పత్తి, శుభ్రపరచడం, గ్రేడింగ్, విత్తన శుద్ధి, ప్యాకింగ్, బ్రాండింగ్ వంటి విలువ జోడింపు చర్యలను చేపట్టడం ద్వారా రైతులు సాధారణ ధాన్యం విక్రయంతో పోలిస్తే అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇది రైతుల ఆర్థికాభివృద్ధికి, గ్రామీణ ఉపాధి పెంపుకు మరియు నాణ్యమైన విత్తనాల లభ్యతకు ముఖ్యమైన సాధనంగా నిలుస్తుంది.

  1. అగ్రో టూరిజం – వ్యవసాయాన్ని ఆదాయ వనరుగా మార్చండి
    ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభవించడానికి ఆసక్తి చూపుతున్నారు.
    రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు , గ్రామీణ ఆహారం ,పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
  2. రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడే అనుబంధ ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలు:
    టెర్రస్ వ్యవసాయం (Terrace Farming) : ఇళ్ల పైకప్పులపై (Terrace) కుండీలు, గ్రో బ్యాగులు, ట్రేలు లేదా ఎత్తైన బెడ్లలో కూరగాయలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, పూలు మరియు ఔషధ మొక్కలను సాగు చేయడాన్ని టెర్రస్ వ్యవసాయం అంటారు. పట్టణ ప్రాంతాల్లో భూమి కొరత ఉన్నప్పటికీ, పైకప్పు స్థలాన్ని సద్వినియోగం చేసుకొని తాజా, సురక్షితమైన మరియు రసాయన అవశేషాలు తక్కువగా ఉండే కూరగాయలను ఉత్పత్తి చేయవచ్చు. టెర్రస్‌లో పండించిన ఉత్పత్తులను సేంద్రియ కూరగాయలుగా విక్రయించడం, నారు మొక్కలు తయారు చేసి అమ్మడం, సేంద్రియ ఎరువులు తయారు చేయడం, విలువ జోడింపు చేసి ప్యాకింగ్ చేయడం
    ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.

కిచెన్ గార్డెన్ (Kitchen Garden / పోషక తోట)
ఇంటి పరిసరాల్లో లేదా పెరట్లో కుటుంబ అవసరాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు మరియు ఔషధ మొక్కలను పండించే తోటను కిచెన్ గార్డెన్ లేదా పోషక తోట అంటారు.
దీని ప్రధాన లక్ష్యం కుటుంబానికి ఏడాది పొడవునా తాజా పోషకాహారాన్ని అందించడం.

పండించే పంటలు : టమాట, వంకాయ, బెండ, మిరప, పాలకూర, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, మునగ, బొప్పాయి

కిచెన్ గార్డెన్ ద్వారా ఉత్పత్తి చేసిన అదనపు కూరగాయలు, నారు మొక్కలు లేదా విత్తనాలను విక్రయించడం ద్వారా కుటుంబానికి అదనపు ఆదాయం లభిస్తుంది. అలాగే ఇంట్లో తయారుచేసిన కంపోస్ట్, వర్మీకంపోస్ట్, జీవామృతం వంటి సేంద్రియ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది.

ప్రభుత్వ పథకాల వినియోగం
రైతులు ఈ పథకాల ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు.
• ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం (PMFME)
• వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (Agriculture Infrastructure Fund)
• జాతీయ తేనెటీగల మరియు తేనె మిషన్
• డెయిరీ అభివృద్ధి పథకాలు
• NABARD గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు

నేటి వ్యవసాయ పరిస్థితుల్లో “పంట పండించడం మాత్రమే కాదు… పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం.” ద్వితీయ వ్యవసాయం ద్వారా రైతులు పంటలతో పాటు పాలు, తేనె, పుట్టగొడుగులు, చేపలు, కోళ్లు, సేంద్రియ ఎరువులు, ప్రాసెసింగ్ ఉత్పత్తులు, నర్సరీలు వంటి అనేక ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు. దీనివల్ల కుటుంబానికి సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయం లభించడమే కాకుండా, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల ప్రతి రైతు తన వ్యవసాయానికి అనువైన కనీసం ఒకటి లేదా రెండు ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టి “ఉత్పత్తిదారుడు” నుండి “వ్యవసాయ పారిశ్రామికవేత్త”గా ఎదగడానికి కృషి చేయాలి.”వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం” అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

డా. కె.తేజస్వర రావు మరియు డా . బి. సహదేవ రెడ్డి
ఆచార్య N G రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయము

Read More

సింగి (మార్పు) చేపల పెంపకంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు

ఎటిరోనుస్టిస్ ఫాజిల్స్ (Heteropneustes fossilis) ను సాధారణంగా “స్టింగింగ్ క్యాట్‌ఫిష్” లేదా “సింగి” చేపగా తెలుగులో సింగి చేపను ‘మార్పు’ అని పిలుస్తారు. ఇది కాకుండా, సాధారణంగా ఈ జాతికి చెందిన క్యాట్‌ఫిష్ రకాలను తెలుగులో ‘జల్లెలు’ లేదా ‘నల్ల జల్లెలు’ అని కూడా అంటారు. ఈ చేపలు ముళ్లు తక్కువగా ఉండి, రుచికి చాలా బాగుంటాయి.

అధిక పోషక విలువలు మరియు ఔషధ గుణాల కారణంగా ఈ చేపలకు వినియోగదారులలో మంచి ఆదరణతో పాటు మార్కెట్లో అధిక డిమాండ్ కూడా ఉంది. అందువల్ల దీనిని అధిక విలువ కలిగిన ఆహార చేపలుగా పరిగణిస్తారు. మార్కెట్లో ఈ చేప ధర కిలోకు రూ.500-800 వరకు ఉండే అవకాశం ఉంది.

ప్రత్యేకంగా RAS మరియు బయోఫ్లాక్ సాగు విధానాల్లో ఆక్వాకల్చర్ విభిన్నీకరణకు ఈ చేప ఒక మంచి అవకాశవంతమైన జాతిగా గుర్తింపు పొందుతోంది. అయితే, సింగి చేపల పెంపకంలో ప్రధాన సమస్య నాణ్యమైన పిల్లల (సీడ్) లభ్యత తగినంత లేకపోవడమే.

జాతీయ మంచినీటి చేపల పెంపక సంస్థ, భువనేశ్వర్ వారు సింగి క్యాట్‌ఫిష్ హ్యాచరీ, చేప పిల్లల ఉత్పత్తి మరియు గ్రో-అవుట్ కల్చర్ సాంకేతికతను అభివృద్ధి చేసింది. అంతేకాకుండా, ఈ సంస్థ దేశవ్యాప్తంగా రైతులు మరియు ఇతర భాగస్వాములకు సింగి చేపల కృత్రిమ ప్రజననం, చేప పిల్లల ఉత్పత్తి మరియు పెంపక సాంకేతికతలను ప్రదర్శించడం, విస్తరించడం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.

తల్లి చేపల పెంపకo నిర్వహణ:
బ్రూడర్ చేపలను చిన్న చెరువులు (100–200 చదరపు మీటర్లు) లేదా సిమెంట్ ట్యాంకులు (50–100 చదరపు మీటర్లు)లో ప్రతి చదరపు మీటరుకు 3–4 చేపల సాంద్రతతో పెంచుతారు. బంధీ పరిస్థితుల్లో (captivity) పరిపక్వత సాధించేందుకు బ్రూడర్లకు అత్యుత్తమ నీటి నాణ్యత మరియు సరైన పోషకాహారం అవసరం.

ట్యాంక్ విధానంలో తల్లి చేపల పెంపకానికి 4–6 సెం.మీ మట్టిపొర ఉన్న సిమెంట్ ట్యాంకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. బ్రూడర్లకు రోజుకు రెండు సార్లు 30–35% ప్రోటీన్ కలిగిన ఫిష్‌మీల్ ఆధారిత ఆహారాన్ని శరీర బరువులో 3-4% మోతాదులో అందిస్తారు.

తల్లి చేపల పెంపక చెరువులు లేదా ట్యాంకుల్లో నీటి నాణ్యతను సరైన స్థాయిలో ఉంచాలి. ఇందుకు నీటి ఉదజని 7.8–8.5, నీటిలో కరిగిన ఆక్సిజన్ 4–6 పి పి యం, మొత్తం కాఠిన్యం 80–180 పి పి యం, మొత్తం ఆల్కలినిటీ 80–180 పి పి యం స్థాయిలో ఉండేలా ప్రతి రెండు వారాలకు 20–30% నీటిని మార్చాలి. సహజ ఆహారం ఉత్పత్తి కావడం మరియు నీటి నాణ్యత మెరుగుపడేందుకు బ్రూడర్ చెరువులకు కాలానుగుణంగా ఎరువులు వేయాలి.

తల్లి చేపల ఎంపిక:
ఎటిరోనుస్టిస్ ఫాజిల్స్ లేదా సింగి చేప ఒక సంవత్సరం వయస్సులో లైంగిక పరిపక్వతను పొందుతుంది. సాధారణంగా వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు)లో ప్రజననం చేస్తుంది.

60–200 గ్రాముల బరువు కలిగిన బ్రూడ్ చేపలు కృత్రిమ ప్రజనానికి అనుకూల పరిమాణంగా పరిగణిస్తారు. ద్వితీయ లైంగిక లక్షణాల ఆధారంగా మగ మరియు ఆడ చేపలను గుర్తించవచ్చు.

ప్రజనన కాలంలో మగ చేపలో పొడవుగా ఉన్న జనన పాపిల్లా కనిపిస్తుంది. ఆడ చేపలో పొట్ట ఉబ్బినట్లుగా ఉంటుంది. ఎంపిక చేసిన బ్రూడర్లను ముందుగానే సేకరించి, ప్రజనన కార్యక్రమం కోసం వేర్వేరుగా ట్యాంకుల్లో ఉంచుతారు.

ప్రేరేపిత ప్రజననం:
సింగి చేపల ప్రజననానికి సాధారణంగా ఓవప్రీమ్ / ఓవా టైడ్, / ఓవా -ఎఫ్ హెచ్, గోనోప్రో, స్పాన్ ప్రో వంటి సింథటిక్ హార్మోన్లు ఉపయోగిస్తారు. బ్రూడర్ల శరీర బరువుకు కిలోకు 1.0–1.5 మి.లీ హార్మోన్ మోతాదును ఇస్తారు.
మగ : ఆడ నిష్పత్తిని 2 : 1 గా నిర్వహిస్తారు. సింగి చేపల్లో సహజ స్పానింగ్ కనిపిస్తుంది. హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చిన 10–14 గంటల తరువాత, బ్రూడర్ పరిస్థితి మరియు హార్మోన్ ప్రతిస్పందన ఆధారంగా స్పానింగ్ జరుగుతుంది.
కొంతమంది రైతులు గుడ్ల సేకరణ కోసం “డ్రై స్ట్రిప్పింగ్” పద్ధతిని అనుసరిస్తారు. అయితే ఈ విధానంలో మగ చేపలను త్యాగం చేసి వీర్య ద్రావణం తయారు చేయాల్సి ఉంటుంది. ఇది మగూర్ చేపల పద్ధతికి సమానంగా ఉంటుంది.

60–200 గ్రాముల బరువు ఉన్న ఆడ చేపలో సాధారణంగా 5,000–18,000 గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఫలదీకరణ పొందిన గుడ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి అడుగుభాగంలో స్థిరపడతాయి. ఫలదీకరణం కాని గుడ్లు తెల్లటి రంగులో ఉండి నీటి పైభాగంలో తేలుతాయి. హ్యాచరీ పరిస్థితుల్లో సాధారణంగా 70–90% ఫర్టిలైజేషన్ రేటు కనిపిస్తుంది.

గుడ్ల ఇంక్యూబేషన్ మరియు హ్యాచింగ్:
ఫలదీకరణ పొందిన గుడ్లను ప్రవహించే నీటి వ్యవస్థ కలిగిన టబ్బులు లేదా ట్యాంకుల్లో ఇంక్యూబేట్ చేస్తారు. మెరుగైన హ్యాచింగ్ కోసం నీటి ప్రవాహం మరియు స్వల్ప గాలివేత కొనసాగిస్తారు.

నీటి ఉష్ణోగ్రత ఆధారంగా 16–20 గంటల్లో హ్యాచింగ్ జరుగుతుంది. సాధారణ ఉష్ణోగ్రత వద్ద flow-through వ్యవస్థలో 60–80% వరకు హ్యాచింగ్ శాతం కనిపిస్తుంది.

ఫలదీకరణం కాని గుడ్లు మరియు చనిపోయిన గుడ్ల పొరలను వెంటనే తొలగించాలి. కొత్తగా పుట్టిన లార్వాలో పెద్ద యోక్ సాక్ ఉంటుంది. ఇది 2–3 రోజులలో పూర్తిగా శోషించబడుతుంది.

లార్వా పెంపకం:

నీటి నాణ్యత నిర్వహణ:
కొత్తగా బయటకు వచ్చిన హ్యాచ్‌లింగ్స్ పొడవు సుమారు 2–3 మి.మీ. ఉండి, పెద్ద యోక్ సాక్‌ను కలిగి ఉంటాయి. రెండు రోజుల తరువాత ఆరోగ్యకరమైన లార్వాలు ట్యాంక్ మూలల వైపు ఈదుతూ గుంపులుగా ఉండటం ప్రారంభిస్తాయి.
8–12 రోజుల వయస్సు తరువాత గాలి ద్వారా శ్వాస ప్రారంభమవుతుంది. అందువల్ల లార్వా పెంపక ట్యాంకుల్లో నీటిలో కరిగిన ఆక్సిజన్ సరైన స్థాయిని నిలుపుకునేందుకు నిరంతర స్వల్ప గాలివేత అవసరం.
లార్వా ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. రోజుకు రెండు సార్లు 30–50% నీటిని మార్చడం మంచిది. నీటి లోతును 30–50 సెం.మీ. వరకు ఉంచాలి.
లార్వాలను ఇండోర్ ట్యాంకుల్లో 15–20 రోజుల పాటు ప్రతి చదరపు మీటరుకు 1000–2000 లార్వాల సాంద్రతతో పెంచాలి.

లార్వా ఆహార నిర్వహణ:
జూప్లాంక్టన్‌లు (ట్యూబిఫెక్స్, కోపీపాడ్), మోయినా, ఆర్టీమియా ప్రధాన లార్వా ఆహారంగా ఉపయోగిస్తారు. ప్రారంభ దశలో మిశ్రమ జంతు ప్లవకాలు చాలా మంచి ఆహారంగా పనిచేస్తాయి.
15వ రోజు నుండి క్రమంగా ప్రత్యక్ష ఆహారాన్ని తగ్గిస్తూ, 35% క్రూడ్ ప్రోటీన్ మరియు 8% క్రూడ్ లిపిడ్ కలిగిన తయారుచేసిన ఆహారాన్ని ఇవ్వడం వల్ల లార్వా వృద్ధి మరియు జీవన శాతం మెరుగుపడుతుంది.
లార్వాలకు రోజుకు 2–3 సార్లు అవసరానికి అనుగుణంగా ఆహారం ఇవ్వాలి. కనీసం 15 రోజుల పెంపకం తరువాత వీటిని ఫింగర్లింగ్ ఉత్పత్తి కోసం మట్టి చెరువులు లేదా సిమెంట్ ట్యాంకులకు మార్చవచ్చు. ఇండోర్ ట్యాంక్ పెంపకంలో సాధారణంగా 60–80% జీవన శాతం కనిపిస్తుంది.

ఫింగర్లింగ్ ఉత్పత్తి
ఫింగర్లింగ్ ఉత్పత్తి కోసం ఉపయోగించే సిమెంట్ ట్యాంకుల్లో 2–3 సెం.మీ మందంతో మట్టిపొర ఉండాలి. నీటి లోతు 30–50 సెం.మీ.గా నిర్వహించాలి.
సింగి ఫ్రైలను ప్రతి చదరపు మీటరుకు 100–200 సాంద్రతతో ట్యాంకులు లేదా చెరువుల్లో నిల్వ చేస్తారు. వీటికి 30% క్రూడ్ ప్రోటీన్ మరియు 6% క్రూడ్ లిపిడ్ కలిగిన తయారుచేసిన ఆహారాన్ని రోజుకు 2–3 సార్లు, శరీర బరువులో 4–6% లేదా తృప్తి స్థాయిలో అందిస్తారు.
2–3 నెలల పెంపకంలో ఇవి 2–3 గ్రాముల బరువుకు చేరుకుంటాయి. ఈ పరిమాణం వచ్చిన తరువాత వీటిని నేరుగా గ్రో-అవుట్ చెరువుల్లో నిల్వ చేయవచ్చు.

గ్రో-అవుట్ కల్చర్ దశ:
చిన్న పరిమాణం (200–1000 చదరపు మీటర్లు) మరియు తక్కువ లోతు (0.75–1.0 మీటర్ నీటి లోతు) కలిగిన మట్టి లేదా లైనింగ్ చెరువులు గ్రో-అవుట్ కల్చర్‌కు అనుకూలంగా ఉంటాయి.
ప్రతి హెక్టారుకు 20,000–40,000 చేపల సాంద్రతతో నిల్వ చేస్తారు. మెరుగైన జీవన శాతం (60–80%) మరియు గరిష్ట ఉత్పత్తి (2.0–3.0 టన్నులు/హెక్టారు) కోసం 2–3 నెలల వయస్సు గల ఫింగర్లింగ్‌లను నిల్వ చేయడం ఉత్తమం.

ప్రీ-స్టాకింగ్ నిర్వహణ

స్థల ఎంపిక, చెరువు నిర్మాణం మరియు సిద్ధం
చెరువు స్థల ఎంపిక ఇతర కార్ప్ మరియు క్యాట్‌ఫిష్ జాతుల మాదిరిగానే ఉంటుంది. పంట కాలమంతా నీటిని నిల్వ ఉంచగల సామర్థ్యం ఉన్న నేలను ఎంపిక చేయాలి.
సాధారణంగా మట్టి నేలలు చెరువు నిర్మాణానికి అత్యంత అనుకూలం. ఇసుక నేలలను నివారించాలి. ఒకవేళ చెరువు నేల ఇసుకగా ఉంటే, నీటి చొరబాటును నివారించేందుకు HDPE లైనింగ్ షీట్లను ఉపయోగించవచ్చు.
సులభమైన నిర్వహణ మరియు సులభమైన చేపల సేకరణ కోసం చెరువులు చిన్న పరిమాణంలో, సాధారణంగా అర ఎకరానికి తక్కువగా ఉండటం మంచిది. చెరువు గట్లు 1:2 నుంచి 1:3 వంపుతో ఉండాలి.
వర్షాకాలంలో చేపలు బయటకు వెళ్లకుండా చెరువు ప్రక్కలను రాళ్లతో బలపరచాలి. నీటి లోతు సుమారు 1 మీటర్ వరకు ఉంచాలి.
నేల మరియు నీటి విశ్లేషణ ఫలితాల ఆధారంగా లైమింగ్ మరియు ఎరువుల వినియోగం చేయాలి.

పోస్ట్-స్టాకింగ్ నిర్వహణ:

నీటి నాణ్యత నిర్వహణ:
సాగు వాతావరణాన్ని మంచి స్థితిలో ఉంచేందుకు నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలించడం, అవసరమైనప్పుడు నీటిని మార్పిడి చేయడం మరియు వాటర్ ప్రోబయోటిక్స్ ఉపయోగించడం అత్యంత అవసరం.
నీటి నాణ్యత ప్రమాణాలను సరైన స్థాయిలో నిలుపుకోవడానికి అవసరమైనప్పుడు 20–30% నీటిని కొత్త నీటితో భర్తీ చేయాలని సూచిస్తారు.

ఆహారం మరియు ఆహార నిర్వహణ
సింగి ఒక సర్వభక్షక క్యాట్‌ఫిష్. అయినప్పటికీ, ఫిష్‌మీల్ ఆధారిత ఆహారం (30% క్రూడ్ ప్రోటీన్ మరియు 8% క్రూడ్ లిపిడ్) ఉపయోగించడం ఉత్తమం.
సింగి ఫింగర్లింగ్‌లకు రోజుకు రెండు సార్లు, శరీర బరువులో 3–4% మోతాదులో ఆహారం అందిస్తారు. సాధారణంగా ఫ్లోటింగ్ ఫీడ్స్ ఉపయోగించడం వల్ల ఆహార వినియోగ సామర్థ్యం మెరుగుపడటంతో పాటు ఆహార వృథా తగ్గుతుంది.

ఆరోగ్య నిర్వహణ:
నాణ్యతలేని సీడ్ మరియు నాణ్యత లేని నీరు చేపల పెంపకంలో వ్యాధులకు ప్రధాన కారణాలు. సింగి చేపల్లో సాధారణంగా కనిపించే వ్యాధులు:
• ఎర్రమచ్చల వ్యాధి
• వాజాల కుళ్ళు
• కురుపుల వ్యాధి
ఈ వ్యాధులు చేపల వృద్ధి మరియు జీవన శాతాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
బాక్టీరియా సంబంధిత వ్యాధుల నివారణకు ఆక్సి టెట్రాసైక్లిన్ ను ఆహారంలో శరీర బరువుకు కిలోకు 50–80 మి.గ్రా మోతాదులో 5 రోజుల పాటు ఇవ్వాలని సూచిస్తారు.
• కురుపుల వ్యాధి నియంత్రణ కోసం సిఫాక్స్ హెక్టారు-మీటరుకు 1000 మి.లీ మోతాదులో 3–5 రోజుల పాటు ఉపయోగించడం సిఫారసు చేయబడింది.

చేపల ఉత్పత్తి మరియు పట్టుబడి:
సింగి చేపలు సుమారు 10 నెలల పెంపక కాలంలో 80–100 గ్రాముల మార్కెట్ పరిమాణానికి చేరుకుంటాయి. చేపల సేకరణ కోసం చెరువులోని నీటిని పూర్తిగా తొలగించి, చేపలను చేతితో సేకరిస్తారు. 10 నెలల పెంపక కాలంలో హెక్టారుకు 2.0–3.0 టన్నుల వరకు ఉత్పత్తి సాధించవచ్చ.

ముగింపు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్వా రైతులు అనుభవిస్తున్న చేపల ఉత్పత్తి సరిగా లేకపోవడం, రొయ్యల పెంపకంలో నాణ్యత లేని రొయ్య పిల్లలు, అధిక మేత రేట్లు మరియు ఆశించిన రీతిలో రొయ్యల ఉత్పత్తి లేకపోవడం వలన ఆక్వా రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. కావున మార్కెట్లో అధిక ధరలు పలికే చేప రకమైన మార్పు చేపల పెంపకం చేపట్టి ఆక్వా రైతులు ఆర్థికంగా లబ్ధి పొందగలరు.

  1. జె. భాను సందీప్, పి.హెచ్. డి. స్కాలర్, డిపార్టుమెంటు ఆఫ్ ఫిషరీస్ ఎక్స్టెన్షన్, ఫిషరీస్ కాలేజ్, కలకత్తా.
    1. కే. వీరాంజనేయులు, శాస్త్రవేత్త (మత్స్య విభాగం), కృషి విజ్ఞాన కేంద్రం, పందిరిమామిడి.
    2. జె. గిరి కిషోర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆక్వాటిక్ అనిమల్ హెల్త్ మేనేజ్ మెంట్, ఫిషరీస్ కాలేజ్, కలకత్తా. Phone: 9553364265
Read More

చేపల చెరువులలో ప్లవకాల ఉత్పత్తి – ప్రాముఖ్యత

చేపల పెంపకంలో అధిక ఉత్పత్తి సాధించడానికి నాణ్యమైన చేప పిల్లలు, సమతుల్య ఆహారం, సరైన నీటి నాణ్యత మరియు వ్యాధి నియంత్రణతో పాటు చెరువులో సహజ ఆహార వనరుల లభ్యత కూడా ఎంతో ముఖ్యమైనది. ఈ సహజ ఆహార వనరులలో అత్యంత ప్రాధాన్యత కలిగినవి ప్లవకాలు. చేపల చెరువులో ప్లవకాల ఉత్పత్తి సమృద్ధిగా ఉన్నప్పుడు చేపల పెరుగుదల మెరుగుపడటంతో పాటు అనుబంధ ఆహార వ్యయం కూడా తగ్గుతుంది. అందువల్ల ప్లవకాల ఉత్పత్తి చేపల సాగులో కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది.

ప్లవకాలు అంటే ఏమిటి?
నీటిలో స్వేచ్ఛగా తేలియాడే సూక్ష్మ జీవులను ప్లవకాలు అంటారు. ఇవి కంటికి కనిపించని స్థాయిలో చిన్నవిగా ఉండి చెరువు జీవావరణ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చేప పిల్లల నుంచి పెద్ద చేపల వరకు వివిధ దశల్లో ఇవి సహజ ఆహారంగా ఉపయోగపడతాయి.

ప్లవకాల రకాలు
చెరువులలో ప్రధానంగా రెండు రకాల ప్లవకాలు కనిపిస్తాయి

వృక్ష ప్లవకాలు (ఫైటోప్లాంక్టాన్)
సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగక్రియ జరిపి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే సూక్ష్మ మొక్కల సమూహాన్ని వృక్ష ప్లవకాలు అంటారు.

జంతు ప్లవకాలు (జూప్లాంక్టాన్)
వృక్ష ప్లవకాలపై ఆధారపడి జీవించే సూక్ష్మ జీవులను జంతు ప్లవకాలు అంటారు. ఇవి చేప పిల్లలకు అత్యంత పోషకమైన సహజ ఆహారం.

చేపల చెరువులలో ప్లవకాల ప్రాముఖ్యత
ప్లవకాలు చేపల చెరువులలో ఆహార గొలుసుకు పునాది వంటివి. చేపల పెరుగుదల, జీవన శాతం, ఆరోగ్యం మరియు ఉత్పత్తి స్థాయిని ప్రభావితం చేసే ముఖ్యమైన జీవ వనరులు. చెరువులో తగిన స్థాయిలో ప్లవకాలు ఉంటే చేపల పెరుగుదల వేగవంతమవుతుంది. అదనంగా రైతులు అనుబంధ ఆహారంపై చేసే ఖర్చు కూడా తగ్గుతుంది.

ప్లవకాల ఉత్పత్తికి అవసరమైన పరిస్థితులు
ప్లవకాల ఉత్పత్తి చెరువు నేల సారం, నీటి నాణ్యత, సూర్యరశ్మి లభ్యత మరియు ఎరువుల వినియోగంపై ఆధారపడి ఉంటుంది. చెరువు తయారీ సమయంలో భూసార పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు పోషకాలను అందించడం ద్వారా ప్లవకాల పెరుగుదలను ప్రోత్సహించవచ్చు.

ప్లవకాల ఉత్పత్తిలో ఎరువుల పాత్ర
చేపల చెరువులలో సహజ ఆహారమైన వృక్ష ప్లవకాలు మరియు జంతు ప్లవకాలు ఉత్పత్తిని పెంచడంలో ఎరువులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వృక్ష ప్లవకాల పెరుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం మరియు పొటాషియం వంటి పోషకాలను అందించడం వల్ల ప్లవకాల ఉత్పత్తి వేగంగా ప్రారంభమవుతుంది.
జంతు ప్లవకాల ఉత్పత్తి కోసం పశువుల పేడ, కోళ్ల పెంట వంటి సేంద్రీయ ఎరువులను వినియోగిస్తారు. చెరువు తయారు చేసుకునే సమయంలో హెక్టారుకు 5-10 టన్నుల పశువుల పేడ లేదా 2-3 టన్నుల కోళ్ల పెంట వేయడం ద్వారా సూక్ష్మజీవుల పెరుగుదల ప్రోత్సహించబడి జంతు ప్లవకాల ఉత్పత్తి పెరుగుతుంది. అదనంగా జింక్, మాంగనీస్, కోబాల్ట్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలు ప్లవకాల వృద్ధిని మెరుగుపరుస్తాయి.
ఎరువులను శాస్త్రీయ మోతాదులో సమతుల్యంగా వినియోగించడం ద్వారా చెరువులో సహజ ఆహార లభ్యత పెరిగి చేపల పెరుగుదల, ఆరోగ్యం మరియు ఉత్పాదకత మెరుగుపడతాయి. అయితే అధిక మోతాదులో ఎరువులు ఉపయోగించడం వల్ల నీటి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉన్నందున అవసరానికి అనుగుణంగా మాత్రమే వినియోగించాలి

వృక్ష ప్లవకాల వల్ల కలిగే ప్రయోజనాలు
వృక్ష ప్లవకాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా నీటిలో ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తాయి. చేపలకు సహజ ఆహారాన్ని అందించడంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయి. నీటిలోని కార్బన్ డైఆక్సైడ్‌ను గ్రహించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. హానికరమైన కొన్ని సూక్ష్మజీవుల పెరుగుదలను కూడా నియంత్రించడంలో సహాయపడతాయి.

జంతు ప్లవకాల వల్ల కలిగే ప్రయోజనాలు
జంతు ప్లవకాలలో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. చేప పిల్లల ప్రారంభ దశ పెరుగుదలలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చెరువులో సమృద్ధిగా జంతు ప్లవకాలు ఉండటం వల్ల చేపల ఆరోగ్యం మెరుగుపడి మరణాల శాతం తగ్గుతుంది.

నీటి నాణ్యత పై ప్లవకాల ప్రభావం
పగటి సమయంలో ప్లవకాలు కిరణజన్య సంయోగక్రియ జరిపి నీటిలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. దీని వలన చేపలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పి.హెచ్. విలువలను సమతుల్యంగా ఉంచడంలో కూడా ప్లవకాల పాత్ర ఎంతో ముఖ్యమైనది. తగిన స్థాయిలో ప్లవకాలు ఉన్నప్పుడు నీటి నాణ్యత మెరుగ్గా ఉంటుంది.

ప్లవకాల బ్లూమ్స్ – కారణాలు మరియు ప్రభావాలు
అధిక మోతాదులో ఎరువులు వాడటం, నీటిలో పోషకాలు ఎక్కువగా చేరడం వంటి కారణాల వల్ల ప్లవకాల బ్లూమ్స్ ఏర్పడతాయి. ఈ సమయంలో నీరు ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. బ్లూమ్స్ కారణంగా రాత్రి సమయంలో ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా తగ్గిపోవచ్చు. ఇది చేపల ఆరోగ్యానికి హానికరం.

ప్లవకాల క్రాష్ – కారణాలు మరియు నివారణ చర్యలు
వాతావరణ మార్పులు, అధిక ప్లవకాల సాంద్రత లేదా నీటి నాణ్యతలో ఆకస్మిక మార్పుల వల్ల ప్లవకాల క్రాష్ సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో నీరు తేటగా మారి ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. చేపలు ఒత్తిడికి గురై వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అందువల్ల చెరువులో నీటి నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూ సమతుల్య ఎరువుల నిర్వహణ చేపట్టాలి.

ప్లవకాల సాంద్రతను అంచనా వేసే పద్ధతులు
సెచి డిస్క్ మరియు ప్లాంక్టాన్ నెట్ ద్వారా ప్లవకాల సాంద్రతను అంచనా వేయవచ్చు. సాధారణంగా సెచి డిస్క్ దృశ్య లోతు 20-30 సెం.మీ. మధ్య ఉన్నప్పుడు చెరువులో ప్లవకాల స్థాయి అనుకూలంగా ఉందని భావిస్తారు.

ప్లవకాల నిర్వహణ లో చేపల రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-చెరువు నేల భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి.

  • ఎరువులను విడతల వారీగా వేయాలి.
  • నీటి రంగు మరియు పారదర్శకతను క్రమం తప్పకుండా పరిశీలించాలి.
  • ప్లవకాల బ్లూమ్స్ ఏర్పడినప్పుడు నీటి మార్పిడి చేపట్టాలి.
  • ఆక్సిజన్ కొరత లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.

ముగింపు
చేపల చెరువులలో ప్లవకాల ఉత్పత్తి విజయవంతమైన చేపల పెంపకానికి మూలాధారం. ప్లవకాలు చేపలకు సహజ ఆహారాన్ని అందించడమే కాకుండా నీటి నాణ్యతను మెరుగుపరచడం, ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం మరియు చెరువు జీవావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి చేపల రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి ప్లవకాల ఉత్పత్తి మరియు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లయితే అధిక దిగుబడులు, తక్కువ ఉత్పత్తి వ్యయం మరియు మెరుగైన లాభాలను పొందగలరు.

డాక్టర్. జి. గణేష్, మత్స్య శాస్త్రవేత్త
కృషి విజ్ఞాన కేంద్రం, పి. వి. నరసింహ రావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం, మామునూర్, వరంగల్ జిల్లా-506 166. ph; 6281836891

Read More

తెలంగాణాలో ఉచిత చేపపిల్లల పంపిణీ

రూ. 125 కోట్లతో తెలంగాణలో 2026-27 సంవత్సరానికిగాను 95 కోట్ల చేప, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ పథకం అమలుకు రాష్ట్ర మత్స్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జులై ఆరంభంలో పంపిణీ చేపట్టేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా ఈ పథకం సాగుతోంది. మొదట్లో మే నెలలో టెండర్లు పిలిచి జూన్‌లో చేపపిల్లలను పంపిణీ చేసేవారు. పెండింగ్ బిల్లులు, పథకం కొనసాగింపుపై సందిగ్ధత ఇతర కారణాల వల్ల కొన్నేళ్లుగా టెండర్ల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. గతానుభవాల దృష్ట్యా ఈ ఏడాది పథకం అమలులో లోటుపాట్లు లేకుండా అమలు చేసేందుకు మత్స్యశాఖ సన్నద్ధమవుతోంది.

Read More

ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించండి

ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందనీ, రసాయన వ్యవసాయాన్ని క్రమంగా వీడి ప్రకృతి సేద్యానికి మళ్లాలని రైతులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒక సీజన్‌కు ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించాలని, తద్వారా రాబడి పొందుతూ ఆత్మవిశ్వాసం పెరిగే కొద్దీ దానిని విస్తరించుకోవాలని ఆయన సూచించారు. ప్రకృతి సేద్యం వల్ల దీర్ఘకాలంలో బహుళ ప్రయోజనాలున్నాయని తెలిపారు. భూమి సారవంతం కావడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సమకూరుతాయని సామాజిక మాధ్యమం ‘లింక్డిన్‌’లో బుధవారం పెట్టిన పోస్టు ద్వారా వివరించారు. గత నెలలో కోయంబత్తూరులో నిర్వహించిన ‘దక్షిణ భారత ప్రకృతి సేద్యం సదస్సు-2025’కు రైతులు ఆహ్వానించగా వెళ్లినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా సాధిస్తున్న విజయాలు తననెంతో విస్మయపరిచాయని పేర్కొన్నారు. వ్యవసాయదారులతో పాటు శాస్త్రవేత్తలు, విద్యాధికులు, వృత్తి నిపుణులు, కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలి వచ్చిన వ్యక్తులు కూడా ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారని తన దృష్టికి వచ్చిందని వివరించారు. ప్రకృతి సేద్యం ద్వారా వివిధ రకాల ఆహార ధాన్యాలు పండించడం, అంతర పంటలుగా కూరగాయలు, వివిధ రకాల పండ్ల మొక్కల సాగు, వీటికి అనుబంధంగా పాడి పశువులు, చేపల పెంపకం తదితరాలను చేపట్టి విజయపథంలో కొనసాగుతున్నారని తెలిపారు. సంప్రదాయ పంటల విత్తనాల పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలనూ ప్రధాని మోదీ ప్రశంసించారు. వివిధ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మలచుకుంటున్నారని తెలిపారు.

Read More

ఉచిత చేపపిల్లల పంపిణీకి అనుమతి

గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని ఈ ఏడాదీ అమలు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2025-26 సంవత్సరానికి 90 కోట్ల చేపపిల్లలను రూ. 122 కోట్లతో కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ఆదేశించింది. నెలాఖరు వరకు టెండర్లు పిలిచి వచ్చేనెల 15 నాటికి వాటిని ఖరారు చేయాలని మత్స్యశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Read More

గోల్డ్‌ లైన్డ్‌ సీబ్రీమ్‌ రకం చేప జన్యువుల విశ్లేషణ

చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రాకిష్‌వాటర్‌ ఆక్వా కల్చర్‌ (సీఐబీఏ) పరిశోధకులు చేపల ఉత్పత్తి సామర్థ్యం, వాటి పెంపక విధానాలను మెరుగుపరచడానికి గోల్డ్‌లైన్డ్‌ సీబ్రీమ్‌ అనే చేప జన్యువులను విశ్లేషించారు. ఉప్పు, మంచి నీటి వనరుల్లో పెరగగలిగే ఈ చేపను తమిళంలో ‘మత్తివాయన్‌’ అని అంటారు. ఇది మంచి రుచి, ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది. చేపల్లో సంతానోత్పత్తి, పర్యావరణ మార్పులకు వాటి స్పందనలు తెలుసుకునేందుకు ఈ జన్యు విశ్లేషణ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్య శాస్త్రవేత్త ఎం.ఎస్‌. శేఖర్‌ నాయకత్వంలో వినయ్‌ కుమార్‌, అశోక్‌ కుమార్‌ జంగం, రేమండ్‌, కుల్దీప్‌ కె. లాల్‌ పరిశోధనలో పాలుపంచుకున్నారు.

Read More