– మిరప, మొక్కజొన్నల్లో భారీగా వాడుతున్నారు
– జొన్నలోనూ యూరియా వాడకం 417% అధికం
రసాయన ఎరువుల బస్తాలు ఎన్ని ఎక్కువ వాడితే.. పంట దిగుబడి అంత ఎక్కువగా వస్తుందనే ఆలోచనే రైతులను పరిమితికి మించిన వాడకం దిశగా నడిపిస్తోంది. పెట్టుబడి వ్యయం పెరగడానికి ఇదీ ఒక కారణం. ఆంధ్రప్రదేశ్లో 2024-25 సంవత్సరంలో పంటల వారీగా చూస్తే ఎరువుల వాడకంలో మిరప అగ్రస్థానంలో ఉండగా మొక్కజొన్న రెండోస్థానంలో నిలిచింది. జొన్న, వేరు శనగ, పసుపు, పప్పుధాన్యాలు తదితర పంటలకూ యూరియాను కుమ్మరిస్తున్నారు. *మిరపలో ఎరువుల వాడకం అధికం* రాష్ట్రంలో రసాయన ఎరువులు అత్యధికంగా వాడే పంట మిరప.. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారమే హెక్టారుకు 1,325 కిలోల వాడకం ఉంది. సిఫార్సు చేసిన మోతాదు కంటే యూరియా 78%, భాస్వరం 122% అధికంగా వాడుతున్నారు. వాస్తవంగా చూస్తే రైతులు ఇంతకు రెట్టింపుస్థాయిలోనే వాడుతున్నారు. ఫలితంగా మిరపకు ఎకరాకు రూ. 3 లక్షల పెట్టుబడి అవుతోంది. తీరా చూస్తే ధరలు దక్కడం లేదు. క్వింటాలుకు రూ.10 వేలు ఉన్నా గిట్టుబాటు కాని పరిస్థితి. లక్షల్లో నష్టపోతున్నారు. ఎరువుల వాడకం తగ్గించుకుంటే పెట్టుబడి కూడా తగ్గుతుందని ఆలోచించడం లేదు.*మొక్కజొన్న సాగులోనూ భారీగా…* ఎరువుల వినియోగం అధికంగా ఉండే రెండో పంట మొక్కజొన్న. హెక్టారుకు 565 కిలోలు వాడుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవ వినియోగం ఇంకా ఎక్కువే. రెండు మూడేళ్లుగా గిట్టుబాటు ధరలు లభిస్తుండటంతో అధిక శాతం రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గుచూపిస్తున్నారు. ఇతర పంటల సాగులో నష్టాలతో.. ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్ననే ఎంచుకుంటున్నారు
.*జొన్న సాగుకు 417% అధికంగా యూరియా:* జొన్న సాగులో సిఫారసు చేసిన మోతాదుకు మించి 417% అధికంగా యూరియాను వినియోగిస్తున్నారు. వేరుశనగకు కూడా 303% అధికంగా వేస్తున్నారు. గడ్డి పెంపకానికి 283% అధికంగా వాడటం గమనార్హం.
*అపోహ మాత్రమే* భూసార పరీక్షలు చేయించుకుని.. అవసరం మేరకు రైతులు ఎరువులు వాడాలి. ఎక్కువ వేస్తే దిగుబడి పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే. నత్రజని ఎక్కువగా వాడితే చీడపీడలు పెరుగుతాయి. వాటి నివారణకు పురుగుమందులు ఎక్కువగా చల్లాలి. పంటల నాణ్యత దెబ్బతింటుంది. భూగర్భజలాలు కలుషితమవుతాయి. ఎరువుల్ని సిఫార్సు మేరకు మాత్రమే అందించాలి. లేదంటే మొక్కల్లో రోగనిరోధకత తగ్గుతుంది. కరవు పరిస్థితుల్లో నానో ఎరువులు పిచికారి చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే నేల ద్వారా అందించడమూ ముఖ్యమే.- *వి. శైలజ,* ప్రధాన శాస్త్రవేత్త, సాయిల్ సైన్స్, ప్రాంతీయ పరిశోధనాస్థానం, లాం, గుంటూరు