మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ సాయం

21న తొలి విడత చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి

అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతులకు మూడు విడతల్లో అందజేస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పీఎం కిసాన్‌ కింద కేంద్రమిచ్చే రూ.2 వేలు, రాష్ట్రం వాటా రూ.5 వేలు కలిపి ఈ నెల 21న తొలివిడతలో రూ.7 వేలు జమ చేస్తామన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏరువాక పౌర్ణమిని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఇటీవల గుంటూరు నుంచి ఎగుమతి అయిన మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని కంటెయినర్లను చైనా అధికారులు తిరస్కరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన పంటను ఉత్పత్తి చేయాలి” అని వెల్లడించారు.

కోకో రైతులకు న్యాయం చేస్తాం
పెదవేగిలో సాగవుతున్న కోకో, పామాయిల్‌ పంటలను మంత్రి పరిశీలించి రైతులు, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. పామాయిల్‌ తరహాలోనే కోకో గింజల కొనుగోలుకు విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. సరకు నాణ్యతతోనే గిట్టుబాటు ధరలు సాధ్యమవుతాయని స్పష్టంచేశారు. కంపెనీలు సాగు సమయంలో చెప్పే మాటలు ఆచరణలో విస్మరిస్తున్నాయని రైతులు మంత్రికి మొర పెట్టుకున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు రాయితీపై పరికరాలివ్వాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కోరారు. ఏలూరు మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన 50 కిలోవాట్ల సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు.

Read More

విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం

వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

ఖరీఫ్‌ సీజన్‌లో వరి విత్తనాలతో పాటు ఎరువుల కొరత లేకుండా రైతులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రామభద్రపురంలోని గ్లోబల్‌ విశ్రాంతి భవనంలో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. రైతులంతా ఒకేరకమైన పంటలు వేయడంతో ధరల్లో తేడాలు వస్తున్నాయన్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సాగు చేయాలని సూచించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, నాయకులు సి. చిన్నమ్మ తల్లి, వి. సన్యాసినాయుడు, ఆర్‌. ఈశ్వరరావు, పి. మహేష్‌ తదితరులు మంత్రిని సన్మానించారు.

Read More

రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి అనూహ్య స్పందన – PJTAU ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

600 గ్రామాల్లో 37,000 రైతులతో అవగాహన కార్యక్రమం

  • రైతుల్లో అసంతృప్తి లేదు.. కానీ చేయాల్సింది చాలా ఉంది

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ రాష్ట్రవ్యాప్తంగా నిరాటంకంగా, విజయవంతంగా సాగుతోంది. మే 5వ తేదీన వికారాబాద్ జిల్లా ధరూర్ లో ఈ కార్యక్రమాన్ని శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ M. కోదండ రెడ్డి, PJTAU ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య లాంచనంగా ప్రారంభించారు. ఆరోజు నుండి ఈ కార్యక్రమం నేటి వరకు 600 గ్రామాల్లో నిర్వహించగా సుమారు 31,000 మంది పురుషులు, 6,000 మంది మహిళలు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 37,000 మంది రైతులతో శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులు ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ MP డాక్టర్ మల్లురవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ G. చిన్నారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, ఎమ్మెల్సీలు, సుమారు 25 మంది శాసనసభ్యులు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులతో పాటు వారంలో ఒకరోజు ఉపకులపతి, ఇతర విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. PJTAU శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆరు అంశాలైన తక్కువ యూరియా వాడి సాగు ఖర్చును తగ్గించడం, అవసరం మేరకే రసాయనాలను వాడి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, వివిధ ఇన్ పుట్స్ కొనుగోలుకు సంబంధించిన రశీదులని భద్రపరచుకోవడం, సాగునీటిని ఆదా చేయడం, పంట మార్పిడులను పాటించి సుస్థిరాదాయాన్ని పొందడం, చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షించడం వంటి వాటిపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్ధులు రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రైతులు అడుగుతున్న అనేక సందేహాలను శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో నివృత్తి చేస్తున్నారు.

ఉపకులపతి సమీక్ష :-

   మూడు వారాలుగా సాగుతున్న 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం పై ఉపకులపతి అల్దాస్ జానయ్య ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ కార్యక్రమానికి రైతాంగం నుంచి మంచి స్పందన వస్తుందని వివరించారు. ప్రభుత్వం రైతాంగానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల పై రైతాంగంలో ఎటువంటి అసంతృప్తి లేదని జానయ్య స్పష్టం చేశారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని తెలిపారు. అలాగే ఇంకా కొన్ని వ్యవసాయ అంశాలకి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా రైతులు కోరుతున్నారని జానయ్య అన్నారు.  ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే నష్టాల్ని అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం పంటల బీమా సదుపాయం ప్రవేశపెట్టాలని రైతులు కోరుకుంటున్నారని, అలాగే చిన్న, సన్నకారు రైతులకి ఆధునిక వ్యవసాయ పనిముట్లని మరియు పచ్చి రొట్ట విత్తనాలను రాయితీపై  అందించాలని, విస్తృతంగా భూసార పరీక్షలు నిర్వహించాలని రైతాంగం కోరుకుంటున్నారని అల్దాస్ జానయ్య వివరించారు. ఇదే స్ఫూర్తితో రైతు సోదరులు, మహిళలు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని  దీన్ని ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఉపకులపతి కోరారు.
Read More

పసుపు పంటకు నిజామాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌

కేంద్రం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. కానీ రైతుకు న్యాయమైన ధర అందడం లేదు. పక్కనే వున్న మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్‌లో ధర ఎక్కువగా వస్తుంది. ఇక్కడ పండే పసుపులో కుర్కుమిన్‌ శాతం తక్కువగా వుంది. దీనికి కారణం కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా వుండే విత్తనం అందుబాటులో లేకపోవడం. కేరళ ఏరోడ్‌ అనే విత్తనంలో కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది పసుపు సాగులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూమిలో నుండి పసుపు తవ్వడం, ఉడకపెట్టడం, పాలిష్‌ చేయడంలో యంత్రపరికరాలు అవసరం. ఆధునిక యంత్రాలు అందించడంలో కేంద్రానిదే బాధ్యత ఉంటుంది కాబట్టి వచ్చే సీజన్‌కు ముందే కేంద్రం చొరవతీసుకోవాలని, రాజకీయాలు పక్కన పెట్టి రైతులకోసం పనిచేయాలని, కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా వుండే విత్తనాన్ని అందించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌కు కూడా సూచించామని రైతు కమీషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్‌ సభ్యులు భవానీరెడ్డి, భూమి సునీల్‌ పాల్గొన్నారు.

Read More