భోపాల్ పోర్టబుల్ బయోచార్ యూనిట్ తో బయోచార్ తయారీ

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) ఆధ్వర్యంలోని కేంద్ర వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (ICAR-CIAE), భోపాల్ శాస్త్రవేత్తలు పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు చిన్న స్థాయి మరియు పైలట్ స్థాయి బయోచార్ యూనిట్లను అభివృద్ధి చేశారు. పైలట్ ప్లాంట్‌లో ఒక్క సారి సుమారు 300 కిలోల పంట అవశేషాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది. ఇందులో బయోమాస్‌ను ఇంధనంగా ఉపయోగించి రియాక్టర్‌ను పరోక్షంగా వేడి చేస్తారు. బ్లోయర్ సహాయంతో దహన ప్రక్రియను కొనసాగిస్తారు. ఫర్నేస్‌ను అగ్నినిరోధక ఇటుకలతో నిర్మించగా, ఉష్ణోగ్రత సుమారు 350°C వరకు చేరుతుంది. ఈ విధానంలో సుమారు 33% బయోచార్ లభిస్తుంది. ఈ యూనిట్ ధర సుమారు రూ. 2.0-2.5 లక్షలు.

ఈ సాంకేతికత ద్వారా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చకుండా నాణ్యమైన బయోచార్‌గా మార్చి, నేల సేంద్రియ కార్బన్‌ను పెంచడంతో పాటు గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు), కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామీణ వ్యవసాయ సేవా కేంద్రాల ద్వారా ఈ యూనిట్ల వినియోగాన్ని విస్తరించడం ద్వారా స్థిరమైన, వాతావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించవచ్చు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

ఇక్రిశాట్ పోర్టబుల్ బయోచార్ యూనిట్ తో బయోచార్ తయారీ

వ్యవసాయ వ్యర్థాల నిర్వహణకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా అంతర్జాతీయ మెట్ట పరిశోదన కేంద్రం శాస్త్రవేత్తలు, చిన్న రైతుల కోసం సులభంగా తరలించగల పోర్టబుల్ బయోచార్ యూనిట్ ను అభివృద్ధి చేశారు. ఈ యూనిట్‌ను నేరుగా పొలంలోనే ఉపయోగించవచ్చు. పంట అవశేషాలను ఒకచోట చేర్చి బహిరంగంగా కాల్చే బదులు, నియంత్రిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా నాణ్యమైన బయోచార్‌గా మార్చవచ్చు. ఈ సాంకేతికత తక్కువ ఖర్చుతో పనిచేయడమే కాకుండా, చిన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలు సులభంగా వినియోగించేలా రూపొందించబడింది.

ఈ యూనిట్‌లో తయారైన బయోచార్ నాణ్యత ప్రయోగశాలలో తయారైన బయోచార్‌కు సమానంగా ఉన్నట్లు పరిశోధనల్లో నిర్ధారించబడింది. బయోచార్‌లో స్థిర కార్బన్ శాతం అధికంగా ఉండటం వల్ల నేలలో సేంద్రియ కార్బన్ పెరుగుతుంది, నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది, నేల ఆరోగ్యం బలపడుతుంది. అదే సమయంలో పంట అవశేషాల దహనం తగ్గి, గాలి కాలుష్యం మరియు హరితగృహ వాయువుల ఉద్గారాలు తగ్గుతాయి. ఈ వికేంద్రీకృత సాంకేతికత ద్వారా పంట అవశేషాలను “వ్యర్థం నుంచి విలువైన వనరుగా ” మార్చి, స్థిరమైన వ్యవసాయం మరియు వాతావరణ అనుకూల వ్యవసాయానికి తోడ్పడవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More