పాలవెల్లువ 2.0

గ్రామీణ స్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, తద్వారా పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా 19.9.2024న కేంద్ర సహకార మరియు పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ పాలవెల్లువ 2.0కు శ్రీకారం చుట్టింది. మహిళల భాగస్వామ్యంతో 5 సంవత్సరాల్లో సహకార సంఘాల ద్వారా 50% పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. కొత్తగా 75000 బహుళార్థ సాధక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, 46000 పాలఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం, ఐదు సంవత్సరాల చివరికి రోజుకు 1000 లక్షల లీటర్ల పాలఉత్పత్తి లక్ష్య సాధన దిశగా కేంద్ర సహకార మరియు పశుసంవర్థక పాడి పరిశ్రమ శాఖలు ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో సమావేశాలు జరిపి నిరంతరం ప్రగతిని సమీక్షిస్తున్నాయి.

1998 నుండి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రస్థానం పదిలపరుచుకుంటున్న భారత్, స్థూల ఉత్పత్తికి 25% వాటా సమకూరుస్తుంది. డిసెంబర్ 2014 నుండి అమలవుతోన్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గేదెల్లో పాలఉత్పాదకత 36.63% పెరిగిందని తెలుస్తోంది. అంతేకాక ఆధునిక పాలపరీక్షా పరికరా…తో పాల నాణ్యత పరిశీలన పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది.

రాష్ట్రాలవారీగా 2024 నుండి 2029 వరకు పాలఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు లక్ష్యం ఇలా ఉంది.

తెలంగాణాపరంగా చూస్తే –
2024-2026కు గాను కొత్త సంఘాల ఏర్పాటు 8%, బలోపేతం 42% గా నమోదయింది.
ప్రస్తుత సంవత్సరంకి 306 కొత్త సంఘాల ఏర్పాటు లక్ష్యంగా ఉంది.
పాడి సుస్థిర అభివృద్ధికి 3 అంచెల సహకార వ్యవస్థ రామరక్షగా నాడే క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ చెప్పారు. కాగా తెలంగాణలో బలహీనంగా ఉన్న గ్రామస్థాయి సహకార సంఘాల పాల సేకరణకు సవాల్‌గా మారింది.
ఉన్న సంఘాల్లో ఆడిట్ జరగక పోవడం, సభ్యుల నిర్లిప్త భావన, సంఘ స్ఫూర్తికి విఘాతంగా నిలిచింది.
తెలంగాణ సహకార యూనియన్ మరింతగా సభ్యుల అవగాహనా కార్యక్రమాలు విస్తృతపరచాల్సిన అవసరం ఉంది.
గ్రామస్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు, జిల్లా స్థాయిలో యూనియన్లు రాష్ట్ర స్థాయిలో సమాఖ్య వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.
పాడి రైతులు సంఘటితంగా ఉంటే, పక్క రాష్ట్రం, కర్నాటకలో రోజుకు కోటి లీటర్లు పాలసేకరణ సాధ్యపడుతుండగా, విస్తృత విపణి అవకాశాలున్నా, తెలంగాణలో వివిధ సహకార వ్యవస్థలు, ప్రైవేటు ఆధిపత్యానికి దారితీస్తోంది.
తెలంగాణలో కరీంనగర్ పాడి రైతుల కంపెనీ, ముల్కనూర్ మహిళా డెయిరీ, నల్లగొండ రంగారెడ్డి యూనియన్, విజయడెయిరీ ఇలా 4 రకాల వ్యవస్థలు నడుస్తున్నాయి.
1964 చట్టంలో ఉన్న విజయ డెయిరీ వ్యవస్థాగత అసమానతలతో ఆశించినంతగా పాలసేకరణ, మార్కెటింగ్ లక్ష్యాలకు చేరువ కావాలంటే, పాడిరైతుల సంఘటిత ముందడుగు ఎంతో అవసరం.
సహకారశాఖ ద్వారా త్వరితగతిన సంఘాల ఏర్పాటు, పశుసంవర్థక శాఖ ద్వారా పాడిరైతులకు సేవలు సమ్మిళితంగా లభిస్తే, పాడి రైతు బతుకులో భరోసా వస్తుంది. అలాగే, సబ్సిడీతో పాడిపశువులకు రుణాలు దొరకకపోవడం, పాడిపరిశ్రమపై బడ్జెట్ లో తగు కేటాయింపులు జరగకపోవడం పాడిపరిశ్రమపై నీలినీడలు ప్రసరించడానికి కారణం అవుతోంది. కర్నాటకలో ఏటా 2000 కోట్లు ప్రోత్సాహకం ఇస్తుంది కాబట్టే, పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. తద్వారా నిర్వహణ ఖర్చులు అదుపులో ఉన్నాయి.
అదేవిధంగా తెలంగాణలో కూడా –
1) పాడి పశువులను సబ్సిడిపై ఇచ్చే పథకం అమలు
2) పాల ప్రోత్సాహకం విడుదల
3) సాంకేతిక వనరుల సరఫరా
4) పశు ఆరోగ్యంకై నిరంతర సేవలు
5) సంఘాల ఏర్పాటు అనివార్యం చేయడం
అనే పంచ సూత్రాలు అమలయితే పాల ఉత్పత్తి పెరిగి, జీవనోపాధులు మెరుగు కాగలవు.

మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553

Read More

త్వరలో పశు ఔషధి కేంద్రాలు

జాతీయ పశు వ్యాధుల నియంత్రణ పథకం కింద పశు ఔషధి కేంద్రాలను కేంద్ర పశుసంవర్ధక-పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ టి. దామోదర్ నాయుడు బుధవారం ప్రకటించారు. వీటితో నాణ్యమైన జనరిక్ పశు ఔషధాలు చౌక ధరలకే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కేంద్రాలను ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు(పీఎం-కేఎస్‌కేలు), సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తారని, జిల్లా, మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు https://pashuaushadhi.dahd.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు పొందవచ్చు లేదా, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని సంప్రదించాలని సూచించారు. ఈ కేంద్రాలకు ఆపరేటింగ్ మార్ౙిన్‌గా 20శాతం ఇస్తారని తెలిపారు.

Read More

సబ్సిడీపై పాడి పశువులు

తెలంగాణా రాష్ట్రంలోని మహిళా స్వయంసహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ రెండేసి పాడి గేదెలు / ఆవులను ఇందిరా డెయిరీ ప్రాజెక్టు కింద పంపిణీ చేయనుంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో దీనిని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టింది. రాష్ట్రంలోని కొడంగల్‌ సహా ఇతర ప్రాంతాలకు దీనిని విస్తరించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది. రోజూ 30 లక్షల లీటర్లు వినియోగమవుతుండగా.. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీకి పాడి రైతులు కేవలం 4 లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 26 లక్షల లీటర్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం ఇందిరా డెయిరీ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ఈ పథకం కింద ప్రతి మండలాన్ని మూడు జోన్లుగా విభజిస్తారు. ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేస్తారు. ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘ సభ్యురాలికి రూ.2 లక్షల యూనిట్‌ ధరతో రెండు పాడి గేదెలు/ఆవులను అందజేస్తారు. ఈ సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం 70 శాతం సబ్సిడీ(రూ.1.40 లక్షలు)గా అందజేస్తుంది. మిగిలిన 30 శాతం (రూ.60 వేలు) లబ్ధిదారు వాటాగా బ్యాంకులు రుణంగా ఇస్తాయి. రవాణా కోసం ప్రభుత్వం ట్రాలీ ఆటోలను అందజేస్తుంది. షెడ్లకు సౌరవిద్యుత్‌ సదుపాయాన్ని కల్పిస్తుంది. పశువుల ఆరోగ్యం కోసం పశువైద్యులు ప్రతి నెలా తనిఖీలు చేసి హెల్త్‌ కార్డులు జారీ చేస్తారు.
మధిర నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ఇందిరా డెయిరీ పైలట్‌ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 781.82 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి బీసీ సంక్షేమశాఖ ద్వారా ఇప్పటికే రూ.286 కోట్లను విడుదల చేసింది. తాజాగా మరో రూ.124.92 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతి లభించింది. మరో రూ.370 కోట్ల మేరకు నిధులు విడుదల కావాల్సి ఉంది.

Read More

అమెరికాలో జొన్న ఉత్పత్తి హెక్టారుకు 11 టన్నులు

మన దేశంలో దాణా కొరత పశుసంపద వృద్ధికి విఘాతంగా మారిందని, విధానపరమైన సమగ్ర కార్యాచరణ లేకపోవడం వల్లే పాడి, పౌల్ట్రీ, మత్స్యరంగాలు ఆశించిన స్థాయిలో పురోగమించడం లేదని భారత సమ్మిళిత పశుదాణా తయారీదారుల సంఘం (సీఎల్‌ఎఫ్‌ఎంఏ) అధ్యకక్షుడు దివ్యకుమార్‌ గులాటీ అభిప్రాయపడ్డారు. అమెరికాలో జొన్న హెక్టార్‌కు 11 టన్నులు పండుతుంటే మన దేశంలో కేవలం 3 టన్నులే ఉందని.. అక్కడ జన్యుమార్పిడి విత్తనాల వినియోగం వల్ల ఉత్పత్తి పెరుగుతోందని మనదేశంలో దానిని చేపట్టడం లేదని, దేశంలో దాణా అవసరాల దృష్ట్యా పలు పంటల ఉత్పాదకతను పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఆ రంగాలను ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగిన సంఘం 66వ వార్షిక సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పశుసంపద, దాణా ఉత్పత్తి ఇతర అంశాల గురించి వివరించారు.
దాణా అవసరాల్లో 50 శాతం దిగుమతి చేసుకుంటున్నాం.
మన దేశం పశుసంపదకు నిలయం. వ్యవసాయ జీడీపీలో మూడో వంతు వాటా పాడి, పౌల్ట్రీ, మత్స్యరంగాలదే. దేశంలో ఏటా 60 మిలియన్‌ టన్నుల దాణాను వాడుతున్నాం. అందులో 22 మిలియన్‌ టన్నులు మొక్కజొన్నలే. ప్రస్తుతం దేశీయ దాణా అవసరాల్లో సగం మాత్రమే దేశం ఉత్పత్తి చేస్తున్నందున ఇతర దేశాల నుంచి 50 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. ఇది పాడి, పౌల్ట్రీ, మత్స్య రైతులకు, ఉత్పత్తిదారులకు భారంగా మారుతోంది.
ఉత్పాదకతనైనా పెంచాలి
వరి లాంటి పంటలు అవసరానికి మించి సాగవుతున్నాయి, కానీ దాణా అవసరాల దృష్ట్యా మొక్కజొన్న, సోయా, నూనెగింజల విస్తీర్ణం, ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా ఆ మేరకు కృషి జరగడం లేదు. జొన్న, సోయా వంటి పంటలను ఎంత పండించినా కొనుగోలుకు ఆస్కారం ఉంది. విస్తీర్ణం పెంచకపోయినా ఉత్పాదకతను పెంచాలని అభ్యర్థిస్తున్నాం. అమెరికాలో మాదిరిగా జన్యుమార్పిడి వద్దనుకుంటే ఉత్పత్తిని పెంచే కొత్త వంగడాలపై భారత వ్యవసాయ పరిశోధన మండలి దృష్టి సారించాలని కోరారు.

Read More

దేశంలో తొలిసారి నారావారిపల్లెలో పాడి పశువుల్లో ఎద క్రమబద్ధీకరణ

కొన్ని పశువులు ఎదకు రాకపోకపోవడం.. లేదంటే ఒకట్రెండు ఈతలకే వట్టిపోతుండటం లాంటి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా నారావారిపల్లె పరిసరాల్లో దేశంలోనే తొలిసారిగా ఎద క్రమబద్ధీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా కృత్రిమ గర్భధారణతో 30-40 శాతం చూలు కట్టు శాతం ఉండగా.. ఎద క్రమబద్ధీకరణ కార్యక్రమంతో 63 శాతం పశువులు గర్భం దాల్చాయి. నారావారిపల్లె సహా చుట్టుపక్కల 29 గ్రామాల్లో వెయ్యికి పైగా ఎదకు రాని పశువుల్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. తొలి విడతగా 172 మంది రైతులకు చెందిన 250 పశువులను ఎంపిక చేసుకుని మార్చి 29న పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 30 మంది పశు వైద్యులు, సహాయకులు ఎంపిక చేసుకున్న ప్రతి పశువు పునరుత్పాదక, గర్భాశయం, అండాశయ స్థితిగతులను అధ్యయనం చేసి వాటిని ఎదకు రప్పించే ప్రక్రియను ప్రారంభించారు. పశువుకు ఆరోగ్య పరీక్షలు చేసి ఎదకు రాకపోవడానికి కారణాలను గుర్తించారు. ప్రతి పశువుకు డీవార్మింగ్‌ మాత్రలు, 20 కిలోల సమీకృత దాణా, 20 మినరల్‌ మాత్రలు, యాంటీ బయాటిక్‌ మందులతో కూడిన రూ. 1500 విలువైన కిట్‌ను రూ.400కే అందజేశారు. మే నెలలో మేలుజాతి ఆంబోతుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేశారు. దీంతో 156 వట్టి పోయిన పశువులు ఇప్పుడు చూలు కట్టాయి.

75 శాతం ఫలవంతం చేయడమే లక్ష్యం
ఎదకు రాని పాడి పశువు విలువ రూ. 15 వేలు మాత్రమే. అదే పశువు ఎదకు వచ్చి గర్భం దాల్చితే రూ.60-70 వేలు. ఆరు నెలల తర్వాత నారావారిపల్లెలోని 172 మంది రైతుల ఇళ్లలో పాల వెల్లువ ప్రారంభమవుతుంది. మంచి ఆదాయం లభించనుంది.
-ఎ. రవికుమార్‌, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి

Read More