భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతుల్లో భయం

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ…”రైతులు పంటల ఎంపిక, పెట్టుబడుల ప్రణాళిక, మార్కెట్ పరిస్థితుల అంచనాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పరిస్థితి ప్రతికూలంగా మారింది. వాణిజ్య ఒప్పందం కారణంగా ఏర్పడిన అనిశ్చితి వల్ల ఏ పంట వేయాలి… ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాల్లో రైతులకు కేంద్రం నుంచి మార్గదర్శకాలు అందడం లేదు. దీంతో రాష్ట్రాలు సందిగ్ధంలో ఉన్నాయి. ఎరువుల సరఫరా విషయంలో కూడా స్పష్టత లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఏప్రిల్‌కు కేటాయించిన ఎరువులు ఇంకా అందలేదు. రైతులకు నష్టం కలిగించే ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించాలి. ఎరువుల సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలి” అని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు.

Read More

బస్తా నిమ్మకాయల ధర రూ. 4,350/-

హైదరాబాద్ (షరీఫ్) మార్కెట్‌లో గురువారం నిమ్మకాయలు బస్తా ధర రూ.4,350 పలికింది. వేసవి తీవ్రమవడంతో డిమాండ్ పెరగడం, ఖరీఫ్ సీజన్ ముగింపు సమయంలో కురిసిన భారీ వర్షాలతో దిగుబడి తగ్గడంతో.. ఈ పరిస్థితి ఏర్పడింది. గతంలో తామెన్నడూ ఇలాంటిది చూడలేదని కనగల్ మండలం మంచినీళ్లబావి గ్రామానికి చెందిన రైతు బోదనపు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంచి ధర దక్కించుకున్న రైతులు మురిసిపోతున్నారు.

Read More

ఈ-నామ్ 2.0పై పూర్తి స్థాయి శిక్షణ అవసరం

కేంద్ర ప్రభుత్వం 2014లో ఈ-నామ1.0ను ప్రవేశ పెట్టింది. దీన్ని మరింత వృద్ధి పరిచి ఈ ఏడాది ‘ఈ-నామ్ 2.0’ను తీసుకొచ్చింది. అయితే, సిబ్బందికి కనీసం శిక్షణ ఇవ్వకుండా అమలు చేయడంతో పంట నమోదులో తప్పిదాలు (ఎర్రర్) చూపించడం, బిడ్డింగ్ సమస్యలు, ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల లాగిన్లలో ఇబ్బందులు, రైతులకు మంచి ధర వచ్చే అవకాశం లేకపోవడం, ఒక్క రోజులో పూర్తయ్యే అమ్మకాలకు మూడు రోజులు పట్టడం వంటి ప్రధాన సమస్యలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 27న ఈ-నామ్ 2.0 ప్రవేశపెట్టగా లాట్ల కేటాయింపులు జరగకపోవడంతో అధికారులు నిజామాబాద్ మార్కెట్ యార్డులో బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోళ్లు చేపట్టగా రైతులు క్వింటాకు రూ. వెయ్యి వరకు నష్టపోయారు. తాజాగా శుక్రవారమూ అదే పరిస్థితి ఎదురైంది. యార్డుకు 30 వేల బస్తాల పసుపు రాగా ఉదయం 8 గంటల నుంచి అధికారులు తీవ్రంగా శ్రమించాక వెయ్యి బస్తాలకు మాత్రమే లాట్లు ఇవ్వగలిగారు. తర్వాత సాఫ్ట్‌వేర్ సమస్య తలెత్తడంతో గత్యంతరం లేక బహిరంగ వేలం ప్రారంభించడంతో వ్యాపారులు పంట కొనుగోలు చేశారు. వేలం విధానంలో సాధారణంగా కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులకు మాత్రమే లాభం ఉంటుంది. వారు నిర్ణయించిన ధరకే రైతులు పంటను విక్రయించాల్సి వస్తుంది. సిబ్బందికి ఈ-నామ్ 2.0 పై పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి… సాంకేతిక సమస్యలను అధిగమించిన తర్వాతే అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Read More

విత్తన కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకోండి

ఆర్గనైజర్ల వ్యవస్థను రద్దు చేసి, విత్తన కంపెనీలు నేరుగా పత్తి విత్తనోత్పత్తి రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రూ.700 కోట్ల బకాయిలను నెల రోజుల్లో రైతులకు విడుదల చేయాలని, జాప్యం చేస్తే లైసెన్స్‌ల రద్దుకూ వెనకాడబోమని స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు రావాల్సిన పెండింగ్‌ బిల్లుల సమస్యపై సోమవారం సచివాలయంలో పర్యాటక, ఆబ్కారీశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ సంచాలకుడు గోపి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ… ”50 వేల ఎకరాల్లో పత్తి విత్తనోత్పత్తితో దేశంలోనే గద్వాల జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. పత్తి సాగు చేసినవారికి నిధులు వెను వెంటనే ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. విత్తన కంపెనీలు ఆర్గనైజర్లకు బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకొని వెనువెంటనే బిల్లులు చెల్లించాలి” అని సూచించారు.

Read More