నాణ్యమైన విత్తనముతోనే అధిక దిగుబడులు మరియు విత్తనం కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నాణ్యమైన విత్తనంలో మంచి దిగుబడికి తోడ్పడే అన్ని లక్షణాలు ఇమిడి ఉంటాయి. అందుచేత విత్తన నాణ్యతపై దిగుబడి ఆధారపడి ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇతర వ్యవసాయ ఉత్పాదకాలతో పాటు నాణ్యమైన విత్తనాలు వాడటం వల్ల అధిక లాభాలు పొందుతారు. కావున రైతులు నాణ్యమైన విత్తనము లక్షణాలపై అవగాహన కలిగి ఉండడం మంచిది.

నాణ్యమైన విత్తనంకి ఉండాల్సిన లక్షణాలు:
శాస్త్రవేత్తలు కొత్తగా అభివృద్ధి పరిచే వంగడాలు ఎంతో మెరుగైనవి కావున వాటి నాణ్యతా ప్రమాణాలు కూడా ఖచ్చితంగా ఉంటే వాటిని రైతులు పూర్తి స్థాయిలో వినియోగిం చుకున్నవారవుతారు.

జన్యుస్వచ్ఛత:
ఒక రకం విత్తనం ఉపయోగించి అదే రకమైన విత్తనం పొందగలిగితే అది జన్యుస్వచ్ఛత కలిగి ఉన్న విత్తనంగా గుర్తించవచ్చు లేదా శాస్త్రవేత్తలు ఏవైతే లక్షణాలను వాటిలో ప్రవేశపెడ తారో అవే లక్షణాలు సంపూర్ణంగా ఆ విత్తనం కలిగి ఉంటే అది జన్యుపరంగా స్వచ్ఛమైందిగా చెప్పవచ్చు.

జన్యుస్వచ్ఛత ఆధారంగా విత్తనాలను నాలుగు రకాలుగా విభజించారు. అవి…
(1) బ్రీడరు సీడ్ : నూరు శాతం జన్యుస్వచ్ఛత కలిగి ఉన్న విత్తనం శాస్త్రవేత్తలు ఏవైతే రకాలను ఉత్పత్తి చేస్తారో వాటి నుంచి లభించిన అత్యంత స్వచ్ఛమైన విత్తనమే ఈ బ్రీడరు సీడ్ ఈ విత్తనం ఖచ్చితంగా శాస్త్రవేత్త లేదా పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసినదై ఉంటుంది. దీనిని బంగారు పసుపు రంగు లేబుల్/ట్యాగ్ తో గుర్తిస్తారు.

(2) ఫౌండేషన్ సీడ్ : బ్రీడరు సీడు నుంచి ఉత్పత్తి చేసిన రెండో తరం విత్తనం కాబట్టి దీని జన్యుస్వచ్ఛత 98 శాతం పైనే ఉంటుంది, వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో దీనిని ఉత్పత్తి చేసి, తెలుపు రంగు ట్యాగ్ తో గుర్తిస్తారు. దీనిని విత్తనోత్పత్తి చేపట్టే రైతులకు అందజేస్తారు.

(3) సర్టిఫైడ్ సీడ్ : రైతులు పంటలు పండించడానికి ఉపయోగించుకునే విత్తనమే సర్టిఫైడ్ సీడ్. ఫౌండేషన్ సీడ్ నుంచి విత్తనోత్పత్తి చేసే రైతులతోగానీ, ప్రైవేటు విత్తనోత్పత్తిదారులు ఉత్పత్తి చేసిన మూడోతరం విత్తనం. దీని జన్యుస్వచ్ఛత 98 శాతంగా ఉండాలి. విత్తన ధృవీకరణ సంస్థ వారు విత్తనోత్పత్తిదారుల క్షేత్రాలను తనిఖీ చేసి దీనిని ధృవీకరిస్తారు. నీలి రంగు ట్యాగ్ ద్వారా దీనిని గుర్తించాలి.

4) ట్రూత్ ఫుల్ లేబుల్ సీడ్: దాదాపుగా రైతులు వినియోగించుకునే విత్తనం ఇది. కొన్ని ప్రైవేటు సంస్థలు మాత్రమే తమ విత్తనాలను ధృవీకరణ సంస్థ ద్వారా ఉత్పత్తి చేస్తాయి. వాటిని సర్టిఫైడ్ సీడ్ అని అంటాం. కానీ దాదాపుగా ప్రైవేటు విత్తనోత్పత్తి దారులు తమ స్వంత బాధ్యత వహించి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. వీటినే ట్రూత్ ఫుల్ లేబుల్ సీడ్ అని అంటారు. రైతు ఆయా ఉత్పత్తిదారులపై నమ్మకంతోనే వీటిని కొనాల్సి ఉంటుంది. ఇది ఆకుపచ్చ రంగు ట్యాగు కలిగి ఉంటుంది.

భౌతిక స్వచ్ఛత: ఎంపిక చేసుకున్నవంగడం (రకం) అదే రకమైన విత్తనాన్ని కలిగి ఉండి తాలు గింజలు, మట్టి పెళ్లలు, దుమ్ము, ధూళి, కలుపు గింజలు, ఇతర రకాల విత్తనాలు (గింజలు) లేకుండా ఉంటే ఆ విత్తనం భౌతిక స్వచ్ఛత కలిగి ఉన్నట్లుగా చెప్ప వచ్చు అన్ని పంటల్లో భౌతిక స్వచ్ఛత 98 శాతంగా ఉండాలి. అంటే ఒక రకం విత్తనం ఎంపిక చేసుకుంటే నూరు విత్తనాలకు కనీసం 98 విత్తనాలు అదే రకానికి చెందినవై ఉండాలి.

సర్టిఫైడ్ సీడ్లలో జన్యుస్వచ్ఛతః

సర్టిఫైడ్ జన్యుస్వచ్ఛత (%)
సూటిరకాలు 98
సంకర రకాలు 95
పత్తి, వంకాయ, టొమాటో సంకర రకాలు 90
ఆముదం (సంకర రకాలు) 85

మొలక శాతం: మొలక శాతం అధికంగా ఉంటే అది నాణ్యమైన విత్తనంగా చెప్పవచ్చు. విత్తనం వేసిన తర్వాత వచ్చే మొలకల ఆధారంగా మొలక శాతం లెక్కించబడుతుంది. మొలక శాతంపైనే మొక్కల సాంద్రత ఆధారపడి ఉంటుంది. పంటలను బట్టి కనీసం 70-90 మొలకశాతం ఉండేలా చూడాలి.

పంట మొలకశాతం (%)
మొక్కజొన్న 90
వరి, గోధుమ 80
జొన్న, సజ్జ, రాగి, కంది, పెసర 75
వేరుసెనగ, ఆముదం, పొద్దుతిరుగుడు 70

సాధారణంగా విత్తనం ఉత్పత్తయిన 9 నెలల నుంచి మొలక శాతం తగ్గు తుంది. రైతులు విత్తనం కొనేముందు. విత్తన తయారీ తేదీని పరిశీలించి 9-12 నెలలు దాటకుండా చూసుకోవాలి.

రైతుస్థాయిలో మొలక శాతం కనుగొనే పద్ధతి:
తక్కువ ఖరీదున్న విత్తనాలైతే 200 చొప్పున, బాగా ఖరీదైన విత్తనాలైతే 50-100 చొప్పున రెండు దఫాలుగా లెక్కించి పక్కన పెట్టుకోవాలి. ఏదై నా దినపత్రికను రెండు పొరలుగా మడిచి నీళ్ళతో తడపాలి. ఇలా తడి పిన పేపరుపై లెక్కించిన విత్తనాలను సమానంగా పరచాలి. దీనిపై మరొక తడి పేపరు కప్పి చాపమాదిరిగా చుట్టి దారంతో రెండువైపులా కట్టాలి. దీనిని ఏటవాలుగా ఒక ట్రేలో పెట్టి తడి ఆరకుండా నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇలా వారం రోజులు ఉంచిన తరువాత, పేపరు జాగ్రత్తగా విప్పి, వేరు, కాండం సమా నంగా ఉన్న మొలకలు మాత్రమే లెక్కించాలి. వేర్లు మరీ పొట్టిగా ఉండి కాండం పొడవుగా ఉన్నా లేదా కాండం బాగా పొట్టిగా ఉండి వేర్లు పొడవుగా ఉన్నా వాటిని లెక్కించ రాదు. ఉదాహరణకు 100 విత్తనా లకు 80 విత్తనాలు మొలకెత్తితే 80 మొలక శాతం ఉన్నట్లు.

తేమశాతం: విత్తనానికి తగినంత తేమ అందితే అది మొలకెత్తుతుంది. తేమ శాతం మరీ ఎక్కువగా ఉంటే విత్తనం నిల్వకాలం బాగా తగ్గిపోయి, కుళ్ళిపోయే అవకాశముంటుంది. ఎక్కువ కాలం విత్తనాన్ని నిల్వ చేసు కోవాలంటే తేమ శాతం ఎంత తక్కు వగా ఉంటే అంత మంచిది, వరి, మొక్కజొన్న, సజ్జ మొదలగు ఆహార పంటల్లో 10-12 శాతం, నూనెగింజలు, అపరాల విత్తనాల్లో 9-10 శాతం, కూరగాయ విత్తనాల్లో 7-8 శాతంగా ఉండాలి. అన్ని రకాల విత్తనాల్లో తేమ 14 శాతానికి మించరాదు.

విత్తనం కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • వీలైనంత వరకు ధృవీకరించిన (సర్టిఫైడ్ సీడ్) విత్తనాన్నే రైతులు కొనుగోలు చేయాలి.
  • ట్రూత్ ఫుల్ లేబుల్ ఉన్న విత్తనా లను కొనాలనుకుంటే లేబుల్ ను పరిశీలించి జన్యుస్వచ్ఛత, మొలక శాతం, భౌతిక స్వచ్ఛత వంటి వివరా లను క్షుణ్ణంగా పరిశీలించాకే కొనాలి.
  • లాట్ నెంబరు, విత్తనం ఉత్పత్త యిన తేదిని చూసుకోవాలి.
  • లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనం కొనాలి.
  • డీలర్ల వద్దనుంచి బిల్లును తీసుకో వడం తప్పనిసరి, తరువాత మొలక /శాతం తగ్గినా, కల్తీ ఉన్నట్లు అనిపించినా, ఆ బిల్లు ఆధారంగా సమీపం లోని వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
  • ధృవీకరించిన సూటి రకాల విత్త నాలను ఒకసారి కొనుగోలు చేసిన తరువాత (మూడేళ్ళ పాటు) రైతులు మెరుగైన మొక్కల నుంచి సేకరిం చిన విత్తనాలను నిల్వ చేసుకొని మూడేళ్ల పాటు ఉపయోగించుకోవచ్చు అదే సంకర రకాలైతే ప్రతీసారి మారుస్తూ ఉండాలి.

N. స్వప్న (7816076871), Ch. ప్రగతి కుమారి, టి. చైతన్య, Dr. స్వర్ణలత, కె. కవిత, Dr. వి.అనిత, వ్యవసాయ కళాశాల, పాలెం.

Read More

అధిక దిగుబడి, గింజ నాణ్యతకు సప్తధాన్యాంకుర ద్రావణం

సప్తధాన్యాలను పాత్రలో వేసి నానిన తర్వాత మొలక కట్టాలి (విడివిడిగా).

  1. 100 గ్రా. పెసలు (మొలకలు)
  2. 100 గ్రా. మినుములు (మొలకలు)
  3. 100 గ్రా. అలసందలు (మొలకలు)
  4. 100 గ్రా. శనగలు (మొలకలు)
  5. 100 గ్రా. నువ్వులు (మొలకలు)
  6. 100 గ్రా. ఉలవలు (మొలకలు)
  7. 100 గ్రా. గోధుమలు (మొలకలు)

తడిగుడ్డతో వేలాడకట్టి మొలక వచ్చాక అన్ని కలిపి రుబ్బి ఒక లీ. నీరు కలపాలి. 10 లీ. ఆవు మూత్రం కలపాలి. కర్రతో బాగా కలియ త్రిప్పాలి. 2 గంటలు అలాగే ఉంచితే ఘనపదార్థం అడుగుకి చేరుతుంది. ఆ కషాయం వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. ఇది 48 గంటలు నిలువ ఉంటుంది. పైరు పాలు పోసుకునేటప్పుడు అన్ని పంటలకు పిచికారి చేస్తే దిగుబడి, గింజ నాణ్యత పెరుగుతుంది.

Read More

కాన్-టికీ కిల్న్ పద్ధతిలో బయోచార్ తయారీ

కాన్-టికీ (Kon-Tiki) బయోచార్ కిల్న్ అనేది ఫ్లేమ్ కర్టెన్ (Flame Curtain) సూత్రం ఆధారంగా పనిచేసే తలక్రిందుల శంఖాకార కిల్న్. పంట అవశేషాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో తక్కువ పొగతో బయోచార్‌గా మార్చడానికి ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది.

ముందుగా కిల్న్ అడుగు భాగంలో కొద్దిపాటి పొడి చెక్కలు లేదా ఇతర తేలికగా మండే పదార్థాలను వేసి మంట వేయాలి. అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు, చెరకు ఆకులు లేదా ఇతర పొడి పంట అవశేషాలను దశలవారీగా చిన్న పరిమాణాల్లో వేయాలి. పైభాగంలో ఏర్పడే మంట (Flame Curtain) పొగను దహనం చేస్తూ, కింది భాగంలోని అవశేషాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ద్వారా బయోచార్‌గా మారుస్తుంది. చివరలో అవసరమైన స్థాయిలో బయోచార్ ఏర్పడిన తర్వాత మంటను ఆపి, నీరు చల్లి లేదా గాలి ప్రవేశాన్ని నిలిపివేసి కిల్న్‌ను చల్లారనివ్వాలి.

     కిల్న్ పరిమాణాన్ని బట్టి ఒక్కో బ్యాచ్‌లో వంద కిలోల నుంచి సుమారు ఒక టన్ను వరకు పంట అవశేషాలను ప్రాసెస్ చేయవచ్చు. ముడి పదార్థం స్వభావాన్ని బట్టి సుమారు 10-20 శాతం బయోచార్ లభిస్తుంది. సాధారణంగా ఒక బ్యాచ్ పూర్తవడానికి 2-4 గంటల సమయం పడుతుంది.

     కాన్-టికీ కిల్న్ ద్వారా పొగ తక్కువగా విడుదలవుతుంది, నాణ్యమైన బయోచార్ ఉత్పత్తి అవుతుంది, తయారీ వేగంగా పూర్తవుతుంది మరియు పంట అవశేషాల దహనం వల్ల కలిగే పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఈ కారణాల వల్ల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు, వ్యవసాయ శిక్షణా కేంద్రాలు మరియు పెద్ద రైతులకు ఈ సాంకేతికత అనువైన ప్రత్యామ్నాయంగా గుర్తింపు పొందుతోంది.

భారతదేశంలో అనేక సంస్థలు మరియు ఫ్యాబ్రికేషన్ యూనిట్లు వివిధ పరిమాణాల కాన్-టికీ కిల్న్‌లను తయారు చేస్తున్నాయి. కిల్న్ పరిమాణం, ఉక్కు మందం, తయారీ నమూనాను బట్టి ధర ₹40,000 నుండి ₹70,000 ల మద్య ఉండవచ్చు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

పూత, పిందె ఏర్పాటులో సహాయపడే బయోడైనమిక్ ఎరువు ‘యారో (502)’

యారోపూలను మగ కణుజు మూత్రాశయంలో ఉంచి వేసవికాలంలో ఎండలో వ్రేలాడదీసి, రాబోయే శీతాకాలంలో సారవంతమైన భూమిలో పూడ్చి పెట్టాలి. ఇది పొటాషియం, సిలికా, సెలీనియం చైతన్యకారక బాక్టీరియాని ప్రేరేపించి గంధకం యితర పదార్థాలతో కలియడానికి సహాయపడుతుంది. పూత, పిందె సరిగ్గా ఏర్పడకపోతే ఈ బలహీనతను పోగొట్టి పూత, పిందె ఏర్పాటులో సహాయ పడుతుందీ బయోడైనమిక్ ఎరువు. మొక్కలను బలపరచి పురుగుల తాకిడి నుండి రక్షిస్తుంది. గ్రహాల రిథమ్స్‌తో భూమిని కలపడానికి సహాయపడుతుంది.

Read More

టాప్-లిట్ అప్‌డ్రాఫ్ట్ కిల్న్ పద్ధతిలో బయోచార్ తయారీ

టాప్-లిట్ అప్‌డ్రాఫ్ట్ (Top-Lit UpDraft – TLUD) కిల్న్ అనేది పంట అవశేషాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా నాణ్యమైన బయోచార్‌గా మార్చే సమర్థవంతమైన సాంకేతికత. ఈ కిల్న్ సాధారణంగా ఇనుప లేదా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడుతుంది. అడుగు భాగంలో నియంత్రిత గాలి ప్రవేశానికి రంధ్రాలు, పై భాగంలో పంట అవశేషాలను నింపేందుకు అనువైన ఏర్పాటు ఉంటుంది.

ముందుగా పొడి పంట అవశేషాలను 5–15 సెం.మీ. పొడవు ముక్కలుగా చేసి కిల్న్‌లో నింపాలి. అనంతరం పైభాగంలో కొద్దిపాటి పొడి గడ్డి, చిన్న చెక్క ముక్కలు లేదా ఇతర తేలికగా మండే పదార్థాలను వేసి మంట వేయాలి. మంట పైభాగం నుంచి క్రమంగా క్రిందికి వ్యాపిస్తుండగా, అడుగు భాగం నుంచి పరిమితంగా ప్రవేశించే గాలి కారణంగా అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

పైరోలిసిస్ పూర్తయిన తర్వాత గాలి ప్రవేశాన్ని నిలిపివేసి కిల్న్‌ను చల్లారనివ్వాలి. అనంతరం తయారైన బయోచార్‌ను బయటకు తీసి నిల్వ చేయాలి లేదా కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఈ పద్దతిలో పొగ తక్కువగా విడుదలవుతుంది, బయోచార్ నాణ్యత మెరుగ్గా ఉంటుంది. తయారీ సమయం తగ్గుతుంది మరియు కార్బన్ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఈ కారణాల వల్ల చిన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలకు ఇది అనువైన, వాతావరణ అనుకూల సాంకేతికతగా గుర్తింపు పొందుతోంది.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం,
రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

పెరటిలో పోషకాహార తోటలతో ఆరోగ్యం, ఆర్థిక పొదుపు – మహిళ సాధించిన విజయగాథ

మహిళా రైతు విజయ గాధ

వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రీమతి సి. విజయ కుమారి వైఎస్సార్ కడప జిల్లా, మైదుకూరు మండలం, పప్పనపల్లి వాసి. విజయ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం సామూహిక నిర్వహణ విభాగంలో మైదుకూరు మండలం పోషణ మరియు ఆరోగ్యం కార్యకర్తగా పనిచేస్తుంది. ఆమె గతంలో తన కుటుంబానికి అవసరమైన కూరగాయలను మార్కెట్ నుంచి కొనుగోలు చేసేది. పెరుగుతున్న కూరగాయల ధరలు, రసాయన అవశేషాలపై ఆందోళన, అలాగే కుటుంబ సభ్యులు తగినంత ఆకుకూరలు, కూరగాయలు తీసుకోకపోవడం వల్ల పోషకాహార లోపం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఆమె గమనించింది.

ఈ నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం (KVK), వొనిపెంట, ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటి పెరటిలో పోషకాహార తోటలు పెంపకం శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శిక్షణలో సమతుల్య పోషకాహారం ప్రాముఖ్యత, ఇంటి పరిసరాల్లో శాస్త్రీయ పద్ధతిలో పోషకాహార తోటలు ఏర్పాటు, సీజన్కు అనుగుణంగా కూరగాయల ఎంపిక, వంటింటి వ్యర్థాలతో సేంద్రీయ ఎరువుల తయారీ, నీటి పొదుపు పద్ధతులు మరియు సహజ పురుగు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అంతేకాక కూరగాయలు, పండ్ల తోటల్లో వాడే వివిధ రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు, వాటివల్ల పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి కలిగే నష్టాలను గూర్చి తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమం అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం (KVK), వొనిపెంట శాస్త్రవేత్తలు జాతీయ ఉద్యానవన పరిశోధన మరియు అభివృద్ధి ఫౌండేషన్ కూరగాయల విత్తనాల కిట్‌ను అందజేయటం జరిగింది. ఈ కిట్‌లో పాలకూర, మిరప, టమాటో, వంగ, బెండకాయ, నేతిబీర, సొరకాయ, ఉల్లి, అలసందలు, ముల్లంగి మరియు గోరు చిక్కుడు వంటి కూరగాయ విత్తనాలు ఉంటాయి

శిక్షణ ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీమతి సి. విజయ కుమారి తన ఇంటి వెనుక ఖాళీ స్థలంలో టమాటా, బెండకాయ, వంకాయ, పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, కాకరకాయ, నేతిబీర, సొరకాయ, ఉల్లి, అలసందలు, ముల్లంగి, బీరకాయ తదితర కూరగాయలను సేంద్రీయ పద్ధతిలోఎటిఎం విధానంలో సాగు చేశారు. కొద్ది వారాల్లోనే కుటుంబ అవసరాలకు సరిపడా తాజా, పోషక విలువలు అధికంగా ఉన్న కూరగాయలు ఆమెకు అందుబాటులోకి వచ్చాయి.

దీని ఫలితంగా కుటుంబం మార్కెట్‌పై ఆధారపడటం గణనీయంగా తగ్గింది. కూరగాయల కొనుగోలు ఖర్చులో నెలకు సుమారు ₹1500–₹2,500 ల వరకు పొదుపు సాధించారు. కుటుంబ సభ్యుల ఆహారంలో ఆకుకూరలు, కూరగాయల వినియోగం పెరగడంతో వారి ఆరోగ్య పరిస్థితిలో సానుకూల మార్పులు కనిపించాయి. మిగులు ఉత్పత్తిని పొరుగువారికి విక్రయించడం ద్వారా ₹4,500 -5,000 లఅదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. అలాగే ఆమె తమ పెరటి తోటలో పండిన కాయగూరలను , ఆకుకూరలను దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో మరియు పాఠశాలలో పిల్లలు భోజనానికి అందించేది.

శ్రీమతి సి. విజయ కుమారి గారి న్యూట్రి గార్డెన్ విజయాన్ని చూసి గ్రామంలోని అనేక మంది తమ ఇళ్లలో కూడా పోషక తోటలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ గ్రామంలో పోషకాహారం, సేంద్రీయ సాగు మరియు కుటుంబ ఆహార భద్రతపై అవగాహన కల్పించే ఆదర్శ మహిళగా ఆమె నిలిచారు.

విజయ అభిప్రాయం
కృషి విజ్ఞాన కేంద్రం అందించిన శిక్షణతో మా ఇంటి ఖాళీ స్థలం పోషకాహారాన్ని అందించే తోటగా మారింది. ఇప్పుడు మా కుటుంబానికి తాజా కూరగాయలు ఇంట్లోనే లభిస్తున్నాయి. డా॥బి. శ్రీ కాంతి శ్రీ, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త తనకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడం వల్లే నేను ఈ విజయం సాధించగలిగాను. ఇప్పుడు మా ఇంటికి కూరగాయల ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడింది. ప్రతి ఇంట్లో న్యూట్రి గార్డెన్ ఉంటే కుటుంబ ఆరోగ్యం, పోషకాహార భద్రత మరియు ఆర్థిక పొదుపు ఒకేసారి సాధ్యమవుతాయి.

సమాచారం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 7032463875.

డా॥బి. శ్రీ కాంతి శ్రీ , డా ఎం. బాలకృష్ణ, డా ॥ఎన్ .శ్రీ విద్యారాణి, డా ॥టి. విజయ నిర్మల, డా ॥ఎస్ . ఫిరోజ్ హుస్సైన్, డా . బి. గోవిందరాజులు మరియు డా ॥ సి హెచ్ . రూత్, కృషి విజ్ఞాన కేంద్రం, ఒనిపెంట – డా॥వై. ఎస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్న గూడెం. Ph: 9493993523

Read More

హానికర శిలీంద్రాలను తగ్గించే ఈక్విసెటమ్ (508)

దీనిని ఈక్విసెటమ్ ఎవెన్స్ అనే హెర్బ్ కషాయం నుండి తయారు చేస్తారు. అతి బలమైన లేదా అతి బలహీనమైన చంద్రుని శక్తులనుండి నీటి అందుబాటుని క్రమబద్ధీకరించడానికి దీనినుపయోగిస్తారు. అంటే ఈక్విసెటమ్ చంద్రుని శక్తులు అతి బలంగా ఉన్నప్పుడు వాటిని తగ్గించి, అతి బలహీనంగా వున్నప్పుడు వాటిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది పులిసిన రూపంలో భూమిలోని ఉపయోగకర శిలీంద్రాల పెరుగుదలను ప్రోత్సహించి, మొక్కలపై తాజా కషాయంగా పిచికారి చేసినప్పుడు హానికర శిలీంద్రాలను తగ్గిస్తుంది.

Read More

వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వివిధ పంట రకాలు, ప్రయోజనాలు

పప్పు ధాన్యాలు ` నూనెగింజలు

మినుము :
ఆంధ్ర రాష్ట్రంలో మినుము 9.71 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 3.65 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 376 కిలోల దిగుబడి నిస్తుంది. రాష్ట్రంలో మినుమును తొలకరిలో, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు.

మినుము పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. మినుములో అనువైన రకాలు :

జి.బి.జి-1 : ఈ రకం పంట కాలం 70-75 రోజలు, దిగుబడి 8-9 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. అన్ని కాలాలకు అనువైన రకం ఇది. వ్యవసాయ పరిశోధనా స్థానం, ఘంటశాల, కృష్ణాజిల్లా నుండి లభ్యం అవుతుంది- 9248838628

టి.బి.జి. 104 : పంట కాలం- 70-75 రోజలు, దిగుబడి, 8-9 క్వింటాళ్ళు. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. ఇది అన్ని కాలాలకు అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, దర్శి, ప్రకాశం జిల్లా నుండి లభ్యం అవుతుంది – 9989623827.

ఎల్.బి.జి-352: ఈ రకం పంట కాలం 75-80 రోజలు . దిగుబడి 6-7 క్వింటాళ్ళు. వరి మాగాణుల్లో ఆలస్యముగా విత్తుటకు కూడా అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటశాల, కృష్ణా జిల్లా నుండి లభ్యం అవుతుంది – ఫోన్ నంబర్- 8008201253.

ఎల్.బి.జి`904 మరియు టి.బి.జి-129 రకాలు కెవికె, రెడ్డిపల్లి, అనంతపూరం జిల్లా నుండి లభ్యం అవుతున్నాయి – ఫోన్ నెంబర్ -9989623825

పెసర :
ఆంధ్ర రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 2.59 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 0.81 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 313 కిలోల ఉత్పాదకతనిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, వేసవిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. కంది, ప్రత్తి మరియు పండ్ల తోటలలో అంతర పంటగా కూడా పండించవచ్చు.

ఎల్.జి.జి-574: ఈ రకం పంట కాలం 65-70 రోజులు. దిగుబడి 6 నుండి 7 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లి అనంతపురం నుండి లభిస్తుంది – 9989623825.

డబ్ల్యు.జి.జి.-42: ఇది ఖరీఫ్ పంటకు అనుకూలం, పంట కాలం 55-60 రోజులు. 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. ఇవి కెవికె, ఊటుకూరు, వై.యస్.ఆర్. కడప జిల్లాలో లభ్యం అవుతాయి. ఫోన్ నెంబర్:9848809236,

కంది : అనువైన రకాలు ఎల్.ఆర్.జి-52 రకం. వ్యవసాయ పరిశోధనా స్థానం, గరికపాడు, ఎన్.టి.ఆర్. జిల్లా నుండి లభ్యం అవుతుంది. ఫోన్ నెంబర్-9491003499 మరియు టి.ఆర్.జి.-59 మరియు జి.ఆర్.జి-152 రకాలు కెవికె, బనవాసి నుండి అభ్యం అవుతున్నాయి – 8074420092.

వేరుశనగ : పంట కాలం 105-110 రోజులు. ఇందులో కదిరి లేపాక్షి రకం తీవ్ర బెట్ట పరిస్థితులను తట్టుకుని 6-8 క్వింటాళ్ళు దిగుబడి ఇస్తుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లిలో లభ్యం అవుతుంది -9989623825, కదిరి చిత్రావతి కూడా లభ్యం అవుతుంది. కె-6, కదిరి, అమరావతి రకాలు వ్యవసాయ పరిశోధనా స్థానం, కదిరి నుండి లభ్యం అవుతున్నాయి. సంప్రదించవలసిన నంబరు – 9490081470. విశిష్ట రకం వ్యవసాయ పరిశోధనా స్థానం, ఊటుకూరు నుండి లభ్యం ఆవుతుంది. ఫోన్ నెంబర్ – 7981982531.

నువ్వులు : నువ్వులలో YLM-66 రకం,YLM-17 రకం ఖరీఫ్‌కు అనువైనవి. పంటకాలం 75-80 రోజులు, దిగుబడి 5-6 క్వింటాళ్ళు. ఇవి రాయలసీమకి ఆనుకూలం. వ్యవసాయ పరిశోధనా స్థానం, యలమంచిలి, అనకాపల్లి జిల్లా నుండి లభిస్తుంది. ఫోన్ నెంబర్: 9440977352, 9849275470.

ఆముదం : ఆముదం పంట కాలం 90-150 రోజులు, దిగుబడి 6 – 7 క్వింటాళ్ళు. ఇందులో కిరణ్ రకం బెట్టను తట్టుకుంటుంది. బూజు తెగులు తక్కువ. డి.సి.ఎస్-107 మరియు ప్రగతి ఎండు తెగులును తట్టుకుంటుంది. ఐ.సి.హెచ్- 66 ఎండు తెగులు మరియు బెట్టను తట్టుకుంటుంది. ఇవి వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురం నుండి లభ్యం అవుతున్నాయి. ఫోన్ నెంబర్: 9989210879.

వరితో పోల్చితో చిరుధాన్యాల్లో అధిక పోషక విలువలు ఉన్నాయి. వీటిలో అధిక మాంసకృకృత్తులతో పాటుగా మంచి అమైనో ఆమ్లాలు ఉంటాయి. పిండి పదార్థాలు తక్కువ. పీచు పదార్థం ఎక్కువ ఉండి రాగి, కాల్షియం అధిక మోతాదులలో ఉంటాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే తీవ్ర కరువు ప్రభావాన్ని తగ్గించడానికి, రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటలను కాక నీటి ఎద్దడిని తట్టుకునే చిరుధాన్యాలను సాగు చేసుకున్నట్లయితే తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడులను సాధించవచ్చు.

జొన్న: ఇది అధిక కరువు నిరోధకత కలిగిన పంట. దీని లోతైన “వేరువ్యవస్థ కారణంగా సుదీర్ఘ వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలదు. ముఖ్యంగా చిరుధ్యాల సాగు అధికంగా ఉండే రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కడపలో ఇటీవల కాలంలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నల్లరేగడి నేలలుండి కెసి కెనాల్ ఆయకట్టు ప్రాంతాలైన ప్రొద్దుటూరు మరియు పులివెందుల ప్రాంతాలలో NTJ NJ-1 CSV-29 రకాలను సాగు చేయవచ్చు. అలాగే ఇవి ధాన్యం మరియు పశుగ్రాసం రెండింటిని అందిస్తాయి. సజ్జ పంట విషయానికి వస్తే తక్కువ తేమగల నల్లరేగడి నేలలలో ABH-1, CTP-8203 హైబ్రిడ్ రకాలను ఎంచుకోవచ్చు. ఆలస్యమైనా ఖరీఫ్ సీజన్‌లో ఆగష్టు రెండవ వారం నుండి సెప్టెంబర్ మొదటి వారం లోపు వేసుకోవచ్చు. ఎర్రనేలలు అధికంగా ఉన్న జమ్మలమడుగు మండలంలో కొర్రలు(స్వల్పకాలిక రకాలు) సియా`3223 (రేనాడు/గరుడ) లేదా సూర్యనంది వంటి అధిక దిగుబడులు ఇచ్చే రకాలు నాటుకోవచ్చు.

రాగి రకాలు చూసినట్లయితే గౌతమి (PR) వకుళ, చైతన్య మరియు ఇంద్రావతి వర్షాధార పరిస్థితులకు అనుకూలం. ఈ రకాలు బ్లాస్ట్ తెగులు మరియు తేమ ఒత్తిడిని అధికంగా తట్టుకుంటాయి. పంట ఏది వేసినా విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. సాళ్ళలో నాటడం వలన అప్పుడప్పుడు పడిన వర్షం బొట్టును కూడా ఒడిసి పట్టుకుని పంట నిలబడుతుంది. అలాగే అంతర పంటల సాగుకు కూడా అనుకూలం. కొర్ర లేదా జొన్నను కంది తో కలిపి 4:1 లేదా 5:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు. విత్తనం కొరకు భారత చిరుధ్యాల పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.ఫోన్ నంబరు : 040 – 24599300.

నీటి ఎద్దడిని తట్టుకునే పశుగ్రాస రకాలు
నీటి ఎద్దడిని (Drought) తట్టుకుని, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పశుగ్రాస రకాలు పాడి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అనంతపురం, వై ఎస్ ఆర్ కడప జిల్లాల పరిసర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు ఈ క్రింది రకాల పశుగ్రాసాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి:

ధాన్యపు జాతి పశుగ్రాసాలు:

జొన్న గడ్డి రకాలు :
ఏకవార్షికాలు – పి.సి -9, ఎం.పి. చారి, పంత్ చారి-5,7, సి.ఎస్.వి. -30F,
32F,

బహు వార్షికాలు – ఎస్. ఎస్. జి 59 -3 , పూస చారి – 6, 23, సి.ఎస్.వి. -33 COFS 29 (కోఎస్ఎస్ 29) COFS 31 (కోఎస్ఎస్ 31). బహుళ కోతలు (మల్టీ కట్) జొన్న రకాలు. కరవును తట్టుకుని, వర్షాలు పడగానే మళ్లీ చిగురిస్తుంది.

సోర్గమ్ -సూడాన్ గడ్డి (SSG): ఇది జొన్న మరియు గడ్డి జాతుల సంకరం. ఇందులో కాండం మందంగా ఉండి రసం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని పెరుగుతుంది
సజ్జ గడ్డి రకాలు : జైంట్ బాజ్ర , ఎస్ – 530, జె-55 , కె – 533

కాయజాతి (లెగ్యూమ్) పశుగ్రాసాలు:
హెడ్జ్ లూసర్న్ (దశరథ గడ్డి): ఇది బహువార్షిక (3-4 ఏళ్లు వచ్చే) పశుగ్రాసం. ఇందులో ప్రోటీన్లు ఎక్కువ. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది.

అలసందలు / బొబ్బర్లు: వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలికంగా పండించడానికి ఇది అనువైన పశుగ్రాసం.
స్టైలో హేమాటా – ఇది నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దీనిని వర్షాధారంగా సారవంతం కాని భూముల్లో సాగుచేయవచ్చు. భూసారాన్ని పెంచుతుంది. మిశ్రమ పంట లాగా తోటల్లో సాగు చేయవచ్చు.

గడ్డి జాతులు:
బాజ్రా నేపియర్ హైబ్రిడ్ : నేపియర్ రకాల వేర్లు లోతుగా చొచ్చుకుపోయి నీటిని గ్రహిస్తాయి కాబట్టి కరవును తట్టుకుంటాయి.

అంజన్ గడ్డి – ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. తోటల్లో మిశ్రమ పంటగా సాగు చేసుకోవచ్చు
గిన్ని గడ్డి – ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో బాగా అనువైన రకం.

చెట్ల మేత:
సుబాబుల్ మరియు అవిశ: నీరు లేని సమయాల్లో వీటి కొమ్మలు, ఆకులను పశువులకు మేతగా వేయవచ్చు.

విత్తనాలు లభ్యత :
పశుగ్రాస విత్తనాలను ఆంధ్రప్రదేశ్ లోని పశువైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని పరిశోధన కేంద్రాలు, ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు లేదా వ్యవసాయ సంభందిత ఆన్లైన్ ప్లాట్ ఫారముల ద్వారా పొందవచ్చు.

రైతుల సమాచారం కోసం కెవికె శాస్త్రవేత్తలచే రూపొందించబడినది. సంప్రదించవలసిన చిరునామా, కెవికె, ఒనిపెంట`9398982828, 7032463875, 8121136184

డా. శ్రీవిద్య రాణి.ఎన్, శాస్త్రవేత్త, విస్తరణ విభాగం , డా.బి.ఎస్.కాంతి శ్రీ, శాస్త్రవేత్త, గృహవిజ్ఞాన విభాగం, డా. టి.విజయ నిర్మల, శాస్త్రవేత్త, పశుపోషణ విభాగం. Ph: 93989 82828

Read More

గొయ్యి పద్ధతిలో బయోచార్ తయారీ

యంత్రం లేదా ఇనుప డ్రమ్ అందుబాటులో లేని పరిస్థితుల్లో చిన్న గొయ్యి ద్వారా కూడా బయోచార్‌ను తయారు చేయవచ్చు. ఇందుకోసం సుమారు ఒక మీటరు లోతు గల గొయ్యిని తవ్వాలి. ఆ గొయ్యిలో పొడి పంట అవశేషాలను నింపి, పైభాగం నుంచి మంట వేయాలి. అవశేషాలు నల్లని రంగులోకి మారడం ప్రారంభమైన తరువాత గొయ్యిని మట్టి లేదా ఇనుప రేకుతో కప్పి, గాలి ప్రవేశాన్ని పరిమితం చేయాలి. ఈ దశలో ఆక్సిజన్ ప్రవేశం నియంత్రించబడటం వల్ల అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

కొంత సమయం తరువాత గొయ్యిని పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం మట్టి లేదా ఇనుప రేకును తొలగించి బయోచార్‌ను బయటకు తీసుకోవాలి. బూడిద ఏర్పడి ఉంటే దానిని వేరుచేసి, బయోచార్‌ను నిల్వ చేసుకోవచ్చు లేదా కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఈ పద్ధతిలో ఆక్సిజన్ ప్రవేశాన్ని పరిమితం చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. గాలి ఎక్కువసేపు లోపలికి ప్రవేశిస్తే పంట అవశేషాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారతాయి. అటువంటి పరిస్థితిలో నాణ్యమైన బయోచార్ తయారు కాదు.

Read More

ఎల్ నినో పరిస్థితులలో పంటల సాగుకు సూచనలు

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడం వల్ల ప్రపంచ స్థాయిలో వచ్చే ఒక సహజ వాతావరణ మార్పు. ఇది ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చి, 9 నుండి 12 నెలల పాటు ఉంటుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వర్షాలు తగ్గి, ఎండలు మరియు కరువు పరిస్థితులు ఏర్పడతాయి. 2026 ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావం ఆగస్టు వరకే ఉంటుందని భావించినప్పటికీ, ప్రస్తుత అంచనాల ప్రకారం ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం వుంది. ప్రస్తుత 2026–27 కాలంలో ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావం 2027 ఖరీఫ్ సీజన్ వరకు కొనసాగి వ్యవసాయం, తాగునీరు మరియు గ్రామీణ జీవనోపాధిని దెబ్బతీయవచ్చని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నట్లు తెలియజేశారు.

ఆంధ్ర ప్రదేశ్ లో 16 జూలై 26 నాటికీ సాధారణ వర్షపాతము 170 మి.మి.గాను 86 మి.మి నమోదు అయింది. అంటే దాదాపు 50 శాతము లోటు వర్షపాతము నమోదు అయింది. ముక్యముగా కోనసీమ, తూర్పు, పచ్చిమ గోదావరి మరియు అన్నమయ్య జిల్లాలలో దాదాపుగా 65 శాతము భారి లోటు వర్షపాతము నమోదు అయింది. అన్ని ప్రధాన జలాశయాలలో కలిపి 290.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది, గత ఏడాది ఇదే సమయానికి (8-7-26) ఈ నిల్వ 524.56 టీఎంసీలుగా ఉండేది.అంటే 55 శాతము తక్కువగా ఉన్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండటం వల్ల సాగునీటి ఇబ్బందులు రావచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఖరిఫ్ లో సాధారణ సాగు ౩౦.84 లక్షల హెక్టార్లుకు గాను 6.7 లక్షల హెక్టార్లు అంటే 22 శాతం మాత్రమే సాగు అయింది. ప్రస్తుతానికి వరి 2.2 లక్షల హెక్టార్లు, ప్రత్తి 1.63 లక్షల హెక్టార్లు, కంది 70400 హెక్టార్లు, వేరుసెనగ 43000 హెక్టార్లు, మొక్కజొన్న 40700 హెక్టార్లు సాగు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లాలకుగాను, కర్నూల్, శ్రీకాకుళం, తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలు తప్ప మిగిలిన 25 జిల్లాలలో 25 శాతము కన్నా తక్కువ విస్తీర్ణంలో సాగు అయింది.

పంటలపై ప్రభావం (దిగుబడి నష్టాలు):
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తి దాదాపు 11% తగ్గే అవకాశం ఉందని, ముఖ్యంగా వర్షాధార పంటలకు 15- 20% నష్టం వాటిల్లవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య వ్యవసాయోత్పత్తి తగ్గుదల క్రింది విధంగా పంటల వారీగా అంచనా వేసినట్లు తెలియజేశారు.

పంట ప్రభావ అంచనా / దిగుబడి తగ్గుదల
మొక్కజొన్న 30% నుండి 35% వరకు తగ్గుదల
సజ్జ 25% నుండి 30% తగ్గుదల
వరి 10% నుండి 20% తగ్గుదల
పప్పుధాన్యాలు 15% నుండి 18% తగ్గుదల
వేరుశెనగ / పత్తి / చెరకు తీవ్రమైన నీటి కొరత వల్ల నాణ్యత, దిగుబడి దెబ్బతింటుంది (వేరుశెనగ పూర్తిగా నష్టపోవచ్చు)
జొన్న, రాగి కరువును తట్టుకోగలవు కాబట్టి వీటికి ప్రమాదం తక్కువ

ప్రస్తుతము సాగు చేసిన పంటల్లో సూచనలు

  • బోరు బావుల క్రింద సాగు చేస్తున్న మొక్కజొన్న, పత్తి పంటలకు నీటి వినియోగాన్ని ఆదా చేసేందుకు వరుస విడిచి వరుసకు నీటిపారుదల అందించాలి.
  • కంది మరియు ఆముదంలో మొక్కల సాంద్రత తక్కువ చేయించడం వలన ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఆముదం మరియు కంది పంటలలో ఎక్కువ వత్తుగా ఉన్న మొక్కలను తొలగించి వరుసలో మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తిన 30 మరియు 60 రోజులకు గుంటకతో గాని, గొర్రుతో గాని అంతర కృషి చేయడం ద్వారా కలుపు నివారణతో పాటుగా నేలలో తేమను రక్షించుకోవచ్చు.
  • లోతు తక్కువ గల ఎర్ర గరప నేలల్లో పంట మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత ప్రతి రెండు సాళ్ళ మధ్య కట్టె నాగలి గానీ లేదా బోదె నాగలి గానీ నడిపినట్లు అయితే పొలమంతా బోదెలు-కాలువలు లాగా తయారు అవుతాయి. బోదెలు చేయడం వలన మొక్కల మొదళ్లకు తగినంత మట్టి సమకూరుతుంది. ఇలా బోదెలు -కాలువలు చేయడం వలన వర్షపు నీరు సాళ్లలో నిలబడి భూమిలోనికి ఇంకి పోతుంది, తద్వారా ఎక్కువ నీరు భూమి లోనికి ఇంకడం వలన భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి పంట మొక్కలకు అందించడం వలన దిగుబడి పెరుగుతుంది.
  • పంట వేసిన తరువాత వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టు లేదా పంట అవశేషాలతో మల్చింగ్ (ఆచ్చాదన) చేయడం వలన భూమిలో తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉండటం ద్వారా పంట బెట్టకు గురి కాకుండా ఉంటుంది. అలాగే కలుపు సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి కనుక నేలలో తేమ శాతాన్ని రక్షించుకోవచ్చు.
  • మెట్ట ప్రాంతాల్లో పంటకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు నీటి కుంటలలో నిలువ చేసిన నీటిని, పంట కాలంలో ఎర్ర నేలల్లో పదిరోజులకు, నల్లరేగడి నేలల్లో 15 రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, స్ప్రింకర్ల ద్వారా 20 మి.మీ.ఎర్ర నేలల్లో, 40 మి.మీ.నల్లరేగడి నేలల్లో అందించగలిగితే 20-30% దిగుబడి పెరుగుతుంది. చివరి దశలో బెట్ట వస్తే (కంది, ఆముదం వంటి దూర వరస పంటలకు) నీటి ట్యాంకర్ల ద్వారా రక్షక తడులు (Protective Irrigation) ఇవ్వాలి.

వరి సాగు లో వర్షాభావ పరిస్థితులు లేదా సాగునీటి కొరత ఉంటే సూచనలు

  • పొలంలో నిరంతరం నీరు నిల్వ ఉంచకుండా ప్రత్యామ్నాయ తడి-పొడి (AWD) పద్ధతి పిలక దశలో, పై పాటుగా ఎరువులు వేసినప్పుడు అనుసరించాలి. కాలువల ద్వారా అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించాలి. పొలాల గట్లను బలపరచి నీటి నష్టాన్ని తగ్గించాలి. పొలంలో పగుళ్లు రాకుండా తగిన తేమను నిలుపుకోవాలి.
  • నీటి లబ్యత తక్కువగా ఉన్న యెడల, మురుగు నీటి నాణ్యతను పరీక్షించుకొని లవణ సాంద్రత 2 దేసిమేన్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సాగునీరుగా ఉపయోగించాలి.
  • వరి దిగుబడి తగ్గే అవకాశం ఉన్న జిల్లాల్లో, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు లో దమ్ము చేసి చదును, చేసిన పొలంలో మండె కట్టిన విత్తనాన్ని వెదజల్లే పద్ధతి లేదా డ్రమ్ సీడర్ పద్దతి లేదా SRI సాగు పాటించాలి.
  • తక్కువ కాలం మరియు బెట్టను తట్టుకునే వరి రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి.
  • ఆలస్యంగా వర్షాలు వచ్చినప్పుడు మెట్ట ప్రాంతాలు మరియు బోరు బావుల క్రింద స్వల్ప వ్యవధి రకాలైన MTU1121, MTU1293, MTU1290 మరియు MTU1426 సాగు చేయాలి. తక్కువ వయస్సు (20–25 రోజుల) నారును ఉపయోగించాలి.
  • చాడు నేలలకు: ఇంద్ర,, MCM 103, MCM 125, MTU 1290, MTU 1293
  • నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్ లో చ॥మీ॥ కు 33 కుదుళ్ళు ఉండేలా చూడాలి. భూసారం ఎక్కువ ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్ళు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేట్లు నాటాలి. వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ళ సంఖ్యను నిర్ధారించాలి. దీర్గకాలిక, మద్యకాలిక మరియు స్వల్ప కాలిక రకాలు నాటినపుడు ఒక చధరపు మీటరుకు 33 కుదుళ్లు ఉండాలి.
  • నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. బాటలు తీయటం వలన పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు.
  • ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులలో, ఉన్న నీటిని జీవ తడులకు వాడుకోవాలి.
  • నీరు తక్కువగా ఉన్నపుడు వరి పైరు మూన తిరిగిన దశ నుండి పిలకల దశ వరకు ఆరుతడిలాగా నీటి తడులు పెడుతూ మరియు నీరు బయటకు పోకుండా పొలం గట్టును దృడంగా చేసుకోవాలి.
  • అధిక ఉషోగ్రతలకు చౌడు భూముల్లో సాగు చేసే వరి పంటకు తరచు మంచి నీరు మార్చుకోవటం వలన చౌడు తీవ్రతను తగించుకోవచ్చు .
  • పంటలో గనుక జింక్ లోపం వచ్చినటైతే ఒక లీటరు నీటికి 2 గ్రా. జింక్ సల్ఫేట్ (0.2%) కలపి పిచికారి చేసి నివారించుకోవాలి. జింక్ లోపం తీవ్రతను బట్టి 5 రోజుల కాలంలో రెండవ పిచికారి చేయాలి.
  • ఇనుము ధాతు లోపము నివారణకు లీటరు నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మఉప్పు కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ద్రావణాన్ని (10 గ్రాముల అన్నభేది) వాడాలి.

ఎల్‌నినో / బెట్ట పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు:
వర్షాలు సకాలములో లేని యెడల ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.

  • ఆగష్టు మాసములో : తేలికపాటి నేలలు : జొన్న, కొర్ర , సజ్జ , పెసర , అలసంద మేత జొన్న, ఉలవలు
  • భరువైన నేలలు: ఆముదము, జొన్న, కొర్ర , సజ్జ , పెసర , అలసంద, కంది ఉలవలు
  • ప్రస్తుత పరిస్థితుల్లో వరి, మొక్కజొన్న పంటల సాగును సాధ్యమైనంత వరకు తగ్గించడం మంచిది.
  • ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ పంట కాలం గల మినుములు, కొర్రలు, సజ్జలు వంటి పంటలను సాగు చేయాలని సూచించారు.

పండ్ల తోటలను (చీని, మామిడి లో) తీవ్ర కరువు సమయంలో చెట్లను కాపాడుకునే అత్యవసర పద్ధతులు:

  • పాదులలో అచ్ఛాధన (మల్చింగ్) చేసుకొని నీటి ఆవిరిని అరికట్టాలి. నేల ఆరోగ్యాన్ని పెంపొందించాలి.
  • ఎండ తీవ్రతలేని సాయంత్రం సమయంలోనే పండ్ల తోటలకు సాధారణ తడిగానీ, లేదా ట్యాంకర్ల ద్వారా రక్షకతడిగానీ ఇవ్వాలి.
  • చెట్టు పాదులో ఒక వారం ఒక సగభాగం, మరుసటి వారం ఇంకో సగభాగంలో నీరు పెట్టడం ద్వారా నీటిని ఆదాచేయవచ్చును. ఇది పార్షియల్ డ్రై రూట్ జోన్ తడి పద్ధతి అంటారు.
    • 1:1 నిష్పత్తిలో బంకమట్టి + సున్నం కలిపి కాండానికి పూస్తే చెట్లు ఎండకు ఎండిపోవడాన్ని తగ్గించవచ్చు.
    • పచ్చిరొట్ట పంటలు వేసుకొని, నేలలో సేంద్రీయ పదార్థాన్ని పెంచవచ్చు.
    • చెరువు మట్టిని వేసి నేలలో తేమను నిలిపే గుణాన్ని పెంచవచ్చు.
    • చెట్టు ఎండిపోతున్నప్పుడు బాగా ఎండిపోతున్న చెట్ల కొమ్మలన్నీ నరికి, ఒక్క ప్రధాన కొమ్మనే ఉంచాలి. ఈ పద్ధతి చెట్టు నీటి అవసరాన్ని తగ్గించి బ్రతికిస్తుంది. దీనిని డీ-హార్నింగ్ (De-horning) అంటారు.
    • పంట కోత అనంతరము కొమ్మలు కత్తిరించి, ఆ వ్యర్థాలను ముక్కలు చేసి, పాదుల్లోనే మల్చింగ్ గా వేయాలి. దీనివల్ల నేల తేమ ఆవిరి బాగా తగ్గుతుంది. ముఖ్యంగా చీడపీడలకు గురైన కొమ్మలను పూర్తిగా కత్తిరించాలి.
    • చెట్టుకు 40-50 కేజీల సేంద్రియ ఎరువు (పశువుల/గొర్రెల/కోళ్ల వ్యర్థాలు) వేయాలి. పండ్ల చెట్ల మధ్య వరుసల పచ్చిరొట్ట పంటలు వేసి 50% పూత దశలో భూమిలో దున్నాలి.
    • మొక్కల వేగవంతమైన పెరుగుదలకు మరియు పోషకాల లభ్యతకు తోడ్పడే పి.ఎస్.బి (PSB – ఫాస్ఫో బ్యాక్టీరియా) వంటి జీవన ఎరువులను వినియోగించాలి.
    • ఉద్యాన పంటలకు అత్యంత కీలకమైన పూత మరియు పిందె దశల్లో నీటి కొరత రాకుండా తగినంత నీరు కచ్చితంగా అందించాలి.

ఆకుకూరలు, కూరగాయలు:
• పొలంలో వర్షపు నీరు పొర్లిపోకుండా, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా బోర్‌వెల్ రీఛార్జ్ పిట్ (ఇంకుడు గుంత) ఏర్పాటు ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంచవచ్చు.
• తక్కువ నీరు & స్వల్ప కాలపరిమితి గల కూరగాయ పంటలను వేసుకోవాలి. ఎక్కువ నీరు అవసరమయ్యే టొమాటో, మిర్చిలకు బదులు గోరుచిక్కుడు, చిక్కుడు, అలసంద. చిలగడదుంప, చామదుంప, కంద, ముల్లంగి, బీట్‌రూట్ , క్యారెట్ (కరుడ రకాలు: 80-90 రోజులు) వేసుకోవలెను.
• వివిధ రకాల ఆకుకూరలు తక్కువ కాలంలో పండుతాయి. కొత్తిమీర, గోంగూరలు డ్రిప్ + మైక్రో జెట్స్ ద్వారా తక్కువ నీటితో సాగు చేయవచ్చును.

ఆయిల్ పామ్ పంటల్లో:

  • రక్షక నీటి పారుదల మరియు తేమ సంరక్షణ చర్యలను చేపట్టండి. నేలలో తేమను కాపాడటానికి మరియు నేల ఉష్ణోగ్రతను తగ్గించడానికి, ఎండిన ఆకులు, ఖాళీ పండ్ల గుత్తులు లేదా సేంద్రియ వ్యర్థాలను ఉపయోగించి నేరుగా నేలలోనే మల్చింగ్ చేయండి.
  • అధిక ఉష్ణోగ్రతల సమయంలో తగినంత నీటిపారుదల లేకుండా అధికంగా ఎరువులు వేయడం మానుకోండి.
  • వేసవిలో ఆకులను ఎక్కువగా కత్తిరించడాన్ని నివారించండి, ఎందుకంటే చెట్టు పైభాగం (canopy) తగ్గడం వల్ల వేడి ఒత్తిడి పెరగవచ్చు. ప్రతి చెట్టుకు కనీసం 35–40 పని చేసే ఆకులు ఉండేలా చూసుకోండి. పశు సంరక్షణకు సూచనలు
  • సన్నకారు రైతులు ఉలవలు వేసుకుని 10 నుంచి 15 పొట్టేలు పిల్లలు మేపుకుంటే ఒక్కొక్క పొట్టేలుపై పది నుంచి పదిహేను వేల రూపాయల ఆదాయం వస్తుంది.
  • దాణా తక్కువ ధరలో దొరుకుతుందని ఎక్కువగా పశువులకు ఇవ్వడం జరుగుతుంది. దీని వలన పాల దిగుబడి బాగా వచ్చినా పశువుల జీర్ణ వ్యవస్థ పనితీరు తగ్గి చనిపోతాయి. కావున ఈ పద్దతిని ఆచరించకుండా చూడాలి.
  • Co F31, Australian Red Napier వంటి గడ్డి రకాలు తక్కువ నీటితో పండించవచ్చును. తద్వారా పచ్చి మేత కొరత తగ్గించవచ్చును.
  • పాడి పశువుల ఆరోగ్యం, పాల ఉత్పాదకత పెరగడానికి వాటి ఆహారంలో క్రమం తప్పకుండా మినరల్ మిక్స్ (ఖనిజ లవణాల మిశ్రమం) అందించాలి అని తెలపడము అయినది.
  • అవసరమైన టీకాలను, సరైన సమయంలో ఇవ్వాలి.

రైతులందరూ వాతావరణ భీమా WBCIS (Weather Based Crop Insurance Scheme) మరియు ప్రధానమంత్రి పంటల భీమా PMFBY (Pradhan Mantri Fasal Bima Yojana) పథకాలలో తప్పనిసరిగా నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించి, నీటి పొదుపు: నీటి వినియోగంలో జాగ్రత్త వహించాలి. భూమిలో తేమ ఆరిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

డా . బి. సహదేవ రెడ్డి, డా. పి.వి. రమేష్ బాబు, డా . య౦ .గిరిజా రాణి మరియు
డా . సి.హెచ్. శ్రీనివాస్, సహ పరిశోధన సంచాలకులు
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము, మారుటేరు. Ph: 9866787072

Read More