పోలవరం పూర్తికి సహకరించాలని కేంద్రానికి వినతి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కోరారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకురావడానికి దిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం మధ్యాహ్నం జలశక్తి శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిశారు. వివిధ అంశాలపై చర్చించి, వినతిపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెదేపా పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, నీటిపారుదలశాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.




