బయోచార్ తయారీ, వినియోగం మరియు వ్యవసాయంలో ప్రయోజనాలు

రైతు వ్యర్థంగా భావించే వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు, చెరకు ఆకులు, పప్పుధాన్యాల కాండాలు, కూరగాయ పంటల అవశేషాలు భూమికి అమూల్యమైన సహజ సంపద. వీటిలో సేంద్రియ పదార్థం, విలువైన పోషకాలు, నేల సారాన్ని పెంచే కార్బన్ సమృద్ధిగా ఉంటాయి. వాటిని కాల్చేస్తే ఈ సంపద మొత్తం నష్టపోతుంది. అదే శాస్త్రీయంగా వినియోగిస్తే నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, ఎరువుల వినియోగం సమర్థవంతమవుతుంది, సాగు ఖర్చు తగ్గుతుంది.

రైతులు పంట అవశేషాలను కాల్చడానికి కూడా బలమైన కారణాలే ఉన్నాయి. ఒక పంట కోసిన వెంటనే మరో పంట వేయాల్సిన అవసరం, కూలీల కొరత, అవశేషాలను తొలగించడానికి అయ్యే అధిక ఖర్చు, యంత్రాల లభ్యత లేకపోవడం వంటి సమస్యలు వారిని ఈ నిర్ణయానికి దారి తీస్తున్నాయి. కానీ తాత్కాలికంగా సమయం ఆదా చేసినా, దీర్ఘకాలంలో నేల సారాన్ని, పంట ఉత్పాదకతను కోల్పోయే ప్రమాదం ఉంది.
అందుకే పంట అవశేషాలను కాల్చడం కంటే వాటిని కంపోస్టు, వర్మీ కంపోస్టు, మల్చింగ్, పశువుల మేత, బయోగ్యాస్ లేదా బయోచార్ రూపంలో వినియోగించడం ఉత్తమ పరిష్కారం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బయోచార్ సాంకేతికత నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచడం, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, నీటి నిల్వను పెంచడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతోంది. పంట అవశేషాలను సమస్యగా కాకుండా విలువైన వనరులుగా మార్చుకునే ఈ సాంకేతికత రైతులకు స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయానికి కొత్త దిశను చూపుతోంది.

బయోచార్ అనేది పంట అవశేషాలు, చెట్ల కొమ్మలు, ఎండిన ఆకులు, కొబ్బరి చిప్పలు, ఇతర సేంద్రియ వ్యర్థాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో 250-700°C ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే నల్లని ఘన పదార్థం. సాధారణంగా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చితే వాటిలోని కార్బన్, గాలిలో కార్బన్ డయాక్సైడ్ రూపంలో విడుదలవుతుంది. కానీ బయోచార్ తయారీ సమయంలో కార్బన్‌లో ఎక్కువ భాగం స్థిర రూపంలో నిల్వ ఉండి, తరువాత నేలలో కలిపినప్పుడు వందల నుంచి వేల సంవత్సరాల వరకు స్థిరంగా నిలిచి సేంద్రియ కార్బన్ నిల్వను పెంచుతుంది. అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరచి, నీటిని మరియు పోషకాలను నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు అనుకూల నివాసంగా పనిచేసి నేల జీవక్రియలను చురుకుగా ఉంచుతాయి.

  ప్రస్తుతం వాతావరణ మార్పులు, నేల సారం క్షీణించడం, నీటి కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బయోచార్ ఒక స్థిరమైన పరిష్కారంగా గుర్తింపు పొందుతోంది. ఇది నేలలో కార్బన్‌ను దీర్ఘకాలం నిల్వ ఉంచడం ద్వారా కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల బయోచార్ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వాతావరణ అనుకూల మరియు సుస్థిర వ్యవసాయానికి కూడా కీలకమైన సాంకేతికతగా నిలుస్తోంది.

డ్రమ్ పద్ధతిలో బయోచార్ తయారి
చిన్న, సన్నకారు రైతుల స్థాయిలో తక్కువ ఖర్చుతో బయోచార్‌ను 200 లీటర్ల సామర్థ్యం గల పాత ఇనుప డ్రమ్ సహాయంతో తయారు చేయవచ్చు. ముందుగా డ్రమ్ అడుగు భాగంలో మరియు కింది ప్రక్కవైపున కొద్దిపాటి గాలి ప్రవేశించేలా చిన్న రంధ్రాలు చేయాలి. అనంతరం పొడి పంట అవశేషాలను చిన్న ముక్కలుగా చేసి డ్రమ్‌లో గట్టిగా నింపాలి. తరువాత డ్రమ్‌కు మూత బిగించి, మూత అంచులను బంకమట్టితో మూసివేయాలి. దీంతో డ్రమ్‌లోకి గాలి ప్రవేశించడం నియంత్రించబడుతుంది.

ఆ తర్వాత డ్రమ్‌ను పొయ్యి లేదా ఇటుకలతో ఏర్పాటు చేసిన మంటపై ఉంచి వేడి చేయాలి. సుమారు 20-25 నిమిషాల తర్వాత మూత అంచుల వద్ద నుంచి నీలిరంగు వాయువు విడుదల కావడం ప్రారంభమవుతుంది. ఈ దశలో డ్రమ్‌లో ఉష్ణోగ్రత 300-400°C వరకు చేరుకొని పైరోలిసిస్ ప్రక్రియ పూర్తవుతుంది.

నీలిరంగు వాయువు విడుదల తగ్గిన తర్వాత మంటను ఆర్పివేయాలి. అనంతరం డ్రమ్‌ను జాగ్రత్తగా దించి నేలపై ఉంచాలి. వెంటనే అడుగు భాగంలోని రంధ్రాలను కూడా బంకమట్టితో మూసివేయాలి. దీంతో గాలి లోపలికి ప్రవేశించకుండా నిరోధించబడి, పంట అవశేషాలు పూర్తిగా బూడిదగా మారకుండా కార్బన్ రూపంలో నిల్వ చేయబడతాయి.

డ్రమ్‌ను సుమారు రెండు గంటల పాటు అలాగే ఉంచి పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం మూతను తీసి బయోచార్‌ను బయటకు తీసుకోవాలి. బూడిద ఏర్పడి ఉంటే దానిని వేరుచేసి, బయోచార్‌ను చిన్న ముక్కలుగా లేదా పొడి రూపంలో తయారు చేయాలి. అనంతరం దీనిని కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి కొంతకాలం ఉంచిన తర్వాత పొలంలో ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
బయోచార్ తయారీలో ఆక్సిజన్ ప్రవేశం పరిమితంగా ఉండాలి. గాలి ఎక్కువగా ప్రవేశించినట్లయితే పంట అవశేషాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారుతాయి. అటువంటి పరిస్థితిలో నాణ్యమైన బయోచార్ తయారు కాదు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

మొక్క జీవితకాలం పెంపుకు ఐ.యం.ఓ. ద్రావణం

మొదట కడిగిన బియ్యాన్ని ఉడకబెట్టి ఒక చెక్క పెట్టెలో వుంచి దాన్ని చెట్టు కింద నీడలో గుంత తీసి పూడ్చి పెట్టాలి. నాలుగు రోజుల తరువాత దానిని వెలికితీయాలి. దీనిని చో మెధడ్‌లో ఐయంఓ (ఇండీజినిస్ మైక్రో ఆర్గానిజమ్)గా వ్యవహరిస్తారు. ఇందులో బెల్లాన్ని కలిపితే ఐయంఓ తయారవుతుంది. దీన్ని నిలువ వుంచుకుని మొక్కలకు స్ప్రే చేయాలి. దీనివల్ల మొక్కకు అన్ని రకాలైన పోషకాలు అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొక్క జీవితకాలం కూడా పెరుగుతుంది.

గమనికః మొదటగా లీటర్ నీరు నిలువ వుంచడానికి లీటరున్నర పాత్రను తీసుకోవాలి. అపుడే బాక్టీరియా పాత్రలో ప్రవేశించడానికి అవకాశముంటుంది.

Read More

ఔషధ మొక్క… గురివింద

ఇది దాదాపు 10 మీ. ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. పత్రాలు సంయుక్తమై ఉంటాయి. పత్రకాలు దాదాపు 20 -40 వరకు వుండి దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. పుష్పాలు లేత గులాబి రంగులో గాని, తెల్లగా గాని ఉండి నారింజ పసుపు రంగులోకి మారతాయి. ఫలాలు చిన్న చిక్కుడు కాయల వలే ఉంటాయి. గింజలు అండాకారంలో కోలగా, ఎర్రగా లేదా తెల్లగా ఒక చివర నల్లని మచ్చ కలిగి ఉంటాయి. తెల్లపూలు వచ్చే తీగలకు గింజలు తెల్లగా ఉంటాయి, ఈ గింజలు ఫిబ్రవరి నుండి జూన్ వరకు లభిస్తాయి. గురివింద విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. పొదల మీద ప్రాకుతూ కన్పిస్తుంది.

సాధారణనామం : ఇండియన్ లిఖోరిస్ శాస్త్రీయ నామం: ఆబ్రస్ ప్రికటోరియస్ కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • గింజలు, వేర్లు, ఆకులు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వేర్లు, ఆకులలో గ్లైకోరైజిన్ అనే రసాయనముంటుంది. గింజలలో యాబ్రిన్, ఇండోల్ అనే ఆల్కలాయిడ్లు, ఆంథోసయనిన్ ఉంటాయి. యాబ్రిన్ విషపూరితం.
  • గ్లైకోరైజిన్ కఫాన్ని తొలగించడమే గాకుండా వాపులను, అలర్జీలను తగ్గిస్తుంది.
    గురివింద గింజ విషతుల్యం. క్రిమిసంహారక, గర్భనిరోధక శక్తి కలిగి ఉంది. కేశ వృద్ధికరం.
  • ఆకులు, వేర్లు వీర్యవృద్ధికరం. మూత్ర విసర్జనకు, వాపులకు, గాయాలకు, ఉబ్బసం, బొల్లి తదితర చర్మవ్యాధులు, తీవ్ర దాహార్తి నివారణకు ఉపయోగపడుతుంది.
  • వేర్లను ఆవు పాలలో కలిపి మిశ్రమం తయారు చేసి అతిసారం మరియు రక్తవిరేచనాల నివారణకుపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • గురివింద ఆకులు, గింజల నీటి, మిథనాల్ ఆధారిత ద్రావణాలు కోపోటెర్మెస్ జెస్ట్రాయ్ మరణశాతాన్ని గణనీయంగా పెంచాయి (ప్రసాద్,అతని అనుచరులు, 2016)
  • గురివింద గింజలలోని అబ్రిన్ అనే రసాయనం పిండినల్లి, మాకోనెల్లికోకస్ హిర్సూటస్‌లో సుగర్స్ పరిమాణాన్ని తగ్గించింది. ప్రోటీన్ పరిమాణాన్ని కూడా గణనీయంగా తగ్గించింది. సుగర్స్, ప్రోటీన్, లిపిడ్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా అబ్రిన్ పిండి నల్లుల సంఖ్యపై తీవ్ర ప్రభావాన్ని చూపింది (అనిత, ఆమె అనుచరులు, 1998).
  • గురివింద నీటి ద్రావణాన్ని వర్మ్స్ నివారణలో ఉపయోగిస్తారు. ఉగాండ రైతులు గురివింద ఆకులు, కాండాలను పురుగుల నివారణలో ఉపయోగిస్తారు (నువగచి, 2016)
  • గురివింద గింజ మిథనాల్ ద్రావణం రాల్‌స్టోనియా సొలనేసియారం, స్ట్రెప్టోమెసిస్ స్కాబీస్‌పై కన్నా పెక్టోబాక్టీరియం కరటోవోరంపై అధిక శక్తివంతమైన ప్రభావాన్ని చూపింది. గురివింద గింజలోని ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, రెసిన్స్, ఫినాల్స్, గ్లైకోసైడ్స్, స్టిరాల్స్, ట్రైటెర్పిన్స్ యాంటి బాక్టీరియల్ ప్రభావాన్ని చూపించవచ్చు. ఇథైల్ ఎసిటేట్ఇథనాల్ మిశ్రమ (80:20) ద్రావణం స్ట్రెప్టోమైసిన్ స్కాబీస్‌పై అధిక శక్తివంతమైన ప్రభావాలను చూపుతుంది. గింజల ద్రావణంలో ఉన్న డై (2ఇథైల్ హెక్సైల్) ఫ్తాలేట్ స్ట్రెప్టోమైసిస్ స్కాబీస్‌పై అధిక బాక్టీరియా నాశక చర్యను ప్రదర్శించింది (అబ్బాసి, అతని అనుచరులు, 2016).
  • గురివింద గింజల నీటి ద్రావణం, ఇథైల్ ఆల్కహాల్ ద్రావణం రెండు మచ్చల ఎర్రనల్లి, టెట్రానైకస్ ఉర్టికె పెద్ద ఆడ పురుగులను అత్యంత సమర్ధవంతంగా నివారించాయి. పెట్రోలియం ఈథర్ ద్రావణం గుడ్డు దశపై సమర్థవంతంగా పనిచేస్తుంది (అమర్, అతని అనుచరులు, 1989).
  • గురువింద ఆకులు, కాండాలు కీటకనాశక లక్షణాలు కలిగి వున్నాయి (ఓక్యుటె, 2012).
    గురువింద గింజల క్రూడ్ ద్రావణం ఆల్టర్నేరియా సొలాని శిలీంద్ర పెరుగుదలను అరికట్టింది. ఈ ద్రావణం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలను కూడా అరికట్టింది (యాస్మిన్, ఆమె అనుచరులు, 2015).
  • గురివింద పెట్రోలియం ఈథర్ ద్రావణాలు మానవుల తలలోని పేలు, పెడిక్యులస్ హ్యూమనస్ కాపిటిస్‌ని సమర్ధవంతంగా నివారించాయి (ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2011).
  • గురివింద మిథనాల్ ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర గుడ్లపై 100% గుడ్లనాశక చర్యను ప్రదర్శించాయి. మిథనాల్ ద్రావణం (500 పిపియం) గణనీయమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (ఎలుమలైకుప్పుసామి, అతని అనుచరులు, 2015), బోడయ్య, అతని అనుచరులు, 2016).
  • ఈడిస్ ఈజిప్టి చికెన్‌గునియా, యెల్లో మరియు డెంగ్యు జ్వరాల ముఖ్య వాహకం. గురివింద గింజల ద్రావణం ఈడెస్ ఈజిప్టి లార్వాలపై అదిక లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (అడెబాజొ, అతని అనుచరులు, 2014).
Read More

4 మేక పిల్లలు…. ఒకే ఈతలో

సాధారణంగా మేకలు రెండు, మూడు పిల్లలకు జన్మనిస్తాయి. కానీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తూర్పు వీధికి చెందిన అన్వర్ పెంచుకుంటున్న మేక ఒకే ఈతలో నాలుగు పిల్లలను ఈనింది. దీంతో చుట్టుపక్కల వారు ఆసక్తిగా వచ్చి చూస్తున్నారు. ‘చాలా అరుదుగా మాత్రమే ఇలా నాలుగు పిల్లలను పెడతాయి’ అని పశువైద్యాధికారి వెంకటేశ్వర్లురెడ్డి తెలిపారు. అందులో ఏదైనా మేక పిల్ల బలహీనంగా ఉంటే జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుందన్నారు.

Read More

ఏప్రిల్ 16 వరకు పాడి పశువుల పథకం దరఖాస్తు చేసుకోవాలి

ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాక, ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ‘రెండు పాడి పశువుల పథకం దరఖాస్తు గడువు ఏప్రిల్ 16 వరకు పొడిగించినట్లు తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఎండీ హన్మంతునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతోపాటు ఫొటో, ఆధార్, రేషన్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు, భూమి పట్టా పాస్‌బుక్‌లు కాపీ (జిరాక్స్)లతో ఒక సెట్ మండల పరిషత్ లేదా మున్సిపాలిటీ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు.

Read More